20, జూన్ 2014, శుక్రవారం

ఐ న్యూస్ న్యూస్ వాచ్


ఈరోజు (29-06-2014) ఉదయం ఐ న్యూస్ ఛానల్ న్యూస్ వాచ్ కార్యక్రమంలో యాంఖర్ ప్రసన్న ప్రస్తావించిన అంశాలకు నా స్పందన సంక్షిప్తంగా:



" గతంలో విద్యుత్ బోర్డ్ వుండేది. చైర్మన్ తప్పిస్తే లైన్ మన్ వీరిద్దరే పవర్ ఫుల్ అని చెప్పుకునేవాళ్ళు.విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, డిస్కం లు, విద్యుత్ నియంత్రణ సంస్థలు ఇవన్నీ ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో పుట్టుకొచ్చినవి. ఈనాడు  చర్చల్లో లేవనెత్తుతున్న సాంకేతిక అంశాలతో ప్రజలకు నిమిత్తం లేదు. వాళ్లకు అవసరమైనదల్లా నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా. వాళ్లు ఎన్నుకున్న ప్రభుత్వాలే  ఈ బాధ్యత యెలా నిర్వర్తించాలి అన్న విషయాలను చూసుకోవాలి. అనవసరమైన చర్చలకు తెర తీయడం అంటే సంఘర్షణలకు తలుపులు తెరవడమే అవుతుంది. పరస్పర ఆరోపణల కన్నా సత్వర కార్యాచరణ ప్రధానం. సవాళ్లు, ప్రతిసవాళ్లు మానుకుని సమస్య పరిష్కార మార్గాలను అన్వేషించాలి"       
"ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పాత పేరుతొ పాత అసెంబ్లీ భవనంలో తొలి సమావేశాలు ప్రారంభించింది. నీలం సంజీవ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న వంటి దిగ్గజాలు కొలువు తీరిన అసెంబ్లీ భవనం అది. నలభై ఏళ్ళక్రితం ఆకాశవాణి విలేకరిగా వరసగా అనేక సంవత్సరాలపాటు అసెంబ్లీ కార్యకలాపాలను రిపోర్ట్ చేసే అదృష్టం నాకు లభించింది. పదుల సంఖ్యలో అనేకమంది కొత్త సభ్యులు ఇప్పుడు అదే సభలో కుడి పాదం మోపారు. సభను సజావుగా నడుపుకోవడంలో సీనియర్లు వారికి ఆదర్శంగా నిలవాలి"
"అఖిల భారత స్థాయి పోటీ పరీక్షల్లో తెలుగు తేజాలు వికసించడం ఆహ్వానించతగ్గ పరిణామం. పిల్లల్ని మంచిగా చదివించాలనీ, అదే వాళ్లకు తాము  ఇచ్చే ఆస్తిపాస్తులన్న స్పృహ,  కలిగినవాళ్లల్లోనే కాకుండా కూలీ నాలీ చేసుకునే బీదాబిక్కీలో కూడా పెరుగుతుండడం దీనికి  కారణం. పెడదారి పట్టించే పలు మార్గాలు అందుబాటులో వున్నా చదువుకు  పెద్దపీట వేస్తున్న పిల్లలు అభినందనీయులు. చక్కగా చదువుకున్న సమాజం భద్రమైన భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది"

19, జూన్ 2014, గురువారం

ఒక రేడియో అభిమాని ఆవేదన - ఆలోచన


మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అనేది ప్రసార భారతిలో కొత్తగా చేరి పనిచేసేవారికి ఒక అధికారి పేరు. కానీ సంగీత పరిజ్ఞానం కొద్దో  గొప్పో వున్నవారికి మాత్రం ఆయన ఒక సంగీత కారుడు. రేడియో అంటే సంగీతం అనుకునేవారు ఇలాటి అధికారులు రావాలని. వుండాలని  కోరుకుంటారు. కాని ప్రసాద్ గారు మాత్రం రేడియో శ్రోతల సంఖ్య పెరగాలని కోరుకుంటూ వుంటారు. సందర్భం దొరికినప్పుడల్లా సమయం చూసుకుని తన మనసులోని మాటని బయట పెడుతుంటారు.



