7, మార్చి 2012, బుధవారం

సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!




సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!

తేదీ: 2011, జూన్ 17 దేశం సౌదీ అరేబియా




ఆ రోజు వందలాదిమంది జనం  కార్లలో బయలుదేరారు. ఇందులో విచిత్రం ఏమిటి అనుకుంటున్నారా.  ఆ కార్లు నడుపుతున్నవారందరూ స్తీలే. అయితే ఏమిటంటారా! వారందరికీ కార్లు వున్నాయి కాని వాటిని నడపడానికి లైసెన్సులు మాత్రం  లేవు. మరి లైసెన్సులు లేకుండా వారంతా కార్లలో బయటకు ఎందుకు వచ్చినట్టు? లైసెన్సుల కోసమే అంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. లైసెన్సుల కోసమే వారందరూ అలా రోడ్డెక్కాల్సి వచ్చింది. లైసెన్స్ లేకుండా కారు నడిపితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. దానికి సిద్ధపడే వాళ్లు కార్లతో రోడ్డున పడ్డారు.
మూకుమ్మడి నిరసన కావడం వల్ల పోలీసులు అందర్నీ అరెస్ట్ చేయలేకపోయారు. కొందరికి చలాన్లు రాశారు. కొందర్ని హెచ్చరించి వొదిలేశారు. అరెస్ట్ అయిన కొద్దిమంది కూడా అందుకు బాధ పడలేదు. ఎందుకంటె తమ బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వారు ఈ ఆందోళనకు నడుం కట్టారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ దేశంలో స్త్రీలకు కార్లు నడిపే హక్కు లేదు. ప్రపంచంలోవున్న లగ్జరీ కార్లన్నీ సౌదీలో దర్శనమిస్తాయి. పెట్రోలు కూడా చాలా చవుక. కార్లు కొనుక్కోగల ఆర్ధిక స్తోమత ఆ దేశంలో చాలామందికి వుంది. మహిళలు కూడా  ఉద్యోగాలు చేస్తారు. కారు కొనుక్కోవడం వారికి ఓ లెక్కలోనిది కాదు. పైగా వృత్తి రీత్యా వాహనం అవసరం కూడా. ఆఫీసులకు వెళ్లడానికీ, పిల్లల్ని స్కూళ్ళలో దింపడానికీ ఉద్యోగినులకి సొంత వాహనం యెంత అవసరమో ఈ నాడు అందరికీ తెలిసిన విషయమే. ఆడా  మగా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందరూ  కారు నడపడం సర్వసాధారణంగా మారిపోయింది. అయినా సౌదీ అరేబియాలో ఆడవారికి ఈ హక్కు ఇంకా హక్కుభుక్తం కాలేదు. దీనికోసం వాళ్లు చాలాకాలంగా ఆందోళన  చేస్తూ వున్నారు. బహుశా, ఆడవారిని మోటారు కారులో డ్రైవింగ్ సీటులో చూడలేనిది మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క దేశంలోనే.
సౌదీ మహిళల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ వివక్ష కారణంగా  ఆ దేశంలో చాలా కుటుంబాలు డ్రైవర్ ని పెట్టుకోవాల్సిన పరిస్తితి. అలా సొంతంగా డ్రైవర్ ని పెట్టుకుకోవాలంటే అతగాడికి నెలకు రెండు వేల సౌదీ రియాల్స్ చెల్లించుకోవాలి. లేదా ఉద్యోగం చేస్తున్న మహిళలు ఆఫీసులకు వెళ్లి రావడానికి భర్త మీదనో లేదా కుటుంబంలోని  మరో మగవాడి మీదనో  ఆధారపడాలి. ఇందువల్ల వాళ్లు ఎంతో విలువయిన సమయాన్ని నష్టపోతున్నారు. శారీరకంగా, మానసికంగా కష్టపడుతున్నారు.       
పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న ఉద్యోగినుల పరిస్తితి మరీ దారుణం.
మనాల్ షరీఫ్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ ఇందుకొక ఉదాహరణ.
భర్త తోడు లేని ఈ మహిళ  పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. ఇంట్లో కారున్నప్పటికీ, పిల్లల్ని పార్కు తీసుకు వెళ్ళాలన్నా లేక ఆసుపత్రికి వెళ్ళాలన్నా అన్నదమ్ములపై ఆధారపడాల్సిన దుస్తితి. ఆ మాత్రం మగతోడు కూడా లేని ఆడవాళ్లు, సొంత కారున్నప్పటికీ  అవసరం పడితే  టాక్సీలో వెళ్ళాలి. ఇలాటి సందర్భాలలో  ఆడవాళ్ళు ఎంతో నిర్వేదానికి లోనవుతుంటారు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్ళడానికి పరాయి మగవాళ్ళని దేబిరించడం  కనాకష్టంగా  ఉంటోందని మనాల్ తన స్నేహితురాలికి యూ ట్యూబ్ లో ఒక సందేశం పంపారు.
కారు నాది.  నా డబ్బుతో కొనుక్కున్నాను. నా పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అయినా కానీ దాన్ని నడపలేని దౌర్భాగ్య స్తితి నాది.  ఏం చెప్పమంటావు?’ అంటూ అందులో  తన గోడు వెళ్లబోసుకుంది.

ఉన్నత కుటుంబీకులకీ, సంపన్న వర్గాలవారికీ డ్రైవర్ను పెట్టుకోవడం పెద్ద ఖర్చేమీ కాదు. కానీ, ఆడా మగా ఇద్దరూ సంపాదించుకుంటే కాని సంసారం నడవని మధ్య తరగతి కుటుంబాలలోని ఆడవారికి సౌదీలో ఇదొక ప్రధాన సమస్యగా తయారయింది. హాస్పిటల్ కు వెళ్ళాలన్నా, ఆఫీసుకు సకాలంలో చేరాలన్నా, పిల్లల్ని స్కూళ్ళలో దింపాలన్నా, పచారీ దుకాణానికి వెళ్లి సరకులు కొనుక్కోవాలన్నా ఆడవారు సొంత కారు పెట్టుకొని కూడా  ఎవరినో ఒకరిని ప్రాధేయ పడాల్సి వస్తోంది. అందుకే అక్కడి ఆడవారు ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న స్టీలు డ్రైవింగ్ లైసెన్స్ హక్కు కోసం ఆందోళనలు దిగుతున్నారు.
  
బాగా అవసరం పడ్డప్పుడయినా కారు నడపడం రావాలని ఆదేశంలో కొందరు ఆడవాళ్ళు పొరుగునవున్న బహ్రెయిన్, లేదా యూయేయీ దేశాలకు వెళ్లి కారు నడపడం నేర్చుకుంటున్నారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్సులు సంపాదించుకుని స్వదేశానికి వస్తున్నారు. 
కారు డ్రైవింగ్ నా తమ్ముడు నేర్పాడు. వూరికి దూరంగా తీసుకువెళ్ళి కారు నడపడంలో మెళకువలు నేర్పాడునూర్ అనే పేరుగల మహిళా అరబ్  వార్తా  సంస్థతో చెప్పింది.
నిరుడు జెడ్డాలో వరదలు వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులను ఓ మహిళ కారులో సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని పత్రికల్లో  చదివినప్పుడు నాకూ కారు డ్రైవింగ్ వస్తే యెంత బాగుండుననిపించింది. అందుకే లెబనాన్ కు వెళ్లి దాన్ని సంపాదించుకున్నానుఅని మోనా హేజాజీ అనే సౌదీ స్త్రీని ఉటంకిస్తూ రియాద్ న్యూస్  పేర్కొన్నది.  
రాత్రివేళల్లో తాను కారు నడుపుతున్న దృశ్యాలను అరీజ్ ఆల్ ఖల్డీ అనే మహిళ  ఇంటర్నెట్ లో పెట్టింది. దాన్ని చూసయినా మరికొందరు మహిళలు స్పూర్తి పొందుతారేమో అన్నది ఆవిడ ఆకాంక్ష.
(మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆవిడ ఆకాంక్ష నెరవేరడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు వేచివుండాలో!)
  
