30, జులై 2011, శనివారం

అవినీతి వ్యతిరేక పోరాటంలో రాజకీయ కోణాలు – భండారు శ్రీనివాసరావు

అవినీతి వ్యతిరేక పోరాటంలో రాజకీయ కోణాలు – భండారు శ్రీనివాసరావు

(30-07-2011 ‘సూర్య’ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

ఆగస్టు ఒకటినుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభ కానున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ సమావేశాలు ఎంత సజావుగా సాగగలవన్న దానిపై ఉజ్జాయింపుగా ఒక అంచనాకు రావడం కష్టమేమీకాదు. అయితే, ఈ సమావేశాల పుణ్యమా అని - లోక్ పాల్ ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు- అనే రెండు కీలక అంశాలపట్ల రెండు ప్రధాన రాజకీయ పార్టీలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చింది.

రాజకీయ అవినీతికి సంబంధించిన పలు వార్తలు వివిధ కోణాలలో వెలువడుతున్న నేపధ్యంలో కేంద్ర క్యాబినెట్ గత గురువారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశమై లోక్ పాల్ ముసాయిదా బిల్లును ఆమోదించింది. స్పెక్ట్రం కుంభకోణం తాలూకు కారుమేఘాలు వర్షాకాల సమావేశాలను కబళించే వాతావరణం ప్రస్పుటంగా కానవస్తున్న దృష్ట్యా, లోక్ పాల్ బిల్లుకు ఏదో ఒకవిధమయిన స్వరూపం ఇవ్వక తప్పని పరిస్తితిని- ప్రతిష్ట మసకబార్చుకున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎదుర్కుంటోంది. అందుకే కేంద్ర మంత్రివర్గం, లోక్ పాల్ బిల్లు వ్యవహారాన్ని ప్రాధాన్యతా క్రమంలో ముందుకు తీసుకురావాల్సివచ్చింది. అయినా సరే, ఈ బిల్లుకు సంబంధించి పౌరసమాజ ప్రతినిధులు చేసిన ప్రధానమయిన సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టి తను అనుకున్న పద్ధతిలోనే లోక్ పాల్ బిల్లుకు తుది రూపం ఇచ్చింది. ఈ బిల్లు పరిధి నుంచి ప్రధానమంత్రినీ, న్యాయ వ్యవస్థను మినహాయించి లోక్ పాల్ వ్యవస్థకు వుండాల్సిన కోరలు తొలగించారు. ప్రధాని పదవిని కూడా బిల్లు పరిధిలోకి తీసుకురావాలని మన్మోహన్ సింగ్ మొన్నటి క్యాబినెట్ సమావేశంలో పట్టుబట్టినప్పటికీ మంత్రివర్గంలోని ఇతర సభ్యులు అందుకు ససేమిరా అంగీకరించలేదన్న స్క్రోలింగులు ఈ వార్తతో పాటే టీవీ తెరలపై దర్శనమివ్వడం విశేషం. ముసాయిదా బిల్లు తనకు అసంతృప్తి కలిగించిందనీ, మళ్ళీ ఆగస్టు 16 నుంచి దీక్ష ప్రారంభిస్తాననీ అన్నాహజారే వ్యాఖ్యానించడాన్నిబట్టి చూస్తే ఇది పార్లమెంటులో బతికి బట్టగట్టి చట్టరూపం తీసుకుంటుందన్న ఆశలు నీరుగారిపోతున్నాయి.

యూ.పీ.యే. సర్కారుపై వస్తున్న అవినీతి ఆరోపణలు, వెలుగుచూస్తున్న కుంభకోణాలపై ప్రభుత్వ పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షం బీ జే పీ వ్యూహరచన చేస్తూ వుండడంతో లోక్ పాల్ బిల్లును పార్ల మెంటులో ప్రవేశ పెట్టి అవినీతి నిర్మూలనలో తనకూ చిత్తశుద్ధి వుందని నిరూపించుకోవడం కోసమే ఈ ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ఆమోదించి వుంటుంది.

పోతే, బీ.జే.పీ. పరిస్తితి మరింత విడ్డూరం.

స్పెక్ట్రం కుంభకోణం దర్యాప్తులోను, తదుపరి విచారణ లోను వెల్లడవుతున్నసంచలనాత్మక సమాచారాన్ని పదునయిన అస్త్ర శస్త్రాలుగా సమకూర్చుకుని పార్ల మెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేసి దానిని ప్రధమ ముద్దాయిగా నిలబెట్టి రాజకీయ లభ్దిపొందాలని పధకాలు సిద్ధం చేసుకుంటున్న ఆ పార్టీ అధిష్టానానికి కర్నాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం తెచ్చిపెట్టిన తలనొప్పి అంతా ఇంతా కాదు. ఏ అవినీతిపై గళం విప్పి, కదను తొక్కి పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ను ఓ పట్టు పట్టాలని అనుకున్నదో అదే అవినీతి భాగోతం కర్నాటక లోకాయుక్త రూపంలో బీ.జే.పీ. గొంతులో పచ్చి వెలక్కాయగా మారింది. దానితో, ఇష్టం వున్నా లేకున్నా యడ్యూరప్పను ముఖ్య మంత్రి పదవినుంచి తొలగించాల్సిన అనివార్య పరిస్తితి ఆ పార్టీకి ఎదురయింది. గతంలో, ఈ మాదిరి రాజకీయ సంక్షోభాలు, పదవీ గండాలు యడ్యూరప్పకు కొత్తేమీ కాదు. 2008 మార్చి మాసంలో కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి, రాజకీయ పరమపద సోపాన పఠంలో యడ్యూరప్ప పలు పర్యాయాలు పెద్దపాము నోటబడి అట్టడుగుగుకు దిగజారే ప్రమాదం అనేకమార్లు ఆయనకు ఎదురయింది. అయినా తప్పించుకుని పీఠానికి అంటిపెట్టుకునే వుండగలిగారు. కానీ, ఈసారి పరిస్తితి పూర్తిగా మారిపోయి ఆయన మాజీ సీ యెం కాక తప్పని పరిస్తితి ఏర్పడింది. వర్షాకాల సమావేశాల్లో బీ.జే.పీ. అనుసరించదలచిన వ్యూహమే ఇప్పడు యడ్యూరప్పకు అడ్డుగోడగా తయారయింది. పార్ల మెంటులో కాంగ్రెస్ పార్టీని కడిగి గాలించాలంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పను వొదిలించుకోక తప్పదు. ఆ క్రమంలోనే బీ.జే.పీ. అధిష్టానం ముఖ్యమంత్రి మార్పుకు పచ్చ జెండా వూపాల్సివచ్చింది.

