5, మే 2012, శనివారం

వృత్తి రహస్యం


వృత్తి రహస్యం
కేంద్రమంత్రులు ప్రణబ్ ముఖర్జీ, కపిల్ సిబాల్ మధ్య సాపత్యం ఏమిటంటే వాళ్ళిద్దరూ ప్రతినెలా క్షౌరం చేయించుకోవడానికి ఒకే సెలూన్ కు వెడతారు.
కపిల్ సిబాల్ కిందటినెల వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే బార్బర్  కపిల్ ని అడిగాడు.
ప్రతిరోజూ పేపర్లో వస్తుంటుంది స్విస్ బ్యాంకు, బ్లాకుమనీ అంటూ, ఇంతకీ  ఏమిటండీ దీని గొడవఅని.
ఆ ప్రశ్నతో  కపిల్ సిబాల్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు.
నువ్వు నాకు క్షౌరం చేస్తున్నావా లేక సీబీఐ మాదిరిగా ఎంక్వైరీ చేస్తున్నావా?’ అంటూ అతడిపై అంతెత్తున ఎగిరిపడ్డాడు.
దాంతో బార్బరు ఏమీ అనుకోకండి, వూరికే అడిగానుఅంటూ వెనక్కి తగ్గాడు.
మర్నాడు ప్రణబ్ ముఖర్జీ గారు తలపని చేయించుకోవడం కోసం వస్తే అదే బార్బరు తారసపడ్డాడు.
కత్తెర,కత్తీ పట్టుకుని  ఓపక్క పని చేస్తూనే, మళ్ళీ నోరు జారి బెంగాలీ బాబు గారిని కూడా అదే ప్రశ్న వేసాడు స్విస్ బ్యాంకూ,బ్లాకుమనీ గట్రా మతలబేమిటని.
ప్రణబ్ ముందు కలవరపడ్డా తమాయించుకుని ఈ ప్రశ్న నన్నే యెందుకు అడుగుతున్నావనిదబాయించాడు.
ప్రణబ్ కు  కోపం వచ్చిన సంగతి  గమనించిన బార్బరు వెంటనే ఆర్ధిక మంత్రికి క్షమాపణలు చెప్పాడు. ‘ఏదో మాటవరసకు అడిగాను, దయచేసి మరచిపోండి, మన్నించండి అని వేడుకున్నాడు.
మరునాడు తెలవారుతూనే సీబీఐ బృందం  ఆ సెలూనుపై దాడిచేసి  కేంద్రమంత్రులను బ్లాకు మనీ గురించీ, స్విస్ బ్యాంకు గురించి ఆరా తీసిన బార్బరును అదుపులోకి తీసుకుని విచారించడం మొదలు పెట్టింది.
నువ్వు రాం దేవ్ బాబా ఏజెంటువా?’
కాదు సార్! నాకే పాపం తెలియదు సార్
మరి అలాంటప్పుడు, క్షౌరం చేసేవాడివి ఆ పని చేయకుండా నీకు స్విస్ బ్యాంకు గురించీ, బ్లాకుమనీ గురించీ ఆరాలెందుకు?’
ఒక సంగతి చెప్పమంటారా సార్! అది మా వృత్తి రహస్యం. మాదగ్గరకు వచ్చే కాంగ్రెస్ 


మంత్రులను స్విస్ బ్యాంకు గురించి, బ్లాకు మనీ గురించి అడగ్గానే ఇక చూడండీ!  వాళ్ల 


వెంట్రుకలు  వున్నట్టుండి నిక్కబొడుచుకుంటాయి. అలాటి జుట్టు కత్తిరించడం సులభంగా


వుంటుంది. అందుకే అలా అడుగుతుంటాను.’ (05-05-2012)

3, మే 2012, గురువారం

కాంగ్రెస్‌ వాకిట్లో ఆగస్టు సంక్షోభం?


కాంగ్రెస్‌ వాకిట్లో ఆగస్టు సంక్షోభం?

(03-05-2012 సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

- మూడోసారి ఆశలు ఆవిరి కానున్నాయా?
- అధిష్ఠానం ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా?
- అసాధారణ సమస్యలతో రాష్ట్ర కాంగ్రెస్‌
- దిగజారుస్తున్న అధిష్ఠానం ఒంటెత్తు పోకడలు
- మసకబారిన ప్రధాని ప్రతిష్ఠ
- పట్టి పీడిస్తున్న అవినీతి, కుంభకోణాలు
- మిత్రపక్షాల కనుసన్నల్లో పాలన 


sonia-manmohan-అసలు కాంగ్రెస్‌ లో ఏం జరుగు తోంది? అధిష్ఠానం అన్నీ గమని స్తోంది అని తరచుగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయ కులు చెబుతుండే మాటలు నిజం కాబో తున్నాయా? రాష్ట్ర కాంగ్రెస్‌ను పట్టి కుదు పుతున్న రుగ్మతలకు శాశ్వత పరిష్కారం దిశగా అధిష్ఠానం పావులు కదుపుతోందా? వరసగా రెండోసారి అధికారంలోకి రాగలిగామని మూడేళ్ల క్రితం మురిసి పోయిన అపురూప క్షణాలు గత కాలపు ముచ్చటగా మారిపోతున్న నేపథ్యంలో, 2012 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా పార్టీని గెలిపించుకుని, రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకున్న ఆశలు కాస్తా ఆవిరి అయిపోతున్నాయేమో అన్న అనుమానం ఢిల్లీ పెద్దలకు కలిగిందా?

తాము కోరి ఎంపిక చేసుకొని నియమించిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ అంచనాలకు, ఆకాంక్షలకు అందకుండా వ్యవహరి స్తున్నారన్న అభిప్రాయం హస్తిన నాయకులను కలవర పెడుతోందా?
డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత రాష్ట్ర వ్యవహారాలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న అధిష్ఠానం ప్రయ త్నాలు బెడిసికొట్టి, 1982 నాటి చరిత్ర పునరావృతం కాబోతున్నదన్న సందేహం పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతోందా?

ఇంతకీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
ఏమీ జరగకుండా అంతా సజావుగా ఉన్నపక్షంలో ఢిల్లీలోని అధిష్ఠానం పనుపున ఇంతమంది దూతలు ఇన్ని సార్లు హైదరాబాదు చక్కర్లు యెందుకు కొడుతున్నట్టు? సవాలక్ష సమస్యలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టి ఉన్న సమయంలో ముఖ్యమంత్రీ, పీసీసీ అధ్యక్షుడు ఇన్నిన్ని పర్యాయాలు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నట్టు?
సమాధానాలు తెలియని అనేక ప్రశ్నలు. ఒక వేళ తెలిసినా పైకి చెప్పుకోలేని అనేక ఆశక్తతలు. వెరసి ఈనాటి రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితి.ఆటు పోట్లు, హెచ్చు తగ్గులు, ముఠా తగాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు- ఇవన్నీ ఏ రాజకీయ పార్టీకయినా తప్పని తల నొప్పులే! కానీ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలు గమనిస్తుంటే ఆ పార్టీ అసాధారణ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నదన్న భావన కలుగుతోంది. ఏదో ఒక జబ్బుకయితే రోగనిర్ధారణ చేసి రోగ నిదానానికి ప్రయత్నం చేయవచ్చు.

ఒకదాని కొకటి పొసగని రుగ్మతలతో పడకేసిన కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి పూర్వవైభవం తేవడం మాట అటుంచి, పార్టీ తన కాళ్ళమీద తాను నిలబడేట్టు చేయడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడే వ్యవహారంగా కానరావడం లేదు. అందుకే, అనేక విచికిత్సల అనంతరం అధిష్ఠానం కాయకల్ప చికిత్సకు పూనుకున్నట్టుంది. బాగా ముదిరిపోయిన వ్యాధి ఏ చికిత్సకూ లొంగదు అన్న అనుమానం ఓ పక్క వేధిస్తున్నా, ఇక తప్పని సరై తానే కల్పించుకుని పరిస్థితులను ఏదో ఒక మేరకయినా చక్కదిద్దాలన్న ఆలోచనకు వచ్చినట్టుంది. బహుశా దాని ఫలితమే కాబోలు, ఇటీవల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో అధిష్ఠాన నాయకులు జరుపుతున్న నిర్విరామ చర్చలు, మరో వైపు తర్జని చూపుతూ చేస్తున్న హెచ్చరికలు!

నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇంతగా దిగజారి పోవడానికి ప్రధాన కారణం అధిష్ఠానం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలే. కానీ ఆ విషయం అధినాయకత్వం ముఖాన్నే చెప్పగల, చేవ కలిగిన నాయకుడేడీ? రాష్ట్ర కాంగ్రెస్‌ అస్తవ్యస్థ పరిస్థితికి సంబంధించి ముద్దాయి స్థానంలో ఉండాల్సిన అధిష్ఠానం తీర్పరి పీఠంపై ఉండడమే విషాదం. దీనికి తోడు - జాతీయ పార్టీ ముసుగులో ‘పేను పెత్తనం’ చేయాలనే ఆభిలాష అదనం.
తమది 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌ నాయకులు, తమ పార్టీ చరిత్రలో కలిసిపోకుండా చూసుకోవాలంటే తమ వ్యవహారశైలిని మార్చుకుని తీరాలి. నిర్ణయాలు ఢిల్లీలో తీసుకున్నా స్థానికంగా తీసుకుంటున్న అభిప్రాయాన్ని కల్పించాలి.

ప్రతి చిన్న విషయానికీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్న అపప్రథ, రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారు, చీటికీ మాటికీ ముఖ్యమంత్రులను మారుస్తున్నారన్న ఆరోపణ నిజానికి యూపీఏ-1 హయాంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిన మాట వాస్తవమే. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల విషయంలో నాటి అధినేత్రి ఇందిరా గాంధీ అనుసరించిన వైఖరికి భిన్నంగా సోనియా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఆ రోజుల్లో ప్రబలింది. 2009 ఎన్నికల్లో యూపీఏ-2 ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా అధిష్ఠానం వ్యవహార శైలిలో వచ్చిన ఈ గుణాత్మక మార్పు దోహదం చేసిందని భావించేవారు అనేకమంది ఉన్నారు.

అయితే, కాంగ్రెస్‌ నాయకత్వంలో యూపీఏ మరోసారి అధికార పీఠం ఎక్కిన తరువాత అధిష్ఠానం తన పద్ధతికి కొంత దూరం జరుగుతున్నదేమో అన్న అభిప్రాయం కలుగుతోంది. మన్మోహన్‌ ప్రధానిగా మొదటి టరంలో సంపాదించుకున్న ప్రతిష్ఠ మసకబారడం మొదలయింది. లెక్కకు మిక్కిలి అవినీతి ఆరోపణలు, అనుదినం వెలుగు చూస్తున్న కుంభకోణాలు, ఎన్నికల్లో ఎదురీతలు, వీధికెక్కి సవాళ్లు విసురుతున్న మిత్రపక్షాలు, ఒకటేమిటి అనేకానేక సమస్యల అమావాస్యల నడుమ యూపీఏ -2 సంకీర్ణ ప్రభుత్వం నడి సంద్రంలో నావ మాదిరిగా కొట్టుమిట్టాడు తున్నది. న్యూక్లియర్‌ ఒప్పందం విషయంలో నాటి మిత్ర పక్షం సీపీఎం కు ధాటీగా బదులిచ్చి, మీ అవసరం మాకు లేదు అని దాష్ఠీకంగా జవాబు చెప్పగలిగిన కాంగ్రెస్‌ నాయకత్వం ఈనాడు మిత్రపక్షాల కనుసన్నల్లో పాలన చేయాల్సిన దుస్థితి లో ఉంది.