(08-03-2012)

2, మార్చి 2012, శుక్రవారం

పీత కష్టాలు పీతవి


పీత కష్టాలు పీతవి
ముని శాపగ్రస్తుడయిన కుబేరుడు భూలోకంలో మానవరూపంలో ముఖేష్ అంబానీగా అవతరించి తండ్రి ధీరూభాయ్ అంబానీ  స్తాపించిన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి, అపర కుబేరుడిగా పేరు గాంచి, ఆ క్రమంలో  పోగేసుకున్న అపార ధనరాశులతో ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచించి,  ఏదో ఒకటి చేయకపోతే బాగుండదనిపించి, భార్యాబిడ్డలతో చర్చించి, కోట్లకు  కోట్లు వెచ్చించి  ముంబై లో  ఏకంగా ఇరవై ఏడు అంతస్తుల రమ్యహర్మ్యాన్ని నిర్మించుకుని సుఖంగా జీవిస్తున్న తరుణంలో – ఆ వైనాన్ని ఓ గిట్టని పత్రిక వైనవైనాలుగా  వర్ణించి రాసి జనం మీదకు వొదిలింది. ఆ కధాక్రమంబెట్టిదనిన - -
ముఖేష్ అంబానీ తన నివాస భవనంలో పదిహేనో అంతస్తులో వున్న పడకగదిలో నిద్రిస్తాడు. నిద్ర లేచిన తరువాత పదిహేడో అంతస్తుకువెళ్లి అక్కడ వున్న  జిమ్ లో వ్యాయామం చేసి అక్కడే నిర్మించుకున్న అందమైన  అధునాతన నీటి  కొలనులో ఈత కొడతాడు.  పందొమ్మిదో అంతస్తులో బ్రేక్ ఫాస్ట్ ముగించి పద్నాలుగో అంతస్తులో దుస్తులు ధరించి ఇరవై ఒకటో అంతస్తుకు వెడతాడు. అక్కడవున్న బ్రీఫ్ కేసు, అవసరమయిన ఫైళ్ళు తీసుకుని పదహారో  అంతస్తులో వెయిట్ చేస్తున్న భార్యకు టాటా చెప్పి పదమూడో అంతస్తుకు వెళ్లి  స్కూలుకు వెళ్ళడానికి తయారవుతున్న పిల్లలను పలకరిస్తాడు. ఆ తరువాత మూడో అంతస్తులో పార్కుచేసివున్న రెండున్నర కోట్ల రూపాయలు ఖరీదుచేసే మెర్సిడెస్ కారెక్కి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వెడతాడు.
ఇంతవరకూ కధ బాగానే వుంది. కానీ విధి విచిత్రమైనది కదా. ప్రతిరోజూ ఒకేరకంగా వుండదు. కదా!. అందుకే ఓ రోజు అది అడ్డంగా  అడ్డం తిరిగింది. ఆ సంగతే ఆ పత్రిక రాసింది. ఆ కధనం ప్రకారం ఓ రోజు యధావిధిగా అన్ని అంతస్తుల్లో తన దినసరి దిన చర్యలను ముగించుకుని కారెక్కడానికి  మూడో అంతస్తుకు చేరుకున్న ముఖేష్ కు కారు తాళాలు మరిచివచ్చిన సంగతి లేటుగా గుర్తుకు వచ్చింది.
వాటిని ఎక్కడ మరచిపోయినట్టు?
పదిహేనో అంతస్తులోనా ? లేక పదిహేడులోనా!  పదా! పద్నాలుగా! ఇరవై ఒకటో అంతస్తులోనా లేక పదహారులోనా! లేదా పదమూడో అంతస్తులో పిల్లలను పలకరించి  వస్తున్నప్పుడా? ఎక్కడ మరచిపోయినట్టు. ఆలోచిస్తూ  తల గోక్కుంటే తండ్రి వారసత్వంగా వచ్చిన బట్ట తల తగిలింది కాని  తాళాలు గురించిన లైటు మాత్రం వెలగలేదు.
కానీ అంబానీనా! మజాకా!
అపర కుబేరుడి కారు తాళాల కోసం  ముమ్మరంగా గాలింపు మొదలయింది. అన్ని అంతస్తుల్లోవున్న  సిబ్బంది చేతుల్లో వున్న  ఫోన్లు మోగాయి. నౌకర్లు, చాకర్లు, బట్లర్లు, సెక్రెటరీలు, జిమ్ ట్రైనర్లు,  వంటవాళ్ళు, వార్పువాళ్ళు, క్లీనర్లు, డ్రైవర్లు, లిఫ్ట్ అటెండెంట్లు ఒకరా ఇద్దరా లెక్కకు మిక్కిలిగావున్న పనివాళ్ళ ఫోన్లన్నీ ఒకేసారి మోగాయి. కానీ ఏం లాభం? తాళం చేతుల జాడ లేదు.
కాలమే ధనంగా  భావించి అనుక్షణం సంపాదనలో మునిగితేలే అంబానీ క్షణం ఆలశ్యం చేయకుండా, ఆ రోజుకు సరిపెట్టుకుని  ఓ కోటి మాత్రమే కిమ్మతు చేసే మరో  చిన్న కారులో డ్రైవర్ను వెంటపెట్టుకుని తన పనిపై తాను  వెళ్ళిపోయాడు. 
అంతటితో ముగిస్తే కధ ఏముంది?
అంబానీ సిబ్బంది అందరూ కళ్ళల్లో కాగడాలు పెట్టుకుని  కారు తాళాల అన్వేషణ ఆ తరువాత కూడా కొనసాగించారు. ఆ క్రమంలో మరో ఆసక్తికరమయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బట్టలు ఉతకడానికి కొత్తగా పనిలో కుదిరిన ఓ పనిమనిషి కారు తాళాలున్న అంబానీ గారి ప్యాంటును  తాళాలతో సహా  ఉతికి ఝాడించి పదహారో అంతస్తులో ఆరేసింది. అలా ఆరేసిన ఆ ప్యాంటు, అక్కడ వీస్తున్న చల్లని  హోరు గాలికి ఎగిరిచక్కా పోయింది. ఆ విధంగా, ప్యాంటు  సమేతంగా కోటిన్నర రూపాయల కారు తాళాలు కూడా గాలిలో కలిసిపోయాయి.
కధ అంతటితో ఆగిందా. ఆగితే కధ ఎందుకవుతుంది.