ఇక, కేంద్రంలో కాంగ్రెస్ పరిస్తితి నానాటికి తీసికట్టు అన్న సామెత చందంగా తయారవుతోంది. యూ.పీ.ఏ. ప్రభుత్వం మొదటి దఫా పదవీకాలం అయిదేళ్ళలో సంపాదించుకున్న ఘనకీర్తి యావత్తూ రెండో మారు అధికారంలోకి వచ్చిన అచిర కాలంలోనే ఆవిరయిపోయింది. ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిగత నిజాయితీ, నిస్వార్ధ వ్యక్తిత్వం సయితం యూ.పీ.ఏ. సర్కారుపై వెల్లువెత్తిన కుంభకోణాల మాటున మసకబారిపోయాయి. ఆయన మంత్రివర్గంలో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖను నిర్వహించిన రాజా స్పెక్ట్రం కుంభకోణం విచారణ సందర్భంగా వెల్లడించిన విషయాలు మన్మోహన్ సింగ్ గురించి ప్రజలు వేరే విధంగా ఆలోచించే పరిస్తితిని కల్పించాయి. మరో మూడేళ్లలోపు రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పీఠం పై కూర్చోబెట్టాలనే లక్ష్యసాధన దిశగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ అధినాయకత్వం- తమది పరిశుద్ధ ప్రభుత్వమని నిరూపించుకునే క్రమంలో తన భాగస్వామ్య పక్షం డీ.ఏం.కే. నాయకులనే అవినీతి కేసుల్లో ఇరికించి జైలుకు పంపి ప్రజలనుంచి మంచి మార్కులు రాబట్టాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు కోర్టు సమక్షంలో రాజా చేస్తున్న తీవ్రమయిన ఆరోపణలు సాధారణ రాజకీయ ఎత్తుగడల్లో భాగమని జనం నమ్మేలా చేయడానికి మన్మోహన్ సింగ్ ఎంతో శ్రమించాల్సివుంటుంది. డ్రగ్స్ వాడకం వంటి కేసుల్లో పట్టుబడిన వ్యక్తులు వెల్లడించే పేర్లు ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ఉబలాటపడే అధికార యంత్రాంగానికి సదా ఉపయోగపడే ‘చట్టం’ – ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పటి హోం మంత్రి, ఒకప్పటి ఆర్ధిక మంత్రి అయిన చిదంబరం గురించి న్యాయస్తానంలో మాజీ కేంద్ర మంత్రి రాజా బాహాటంగా చేసిన ప్రస్తావనల పట్ల కూడా అదేవిధంగా ‘తన పని తాను చేసుకుపోతుంది’ అనే నమ్మకం జనంలో కలిగించగలిగితే అంతకన్నా ఆహ్వానించాల్సిన అంశం మరొకటి వుండదు. కానీ, ఒకరిపట్ల ఒకరకంగా, మరొకరిపట్ల మరోరకంగా అవసరాన్నిబట్టి చట్టాల అన్వయం మారిపోతూ వుండడమే మన వ్యవస్థ లోని విషాదం. అందుకే చట్టాల పట్ల సామాన్యుడికి విశ్వాసం సన్నగిల్లుతోంది. అవినీతిపై ఆయా రాజకీయ పార్టీలు ఎక్కుబెట్టే బాణాలన్నిటి వెనుకా పైకి కనబడని రాజకీయ లక్ష్యాలు, ఉద్దేశ్యాలు ఏవో దాగున్నాయని ప్రజలు నమ్మే పరిస్తితి దాపురిస్తోంది.

మొన్నటికి మొన్న అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమం పట్ల భారత ప్రజానీకం ముఖ్యంగా యువత స్పందించిన తీరు గమనించిన వారికి దేశ భవిష్యత్తు గురించి కొత్త ఆశలు రెక్కలు తొడిగాయి. కల్మాడీ, కనిమొళి, రాజాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతున్న విషయాలు గమనించిన తరువాత ఈ ఆశలు మరింత ముప్పిరిగొన్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయ అవినీతి కేసుల విషయంలో న్యాయస్తానాలు స్పందిస్తున్న తీరు సయితం హర్షనీయం.

అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత చందంగా రాజకీయ అవినీతి గురించి జరిగిన దర్యాప్తులు, అవి నిగ్గు దేల్చిన నిజాలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాల కాలంలో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు రుజువై శిక్ష పడ్డ రాజకీయ ప్రముఖులు కలికానికి కూడా కానరారు. నేరానికి తగిన శిక్ష తధ్యం అన్న భయం వున్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేర ప్రవృత్తి సయితం తగ్గుముఖం పడుతుంది.