వారు చెప్పిన వారిని మంత్రిపదవి నుంచి తొలగిం చడం, పలానా వారినే తీసుకోవాలి, పలానా శాఖ ఇవ్వాలి అంటే జీ హుజూర్‌ అంటూ తల ఆడించడం- ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఎంతటి శోభ కలిగిస్తుందో ఆ పార్టీ పెద్దలే చెప్పాలి. ఢిల్లీ స్తాయిలో తన పరిస్థితే ఇలా పెట్టుకుని- రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడానికి పూనుకోవడం అవివేకమే అయినా తప్పని బాధ్యతగా నెత్తికెత్తుకోవాల్సిన దుస్థితి. లోపల అయ్యవారేం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్న చందంగా తయారయింది. కానీ తప్పు దిద్దుకోవడానికి తరుణం కాదాయె.

Copy of bandaruముంగిట్లో 18 అసెంబ్లీ ఉపఎన్నికలు, ఒక లోకసభ ఉపఎన్నిక పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పాలుపోని పరిస్థితి. బహుశా నిర్ణయం అయిపోయింది, అమలు చేయడమే ఆలశ్యం అనే వాళ్లు కూడా ఉన్నారు.రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఆగస్టులో కాయకల్ప చికిత్స మొదలు పెడతారేమో! అప్పుడూ లొంగకపోతే, ఆఖరి ఔషధంగా గరళ వైద్యం తప్పదేమో! దుష్టాంగాన్ని ఖండించయినా శిష్టాంగాన్ని కాపాడమన్నారు కదా పెద్దలు. కాకపోతే, తొలగించే అంగాలు ఒకటా రెండా అన్నదే ప్రశ్న.

30, ఏప్రిల్ 2012, సోమవారం

డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు


 డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు 
ఈ కాలంలో సీటుకోసం వెంపర్లాడని వెర్రివాళ్ళెవ్వరుంటారు?
రాజకీయాలు తీసుకుంటే సర్పంచ్ సీటుతో ప్రారంభించి  సీఎం సీటు వరకు ఎగబాకాలనుకుంటారు.
సినిమాల్లో అయితే ఎగస్ట్రా పాత్రనుంచి మొదలుపెట్టిసెట్లో  వెనుక హీరో’ అనో హీరోయిన్ అనో రాసున్న సీటు సొంతం చేసుకోవాలని కలలు కంటారు.
మహాసభల్లో స్టేజీ మీద మొదటి వరస సీటు దక్కించుకోవాలనుకునేవారు కోకొల్లలు.
ప్రేక్షకుల్లో కూర్చోవాల్సిన పరిస్తితే వస్తే అక్కడా మళ్ళీ ముందు వరస కోసం వెతుకులాటే!
చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాలనుంచి పెద్ద పెద్ద సభలవరకూ ఈ సీట్ల గోల తప్పదు.
కెమెరా యాంగిల్ నుంచి వీ.వీ.ఐ.పీ. పక్క సీటు కోసం ఆత్రపడేవాళ్ళు తక్కువేమీ కాదు.
యాభై అరవై ఏళ్ళక్రితం పల్లెటూళ్ళకు వచ్చే బస్సుల్లో డ్రైవర్ పక్కన వుండే ఫ్రంటు సీటు కోసం వూళ్ళో మోతుబరులు పోటీపడేవారు.
ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు.  అమ్మ   (శ్రీమతి ఇందిరాగాంధి)  కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు.  ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేది. అంజయ్య గారు  ముందు సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది.  ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ.  లైఫ్ బాయ్ ఎక్కడవుంటే  ఆరోగ్యం అక్కడ వుంటుంది’  అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం.  బాత్రూంబెడ్ రూముల్లో  కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.
ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ  కారుకు  యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం  పూర్తిగా మారిపోయింది. మంత్రులుముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా  యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు అభివాదం చెయ్యడానికీరెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం  మరో కారణం.
ఇంతకీ ఈ సీట్ల గొడవ ఎత్తుకోవడానికి కారణం లేకపోలేదు.
ఆస్ట్రేలియాలో స్కై స్కానర్’ అనే ఓ వెబ్ సైట్ సంస్థకు ఏమీ తోచకతోడికోడలు పుట్టిల్లు ఎక్కడో తెలియక – తరచుగా విమానాల్లో ప్రయాణించేవారు  ఏ సీటు అంటే బాగా మక్కువ పడతారో లెక్కలు తేల్చడానికి ఏకంగా ఓ సర్వే చేపట్టింది. దానాదీనా తేలిందేమిటంటే చాలా ఎక్కువమంది గాలి తిరుగుబోతులు’  తాము ప్రయాణించే విమానాల్లో ‘6-A’ నెంబరు కలిగిన సీటును కోరుకుంటారట.
విమానం ఆగగానే ఆలశ్యం లేకుండా దిగిపోయేందుకు ఆ సీటు అయితే బాగా వుంటుందన్నది వాళ్ల అభిప్రాయం. అలాగే టాయిలెట్లు కాస్త దూరంలో వుండడం కూడా 6-A’ నెంబరు సీటు కోరుకోవడానికి కారణంగా చెబుతున్నారు. అలాగే, విమానం ముందు భాగంలో ఎడమవైపు వరసలో వుండే సీట్లు కూడా చాలామంది కోరుకునే సీట్లని ఈ సర్వే తేల్చింది.
పోతే ఎవ్వరూ కూడా  అంతగా ఇష్టపడని సీటు ఒకటి వుందని ఈ సర్వేలో తేలింది. అదేమిటంటే విమానం వెనుక భాగంలో రెండు సీట్ల నడుమ వుండే ‘31-E’ సీటట.
6-A’ నెంబరు సీటుకు డిమాండు వుందని తేలడంవల్ల గిరాకీని  బట్టి రేట్లు పెంచే సంస్కృతి కలిగిన విమానయాన సంస్తలు ఆ సీటుకు  ‘ప్రీమియం’  చార్జీ వసూలు చేసే అవకాశం లేకపోనూలేదని ఈ సర్వే చేసిన స్కై స్కానర్’ ట్రావెల్ ఎడిటర్  శామ్ బాల్డ్ విన్ మహాశయులవారు హెచ్చరిస్తున్నారు.
లాభం లేనిదే వ్యాపారి వరదను సయితం  లెక్కచేయకుండా ప్రయాణం పెట్టుకోడని సామెత.
కాబట్టి, సర్వేల్లో అసలు మతలబు ఇదన్నమాట.
సర్వేజనా సుఖినోభవంతు! (30-04-2012)