ఆ రోజు రాత్రి పదహారో అంతస్తులో పడుకుని, అత్తగారిని విషం పెట్టి చంపాలని చూసే కోడలు పిల్ల ప్రయత్నాలను   టీవీ సీరియల్  నాలుగువందల నలభయ్యో ఎపిసోడ్ చూసి, పీడ కలలతో  నిద్రపట్టక కలత నిద్రలో  దొర్లుతున్న అంబానీ అర్ధాంగికి పైన ఏదో శబ్దం వినిపించి లేచి చూసింది. క్లోజుడ్ సర్క్యూట్ టీవీ తెరపై  భవనం పై భాగంలో హెలిపాడ్ పై  దిగుతున్న  హెలికాప్టర్ కన్పించింది. ఇంత  రాత్రప్పుడు మొగుడు హెలికాప్టర్ లో ఎక్కడ చక్కర్లు కొట్టి వస్తున్నట్టన్న అనుమానం ఆవిడ మనసులో  మొక్కై మొలిచి మరుక్షణంలోనే  మానుగా విస్తరించింది. ఆ మధ్య   ఏదో ఫంక్షన్ లో అప్పుడే పైకొస్తున్న  ఓ  సినీ హీరోయిన్ తన మొగుడి  వంక వంకర చూపులు చూస్తున్నప్పుడే జాగ్రత్త పడివుండాల్సింది. అయినా ఇన్నేళ్ళొచ్చి,  ఇంట్లో ఎదిగిన పిల్లల్ని పెట్టుకుని ఇలా చెడు  తిరుగుళ్ళు తిరగడానికి ఈ మగవాళ్ళకు మనసెలా వస్తుందో అని ఏడుస్తూ ముక్కు చీదుకుంటూ పైఅంతస్తులో వున్న అత్తగారి దగ్గరకు వెళ్లి మరోసారి భోరుమంది. అర్ధరాత్రి ఈ కాకి గోలేమిటని అత్త కోకిలా బెన్  విసుక్కుంటూ నసుక్కుంటూ  అప్పటికప్పుడే  కొడుకుని పిలిచి అక్కడికక్కడే పంచాయితీ పెట్టింది. చవితినాడు నోముకోకుండా విదేశాల్లో విహారయాత్రలు చేసి వచ్చిన  పాపానికి తనమీద పడ్డ నీలాపనింద  ఇదానుకుని ఎంతో ఇదయిపోయిన ముఖేష్ అంబానీ  మరోసారి బట్ట తలను తడుముకుంటే అసలు విషయం గుర్తుకువచ్చింది. ఆ రోజు కారు తాళాలు పోయిన సంగతి మెర్సిడెస్ కంపెనీ వారికి తెలియచేస్తే వారు తమ హోదాకు తగ్గట్టుగా ఆ రాత్రికి రాత్రే హెలికాప్టర్ ద్వారా కారు తాళాలను ఇంటికి బట్వాడా చేశారు. ఆ అర్ధరాత్రి  ఆ అమ్మడు చూసి అపార్ధం చేసుకున్న హెలికాప్టర్ అదేనట.
అందుకే అంటారు –  పీత కష్టాలు పీతవని. (02-03-2012)

29, ఫిబ్రవరి 2012, బుధవారం

సమతూకం


సమతూకం


ఈ చరాచర సృష్టి జరక్క పూర్వం సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంపై  మఠం వేసుక్కూర్చుని  విశ్వ సృష్టిలో నిమగ్నమై వున్నాడు. సృష్టి కార్యంలోని  వింతలూ విశేషాలను పనిలో పనిగా తన సతీమణి సరస్వతీ దేవికి తెలియచేస్తున్నాడు.
‘చూడు వాణీ! హాటకగర్భురాణీ! మనం చేసే ప్రతిపనీ చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని చేయాలి. సమతూకం వుండేలా చూసుకోవాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది’ అన్నాడాయన హెచ్చరికగా తన నాలుగు తలల్లో ఒకదాన్ని తడుముకుంటూ.
‘ఉదాహరణకు పది జింక పిల్లల్ని సృష్టించగానే సరిపోదు. వాటి సంఖ్యను అదుపుచేయడానికి కనీసం ఒక సింహాన్ని అయినా సృష్టించాలి.’
చదువులతల్లికి విషయం అర్ధమయింది.  ఎప్పుడూ ఏదో ఒకదాన్ని సృష్టిస్తూ ఆ పనిలోనే తలమునకలుగా వుండిపోయే శ్రీవారు ముచ్చట్లు మొదలు పెట్టడమే ఓ వింత. అందుకని వాయిస్తున్న వీణను కాసేపు పక్కనబెట్టి తన రెండు చెవులను ఆయనకు ఒప్పగించింది.      
‘చూశావు కదా ప్రపంచపఠంలో కానవస్తున్న  ఈ దేశాన్ని. దీన్ని అమెరికా అంటారు. ఈ దేశానికి నేనిప్పుడు సర్వ సంపదలు అనుగ్రహిస్తున్నాను. మొత్తం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా దీన్ని తయారుచేస్తున్నాను. కానీ అదే సమయంలో ఈ దేశానికి భద్రతా భావం  కొరవడేట్టు చేస్తున్నాను. లేకపోతే దీనికి పట్టపగ్గాలుండవు.’
‘ఇదిగో! ఇది ఆఫ్రికా! యావత్ ప్రపంచంలో ఎక్కడా కానరాని  ప్రకృతి రామణీయకతను దీని సొంతం చేస్తున్నాను.  అయితే అదేసమయంలో ఎక్కడాలేని విధంగా అతి దారుణమయిన ఉష్ణోగ్రతలతో కూడిన వాతావరణాన్ని ప్రసాదిస్తున్నాను.’
‘ఇదే దక్షిణ అమెరికా. ఈ దేశంలో ఎక్కడ చూసినా దట్టమయిన అడవులు. అందుకే, సమతూకంగా  నివాసయోగ్యమయిన భూమి అంతగా అక్కడి ప్రజలకు దొరక్కుండా చేస్తున్నాను. అందువల్ల వాళ్ళంతట  వాళ్ళే అడవులను నరుక్కుంటూపోతారు.    ఆత్మహత్యాసదృశమయిన పనులతో వారిని వారే నాశనం చేసుకుంటారు.’
సృష్టికర్త మాటలను ఓ చెవితో వింటూ మరోవంక ఓరకంట విశ్వపఠంలో వివిధ దేశాలను  తిలకిస్తున్న  వాణీదేవి  చూపులు ఓ సుందర ప్రదేశం దగ్గర ఆగిపోయాయి.  అదేమిటన్నట్టు బ్రహ్మను చూపులతోనే ప్రశ్నించింది.
‘అదా! మొత్తం  నా సృష్టిలోనే అపూర్వమైన దేశం అది. పేద దేశమైనా ధార్మికంగా సంపన్నమైనది. ఎత్తయిన పర్వత శిఖరాలు, గలగలా పారే నదులు. చక్కటి అవగాహన వున్న ప్రజలు. యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మికంగా  మార్గ నిర్దేశనం చేయగల చేవ,సత్తా వున్న ఏకైక దేశం. అదే భారత దేశం’
వింటున్న వాణమ్మ నోరు తెరిచింది. కొంత ఆశ్చర్యంతోనూ, మరికొంత ఉత్సుకతతోనూ.
‘మరి మీరు చెబుతూ వస్తున్న సమతూక న్యాయం భారత దేశం విషయంలో ఏమయింది స్వామీ?’
‘తొందరపడకు సుందరవదనా! ఆ విషయం చెప్పేలోగానే నువ్వు నోరు తెరిచావు. చూడు మరి. భారత దేశానికి ఇరుగు పొరుగున ఎలాటి వారిని సృష్టించి పెట్టానో!’        

 బ్రహ్మదేవుడు నాలుగు నోళ్ళతో మందహాసం చేస్తుంటే బ్రహ్మణి భర్త తెలివితేటలకు ఆశ్చర్యపోతూ మరో మారు నోరు తెరిచింది.
స్వస్తి.
(29-02-2012)

26, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఇచ్చుటలో వున్న హాయీ!


ఇచ్చుటలో వున్న హాయీ!