మనకంటే చిన్న దేశాల్లో కూడా లంచగొండి రాజకీయనాయకులు చట్టం నుంచి తప్పించుకోలేక జైల్లో మగ్గుతున్న సందర్భాలు వున్నాయి. ఉదాహరణకు 1997-2002 నడుమ నికరాగువా అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్నాల్డోపై తీవ్రమయిన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని గురించి విచారించిన ఆ దేశపు సుప్రీం కోర్టు ఆర్నాల్దో కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే, గతంలో యుగోస్లావియా అధ్యక్షుడిగా పనిచేసి కోట్లాది డాలర్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కున్న మిలోసెవిక్ ప్రస్తుతం జైలు వూచలు లెక్కబెడుతున్నాడు. 1990 – 2000 మధ్య పెరు ప్రెసిడెంటుగా వున్న ఫ్యుజిమోరి తన పదవీకాలంలో దేశంలో టెర్రరిజాన్ని పూర్తిగా మట్టుబెట్టగలిగాడు. కానీ, సంపూర్ణ అధికారం అతడిని ఒక టెర్రరిస్టుకన్నా ప్రమాదకారిగా మార్చింది. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టాడు. దానితో విసిగిపోయిన ప్రజలు తిరగబడి అతడిని గద్దె దించారు. ఫ్యుజిమోరి దేశం విడిచిపెట్టి పారిపోయినా అతడిని పట్టుకుని పెరు తీసుకువచ్చి జైల్లో పెట్టారు.

చట్టం అందరిపట్లా ఒకే రకంగా వ్యవహరించినప్పుడే ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనే వాక్యానికి అర్ధం వుంటుంది. లేని పక్షంలో అది ఒక పనికిరాని వూతపదంగా మిగిలిపోతుంది. (28-07-2011)

29, జులై 2011, శుక్రవారం

సులభంగా చావాలంటే? – భండారు శ్రీనివాసరావు

సులభంగా చావాలంటే? – భండారు శ్రీనివాసరావు


జీవితమే మధురమూ అని పాడుకోవడం సులభమే. కాని జీవించడం అంత వీజీ ఏమీ కాదు. అందుకని దాన్ని అర్ధం చేసుకోవాలనే అర్ధం పర్ధం లేని ఆలోచనలను వొదిలేసుకుని ఎంచక్కా జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టండి.

దానికి కొన్ని చిట్కాలున్నాయి. హాయిగా నవ్వుకోవడం. వీలయితే నవ్వించడం.

“హాయిగా జీవించడం సరే ! సులభంగా జీవితాన్ని అంతం చేసుకునే నిఖార్సయిన పద్ధతులు ఏమయినా వున్నాయా గురువుగారూ!” అని అడిగాడొక శిష్యులుంగారు.

“మూడున్నాయి రాసుకో’ అని మొదలు పెట్టాడు మూడొచ్చిన గురువు.

“మొట్టమొదటి పధ్ధతి. రోజూ పది పెట్టెలు సిగరెట్లు వూదేసేయ్. పదేళ్లు ముందుగానే గుటుక్కుమంటావ్.

“రెండోది – రోజూ క్రమం తప్పకుండా మందు కొట్టు. ముప్పయ్యేళ్ళు ముందుగానే టపా కట్టేస్తావ్.

“ఇక ఆఖరు చిట్కా ఏమిటంటే – కనుముక్కుతీరు చక్కగా వున్న అమ్మాయిని చూసి నిజాయితీగా ప్రేమించడం మొదలు పెట్టు. ముందుగా ఏం ఖర్మ. ప్రతిరోజూ చచ్చి బతుకుతుంటావ్.”

(29-07-2011)

28, జులై 2011, గురువారం

ఆనందమె జీవిత మకరందం - భండారు శ్రీనివాసరావు

ఆనందమె జీవిత మకరందం





అందమే ఆనందం అని ఒకరంటే ఆనందమె జీవిత మకరందం అని మరొకరన్నారు.

ఆనందం అర్ణవమైతే ఇంకా కావాల్సింది ఏముంది అని కూడా ఇంకొకరన్నారు.

ఈ ఆనందాన్ని యెలా కోరుకోవాలి అన్నదానిపై ఈ మధ్య నెట్లో ఓ సూక్తి షికార్లు చేస్తోంది.

‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నారు కాబట్టి వింటే (చదివితే) ఓ పనయిపోతుంది.

ఆ ఇంగ్లీష్ సూక్తికి తెలుగు అనువాదం. అవధరించండి. 

ఓ గంట సేపు ఆనందం కోరుకుంటే ఒక కునుకు తీయండి సరిపోతుంది.

కాదు కూడదు ఒక నెలపాటన్నా ఆనందం సొంతం కావాలనుకున్నారనుకోండి.

ఓ చక్కటి పిల్లను చూసి పెళ్లి చేసుకోండి ఆ కోరిక తీరిపోతుంది.

అలా ఇలా కాదు ‘జీవిత పర్యంతం’ ఆనందాన్ని అనుభవించాలని గట్టిగా అనుకుంటే మాత్రం అవసరంలో వున్న వారికి మీ చేతనయిన సాయం చేయండి. తద్వారా లభించే ఆనందం మాత్రం జీవితాంతం మీ వెంటే వుంటుంది.

కావాలంటే ప్రయత్నించి చూడండి!

(28-07-2011)

27, జులై 2011, బుధవారం

24, జులై 2011, ఆదివారం

చదవడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు

చదవడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు

చదువుకునే రోజుల్లో ప్రతిఒక్కరికీ ఫస్ట్ క్లాస్ మీద ఆసక్తి ఫస్ట్ క్లాస్ గా వుంటుంది. బళ్ళో లాస్ట్ బెంచీలో కూర్చునే వాళ్లకు కూడా క్లాసులో ఫస్ట్ రావాలనే తాపత్రయం మాత్రం అపరిమితం. అయితే ఈ ఫస్ట్ క్లాస్ థియరీపై పరిశోధన చేసి ఒకాయన కనుక్కున్న సంగతులు మాత్రం వేరుగా వున్నాయి.