29, ఏప్రిల్ 2012, ఆదివారం

కప్పల గోల



కప్పల గోల
‘మనసు భద్రం తమ్ముడూ!’ అన్నాడో కవి.
ఎందుకంటే మనసు చేసే గందరగోళం ఇంతా అంతా కాదు. లేని దాన్ని సృష్టిస్తుంది. వున్నదానిని కానరాకుండా చేస్తుంది. మనసు చేసే మాయనుంచి బయటపడలేకపోతే ఇక ఆ ‘మనిషి గతి ఇంతే!’
చైనా లో ఓ నీతి కధ వుంది.
ఓ వయసు మళ్ళిన పెద్దమనిషికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఇంటి పక్క మడుగులో వున్న కప్పలు రాత్రి వేళల్లో చేసే గోల.
మండూక సంతానం చేసే బెకబెకల శబ్దాలు ఆ పెద్దమనిషికి చిన్నపాటి కునుకు కూడా పట్టకుండా చేస్తున్నాయి. వాటి బెడద వొదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఆసామీ పొరుగున బస్తీలో హోటల్ నడుపుతున్న మరో పెద్ద మనిషిని సంప్రదించాడు.
‘నా దగ్గర ఓ లక్ష కప్పలు వున్నాయి. మీరు కొంటానంటే రోజూ ఓ వేయి కప్పలయినా సప్లయి చేస్తాను’
బస్తీ పెద్దమనిషి సంతోషంతో కప్పలా గెంతబోయి వెంటనే తమాయించుకుని, రోజూ ఓ వెయ్యి కొనడానికి  పల్లెటూరి పెద్దమనిషితో ‘కప్పల బేరం’ కుదుర్చుకున్నాడు.
వూరికెళ్లిన పెద్దమనిషి మర్నాడే తిరిగొచ్చాడు. ఆయన చేతిలో రెండే రెండు కప్పలు వున్నాయి.
‘మిగిలినవేవి?’ అని బస్తీ మనిషి అడిగాడు.
‘రాత్రిళ్ళు  అవి చేసే బెకబెకల ధ్వనులు విని ఆ మడుగులో కనీసం ఓ లక్ష కప్పలయినా వుంటాయని భ్రమ పడ్డాను. తీరా చూస్తే అంత గోల చేస్తున్నవి ఈ రెండే!’ పల్లెటూరి మనిషి బదులు చెప్పాడు.
అంటే ఏమిటన్న మాట!
చుట్టూ జగమంతా నిద్రిస్తున్నప్పుడు, వొంటరితనం వేధిస్తున్నప్పుడు మనసు చేసే అల్లరి ఇది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. (29-04-2012)

26, ఏప్రిల్ 2012, గురువారం

కష్టాల కడలిలో కాంగ్రెస్‌


కష్టాల కడలిలో కాంగ్రెస్‌  (SURYA DAILY- Dated. 26-04-2012)

రోగనిర్ధారణలో కేంద్ర ఆరోగ్యమంత్రి వైఫల్యం?
కేరళ మూలికా వైద్యుని ప్రవేశం!
ఇంతకీ రోగ నిర్ధారణ జరిగినట్టేనా?
వయలార్‌ రాకతో అనుమానాలు
ఇంతలోనే ముంచుకొచ్చిన ఉప ఎన్నికలు
కాంగ్రెస్‌ ఆశలపై ఎన్నికల నియమావళి నీళ్ళు
తోడైన అంతర్గత కుమ్ములాటలు
పుణ్యకాలం రెండేళ్ళే! 





రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికి తీసికట్టు చందంగా ఉందన్న సంగతి అధిష్ఠానానికి ఇన్నాళ్లకు తెలిసివచ్చినట్టుంది. కేంద్రంలో స్వయంగా ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న గులాం నబీ ఆజాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీని పట్టి పీడిస్తున్న జబ్బేమిటో ఆనవాలు పట్టలేక పోయారు. ఇక ఇంగ్లీష్‌ వైద్యంతో పని కాదనుకున్నారో యేమో కానీ హఠాత్తుగా ఢిల్లీ నుంచి కేరళ మూలికా వైద్యుడు వయలార్‌ రవిని రోగనిర్ధారణ కోసం పంపారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో అదే ఢిల్లీ నుంచి వయలార్‌ మహాశయులు హైదరాబాదు రావడం లేనిపోని అనుమానాలకు బీజం వేసింది. నేడో రేపో ముఖ్యమంత్రి మార్పు తథ్యం అన్నంతవరకు ఊహాగానాలు గుప్పుమన్నాయి.