చుట్టూ చిమ్మ చీకటి.  ఆ చీకటి నడుమ ఆగిపోయిన కారు. ఆ కారులో వొంటరిగా అనసూయ.
భర్త తరచూ పరిహాసంగా అనే మాటలు ఆ సమయంలో గుర్తుకు వచ్చాయి.  
‘నువ్వు మగాడిగా పుడితే సరిపోయేది’
కారులో వొంటరి  ప్రయాణాలు ఆమెకు కొత్తేమీ  కాదు. కారు  ఆగిపోవడాలు, చిన్న చిన్న రిపేర్లు సొంతగా చేసుకోవడాలు కూడా కొత్త కాదు. అందుకే ముందు భయం అనిపించలేదు. కానీ పొద్దుపోయి చీకటి చిక్క పడుతున్న కొద్దీ, కొద్ది కొద్దిగా ఆందోళన మొదలయింది. ఈ ప్రయాణం పెట్టుకోకుండా వుంటే సరిపోయేదేమో అనిపించసాగింది.   
అనసూయకు చిన్నతనం నుంచీ  ధైర్యం పాలు కొంత ఎక్కువే. వొంటరి ప్రయాణాలు చేయడానికి ఎప్పుడూ జంకేది కాదు. మొగుడి తరపున వ్యాపార వ్యవహారాలు   సంభాలించడానికి అనేక వూర్లు తిరగాల్సిన పరిస్తితి. ఆయన కాలం చేసిన తరువాత ఆమెపై ఈ బాధ్యత మరింత పెరిగింది.  పిల్లలు పెద్దవాళ్లయి విదేశాల్లో స్తిరపడడంతో భర్త   పెంచి  పోషించిన సంస్తను తన చేతులతోనే మూసివేయలేక కొంతా, మరో వ్యాపకం లేక మరికొంతా ఏమయితేనేం దాన్ని ముందుకు నెట్టుకొస్తోంది.  అందులో భాగంగానే ఈ ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఈ కొత్త  అనుభవం.
హైదరాబాదు నుంచి బెజవాడ వెళ్ళే రోడ్డు మార్గాన్ని పెద్దది చేస్తూ వుండడంతో ఆ మార్గంలో రోడ్డు ఎక్కడ వుందో గుంత ఎక్కడ వుందో తెలియని పరిస్తితి. మామూలుగా  ఇలాటి ప్రయాణాల్లో డ్రైవర్ ఎప్పుడూ వుంటాడు.  కాని ఆ రోజు అతగాడి భార్యకు సుస్తీ చేయడంతో, గంట  ప్రయాణమేగా వెంటనే  తిరిగిరావచ్చు అన్న సొంత భరోసాతో బయలు దేరింది. తిరుగు ప్రయాణం బాగా ఆలశ్యం అయి చీకటి పడి పోయింది. కారు హెడ్  లైట్లు మొరాయించడంతో ముందు వెడుతున్న ఓ లారీ వెనుక కారు నడుపుతూ వెళ్ళింది. రోడ్ల విస్తరణ వల్ల కాబోలు, లోగడ మాదిరిగా ఎటువంటి  మెకానిక్కు షాపు దోవలో కానరాలేదు. పైగా  ఆ లారీ వెంట గుడ్డిగా వెడుతూ దోవ తప్పింది. ఆ సంగతి తెలిసివచ్చేసరికి ఆ లారీ కూడా అయిపులేకుండా పోయింది. మొబైల్ వెలుతురులో చూస్తే అదో డొంక దారిలా కానవచ్చింది. కనెక్టివిటీ లేకపోవడంతో హైదరాబాదు ఫోన్ చేసి విషయం చెప్పడానికి కూడా వీలు  లేకుండా పోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ స్టీరింగ్ మీద తలపెట్టి చూస్తూ  కారులో అలాగే వుండిపోయింది.
కొంతసేపటి తరువాత దూరంగా ఎవరో వస్తున్న అలికిడి. ముందు ప్రాణం లేచివచ్చినట్టు అనిపించినా ఆ సమయంలో వొంటరిగా వచ్చింది ఒక యువకుడు అని తెలియడంతో తెలియని భయం ఆవహించింది. అతడు తన మానాన తను పోకుండా కారు దగ్గరికి వచ్చి అద్దంలోనుంచి తొంగి చూసాడు. ఆ చీకట్లో ఏమీ కనబడకపోయినా ఆమె  మనో నేత్రానికి అతగాడొక చిల్లర మనిషిలా కనిపించాడు. అందుకే  కిటికీ అద్దాలు తీయకుండా అలాగే వుండి  పోయింది.  అతడు కాసేపు కారు చుట్టూ  తిరిగి తన దారిన పోతుండడం చూసి ఆమె మనసు తేలిక పడింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. కాసేపటిలో అతడు తిరిగి వచ్చాడు. అతడి చేతిలో ఈ సారి ఓ సంచీ వుంది. కిటికీ దగ్గర నిలబడి అద్దం తీయమని సైగలు చేయడం ప్రారంభించాడు. ఏదయితే అయిందని అద్దం దించింది.
బయట చలిగాలితో పాటు అతడి మాటలు మెల్లగా  చెవిలో పడి అనసూయ మనసు చల్లబడింది.
‘అమ్మా! కారుకు ఏదో అయినట్టుంది. అందుకే దగ్గర్లో వున్న మా వూర్లోకి వెళ్లి రిపేరు సామాను తెచ్చాను. మీరలా కారులోనే కూర్చోండి. నేను ఈ లోగా కారు సంగతి చూస్తాను.’
అంత ఖరీదయిన కారు రిపేరు పల్లెటూరి వాడికి వొప్పచెప్పడం ఆమెకు  సుతరామూ ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది.  విధిలేని  పరిస్తితి.
అతడు ఏం చేసాడో తెలవదు. మంత్రం వేసినట్టుగా హెడ్ లైట్లు వెలిగాయి. మరి కాసేపటిలో కారు ఇంజన్ స్టార్ట్ అయింది. అనసూయ  మొహం ఆ చీకట్లో వెలిగిపోయింది.
హాండ్ బ్యాగ్ తీసి చూసింది. అన్నీ  క్రెడిట్ కార్డులే. వెతగ్గా కొన్ని వెయ్యి రూపాయల నోట్లు కనిపించాయి. లెక్కపెట్టకుండా తీసి అతడికి ఇవ్వబోయింది.  నిజానికి ఆ మొత్తం చాలా ఎక్కువే. కానీ ఆ సమయంలో ఆ మాత్రం సాయం దొరక్కపోతే తను పడే  కష్టాలు వూహించుకుంటే తక్కువే అనిపించింది.  కానీ, అతడికీ  తక్కువే అనిపించిందేమో అన్నట్టుగా ఆ డబ్బు వద్దన్నాడు. ఇంకా ఎక్కువ కావాలేమో అని మళ్ళీ బ్యాగు తెరవబోయి ఇంతలో అతడి మాటలు వినిపించి ఆగిపోయింది.
‘చూడమ్మా మీరింత చీకటిలో వొంటరిగా ఇలా చిక్కుకుపోవడం చూసి నేనేదో  నా ప్రయత్నం చేసాను. ఈ పనికి  డబ్బుతో సరిపెట్టుకోవడం నాకు నచ్చదు. ఈ డబ్బు మీ వద్దే వుంచండి. అంతగా ఇవ్వాలనిపిస్తే ఇలాగే అవసరంలో వున్న వారికి సాయంగా ఇవ్వండి.  దానితో నా లెక్క చెల్లవుతుంది.’
అవాక్కయిన అనసూయ  తేరుకునే లోగా అతడు మళ్ళీ   అన్నాడు.
‘ఈ పక్కనే మా వూరు.  నా పేరు సత్యనారాయణ. అందరూ మెకానిక్ సత్యం అంటారు. ఈ దారంట వెళ్ళండి. మూలమలుపులో ఓ చాయ్ దుకాణం వస్తుంది. అక్కడ రోడ్డెక్కారంటే చక్కగా షహర్ కెళ్ళి పోతారు.  వస్తానమ్మా! నేను చెప్పింది మరచిపోకండి’ అంటూ సంచీ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు.
కారు స్టార్ట్ చేసింది.  కొంత దూరంలో అతడు చెప్పిన టీ దుకాణం కనబడింది. లైట్లు వెలుగుతున్నాయి.
మెకానిక్ సత్యం మాటలే ఆమె  చెవుల్లో మార్మోగుతున్నాయి. ఇంత హైరానా ప్రయాణం తరువాత కాస్త వేడి వేడి చాయ్ తాగితే బాగుంటుందనిపించి కారు అక్కడ ఆపి లోనికి నడిచింది. వేళకాని వేళ. జనం లేరు. స్టవ్ మీద గిన్నెలో టీ నీళ్లు  మరుగుతున్నాయి. చెక్క బల్ల మీద కూర్చుంటూ వుండగానే లోపలనుంచి నిండు గర్భంతో వున్న మహిళ భారంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. కానీ కళ్ళల్లో ఏమాత్రం అలసట లేదు.   టీ చెప్పగానే అనసూయ ముందు  వున్న బల్లను శుభ్రంగా గుడ్డతో తుడిచింది. మూలగా వున్న ఫ్రిజ్ తెరిచి చల్లని నీళ్ళు తెచ్చిపెట్టింది. ఇంత రాత్రి వేళ ఇలా వొంటరి ప్రయాణం ఎందుకు  పెట్టుకున్నారని మందలింపు ధోరణిలో మాట్లాడుతూనే వెళ్లి టీ తయారు చేసి తీసుకు వచ్చింది. దానితో పాటు కొన్ని బిస్కెట్లు కూడా సాసరులో పెట్టి ఇచ్చింది. నెలలు మీదపడ్డ ఆడమనిషి అంత కష్ట పడడం చూసి అనసూయ మనసు కూడా కష్టపెట్టుకుంది.  పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆ అమ్మాయి కుటుంబంకోసం పడుతున్న శ్రమ అనసూయను కదిలించింది. ఓ వంద రూపాయల నోటు సాసరులో వుంచింది. చిల్లర తేవడానికి ఆ అమ్మాయి లోపలకు వెళ్ళగానే మెకానిక్ కోసం తీసివుంచిన వెయ్యి నోట్లను ఆ సాసరు కింద వుంచి అక్కడ నుంచి తప్పుకుంది.
చిల్లరతో వచ్చిన అమ్మాయికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కారులో వచ్చిన ఆవిడకోసం చుట్టూ చూసింది. ఆవిడ కనబడలేదు కానీ ఆవిడ వొదిలి వెళ్ళిన వెయ్యి నోట్లు కనిపించాయి. వాటితోపాటే వుంచిన  మరో చిన్న కాగితం. దాని మీద హడావిడిగా రాసిన  రెండే రెండు వాక్యాలు. ‘నువ్వు నాకు ఏమీ రుణపడి లేవు. అలాటి భావన వుంటే మరొకరికి సాయపడు, ఈ రుణం తీరిపోతుంది.’
పాపం ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తోచలేదు. అంత డబ్బు ఉదారంగా వొదిలివెళ్లడం అంటే మాటలు కాదు.
నిజానికి వచ్చేనెలలోనే డాక్టర్ పురుడు వస్తుందని చెబుతూ అందుకు తగ్గట్టుగా  డబ్బు సర్దుబాటు చేసుకొమ్మని చెప్పింది. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఎదురు చూడని విధంగా ఆ కారు ఆవిడ అందించిన అయాచిత  ఆర్ధిక సాయం.
ఈ టీ కొట్టుతో వచ్చే రాబడి ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది. చిన్న  చిన్న రిపేర్లు చేసే మొగుడికి వచ్చే కొద్దో గొప్పో సంపాదన కూడా రోడ్డు విస్తరణ పనులవల్ల ఈ మధ్య బాగా తగ్గిపోయింది.
అసలే తొలి చూలు యెలా బయటపడాలి అని  అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ఈ రాత్రి ఈ ధన యోగం. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఆమె హోటల్ కట్టేసి మొగుడు మెకానిక్  సత్యానికి ఈ కబురు చెవిలో వేయాలని ఆత్రుతగా ఇంటికి బయలుదేరింది. (26-02-2012)         
     