చదువులో ఫస్ట్ క్లాస్ సంపాదించే వాళ్ళలో చాలామంది టెక్నికల్ కోర్సుల్లో చేరి డాక్టర్లో ఇంజనీర్లో అవుతుంటారు.

ఇక సెకండ్ క్లాస్ స్టూడెంట్లు ఎంబీయే లాటి కోర్సులు ఏవో చేసి, ఐ.ఎ.ఎస్. లయిపోయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అయిన డాక్టర్లను, ఇంజినీర్లను ఆజమాయిషీ చేస్తుంటారు.

పోతే, థర్డ్ క్లాస్ స్టూడెంట్లు డింకీలు కొట్టికొట్టి అత్తెసరు మార్కులతో పాసయినామని అనిపించుకుని ఏ ఉద్యోగాలు దొరక్క రాజకీయాల్లో చేరి మంత్రులుగా మారి పైవాళ్ళందర్నీ తమ చెప్పుచేతల్లో వుంచుకుంటారు.

ఇక ఆఖరు రకం అంటే ఏ పరీక్షా పాసుకాకుండా చదువుకు ఆదిలోనే స్వస్తి చెప్పి అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళేమో అండర్ వరల్డ్ డాన్ లుగా అవతారం ఎత్తి పైఅందరిపై పెత్తనం చేస్తుంటారు.

కాబట్టి ఇది చదివినతరవాత ఏమనిపిస్తోంది ? చదవడానికెందుకురా తొందరా! అని పాడుకోవాలనిపిస్తోందా!

ఏదో సరదాకు రాసిందాన్ని సీరియస్ గా తీసుకుని చదువులు చెడగొట్టుకోవద్దు సుమా.
(24-07-2011)

23, జులై 2011, శనివారం

ఇగో అను నర గర్వభంగం కధ – భండారు శ్రీనివాసరావు

ఇగో అను నర గర్వభంగం కధ – భండారు శ్రీనివాసరావు




యమధర్మరాజు మహిష వాహనం ఎక్కి యమపాశం చేతబట్టి భూలోకం బయలుదేరాడు.

కాలం తీరిన మనుషుల ప్రాణాలు పట్టి యమలోకానికి చేర్చడానికి యమభటులు వున్నప్పటికీ యముడు స్వయంగా భూలోక యాత్ర పెట్టుకోవడానికి ఓ కారణం వుంది.

నరలోకంలో ఓ నరుడు శాస్త్ర పరిశోధనలు చేస్తూ చేస్తూ ఒక ప్రయోగంలో గణనీయమైన విజయం సాధించాడు. మనుషులను పోలిన మనుషులను సృష్టించే ఒక ఫార్ములాను కనుగొన్నాడు. అచ్చం తన మాదిరిగా వుండే మరో డజను మంది శాస్త్రవేత్తలను ఆ ఫార్ములా సాయంతో తయారుచేసాడు.

కానీ ఈ లోగా ఆ శాస్త్రవేత్తకు భూమిమీద నూకలు చెల్లే తరుణం ఆసన్నం కావడంతో అతడిని కొనిపోవడానికి నరకం నుంచి యమభటులు వచ్చారు. ఆ వచ్చిన యమ భటులకు ఆ పదముగ్గురిలో అసలు శాస్త్ర వేత్త ఎవరన్నది అర్ధం కాలేదు. కనుముక్కు తీరులో కానీ, మాట వరుసలో కానీ, నడకలో కానీ ఆ పదమూడుమంది అచ్చంగా ఒకే రకంగా వుండడంతో కాసేపు గుంజాటనపడి ఎటు తేల్చుకోలేక వారు నరకానికి తిరిగి వెళ్ళిపోయి తమ ప్రభువుతో విషయం విన్నవించుకున్నారు.

యమధర్మరాజు స్వయంగా పాశం పట్టుకుని భూలోకం రావడానికి ఇదీ నేపధ్యం.

తీరా వచ్చిన తరువాత కానీ తన భటులు పడ్డ అవస్థ ఆయనకు అర్ధం కాలేదు. వాళ్లు చెప్పినట్టు ఆ పదమూడుమందిలో అసలు శాస్త్రవేత్త ఎవరన్నది గుర్తుపట్టడం అతి కష్టం అని ఆయనకు కూడా తొందరగానే అర్ధం అయిపోయింది. కానీ సమవర్తి తన వోటమిని అంత తేలిగ్గా యెలా వొప్పుకుంటాడు చెప్పండి?

అప్పుడాయన ఏం చేశాడన్నదే ఈ చిన్న కధకు క్లైమాక్స్.

తన ఎదుట కనబడుతున్న పదముగ్గురిలో ఒకడే తనకు కావలసిన వాడు. ఆ ఒక్కడినీ కనిపెట్టడం యెలా! అందుకని వారందరినీ వుద్దేశించి ఇలా అన్నాడు.

“అయ్యా శాస్త్రవేత్త గారు. మీ మేధస్సు అమోఘం. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మీ తెలివితేటలకు నా జోహారు. ఇటువంటి మేధావిని నా ఇన్ని కోట్ల సంవత్సరాల సర్వీసులో ఎన్నడూ చూసి ఎరుగను. మీ పదముగ్గురిలో అసలు ఎవరు? మిగిలిన ఆ పన్నెండుమంది నకిలీలు ఎవరన్నది తెలుసుకోగలగడం ఆ విధాతకు కూడా సాధ్యం కాదనిపిస్తోంది. కాకపొతే పరీక్షించి చూడగా చూడగా నా కళ్ళకు ఏదో ఒక చిన్నలోపం కానవస్తోంది. ఇంత అద్భుత సృష్టి చేసిన మహానుభావులు మీరు అంత చిన్న లోపాన్ని కనిపెట్టి ఎందుకు సరిచేయలేకపోయారన్నది నా కర్ధం కావడం లేదు..........”