అయితే, వీటితో సంతోషపడ్డవారూ కాంగ్రెస్‌లో ఉన్నారు. అయ్యో యెట్లా అనుకున్న వారూ అదే కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలం, బలహీనత ఇదే సుమా అని విశ్లేషించిన వాళ్ళూ లేకపోలేదు.వచ్చారు, చూశారు, వెళ్లారు అన్న తరహాలో వయలార్‌ వారి రాష్ట్ర పర్యటన ముగిసింది. పోతూ పోతూ షరా మామూలు తరహాలోనే, ముఖ్యమంత్రికీ, పీసీసీ అధ్యక్షుడికీ నడుమ ఎలాటి విభేదాలు లేవని మీడియాకు నొక్కి వక్కాణించి మరీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి అధినాయకురాలికి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలపై ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నివేదిక రూపంలో అందచేశారని భోగట్టా. ఇంతకీ ఆయన అయినా రోగనిర్ధారణ చేశారా అన్నది సమాధానం దొరకని ప్రశ్నే.ఈలోగా పులిమీది పుట్రలా పద్ధెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉపఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు ఎంతో కొంత వ్యవధానం ఉంది, ఏదో ఒక మేరకు సర్డుకోలేకపోతామా అని కాంగ్రెస్‌ పెట్టుకున్న ఆశలపై, ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్న ప్రకటన బిందెడు నీళ్ళు గుమ్మరించింది.

ప్రజాపథం పేరుతొ, లేదా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల పేరుతో సర్కారు డబ్బులు వెదజల్లకుండా ఈ నియమావళి మోకాలొడ్డింది. నిజానికి ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీల మీద కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న వెసులుబాటు ఇదొక్కటే. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ వ్యవధానం ఉంది. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడానికి, చోటా మోటా నాయకులను చేరదీసి పోలింగు బూత్‌ల పరిధుల్లో కోరుకున్న విధంగా ఓటింగు జరిగేలా చూసుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న వీలు, సాళ్ళు ఇతర పార్టీలకు లేవు. కానీ, ఎన్నికల నియమావళి పుణ్యమా అని ఇప్పుడా వెసులుబాటు లేకుండా పోయింది. రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేవిధమయిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

అనుకున్న వ్యవధిలో జరుగుతాయనుకున్న అసెంబ్లీ ఎన్నికలు బాగా వాయిదా పడిపోవడంతో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నెలల తరబడి కొనసాగాల్సి వచ్చింది. పేరుకు ముఖ్యమంత్రి అయినా ఏమిచేయాలనుకున్నా చేయలేని పరిస్థితి. అన్నింటికీ ఎన్నికల కమిషన్‌ లక్ష్మణ రేఖలు. మండే ఎండా కాలం. చిన్నా చితకా పనులు చేయాలన్నా అడ్డుకొంటున్న ఆంక్షలు. జనాలకు అవసరమయిన పనులు చేసిపెట్టలేని అశక్తత. ఫలితం ఏమిటన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు అదే వాతావరణం పునరావృతమవుతోంది. ఎండలు మం డుతున్నాయి. దాహార్తితితో జనం ఎండుతున్నారు. అభివృద్ధి కార్యక్ర మాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సిన పరిస్థితి. ఆనవాయితీకి భిన్నంగా ఉప ఎన్నికల షెడ్యూల్‌కు, ఎన్నికల నోటిఫికేషన్‌కు నడుమ వ్యవధి కాస్తా ఇరవై అయిదు రోజులకు పెరిగింది. సాధారణంగా ఇది వారం, పది రోజులకు మించి ఉండదు.

ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం సుమారు వంద కోట్ల రూపాయల పైచిలుకు అభివృద్ధి పనులు మంజూరు చేసిన విషయం ఫిర్యాదుల రూపంలో ఎన్నికల కమిషన్‌కు చేరడమే ఇంత ముందుగా షెడ్యూల్‌ ప్రకటించడానికి కారణంగా చెప్పుకుంటున్నారు.
ఉప ఎన్నికలు జరిగి తీరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా అసలు జరుగుతాయా లేదా అన్న విషయంపై చాలా రోజులుగా సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. రాష్టప్రతి ఎన్నిక జరిగే లోగా ఆయా రాష్ట్రాల శాసన సభల్లో ఏమైనా ఖాళీలు ఉంటే, వాటిని భర్తీ చేయడం అన్నది సంప్రదాయమే కాని నిబంధన కాదని, ఎన్నికలకు వెనుకంజ వేసే ప్రభుత్వం ఏదో ఒక కారణం చూపి వాటిని వాయిదా వేయించడానికే ప్రయత్నిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రతిపాదన ఇందులో భాగమేనని కూడా వార్తలు వెలువడ్డాయి. కాని ఈ వదంతులను పటాపంచలు చేస్తూ అనుకున్న దానికంటే కొంత ముందుగానే ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించడం ఆయా పార్టీల వారిని నివ్వెర పరచింది. ఉప ఎన్నికలు ముందు నుంచి ఊహించినవే కాబట్టి, అందరూ వాటికి సంసిద్ధంగానే ఉన్నారనుకోవడం పొరబాటు. వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న పార్టీలు, ముఖ్యంగా పాలక పక్షం, ఏదో ఒక కారణంతో పోలింగ్‌ వాయిదా పడాలనే కోరుకోవడం సహజం. కానీ, ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నిఅన్నట్టుగా ఎన్నికల తరుణం ముందుకు తోసుకు వచ్చింది.

అసలే ప్రతికూల వాతావరణం. పైపెచ్చు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. వాటికి తోడు, ఈ సారి కాంగ్రెస్‌ పని అయిపోయినట్టే అని వెలువడుతున్న ఎన్నికల సర్వేలు. ఇవన్నీ కాకుండా, పోటీ చేసే అభ్యర్ధులను కూడా సకాలంలో ప్రకటించలేని దుస్థితి, వెరసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారయింది.ఈ నేపథ్యం ఇట్లా ఉంటే, ఇవన్నీ సరిపోలేదన్నట్టు- రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడు, సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయనగరంలో ధర్నా చేయడం, మరో వైపు పార్లమెంటులో అధికార పక్షానికే చెందిన సభ్యులు తెలంగాణ కోసం సభా కార్యక్రమాలకు అడ్డు తగిలి, నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌కు గురికావడం- ఇవన్నీ కాంగ్రెస్‌ పార్టీని, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మరింత ఇరకాటంలో పడేసాయి.