"ఇప్పడు రేడియోలు ఎక్కడ దొరుకున్నాయండీ" అనే ప్రశ్నకు జవాబు ఆయన వద్ద సిద్ధంగా వుంటుంది. అలా అడిగినవారికి ఒక చిన్న సైజు ట్రాన్సిస్టర్ రేడియో ఇచ్చి 'రేడియో దొరికింది కదా! ఇక వినండ'ని అంటుంటారని ఆయన గురించి మెచ్చుకోలుగా చెప్పుకునే ఒక  జోకు ప్రచారంలో వుంది.  మొన్నీమధ్య ఆదిత్య ప్రసాద్ గారు రాజభవన్ లో గవర్నర్  నరసింహన్ గారిని కలుసుకున్నప్పుడు ఏకంగా వారికి ఒక రేడియో కానుకగా ఇచ్చారట. దాన్ని స్వీకరించిన గవర్నర్ ఎంతగానో సంతోషించారట. నిన్న రేడియో ప్రాంగణంలో డాక్టర్ పద్మనాభరావు గారు  రచించిన 'అలనాటి ఆకాశవాణి'  పుస్తక ఆవిష్కరణ సభలో ఆయనే ఈ విషయాన్ని మర్యాదకు భంగం కలగని రీతిలో చాలా మన్ననగా ప్రస్తావించారు. 'రేడియో ప్రచార సభ' ఆలోచన కూడా వారిదే.  
రేడియో శ్రోతల సంఖ్య పెరగాలన్న ఆదిత్య ప్రసాద్ గారి కోరిక నెరవేరాలని కోరుకుందాం. అయితే కేవీ రమణాచారి గారు చెప్పినట్టు 'హాయ్ ఓయ్ రేయ్' అంటూ చెలరేగిపోయే మిర్చీ బజ్జీ శ్రోతలు కాదు. మంచి సంగీతాన్ని, మనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి శ్రోతల సంఖ్య పెరగాలి. అందుకు నాందిగా ఆదిత్య ప్రసాద్ గారి మాదిరిగా ఒకరికొకరు చిన్న చిన్న రేడియోలు చిరుకానుకలుగా ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం రావాలి.

అలనాటి ఆకాశవాణి


నిన్న పుట్టింటికి వెళ్ళి వచ్చాను. మగవాళ్ళకి పుట్టిల్లు వాళ్లు మొదట్లో పనిచేసిన ఆఫీసులే కదా. అలా రేడియో స్టేషన్ కు వెళ్లాను. పుట్టిల్లు కదా. వాయినాలు బాగానే ముట్టాయి. మంచి పుస్తకం చేతికి వచ్చింది. రేడియో స్టేషన్ లో పుస్తకాలు ఏమిటి అన్నదానికి కూడా ఒక కధ రెడీగా వుంది.
ఆకాశవాణిలో అలనాడు ఎన్నడో చేరి అంచెలంచెలుగా ఎదిగి దూరదర్శన్ అదనపు డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ ఆర్. అనంత పద్మనాభరావు తన అనుభవాల సమాహారాలను గుదిగుచ్చి 'అలనాటి ఆకాశవాణి' అనే పేరుతొ గ్రంథస్తం చేశారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికే నేను వెళ్ళింది. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు శ్రీ కె వీ రమణాచారి ఈ గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణి డైరెక్టర్ శ్రీ దూరదర్శన్ డైరెక్టర్ శ్రీమతి శైలజా సుమన్, మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ వీ ఎస్ రెడ్డి పాల్గొన్నారు.