........యమధర్మరాజు మాటలు ఇంకా పూర్తికానేలేదు.

ఇంతలో ఆ పదముగ్గురులోనుంచి ఒకడు తటాలున ముందుకు వచ్చి “నా పనిలోనే తప్పు పట్టేంత మొనగాడివా నువ్వు. తప్పు చేశానని వూరికే అంటే సరిపోదు. ఎక్కడ ఆ తప్పు చేసానో కూడా చెప్పు” అన్నాడు.

యముడు క్షణం ఆలశ్యం చేయకుండా ఆ మాటలు పలుకుతున్న వ్యక్తిపై పాశం విసురుతూ చెప్పాడు. “ఇదే నువ్వు చేసిన తప్పు. దీన్ని మీభాషలో ఇగో (EGO) అనో గర్వం అనో అంటారు. దాన్ని చంపుకుని వుంటే ఇప్పుడు నీకీ చావు తప్పేది.”

(23-07-2011)





19, జులై 2011, మంగళవారం

మొదటి పెళ్ళాం – రెండో కాపురం – భండారు శ్రీనివాసరావు

మొదటి పెళ్ళాం – రెండో కాపురం – భండారు శ్రీనివాసరావు


కలియుగం నాలుగోపాదంలో ఒకానొక ధూర్తుడు, రౌరవాది మహా రాక్షస గణాలకు ఓ దేవ రహస్యం తెలియచేసాడట.


“వేరే ఆడదానితో అక్రమ సంబంధం వున్నట్టు భార్యకు తెలియనంత కాలం భర్తకు స్వర్గమే . తెలిసిన మరుక్షణం నుంచీ ప్రత్యక్ష నరకమే!” అన్నది దాని సారాంశం.

నేను జానకితో చనువుగా మసలుతున్న సంగతి తెలిసిన నా మిత్రుడు శంకరం- దేవరహస్యం పేరుతొ నాకీ హితబోధ చేసాడు. అయితే, జానకితో నేను సాగిస్తున్న వ్యవహారం గురించి మా ఆవిడకు తెలుసునని నాకు చాలాకాలం వరకూ తెలవదు. అయినా గుంభనగా వుండిపోయిందంటే శంకరం చెప్పిన సూత్రం అందరు భార్యలకు వర్తించదని అనుకోవాలి.

రోజులు గడుస్తున్నకొద్దీ జానకి నుంచి రోజురోజుకూ నామీద వొత్తిడి పెరిగిపోతోంది. ఇక ఆ పోరుపడలేక లాయరుతో మాట్లాడడం, ముగ్గురు పిల్లల తల్లి అని చూడకుండా మా ఆవిడకి విడాకుల నోటీసు ఇప్పించడం కూడా జరిగిపోయింది.

నోటీసు పంపిన రోజు నేను కావాలనే బారులో పీకలదాకా తాగి ఇంటికి బయలుదేరాను. జానకి పరిచయం అయిన తరవాత ఆలస్యంగా ఇంటికి చేరడం అన్నది అప్పటికే నాకు అలవాటుగా మారింది. ఆఫీసు నుంచి నేరుగా జానకి పనిచేసే చోటుకు వెళ్లడం, ఆమెను స్కూటర్ పై ఎక్కించుకుని వాళ్లింటికి వెళ్లి అక్కడ కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి చేరడం నాకు దినచర్యలో భాగమయిపోయింది. అదేమిటో, పెళ్ళాం పిల్లలున్న నేను ఇలా చేయడం తప్పని నాకు కానీ, జానకికి కానీ ఒక్కనాడూ అనిపించకపోవడం విచిత్రం.

మా ఆవిడ సీతతో నేను మాట్లాడాల్సిన తీరు గురించి జానకి నాకు ముందుగానే బాగా తర్పీదు ఇచ్చింది. ఇలాటి సందర్భాలలో ఇల్లాలు పెట్టుకునే కళ్ళనీళ్ళకు కరిగిపోకూడదని హితబోధ చేసింది. ముందు ముందు భార్యగా తననుంచి అందబోయే సుఖాలను మనసులో వుంచుకుని సీతతో కఠినంగా ప్రవర్తించమనీ దాదాపు ఆర్డర్ మాదిరిగానే చెప్పింది.

ఇంటికి వెళ్లేసరికి పరిస్తితి నేను అనుకున్నట్టుగా లేకపోవడం చూసి ఆశ్చర్య పోయాను. పిల్లలు నిద్రపోతున్నట్టున్నారు. ఎప్పటిమాదిరిగానే మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. భోజనం తిననని తెలిసి కూడా వడ్డించమంటారా అని అడిగింది . వద్దని సైగ చేసి నేను బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాను.

నేను పంపిన విడాకుల నోటీసు సీత అందుకున్న సంగతి ధ్రువపరచుకున్న తరువాతనే ఇంటికి వచ్చాను. అయినా ఇల్లు ప్రశాంతంగా వుంది. ఏడుస్తూ నానా యాగీ చేస్తుందనుకున్న ఇల్లాలు మామూలుగా వుండడం చూసి ఆశ్చర్యపోవడం నావంతయింది.