రామాయణంలో పిడకల వేటలా ఉప ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకోవాలో లేదో అని పార్టీలో చెలరేగిన మీమాంస పార్టీని అతలాకుతలం చేసింది. ఒక రోగం అయితే ఏదో వైద్యం చేసి సరిదిద్దవచ్చు. అనేక రోగాలాయే. ఒకదానికి చేసే చికిత్స మరో దానికి వికటిస్తుంది. క్షయ, షుగర్‌ వ్యాధులతో సతమతమయ్యే రోగికి ఒక రోగ నిదానానికి చేసే చికిత్స మరో వ్యాధికి పొసగదు. క్షయ రోగానికి పుష్టీ బ్రాండ్‌ ఆహారం తీసుకోవాలి. కానీ, షుగర్‌ వ్యాధి కూడా ఉన్నప్పుడు అలాటి ఆహారం తీసుకోవడం కుదరని పని.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్తితి ప్రస్తుతం ఈ రెండు వ్యాధులు సోకిన రోగి మాదిరిగా ఉంది. వైఎస్సార్‌ అభివృద్ధిని ఖాతాలో వేసుకోవాలంటే, మరో వైపు ఆయన హయాంలో జరిగినదంటున్న అవినీతి మరక అంటుకుంటుందని భయం. వైఎస్‌ చేసిన అభివృద్ధిని వదలుకుంటే ప్రజలు కాదంటారని సంకోచం. ఇన్ని సంకటాల నడుమ కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలన సాగుతోంది.

పాలన సాగుతోందని అంటే దానికి కూడా అభ్యంతర పెట్టేవాళ్ళు ఆ పార్టీలోనే చాలామంది ఉన్నారు. కొంతమందికి వైయస్సార్‌ పనికిరాడు. ఆ మేరకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అవసరం వారికి ఉంది. అదీ ఎంతవరకు? మరొకరికి అధిష్ఠానం అవకాశం ఇచ్చేవరకు. ఇస్తే, మరుక్షణం నుంచి వారి విధేయతలు మారిపోతాయి. ఎందుకంటే నేటి రాజకీయాల్లో విధేయతలు, విశ్వాసాలు అన్నీ కుర్చీలకే పరిమితం. అవకాశం రావాలే కానీ, ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్న అధినాయకులతోనే- ముఖ్యమంత్రి పదవి కోసం బరిలోకి దిగడానికి అలాటివాళ్ళు ఎప్పుడూ సిద్ధమే. ఇందుకు కారణం ఉంది.

మంత్రి అనిపించుకోవాలన్నా, ముఖ్యమంత్రి అనిపించుకోవాలన్నా ఇక మిగిలిన పుణ్య కాలం రెండేళ్ళే! ఆ తరువాత ఏదో మహాద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్‌ వరసగా మూడో పర్యాయం అధికారంలోకి రావడం కల్ల. అందువల్ల, ముఖ్యమంత్రి కావాలనే కల నెరవేరాలన్నా, ఆ దరిమిలా పది కాలాలపాటు మాజీ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోవాలన్నా ఉన్న వ్యవధి ఈ రెండేళ్ళే అన్న వాస్తవం మూడు రంగుల కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటారు. మరి కుర్చీ ఖాళీ లేకపోతే ఏం చేస్తారు? ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదేనేమో!


(25-04-2012)

22, ఏప్రిల్ 2012, ఆదివారం

ఇంటర్నెట్ యూజర్లూ! హెచ్చరికోయ్! హెచ్చరిక!!


ఇంటర్నెట్ యూజర్లూ! హెచ్చరికోయ్! హెచ్చరిక!!

ఈనాడు అంటే ఏప్రిల్ ఇరవై రెండో తేదీ 'ఈనాడు' దినపత్రిక మెయిన్ ఎడిషన్ ఐదో పేజీలో ప్రచురించిన వార్త ఆధారంగా -






వివరాలకు ఈ కింది 'లింక్' పై నొక్కండి.