దేహమేరా వైద్యాలయం



దేహమేరా వైద్యాలయం

సీనియర్ పాత్రికేయులు, ‘కలం కూలీ’, కీర్తిశేషులు జి.కృష్ణ గారు తనకు తెలిసిన దేనినీ, జర్నలిజంతో సహా, తనకోసం వాడుకోని అభినవ పోతన. ఆయనకు  పుట్టుమచ్చల శాస్త్రం అంటే మక్కువ ఎక్కువ. దేహంలో బయటకు కనిపించే పుట్టుమచ్చకు తోడుగా మరోచోట అదే శరీరంలో ఇతరులకు కాని రాని చోట మరో జోడు పుట్టుమచ్చ వుంటుందని ఆయన సిద్ధాంతం. నిజంగా నమ్మి చెప్పేవారో లేక నవ్వులాటకు చెప్పేవారో తెలియదు కాని ఆయన చెప్పిన చోట పుట్టుమచ్చ వుండడాన్ని నేను అనేక మార్లు గమనించాను. ‘పాడు దేహమిది తూటులు తొమ్మిది తుస్సుమనుట  ఖాయం’ అనే పాత సినిమా పాట ఈ మధ్య రేడియోలో విన్న రోజునే ఈ పాడు దేహంతో చేయగల అనేక ట్రిక్కులు గురించి చదవడం కాకతాళీయమే కావచ్చు కానీ అప్పుడు కృష్ణ గారు గుర్తుకొచ్చారు. ఆ చిట్కాల కధా కమామిషును   నలుగురితో పంచుకోవడానికే ఈ ప్రయత్నం.

మానవ దేహం  అత్యంత సంక్లిష్టమైనది. తల వెంట్రుక కంటే తక్కువ మందం కలిగిన అనేక నాడులు, గ్రంధులు, రక్త నాళాలు శరీరంలో పెనవేసుకుని వున్న తీరు తెన్నులు గమనిస్తే సూపర్ కంప్యూటర్ లు కూడా ఓ లెక్క లోకి రావు. దేహంలో దాగున్న అనేక రహస్యాలు ఇంకా అనేకం వెల్లడి కావాల్సివుంది. తెలిసిన వాటిల్లో కొన్నింటిని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది.

·        గొంతులో గరగర అని టీవీల్లో ప్రకటనలు వస్తుంటాయి. అలాటి గరగర సమస్య తలెత్తినప్పుడు చెవిపై రుద్ది చూసుకోండి. అంతే! టీవీ ప్రకటనలో మాదిరిగా గరగర మాయం. చెవిలో నరాలు ఉత్తేజితమయినప్పుడు  గొంతులో కండరాలు బిగదీసుకుంటాయట. ఫలితం గొంతులో ఉపశమనం.