మా ఆవిడ భోజనం పెట్టింది. తిని చేతులు కడుగుకున్నతరవాత ఆమె చేయిపట్టుకున్నాను. నా కళ్ళల్లోకి ఓసారి చూసి నెమ్మదిగా చేయి విడిపించుకుంది. ఆమె వంక చూడడానికి గిల్టీ గా అనిపించి తల దించుకున్నాను. ఏదో చెప్పాలని వుంది. ఎంతో చెప్పాలని వుంది. కానీ నోరు పెగలడం లేదు.మాట రావడం లేదు. ఆమె మెల్లగా లేచింది. మౌనంగా ప్లేటులో వడ్డించుకుంది. మాటా పలుకూ లేకుండా భోజనం అయిందనిపించింది. ఆమె కళ్ళల్లో నీరు వూరుతూ వుండడం నాకు కనిపిస్తూనే వుంది.

ఆమెనుంచి నాకు విడాకులు కావాలి. సీతను ఎలాగయినా వొప్పించి తీరాలి. కానీ మనసులోని ఈ మాటను చెప్పడం ఎలా? పక్కకు తిరిగి గొంతు సవరించుకున్నాను. మనసులోని భావాలను మాటల్లోకి మార్చి గోడతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఆమెకు ఎరుక పరిచాను. చిత్రం ఏమిటంటే నా మాటలు వింటున్నప్పుడు, విన్నతరవాత కూడా ఆమె ఎలాటి బాధను వ్యక్తం చేయలేదు. పైగా, విడాకులా?ఎందుకు? అని ముక్తసరిగా అడగడం నన్ను మరింత ఆశ్చర్యపరచింది. ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలి? అందుకే విననట్టు నటించాను. దానితో అంతవరకూ బిగపట్టుకునివున్న ఆమె కోపం కట్టలు తెంచుకుంది.

‘నువ్వొక మగాడివేనా?’ – అంటూ ఒక్కసారిగా ఆమె అరవడంతో నిద్రపోతున్న పిల్లలు లేచారు. మా ఇద్దరి మధ్యా ఏదో జరిగిందని గ్రహించి ముగ్గురూ ఏడవడం మొదలుపెట్టారు. ఆ రోదనలతో ఇల్లు మార్మోగింది.

ఆ రాత్రి మా మధ్య మాటలు సాగలేదు. రాత్రల్లా ఆమె రోదిస్తూనే వుంది. మా వివాహ బంధం ఇలా ఎందుకు తెగిపోయిందో తెలుసుకోవాలన్నది ఆమె తపనగా నాకు అర్ధం అయింది. కానీ, ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర వుంటేగా. తన మీద వున్న నా ప్రేమ ఇప్పడు జానకి వైపు మళ్లి౦దని ఎలాచెప్పను ?

విడాకుల ఒప్పంద పత్రంలో ఇల్లూ, కారూ, కంపెనీ ఇచ్చిన షేర్లలో మూడో వంతు ఆమె పేరిట, పిల్లల పేరిట రాసాను. ఇది కాక నెల నెలా కొంత మొత్తం చేతికందేలా ఏర్పాటు చేసాను. ఈ విషయంలో మిగిలిన మొగాళ్ళ కంటే నేనే నయమని నేననుకుంటున్నాను.

తెల తెల వారుతుండగా నేను ఆమె ముందు విడాకుల అంగీకార పత్రాన్ని వుంచాను. అది చూడగానే ఆమె కళ్ళు విస్పులింగాల్లా మారాయి. ఒప్పంద పత్రాన్ని ముక్కలు ముక్కలు గా చించి విసిరివేసేంతగా ఆమె కోపం తారాస్తాయికి చేరుకుంది.
పదేళ్లకు పైగా నాతో జీవితాన్ని పంచుకున్న సీత ఈ రోజు పరాయి వ్యక్తిలా మారిపోయింది.

ఇంతకాలం నా సమయాన్ని, ధనాన్ని, శక్తి యుక్తుల్ని ఈమె కోసమా వెచ్చించింది అని బాధపడ్డానే కాని ఆమె పడుతున్న క్షోభను పట్టించుకునే పరిస్తితిలో నేను లేను. ఎంత త్వరగా సీతను విడాకులకు ఒప్పించి ఆ చల్లని కబురు జానకికి చేరవేద్దామా అని అనుకుంటున్నానే కాని సీత మనస్సులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని నేను ఏమాత్రం పట్టించుకునే పరిస్తితిలో లేను.

పైగా ఆమె రోదన నాకు స్వాంతన కలిగిస్తోంది. విడాకులకు ఒప్పుకుంటుందన్న ఆశను రగిలిస్తోంది. దానితో, సీతతో తెగతెంపులు చేసుకోవాలనే నా కోరిక మరింత బలపడసాగింది. ఎంత త్వరగా ఈమెని వొదుల్చుకుని జానకి చెంతకు చేరగలనా అన్నఆత్రుత నాలో పెరిగిపోసాగింది.

మర్నాడు కూడా ఇంటికి పొద్దు పోయే వచ్చాను. నిజానికి అది నా ఇల్లన్న అభిప్రాయం నానుంచి ఎప్పుడో తొలగిపోయింది.

సీత భోజనాల బల్ల వద్ద కూర్చుని ఏదో రాస్తోంది. నా రాక గమనించి ప్లేట్లు సదరబోయింది. కానీ, అన్నం తినడానికి మనస్కరించక నేరుగా నా గదిలోకి వెళ్ళిపోయాను. అప్పటికే పగలంతా జానకి సమక్షంలో గడిపివచ్చాను. అలసటతో వొల్లెరుగని నిద్ర పట్టింది.

తెల్లవారు ఝామున మెలకువ వచ్చి చూస్తే ఇంకా ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరే రాస్తూ కనిపించింది. ఆమెను పట్టించుకోనట్టుగా పక్కకు తిరిగి నిద్రపోయాను.

ఉదయం నేను లేచేసరికల్లా సీత తయారయివుంది.