12, ఏప్రిల్ 2012, గురువారం

రాజకీయుల నాలుకకు నరం వుంటుందా! – భండారు శ్రీనివాసరావు


రాజకీయుల నాలుకకు  నరం వుంటుందా!భండారు శ్రీనివాసరావు
అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి  ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో  మళ్ళీ  డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో  వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960   అధ్యక్ష ఎన్నికలనాటికి  డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్  స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే  సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.
అసత్యాలు సరే గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాష్ట్ర రాజకీయాల  తీరుతెన్నులను  గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్  విండిలై విండవర్ కండిలై’ అని  తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దివంగత రాజశేఖర రెడ్డి గురించి కూడా ఇదే రకమయిన అయోమయం చోటుచేసుకుంటు న్నట్టు అనుదినం వార్తలు తెలుపుతున్నాయి. కొందరికి ఆయన కనబడుతుంటే మరికొందరికి ఆయన కుమారుడు జగన్ మోహన రెడ్డి కూడా కనబడుతున్నారు. నిజానికి, రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి ఆజాత శత్రువు ఏమీ కాదు. ఆజన్మ శత్రువులకు కూడా కొదవేమీ లేదు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సయితం  ఆయనతో తీవ్రంగా విభేదించిన కాంగ్రెస్ నాయకులున్నారు. అలాగే ఆయనను ఇంద్రుడు, చంద్రుడు అని వేనోళ్ళ పొగిడి రాజకీయ లబ్ది పొందినవాళ్ళు కూడా వున్నారు.  తెలుగు దేశం హయాంలో రాష్ట్రంలో కొడిగట్టిపోతున్న కాంగ్రెస్ పార్టీకి తన పాద యాత్రతో నూతన  కొత్త జవసత్వాలు కట్టబెట్టి అనేక ఏళ్ళ తరువాత అందని పండుగా మారిన అధికారాన్ని  తమ  పార్టీకి అందించాడని  కొన్నేళ్లపాటు ఆయనను విడవకుండా కీర్తించిన వందిమాగధుల స్వరాలు కూడా  క్రమంగా మారిపోతూ వుండడమే విచిత్రం. ఆయన చనిపోయిన వెంటనే సీను హఠాత్తుగా మారిపోలేదు  కాని క్రమంగా మారుతూ వచ్చింది.  వైయస్సార్ కుమారుడు తిరుగుబాటు బావుటా ఎగురవేసి వేరు కుంపటి పెట్టి రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురయిన వరస అపజయాల దరిమిలా కాని కాంగ్రెస్ నాయకులకు కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. లక్షల కోట్ల లెక్కలో జగన్  మోహన రెడ్డి అవినీతి గురించి తాము  చెబుతున్న లెక్కలు జనాలకు పట్టకపోవడం వారికి వింతల్లో వింతగా అనిపిస్తూ వుండవచ్చు. ఇందుకు నెపం ఎవరిమీదనో మోపాల్సిన పని లేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధం. ఆయన చనిపోగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసి మరో పార్టీ అధికారంలోకి వచ్చిందా అన్నట్టు ఆ తరువాత  అధికార పీఠం ఎక్కిన వారు ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారికి నచ్చడం లేదు. ఆ విధంగానే, ఆయన పాలన అంతా అవినీతిమయం అంటున్న  వారికి ఆయన చేపట్టి అమలు చేసి చూపిన సంక్షేమ కార్యక్రమాల వూసు పట్టడం లేదు. దాని ఫలితమే బడుగు బలహీన వర్గాలన్నీ వైయస్సార్ పేరుతొ పెట్టిన పార్టీ వెంట నడవడానికి దోహదం చేసింది. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తనకేం చేసుకున్నాడో, తన కొడుక్కేం చేసుకున్నాడో మాకనవసరం. మాకేం  చేశాడన్నదే మాకు ప్రధానం’ అని మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి రాజధానిలో బార్బర్ గా పనిచేస్తున్న నరేష్ చెప్పాడు. వైయస్సార్ పుణ్యమా అని తన చెల్లెలు ఇంజినీరింగు పూర్తిచేసిందని, తనకూ ఈ మాదిరి సాయం లభించి వుంటే పదో తరగతి కూడా పూర్తి చేయకుండానే  చదువు మధ్యలో  మానేయాల్సిన దుస్తితి తప్పేదని అంటూ, చెల్లెలు ఇంజినీరుకాగానే వూళ్ళో తమ స్తాయి పెరిగిందనీ, అందరూ తమ కుటుంబాన్ని గౌరవంగా చూస్తున్నారనీ గర్వంగా చెప్పుకొచ్చాడు. ఆరోగ్య శ్రీ కింద  గుండె ఆపరేషన్లు చేయించుకున్నవాళ్ళు, ఏ పార్టీ జెండా పట్టుకోకుండానే ఇందిరమ్మ ఇల్లు పొందిన వాళ్లు, నెలనెలా పెన్షన్ క్రమం  తప్పకుండా అనుకుంటున్న వృద్ధులు – వీరంతా  వూరూరా నోటిమాటగా చేసిన ప్రచారం కోట్లు ఖర్చు  పెట్టి చేసే ప్రభుత్వ ప్రచారాన్ని మించి పోయింది. ఇది గమనం లోకి తీసుకోకుండా పార్టీలోని వైయస్సార్ ప్రత్యర్ధులు చేసిన తప్పుడు ప్రచారాన్ని  నమ్మి కొంతా, పధకాల మీద తమ  పట్టు పోతోందన్న  ఉక్రోషంతో కొందరు అధికారులు చేసిన నిర్వాకం వల్ల కొంతా  మొత్తం మీద ఏదయితేనేం వైయస్సార్ సంక్షేమ పధకాలను  అటకెక్కి స్తున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. వైయస్సార్ మరణం తరువాత ఈ పధకాలను అప్పటి మాదిరిగానే కొనసాగించివున్న పక్షంలో ఈనాడు జగన్ మోహన రెడ్డి  ఆ పధకాలను గురించి క్లెయిం చేసుకునే అవకాశం దక్కివుండేది కాదు. ఆ పధకాల వల్ల మేలు పొందిన వారి అభిమానం కాంగ్రెస్ పట్ల చెక్కు చెదరకుండా వుండేది. వైయస్సార్ బొమ్మ గురించి ఈనాడు ఇంతగా పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడాల్సిన అవసరం వుండేది కాదు.  కారణాలు ఏవయినా కాంగ్రెస్ నాయకత్వం ఈ బంగారు అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. దాని ఫలితమే,  దరిమిలా  కడప, కోవూరు ఉపఎన్నికల  ఫలితాల్లో ప్రస్పుటమయింది కూడా.
అయినా ఇప్పటికీ,  రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం గురించి  పార్టీ వర్గాల్లో  గుంజాటన సాగుతూనే వుంది. ఈ మధ్య ఢిల్లీలో అధిష్టాన దేవతలు రాష్ట్ర నాయకులకు అభ్యంగన స్నానం చేయించి, చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి, చేయాల్సిన హిత బోధలు చేసి సాగనంపిన పిమ్మట   ఇది క్రమంగా శ్రుతి మించి ఆరున్నొక్క రాగంగా మారుతోంది.
కాంగ్రెస్ లో అవలక్షణాలకు చక్కని పేర్లు పెట్టుకుంటూ వుంటారు. కార్యకర్తల స్తాయిలోనే కాకుండా అధినాయకుల స్తాయిలో కూడా మాటలు విసురుకుంటూ దానికి అంతర్గత ప్రజాస్వామ్యం అనే నామకరణం చేసుకుని వారిలో వారే సంతృప్తి పడుతూ వుంటారు. పోటీ లేనప్పుడు, ప్రత్యామ్నాయం లేనప్పుడు ఇలా గొడవలు పడ్డా వచ్చే ప్రమాదం లేకపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా లేవు. ఏదో అధికారంలో వున్న పార్టీ కదా ఇప్పుడే  వొదిలేయడం ఎందుకు, కొన్నాళ్ళు ఆగితే పోలా అనుకునేవాళ్లకు  కాంగ్రెస్ లో ఏమాత్రం కొరత లేదు. అలాగే వై యస్సార్ వీరవిధేయులు పార్టీ విడిచి వెళ్ళిన తరువాత కూడా, మరి  కొందరు ఇంకా మఠం వేసుకు కూర్చుని ‘మనసు ఒక చోటా మనువు మరో చోటా’ అన్న డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తార్కాణం కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా  వెల్లడిస్తున్న ‘కోవర్టు’ల వ్యవహారమే.
త్వరలో జరగనున్న పద్దెనిమిది ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్తితి ఎలావుంటుందో ఎవరూ చెప్పలేరు. పోలింగుకు ఒక్క రోజు ముందు జరిగే ఏ సంఘటన అయినా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం వుంటుంది. కాని ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంత దీనాతిదీనంగా వుండడం గత నలభై ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. వైయస్సార్ మరణానంతరం లభించిన  మూడేళ్ళ పై చిలుకు అధికార సమయాన్ని కాంగ్రెస్ వారు పూర్తిగా వృధా చేసుకున్నారు. నిష్క్రియాపరత్వానికి ఒక ఉదాహరణగా చరిత్రలో నిలచిపోతారు. (11-04-2012)
                                                          