·        ఫోనులో మాట్లాడుతున్నప్పుడో, లేక నలుగురిలో వున్నప్పుడో అవతల వ్యక్తి చెప్పేది సరిగా వినబడడం లేదనిపిస్తే, వెంటనే కుడి చెవికి పని చెప్పండి. త్వరత్వరగా ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు త్వరిత గతిన దాన్ని గ్రహించగల శక్తి  రెండు చెవుల్లో కుడి చెవికి ఎక్కువగా వుండడమే దీనికి కారణం. అలా అని  ఎడమ చెవి తక్కువదేమీ కాదు. మంచి సంగీతాన్ని ఆస్వాదించడం దానికే సాధ్యం సుమా!.

·        చిన్నప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ చేసేటప్పుడు నొప్పి తెలియకుండా వుండడానికి పచ్చని చెట్టు వంక చూస్తూ వుండమని చెప్పడం చాలామందికి స్వానుభవమే. ఇప్పుడు మరో కొత్త ట్రిక్కు నేర్చుకోండి. సూది శరీరంలోకి దిగుతున్నప్పుడు చిన్నగా దగ్గండి. సూది దిగడం వల్ల కలిగే చురుక్కుమనే భావన వెన్నుపూస ద్వారా మెదడుకు చేరే సమయంలో వెన్నుపాములో దగ్గు వల్ల కలిగే వొత్తిడి, ఆ  నొప్పి తీవ్రత తెలియకుండా చేస్తుంది.(ట)

·        ముక్కు దిబ్బడ వేసినప్పుడు నాలుకను నోటి పైభాగానికి వొత్తి పెట్టి వుంచి, రెండు కనుబొమల నడుమ చూపుడు వేలిని నొక్కి పెట్టి వుంచితే మంచి ఉపశమనం కలుగుతుంది.
·        భుక్తాయాసం కలిగినప్పుడు ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోవాలి.  శ్వాసకోశనాళం కంటే ఉదరం దిగువన వుండడం వల్ల భుక్తాయాసం అధికం కావడం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గిపోతాయి.
·        పంటి నొప్పి ఎక్కువగా  వుంటే కొద్దిగా ఐస్ తీసుకుని అరచేతి వెనుక వైపున రుద్దాలి. అలాగే బొటన వేలుకు, చూపుడు వేలుకు నడుమ భాగంపై ఐస్ మర్ధనా చేయాలి. మెదడునుంచి పంటికి నొప్పి గురించిన  సంకేతాలు అందించే నాడీ మార్గం దీనివల్ల ఉత్ప్రేరితం కావడం దీనికి కారణం.
·        ఒక్కోసారి డోసు ఎక్కువయినప్పుడు మందు బాబులకు తామువున్న ప్రదేశం గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ స్తితిలో చేతిని  బల్లకు ఆనించి కాసేపు నిలబడితే ఆ తీవ్రత తగ్గుతుంది. మనిషి స్తిరంగా నిలబడడానికి చెవిలో వుండే ఒక రకమయిన ద్రవం తోడ్పడుతుంది. మద్యం సేవించడం వల్ల ఆ ద్రవం పలచబడి మనిషి స్తిరంగా నిలబడే శక్తిని కోల్పోవడం వల్ల కళ్ళు తిరుగుతాయి. అలాంటప్పుడు  చేతిని బల్లకు ఆనించి నిలబడడం వల్ల మెదడుకు మరో రకమయిన సంకేతం వెళ్లి ప్రపంచం  గిర్రున తిరుగుతున్న భావనను అరికడుతుంది.  
·        వెక్కిళ్ళు వస్తున్నాయా? బొటన వేలిని, రెండో వేలిని కనుబొమలమీద వొత్తి పెట్టి వుంచండి. వెక్కిళ్ల సంగతి అవే చూసుకుంటాయి.

·        నీతి: ఉచిత సలహాలు కొండొకచో పనిచేయకపోవచ్చు.
·        ఉపసంహారం: తలలో పేల బాధ అధికంగా వున్న ఓ శాల్తీ కి ముళ్లపూడి వెంకటరమణ గారు ఓ జోకు ద్వారా ఇచ్చిన సలహా.  “ బ్రాందీలో ఇసక కలిపి తలకు పట్టించండి. బ్రాందీ సేవించిన పేలు ఆ మత్తులో చెలరేగిపోయి ఇసుకరేణువులతో ఒకదానినొకటి మోదుకుని చచ్చివూరుకుంటాయి.” 
     

(26-02-2012)

23, ఫిబ్రవరి 2012, గురువారం

నవ్వుల పువ్వుల ముళ్ళపూడి


నవ్వుల పువ్వుల ముళ్ళపూడి






(June, 28,1931 - Feb. 23, 2011)





తెలుగు నేలపై పుట్టి తెలుగులోనే రాసి ఆయన దురదృష్టవంతుడయ్యాడు.
ఆయన తెలుగులోనే రాయడం వల్ల తెలుగు నేలపై పుట్టిన  తెలుగు పాఠకులు అదృష్టవంతులయ్యారు.
నవ్వించే సినిమాలకు, కవ్వించే సినీ రివ్యూలకు ముళ్ళపూడి ట్రేడ్ మార్క్.
రాజకీయ భేతాళ పంచవింశతిక – నేటికీ, ఏనాటికీ వర్తించే బుక్ మార్క్
తెలుగులో హాస్యరసం ముళ్లపూడి వారితోనే పుట్టింది.
నవ్వడం రానివారికి, నవ్వడం మరచిపోయిన వారికి ఆయన కాణీ ఖర్చు లేకుండా నవ్వడం నేర్పారు.
ముఖచిత్రానికి ‘అట్ట’హాసం అని పేరు పెట్టినా,
అప్పులు చేయడంలో ‘ఇంత’ ఆనందం వున్నదని చెప్పినా-
ఆ వెంకటరమణుడికే చెల్లు.
‘నిన్న రాసింది ఈ రోజు చదివితే మొన్నటి అప్పడంలా వుంటుంది’ అని రాసిన  ముళ్లపూడి వెంకటరమణ –
అక్షరాలా అక్షర బ్రహ్మ.
ఆయనకిదే నా సాక్షర నివాళి.
(ఫిబ్రవరి 23 – ముళ్లపూడి ప్రధమ వర్ధంతి సందర్భంగా)