“విడాకులు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు.” ఆమె నోట్లో నుంచి వచ్చిన ఈ మాటలతో నోట్లో పంచదార పోసినట్టు ఫీలయ్యాను. నెత్తిమీది బరువు సగం దిగిపోయింది.

“ మీ ఇల్లూ, కారూ, ఆ డబ్బూ కూడా నాకక్కరలేదు.” సీత కంఠం నిశ్శబ్దంగా వున్న ఆ గదిలో మారు మోగింది.

“అయితే ఒక కండిషన్. దానికి ఒప్పుకుంటే విడాకుల అంగీకారపత్రం పై సంతకం చేయడానికి నేను సిద్ధం.”

ఆ షరతు ఏమిటో వినడానికి నా చెవులు వెంటనే నిక్కబొడుచుకున్నాయని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.

“నాకొక నెల వ్యవధానం కావాలి. ఆ నెల రోజులు ఇష్టం వున్నా లేకపోయినా మీరు నాతో, పిల్లలతో మామూలుగా మునపటి మాదిరిగా గడపాలి.”

ఇందుకు ఆమె చూపించిన కారణాలు కూడా ఆక్షేపించదగినవిగా లేవు. పెద్ద పిల్లాడి పరీక్షలు నెలరోజుల్లో అయిపోతాయి. ఈ విడాకుల వ్యవహారం అతడి చదువును చెడగొట్టడం ఆమెకు ఇష్టం లేదు.

నెల అంటే ఎంత ముప్పయి రోజులు.

ఇట్టే గడిచిపోతాయి. దీన్ని కాదనుకుని విడాకులకోసం ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం కంటే నెల రోజుల ‘బలవంతపు కాపురమే’ నయమన్న నిర్ధారణకు వెంటనే వచ్చాను. ఈ షరతుకు జానకి కూడా సులభంగా వొప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది.

‘మరో సంగతి” సీత స్వరం లో చిన్న మార్పు.

“ఇది షరతు కాదు. ఇన్నేళ్ళు మీతో కాపురం చేసిన భార్యగా ఓ కోరిక కోరుతున్నాను. మన్నిస్తే అదృష్టవంతురాలినని అనుకుంటాను.”

ఆ స్వరంలోని మృదుత్వం నన్ను కరిగించింది. వరాలిచ్చే దేవుడి ఫోజులో సరే! అన్నాను.

ఆమె కోరిన ఆ కోరిక విన్న తరువాత – విడాకుల షాక్ లో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నదేమో అన్న అనుమానం కలిగింది. కానీ, జానకితో నా రెండో పెళ్లి త్వరగా జరగాలంటే ఇలాటి ఒకటి రెండు కోర్కెలు ఒప్పుకోక తప్పదు.

నేను మర్నాడు వెళ్లి సీత పెట్టిన షరతులు గురించీ, ఆమె  అడిగిన కోరిక గురించి జానకితో చెప్పాను. ఆమె ఒక్క పెట్టున నవ్వి సీతను ఓ పిచ్చిదానికింద జమకట్టి సరిపుచ్చుకుంది. అన్నీ సవ్యంగా జరుగుతూ వుండడంతో ఎంతో రిలీఫ్ గా ఫీలయ్యాను.

సీతకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయానికి వొచ్చినప్పటినుంచి ఆమెతో ఎడమొగం పెడమొగమే. పడక గదులే వేరయిపోయాయి. ముద్దుముచ్చట్ల సంగతి దేవుడెరుగు ఆమెతో మాట్లాడడానికే నాకు మనస్కరించేది కాదు. ఇప్పుడు మళ్ళీ సీతకు ఇచ్చిన మాట ప్రకారం ‘తొలి రాత్రి’ సన్నివేశాన్ని రిపీట్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. తనకూ కొంత ఇబ్బందికరం గానే వున్నట్టు అనిపించింది. కాకపొతే, ఇంట్లో సన్నిహితంగా మసలుతున్న మమ్మల్ని చూస్తూ మా పిల్లలు మాత్రం ఎంతో సంతోషపడ్డారు. చాలా రోజుల తరువాత మళ్ళీ మేము మా పడక గదిలోకి వెళ్లడం చూసి మా పెద్ద పిల్లవాడు వెనుకనుంచి చప్పట్లు కొట్టాడు. మనసు మూలల్లో ఏదో కదిలిన ఫీలింగ్. మంచం మీదకు చేరగానే సీత కళ్ళు మూసుకుని నెమ్మదిగా అంది. “దయచేసి మన విడాకులు గురించి పిల్లలతో అనకండి.”

పైకి తల వూపాను కాని మళ్ళీ ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. పదేళ్లనాటి చీరెను భద్రంగా  దాచి ఆ రాత్రి కట్టుకోవడం చూసి తల దించుకున్నాను.

మర్నాడు నా స్కూటర్ మీదనే సీతను తన ఆఫీసులో దింపాను. దారిపొడుగునా భుజం మీద తల వాల్చి మాట్లాడుతూనే వుంది. నా నడుం చుట్టూ బిగించి పట్టుకున్న చేతిని దిగేదాకా వొదలలేదు. నేను నా ఆఫీసుకు వెళ్ళిపోయాను.

సీతకిచ్చిన మాట ప్రకారం వెనుకటి రోజుల్లోలాగా సాయంత్రం తన ఆఫీసుకుకు వెళ్లి ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాను. మా ఇద్దర్నీ మునుపటిలా చూడడం కోసమే అన్నట్టు పిల్లలందరూ గుమ్మం ముందరే కనబడ్డారు.