7, ఏప్రిల్ 2012, శనివారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు)


మార్పు చూసిన కళ్ళు 
(అలనాటి మాస్కోలో మా అనుభవాలు)
ప్రధాని గారూ! మీరు బూట్లెక్కడ కొన్నారు?  
ఓ రోజు ఆఫీసులో పనిచేసే రష్యన్ సహోద్యోగి, పత్రికలో పడిన ఓ జోక్ ను  రష్యన్ యాసలో తెలుగులో చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజానికి అది జోకేమీ కాదు. అది ఆ దేశ ప్రధానమంత్రి  కోసిగిన్ గురించిన వార్త. ఆయన ఏదో కార్యక్రమంలో పాల్గొన్న ఫోటో ఓ పత్రికలో వేసారు. బూట్లు సాక్సు వేసుకుని ఫోటోలో కానవస్తున్న ప్రధాన మంత్రికి ఆ పత్రిక పాఠకుడు రాసిన బహిరంగ లేఖను  నా రష్యన్ మిత్రుడు  జోకుగా చదివి  వినిపించాడు.
‘అయ్యా! ప్రధాని గారు. బూట్లు, సాక్సు కోసం గత ఆరు మాసాలుగా నేను తిరగని దుకాణం లేదు. మీరు ఎక్కడ కొన్నారో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి.’ ఇదీ ఆ ఉత్తరం సారాంశం.
నేను మాస్కో వెళ్ళిన  కొత్తల్లో ఆఫీసులో ఎవ్వరూ, జోకుల సంగతి అటుంచి అసలు  అవసరం అయినదానికంటే ఎక్కువ తక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. అలాటిది ఏకంగా దేశ ప్రధాని గురించీ, ఆయన వేసుకున్న బూట్లూ సాక్సూ గురించీ అలా బహిరంగ లేఖ రాయడం, దాన్ని గురించి ఆఫీసుల్లోనే బహిరంగంగా చర్చించుకోవడం – ఇదంతా  చూస్తుంటే  నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సోవియట్ రష్యాలో నిత్యావసర వస్తువుల కొరత గురించి ఒక సాధారణ పౌరుడు ఏకంగా ప్రధానమంత్రిని ఉటంకిస్తూ వ్యంగ్యంగా నేరుగా  పత్రికకు ఉత్తరం రాయడం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం నుంచి వెళ్ళిన నాకే అబ్బురం అనిపించింది. అందులో అది షరా మామూలు దేశమేమీ కాదు. ఇనుపతెర దేశంగా ప్రసిద్ధి చెందిన దేశం.
మంచిదే! గోర్భచెవ్ ఏమిచ్చినా ఏమివ్వకపోయినా ప్రజలు  గాఢంగా కోరుకుంటున్న వాక్స్వాతంత్రం పూర్తిగా ఇచ్చేసినట్టే లెక్క. నిజానికి అక్కడివారికి జీవించడానికి ఏమేమి కావాలో అక్కడ అన్నీ వున్నాయి. పైగా అవన్నీ కారు చౌకగా. లేనిదల్లా మనసులో మాట బయట పెట్టగలిగిన స్వేచ్చ ఒక్కటే. అదొక్కటీ దొరకడమే వారికి అబ్బురంగా అనిపించి వుంటుంది.
ఇలా మొదలయిన మార్పు ‘మార్పు’ అన్న పదానికంటే గొప్పగా మార్పు చెందడమే నేను చూసిన మార్పు.
మార్పు అన్నది తెలవకుండా డెబ్భయ్ ఏళ్ళపాటు అవిచ్చిన్నంగా సాగిన సోవియట్ వ్యవస్థలో కనబడని మార్పులు కనీ కనబడకుండా  చోటు చేసుకుంటున్నాయన్న మాట. (07-04-2012)