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ


అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ



శాసన సభ సమావేశాలు రిపోర్ట్ చేయడానికి రేడియో విలేకరిగా తొలిసారి అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి అడుగుపెట్టి 37 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు అసెంబ్లీ పాత భవనంలో వుండేది. అందులోని  ప్రెస్ గ్యాలరీ చాలా చిన్నది. చెక్క మెట్లెక్కి అందులోకి వెళ్ళే వాళ్ళం. సర్దుకుని కూర్చుంటే ఓ పాతిక మందికి సరిపోతుంది. సభా భవనంలో సభ్యుల సీట్లు సినిమా హాళ్ళలో మాదిరిగా కింద నుంచి పైకి అంచెలంచెలుగా వుండేవి కాబట్టి వారు కూర్చునే చివరి వరుసకూ, మా గ్యాలరీకి నడుమ ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా వుండేది. కొండొకచో – వెనుక వరుస సభ్యులు తలలు వెనక్కి తిప్పి జర్నలిష్టులతో గుసగుసలాడడం – సభాపతి గమనిస్తున్నారని తెలియగానే బుద్దిమంతుల మాదిరిగా సర్దుకోవడం- నిజంగా అవో తమాషా రోజులు.
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో పేజీల సంఖ్య తక్కువ. ఒకటి రెండు మినహాయిస్తే – మిగిలిన అన్ని దిన పత్రికలు విజయవాడ నుంచే వెలువడేవి. తెలుగు పత్రికల రాజధానిగా బెజవాడకు పేరుండేది.
అసెంబ్లీ వార్తలయినా, మరో వార్త అయినా హైదరాబాదు నుంచి బెజవాడ పంపాలంటే టెలెక్స్, టెలి ప్రింటర్ లే శరణ్యం. డెడ్ లైన్ దాటిన తరువాత వార్త   పంపాలంటే విలేకరులు ట్రంకాల్ బుక్ చేసి చెప్పాల్సిందే. అంతకు కొన్నేళ్ళ క్రితం నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా పనిచేసేటప్పుడు హైదరాబాదు నుంచి జ్యోతి విలేకరులు శ్రీ జి. రామారావు, శ్రీ ఆదిరాజు వేంకటేశ్వరరావు, శ్రీ ఎన్. ఇన్నయ్య ప్రభ్రుతులు ఫోనులో చెప్పే వార్తలు రాసుకున్న అనుభవం నాకుంది. ఎడిషన్ గడువు లోగా వార్త పంపితేనే మర్నాడు పేపర్లో వచ్చేది. లేకపోతే మరో రోజు వరకు దానికి మోక్షం దొరికేది కాదు. అలాగే రేడియో వార్తలకు కూడా సమయ పరిమితులు వుండేవి.
సభలో ఏం జరిగిందో సవివరంగా అదేరోజు తెలుసుకోవాలంటే వున్న ఏకైక వెసులుబాటు రేడియోలో ప్రసారం అయ్యే అసెంబ్లీ సమీక్ష. సమావేశాలు జరిగే రోజుల్లో రాత్రి 7.45 గంటలకు ఈ కార్యక్రమం పదిహేను  నిమిషాల పాటు సాగేది. పల్లెటూళ్ళలో పంచాయతీ రేడియోల ద్వారా వినడానికి జనాలు గుమికూడేవారు. హైదరాబాదు లోని న్యూ ఎం.ఎల్. యే. క్వార్టర్స్ లో మైకులు ఏర్పాటుచేసి వినిపించేవారు. ఆ సమీక్షలు రాసే బాధ్యతను కూడా పత్రికల్లో పనిచేసే సీనియర్ జర్నలిష్టులకు ఒప్పగించేవారు. ఇప్పుడు ప్రధాన పత్రికలకు ఎడిటర్లుగా వున్న వారిలో చాలా మంది ఆ రోజుల్లో రేడియోకోసం అసెంబ్లీ సమీక్షలు రాసేవారు. ఏమాత్రం తభావతు వచ్చినా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వచ్చే ప్రమాదం వున్నందున – ఆ  సమీక్షలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి కానీ రికార్డింగు కు  అనుమతించడం జరిగేది కాదు.  సభలో చర్చల సందర్భంలో వాడిన వ్యంగాస్త్రాలు రేడియో సమీక్షలో వచ్చాయో లేదో తెలుసుకోవడానికి సీనియర్ శాసన సభ్యులు అనేకమంది ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేవారు.
మరునాడు కలిసినప్పుడు చెప్పేవారు. శాసన సభ వ్యవహారాలను గురించి వార్తలు రాసే పత్రికల వారు కూడా ముందు తమలో తాము చర్చించుకుని కానీ వార్త రాసేవారు కాదు. యేది రాయాలో యేది రాయకూడదో ఆలోచించుకుని రాసేవారు. అసెంబ్లీ  రిపోర్టింగ్ ను విలేకరులు గొప్ప విషయంగా భావించేవారు. సహజంగా ఇలాటి భావన బాధ్యతని పెంచుతుంది. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పత్రికా రంగంలో ‘కదలిక’ మొదలయింది. విజయవాడ కేంద్రంగా వెలువడుతున్న పత్రికలన్నీ క్రమేపీ  తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదుకు మార్చుకున్నాయి. అప్పట్లో చిన్న చిన్న గదుల్లో న్యూస్ బ్యూరోలు నిర్వహించిన పత్రికలు రాజధానిలో ఏకంగా సొంత భవనాలనే ఏర్పాటు చేసుకున్నాయి. ఆంధ్ర జ్యోతి బ్యూరో సచివాలయం పాత గేటుకు ఎదురుగా వున్న మేడ మీద వుండేది. హిందూ పత్రిక బ్యూరో హిమాయత్ నగర్ లో చిన్న వాటాలో పనిచేసేది. అలాగే  మిగిలిన పత్రికల వాళ్లు.
కొన్నాళ్ళకు ఆంధ్రపత్రిక కార్యాలయాన్ని బషీర్ బాగ్ లో ప్రస్తుతం  లోకాయుక్త కార్యాలయం వున్న పెద్ద  భవనానికి తరలించారు. పత్రిక బ్యూరోలో శ్రీయుతులు ముక్కు శర్మ, ఎం ఎస్.శర్మ, పాపయ్య శాస్త్రి, రత్నం, కె.వేణుగోపాల్, విద్యారణ్య ప్రభ్రుతులు పనిచేసేవారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడు లో ఆయన్ని సమర్ధిస్తూ వార్తలు రాసారన్న అనుమానంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ భవనం నుంచి ఆంధ్ర పత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయించిందని ఆ రోజుల్లో చెప్పుకునే వారు. కారణాలు ఏమయినా ఆ తరువాతి కాలంలో యాజమాన్యాలు మారి ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తలమానికంగా వెలుగొందిన ఆంధ్ర పత్రిక కాలగర్భంలో కలిసిపోయింది.
ఇక శాసన సభ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో అనేక కొత్త పత్రికలు పురుడుపోసుకున్నాయి. పాతపత్రికల యాజమాన్యాలు మారిపోయాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసాయి. అసెంబ్లీ ప్రత్యక్ష  ప్రసారాలు మొదలయ్యాయి. దానితో రికార్డులనుంచి తొలగించడం అన్న నిబంధన కాగితాలకే పరిమితమయిపోయింది. హక్కుల ఉల్లంఘన గురించి  పట్టించుకునే వ్యవధానం లేకుండా పోయింది. సభలో కంటే సభ బయట అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సభ్యుల హడావిడి పెరిగింది. అర్ధవంతమయిన చర్చలు సరే అసలు సభ సజావుగా కొద్ది గంటల పాటు నడిచినా ఒక వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.
అసెంబ్లీ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారింది. ఆ కొత్త భవనానికి కూడా కొత్తగా మరిన్ని రంగులు హంగులు సమకూర్చారు. కొత్త కుర్చీలు, కొత్త తివాసీలు, పూలకుండీలతో భవనం రూపురేఖావిలాసాలు మారాయి. కానీ, సభ జరిగే తీరులో మార్పులేదు. మరోసారి వాయిదా వేయడం కోసం సభ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ వాయిదాల సమావేశాలు చూసేవారికి విరక్తి పుడుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు. (21-02-2012)

20, ఫిబ్రవరి 2012, సోమవారం

నవ్వడం మరచిపోతున్నామా!


నవ్వడం మరచిపోతున్నామా!