రెండో రోజు మా ఇద్దరి నడుమా మరికొంత సాన్నిహిత్యం పెరిగినట్టనిపించింది. స్కూటర్ మీద వెడుతున్నప్పుడు తను నాకు మరింత హత్తుకుని కూర్చుంది. ఆమె నుంచి వెలువడుతున్న పల్చటి పరిమళం నా మెడను దాటుకుని నెమ్మదిగా వ్యాపిస్తోంది. సీతను అంత దగ్గరగా చూసిన జ్ఞాపకం ఈ మధ్య లేదు. పెళ్ళయిన కొత్త రోజులు మనసులో మెదిలాయి. స్కూటర్ దిగి ఆఫీసులోకి వెడుతున్నప్పుడు కాకతాళీయంగా ఆమె వైపు చూసాను. గంభీరతతో కూడిన మందహాసం మేళవించి నాకు చెయ్యి వూపి వీడుకోలు పలికింది. ఎన్నో ఏళ్ళ తరువాత మళ్ళీ అనుభవంలోకి వచ్చిన  సన్నివేశం.

నాలుగో రోజున నేనే చేయి అందించి ఆమెను స్కూటర్ పై కూర్చోపెట్టుకున్నాను. నాకు భార్యగా వుంటూ, నా పిల్లలకు తల్లిగా వుంటూ మరోపక్క ఉద్యోగం చేస్తూ ఇంటి పనీ, బయట పనీ సంభాలించుకుంటూ ఇన్నేళ్ళు చాకిరీ చేసిన మనిషి ఈమేకదా అనిపించింది. ఎప్పుడన్నా, ఏనాడన్నా తన గురించి పట్టించుకున్నానా అని ఒక్క క్షణం చివుక్కుమనిపించింది.

రోజులు మారుతున్న కొద్దీ సీతను గురించి నా అభిప్రాయాలు కొద్ది కొద్దిగా మారుతుండడం గమనించాను. అదేమిటో కానీ ఇవేవీ జానకికి చెప్పాలనిపించలేదు.

క్రమంగా ఇంట్లో నేను గడిపే సమయం పెరుగుతూ వస్తున్న సంగతి నేను గమనించనే లేదు. పిల్లలతో ముచ్చట్లు, పెద్ద పిల్లవాడి పరీక్షలు గురించి ఆరా తీయడం వీటన్నిటితో మళ్ళీ ఇంటి పెద్ద పాత్రలో వొదిగిపోయాను. ఓ రోజు ఏకాంతం దొరికినప్పుడు పెళ్ళికిముందు నేను రాసిన ప్రేమలేఖలు చూపించింది. నా ఉత్తరాలను పదేళ్లుగా తాను పదిలంగా దాచుకున్న తీరు నన్ను నివ్వెరపరచింది. తను రాసినవి నేను ఏం చేసానని అడగలేదు. అడిగివుంటే ఏం జవాబు చెప్పాలా అని కొద్ది సేపు మధన పడ్డ మాట వాస్తవం.

వారం రోజులు గడిచాయో లేదో పిల్లవాడి పరీక్షల పేరుతొ నేను పదిరోజులు సెలవుపెట్టాను. ఈ సంగతి తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కాని తను కూడా లాంగ్ లీవ్ పెట్టింది. అందరం కలసి ఇంట్లో చాలాసేపు గడపడం చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ మొదలయింది.

ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది.

శ్మశాన నిశ్శబ్దానికి అలవాటుపడ్డ ఇంటిని మాటలు, ముచ్చట్లు, నవ్వులు మళ్ళీ మనుషులు తిరిగే ‘నివాసం’ గా మార్చాయి. తెలియకుండానే చోటుచేసుకుంటున్న మార్పులన్నీ నన్ను కొత్త మనిషిగా మార్చడం తెలియకుండానే జరిగిపోతోంది.

పాత సంగతులు గుర్తుకొస్తున్నాయి. కొత్త విషయాలు మరపున పడుతున్నాయి.

జీవితం పాత బాటలో కొత్త పరుగు తీస్తోంది. సీతతో కాపురం సరికొత్త మధురిమను అందిస్తోంది.

ఒక్క నెల రోజుల్లో ఇది సాధ్యమా అంటే సాధ్యమే అనిపిస్తోంది.

సీత పెట్టిన గడువు పూర్తవుతున్న విషయం నాకు గుర్తుకు రాలేదు. చిత్రం ఏమిటంటే, గత కొద్ది రోజులుగా ఒక్క రోజు కూడా జానకి గుర్తుకు రాలేదు.

ఓ రోజు సీత తను సంతకం చేసిన విడాకుల అంగీకార పత్రాన్ని నాకు అందించింది. అప్పుడు కానీ నెల రోజుల గడువు పూర్తయిన విషయం నాకు తట్టలేదు.

కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ ఆమె అందించిన కాగితాలను తీసుకున్నాను. అవే చేతులతో ఆమెను పొదివి పట్టుకున్నాను. నా గుండెలపై తల ఆన్చి మౌనంగా రోదిస్తున్న సీతకు తన వీపును చుట్టుకున్న నాచేతులు ఏం చేస్తున్నాయో తెలిసే వీలు లేదు.

ఇక జీవితంలో సీతను విడిచి పెట్టేది లేదు అన్న నా దృఢ నిశ్చయానికి అనుగుణంగా నా చేతులు అంతే బలంగా మా విడాకుల పత్రాన్ని నలిపి నాశనం చేస్తున్నాయి.

(కలిసివున్నప్పుడు విడి విడిగా మసిలే భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. సన్నిహితంగా మెలగడం ద్వారా విడిపోవాలనే కోరిక దూరం చేసుకోవచ్చన్నదే ఈ కధలో నీతి. విడిపోవాలనుకున్న దంపతులు ఈ కధలో లాగా తిరిగి ఒకటవడం సులభం కాకపోవచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు.)

(19-07-2011)