(శ్రీ ఎన్వీ ఎస్ రెడ్డి, డాక్టర్ పద్మనాభ రావు, శ్రీ ఆదిత్య ప్రసాద్) 

వూపిరి తిరగని బాధ్యతలతో ఎప్పుడూ తలమునకలుగా వుండే మెట్రో రైల్ ఎండీ శ్రీ ఎన్.వీ. ఎస్. రెడ్డి ఆకాశవాణి పట్ల తమ అభిమానాన్ని చాలా బాగా  వ్యక్తం చేశారు. 'వాణిజ్య కాలుష్యం సోకని సంస్థ నాటి ఆల్ ఇండియా రేడియో' అంటూ ఒక్క ముక్కలో గొప్పగా చేప్పేశారు.


(ప్రసంగిస్తున్న శ్రీ రమణాచారి)

ఇక రమణాచారిగారు. ఆకాశవాణితో తనకున్న మమకారాన్ని  ఏమాత్రం భేషజానికి పోకుండా బయట పెట్టేశారు.  ఐ.ఏ.ఎస్.లో చేరకముందు అతి పిన్న వయస్సులోనే సైఫాబాద్ కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తున్న రోజులనుంచే ఒక్కసారయినా రేడియో ప్రోగ్రాం లో పాల్గొనాలని ఆయన కోరికగా వుండేదట. అందుకని కాలేజీ పని కాగానే నడుచుకుంటూ వచ్చి రేడియో స్టేషన్ పక్కనేవున్న ఝం ఝం కేఫ్ ఇరానీ హోటల్ నుంచి రేడియో ప్రహరీ గోడ వెంట నడుచుకుంటూ మెయిన గెట్ వద్ద వరకు వచ్చేవారట. లోపలకు పోవాలంటే గేటు దగ్గరే కాపలా మనిషి. ఇక పని కాదనుకుని మళ్ళీ వెనక్కు తిరిగి ఝం ఝం కేఫ్ వరకు, మళ్ళీ  గేటు వరకు అటూ ఇటూ అనేక మార్లు పచార్లు చేసేవారట. ఎలాగయితేనేం ఒక రేడియో నాటకంలో వేసి తన చిరకాల కోరిక తీర్చున్నారట. ఆయన ధారణ శక్తి అపూర్వం. రేడియో దిగ్గజాల పేర్లు ఆయన అలవోకగా స్మరించుకుంటూ పోతుంటే ఆ సమావేశంలో కూర్చున్న రేడియో వారికే మతులు పోయాయి.
పోతే, ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ శ్రీ ఆదిత్యప్రసాద్ ప్రస్తావించిన 'ఆకాశవాణి ప్రచార సభ' పధకం గురించి వింటుంటే ఒకనాడు ఆ సంస్థలో పనిచేసిన నా కళ్ళు చమర్చాయి. ఆ విశేషాలు మరో సారి.

మహా టీవీ 'న్యూస్ అండ్ వ్యూస్'


ఈరోజు (19-06-2014) ఉదయం ఏడుగంటలకు  మహా టీవీ 'న్యూస్ అండ్ వ్యూస్'  కార్యక్రమంలో సీనియర్ యాంఖర్ శ్రీనివాస్ ప్రస్తావించిన అంశాలపై నాతొ పాటు పిఠాపురం నుంచి ఎన్నికయిన టీడీపీ అనుబంధ శాసన సభ్యుడు శ్రీ ఎస్వీ ఎస్ ఎన్ వర్మ స్పందించారు. నా స్పందన క్లుప్తంగా:


"గత కొన్ని సంవత్సరాలుగా శాసన సభ సమావేశాలు సజావుగా సాగిన దాఖలాలు లేవు. మొన్నీమధ్య ముగిసిన తెలంగాణా కొత్త శాసన సభ సమావేశాలు సంతృప్తి కరంగా సాగిన తీరు చూసిన తరువాత కొంత ఆశలు కలుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ అనే పేరు పాతదే అయినప్పటికీ, నిజానికి కొత్తదే. పాత అసెంబ్లీ భవనంలో జరగనున్న ఈ సమావేశాల్లో పాల్గొనే సభ్యుల సంఖ్య మునుపటి ఉమ్మడి శాసన సభతో పోల్చి చూస్తే బాగా తగ్గిపోయింది. అయితే, మొదటి సారి సభలో కుడికాలు పెడుతున్న కొత్త సభ్యుల సంఖ్య తక్కువేమీ కాదు. అందువల్ల అనుభవం కలిగిన సీనియర్ల ప్రవర్తన వాళ్లకి ఆదర్శంగా వుంటుంది.  కాబట్టి పాత  వాళ్ళమీద వుండే బాధ్యత కూడా ఎక్కువే.  ఈసారి పటిష్టమైన ప్రతిపక్షం కూడా వుంది. వాస్తవానికి పాలక పక్షం, ప్రతిపక్షం రెండే వుండే కొత్త సాంప్రదాయం అనుభవంలోకి  రాబోతోంది. దీన్ని ఉభయపక్షాలు బాధ్యతగా ఉపయోగించుకోవాలి. ఒకరి మీద మరొకరు నెపాలు మోపుకోవడానికీ, నిలదీయడానికీ వాడుకుంటే ప్రయోజనం వుండదు."
'ఇక లోకేష్ పార్టీ బాధ్యతల స్వీకరణ గురించి. ఇదేమంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. తండ్రి రాజకీయవారసత్వం అనేది రాజకీయాల్లో ప్రవేశం వరకు పనికొస్తుంది. ఆ తరువాత ఎవరైనా ఎదిగి రావడానికి సమర్ధతే గీటురాయి అవుతుంది. ఆ గుర్తింపు తెచ్చుకోగలిగితే రాణింపుకు అవకాశం లభిస్తుంది."

18, జూన్ 2014, బుధవారం

అన్యోన్య కాపుర రహస్యం


కధ అనుకుంటే కధే. కాదనుకున్నా కధే!
చిత్తగించండి.

లండన్ మహానగరంలో మురుగన్ కోవెల. ప్రతి వారం అక్కడ తమిళ సోదరులు సమావేశం అవుతుంటారు.
ముత్తుస్వామి అనే అతడికి పెళ్ళయి యాభయ్ ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ల కాపురం ఎలాటి కలతలు లేకుండా యెలా సాగిందో కారణం చెప్పాడు ముత్తుస్వామి.
"పెళ్ళయిన దగ్గరనుంచీ ఆవిడ్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాను. ముచ్చటపడ్డ నగలూ చీరెలు అన్నీ కాదనకుండా కొనిపెట్టాను. పెళ్ళయిన పాతికో ఏట  రజితోత్సవ కానుకగా మా ఆవిడ్ని చెన్నైలో ఆమె పుట్టింటికి తీసుకువెళ్లాను. యెంత సంతోషపడిందో మాటల్లో చెప్పలేను"
"బాగుంది మీ అన్యోన్య కాపుర రహస్యం. మరి ఇప్పుడు యాభై ఏళ్ళ పండుగకు ఏమి కానుక ఇస్తున్నారు ?"

"ఏముంది. ఆమెను లండన్ తీసుకురావడానికి మళ్ళీ చెన్నై వెడదామని అనుకుంటున్నాను"
(కార్టూనిస్ట్ మల్లిక్ గారికి కృతజ్ఞతలతో)

సాక్షి టీవీ హెడ్ లైన్ షో

ఈరోజు (18-06-2014) ఉదయం ఏడుగంటలకు సాక్షి టీవీ హెడ్ లైన్ షో, సమన్వయకర్త దేవులపల్లి అమర్. నాతొ పాటు పాల్గొన్నది తెలంగాణా విద్యాశాఖ మంత్రి శ్రీ జీ. జగదీశ్వరరెడ్డి, శ్రీకాకుళం నుంచి వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకుడు,  మాజీ మంత్రి శ్రీ దర్మాన ప్రసాద రావు, బీజేపీ శాసన సభ్యులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి. ఫోన్ ఇన్ లో తెలంగాణా హోం మంత్రి శ్రీ నాయిని నరసింహా రెడ్డి. ప్రస్తావనకు వచ్చిన అంశాలు, వాటిపై నా అభిప్రాయాలు సంక్షిప్తంగా:


"కేంద్రంలో ప్రభుత్వాలు మారగానే గవర్నర్ల మార్పు కూడా సహజమే. రాష్ట్రపతి మాదిరిగా గవర్నర్లు ఎన్నికయినవారు కాదు. నామినేట్ అయిన వారు. స్వచ్చందంగా  తప్పుకోవడం సత్సంప్రదాయం. ఇక వారిని  తొలగించె పని  గతంలో ఎన్డీయే చేసింది. యూపీయే కూడా చేసింది. ఒకరినొకరు తప్పుపట్టడం పెద్ద తప్పు.   రాజకీయ కోణంలో ఆలోచించి గవర్నర్లను నియమించే  విధానం మారనంతవరకు ఈ విమర్శలు, ఆరోపణలు  తప్పవు"
"ఎవరి విద్యుత్ వారిదే అని వాదించడం వినడానికి బాగుండవచ్చు కాని ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని  ఆలోచిస్తే ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం అనిపిస్తుంది. అసలు ఇటువంటి కీలకమైన విషయాలను,  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చల ద్వారా పరిష్కరించుకోవడం సబబుగా వుంటుంది. వీరి నడుమ గెట్టు తగాదాలు లేవు. ఒకే వూరిలోవుంటూ, ఒకే సచివాలయానికి వెడుతూ ఒకరినొకరు కలుసుకుని మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం వింతగా అనిపిస్తుంది. రెండు కొత్త రాష్ట్రాలు బాలారిష్టాల్లో వున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులకి పరిపాలన విషయంలో విశేష అనుభవం వుంది. దాన్ని సమస్యల పరిష్కారానికి వాడాలి కాని కొత్త సమస్యలు సృష్టించడానికి కాకూడదు"

17, జూన్ 2014, మంగళవారం

అడవిలో పుస్తకాలు


ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చదువుకున్నవాడిలా కానవస్తున్నాడా? లేదు కదా!
మరి ఆ పక్కనే చాప మీద అన్ని పుస్తకాలు ఏమిటి.



ఇతగాడి పేరు చిన్నతంబి. కానీ ఇతడిది పెద్ద కధే. వయస్సు కూడా చిన్నదేమీ కాదు. 73. కేరళ రాష్ట్రంలో  ఇడుక్కి జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం. అతడితో కలిపి వూళ్ళో వుండేది పట్టుమని పాతిక కుటుంబాలు. అవి కూడా ఆదివాసీలవి.   చిన్నతంబి భార్య పనిపాటులు చేసుకుంటూ నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది. ఇతడేమో చిన్న టీ కొట్టు నడుపుతూ వుంటాడు. పక్కనే చాపమీద పుస్తకాలు. అవికూడా ఆషామాషీ కాలక్షేపం పుస్తకాలు కాదు. చక్కని క్లాసిక్స్. తను చదువుతూ ఇతరుల చేత చదివిస్తుంటాడు. పుస్తకాలను నామ మాత్రపు రుసుముతో అద్దెకు ఇస్తుంటాడు. అలా వచ్చిన వారికి చాయ్ ఫ్రీ.
అసలు కేరళ రాష్ట్రమే చదువుల తల్లి  నిలయం. ఆ దేవాలయంలో  పూజారులు చిన్నతంబి లాంటి పుస్తక ప్రియులు.

కళ్ళు బెట్టి చూస్తే ఈ ప్రపంచంలో చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నోవున్నాయి. కదా!