మా పక్కింటి పాపాయి – పది నెలల పాప – నన్ను చూడగానే నోరంతా తెరిచి పలకరింపుగా నవ్వుతుంది. పుట్టెడు దిగుళ్లను సయితం మటుమాయం చేయగల మహత్తరమయిన నవ్వది. అలా హాయిగా నవ్వుకుని ఎన్నాళ్లయిందన్న బెంగ  వెంటనే మనస్సుని తొలిచివేస్తుంది.
‘మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి’
ఈ వాక్యం రాసిపెట్టుకున్న కాగితాన్ని  ముప్పయ్ అయిదేళ్ళ క్రితం నేను రేడియోలో ఉద్యోగం మొదలు పెట్టిన కొత్తల్లో నా ఆఫీసు బల్ల మీది అద్దం కింద హమేషా కనబడేలా పెట్టుకునేవాడిని. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే – ‘చనిపోయినప్పుడు నా మొహం మీద చిరునవ్వు చెరగకుండా  వుందో లేదో చూసి చెబుతావా స్వామీ!’ అని చెప్పుకున్న రోజులవి.
‘నవ్వగలగడం ఒక భోగం -  నవ్వలేకపోవడం ఒక రోగం’ అని నవ్వు గురించి నవ్వుల రేడు, కాలేజీలో నా క్లాసుమేటు ఆ తరువాత గ్లాసుమేటు అయిన జంధ్యాల చెప్పిన ఈ సూక్తి సూర్యచంద్రులున్నంతవరకు జనం నోళ్ళలో నానుతూనే వుంటుంది. ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో, ఉరుకులు పరుగులమీద సాగుతున్న జీవితాల్లో నవ్వనేది మరింత అపురూపం కాగలదన్న భయం కూడా పట్టుకుంటోంది.
నిజం. హాయిగా నవ్వలేకపోవడం ఒక రోగం. పైగా ఇది అంటు  రోగంలా అందర్నీ అంటుకుంటోంది.
విశ్వనాథవారు అన్నట్టు ఇదొక విషాదం. (20-02-2012)

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

పిల్ల పిడుగులు





పిల్ల పిడుగులు



బాపు గారికి కృతజ్ఞతలతో 


టీచర్:  ఏకాంబరం ఈ ప్రపంచ పఠంలో అమెరికా ఎక్కడ వుందో కనుక్కో.
ఏకాంబరం:  ఇదిగో ఇక్కడ టీచర్.
టీచర్: సరే నువ్వు జవాబు చెప్పు లంబోదరం. అమెరికాని కనుక్కున్నది ఎవరు?
లంబోదరం:  ఏకాంబరం టీచర్.  

టీచర్: శంకరం నీరు ఈ పదానికి రసాయనిక ఫార్ములా ఏమిటి?
శంకరం: హెచ్ ఐ జె కె ఎల్ ఎం ఎన్ ఓ
టీచర్ : ఏమిటా జవాబు ? ఎవరు చెప్పారలా !
శంకరం : నిన్న మీరే అన్నారు కదా టీచర్  నీటికి కెమికల్ ఫార్ములా ‘హెచ్ టూ ఓ’ అని.

టీచర్  : స్వప్నా ఇవ్వాళ మన మధ్య వుండి పదేళ్ళ క్రితం లేనిదేమిటి?
స్వప్న : నేనే టీచర్  

టీచర్: కోటయ్య కొడుకు గొడ్డలితో ఇంటి పెరట్లో వున్న బాదం చెట్టును అడ్డంగా నరికేశాడు. సుందరం నువ్వు చెప్పు కోటయ్య తండ్రి తన కొడుకును ఎందుకు దండించలేదు?
సుందరం: ఎందుకంటె ఇంకా కొడుకు చేతిలో గొడ్డలి వుండడం చూసి.

టీచర్ : ఒరే రాఘవా! భోజనానికి ముందు దేవుడిని ప్రార్దిస్తావా? నిజం చెప్పరా!
రాఘవ: ఆ అవసరం లేదు టీచర్. మా అమ్మ బాగా వంట చేస్తుంది.
టీచర్: గీతా నువ్వు కుక్క మీద రాసుకొచ్చిన వ్యాసం అచ్చం మీ అన్నయ్య రాసిన దానికి నకలుగా వుంది. కాపీ కొట్టావా!
గీత: లేదు టీచర్. ఇద్దరం ఒకే కుక్క మీద రాసాం.  

టీచర్: శేఖర్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. వినే వాళ్లకు ఇష్టం లేదని తెలిసి కూడా అదేపనిగా మాట్లాడే వ్యక్తిని ఏమంటారు?
శేఖర్: టీచర్! 
(19-02-2012)

18, ఫిబ్రవరి 2012, శనివారం

పది నోటు ఎటు పోయింది చెప్మా!



పది నోటు ఎటు పోయింది చెప్మా!







ముగ్గురు వెంగళప్పలు పట్నం వెళ్లి హోటల్లో ఓ గది తీసుకున్నారు.
ముగ్గురికీ కలిపి రోజుకు మూడువందల రూపాయలు అవుతుందని హోటల్ క్లర్కు చెప్పిన మీదట తలా ఒక వంద వేసుకుని ఆ మొత్తాన్ని అతడికి చెల్లించారు.
అయితే హోటల్లో వేడి నీరు రాకపోవడంతో హోటల్  యజమాని వారినుంచి రెండువందల యాభయ్ రూపాయలు మాత్రమే తీసుకుని మిగిలిన యాభయ్ వారికి వాపసు చేయమని క్లర్కుకు చెప్పాడు. అతగాడు అందులో ఇరవై నొక్కేసి మిగిలిన ముప్పై ఆ ముగ్గురికీ తలా  పది చొప్పున  తిరిగిచ్చేశాడు.
అంటే ఏమిటన్న మాట.  ముందు ఇచ్చిన వందలో పది రూపాయలు వెనక్కి వచ్చాయి.  వందలో పది పోతే తొంబై చొప్పున  ముగ్గురూ హోటల్ కు రెండువందల డెబ్బై రూపాయలు చెల్లించినట్టయింది.  క్లర్కు కొట్టేసిన ఇరవైతో కలిపితే ఆ మొత్తం రెండువందల తొంబై. మరి  మిగిలిన పది రూపాయలు ఏమయిపోయినట్టు చెప్మా!
జవాబు చెప్పగలిగినవారికే ఆ పది రూపాయలు.  (18-02-2012)

16, ఫిబ్రవరి 2012, గురువారం

గాభరా



గాభరా



భార్య వంట చేస్తుంటే మొగుడు హడావిడిగా వొంటి౦ట్లోకి వచ్చాడు.
‘అదేమిటి పోపులో అన్ని మిరపకాయలు వేశావు. జాగ్రత్త! పేలి మొహం మీద పడేను సుమా!
‘అదిగో ఓ పక్క నేను చెబుతున్నా నువ్వు  వినడం లేదు.  ఒక్కసారి అంత నూనె పోశావు. పోపు మాడి వూరుకుంటుంది.  స్టవ్ తగ్గించు. బాగా తగ్గించు. వాటిని కలయ తిప్పు. గరిటేది? కనబడి చావదేమి? నేను చెబుతుంటే  అసలు నీకు వినబడుతోందా లేదా?
‘నువ్వెప్పుడూ ఇంతే. వంట చేస్తుంటే నా మాట చెవిన పెట్టవు కదా!
‘సరే కొద్దిగా ఉప్పు తగిలించు. అదెప్పుడూ మరచిపోతూనే వుంటావు. ఇంతకీ ఉప్పెక్కడ? కొద్దిగా వెయ్యి. వేసి గరిటతో తిప్పు. తిప్పు. తిప్పమన్నానా!. తిప్పమంటే అలా చూస్తావేమిటి?’
మొగుడి అఘాయిత్యం చూసి భార్యకు వొళ్ళు మండింది. అతగాడి వంక  తీక్షణంగా చూసింది.
‘ఏమంటున్నారు మీరు. ఈ మాత్రం వంట చేయడం నాకు రాదా. కాపురానికి వచ్చినప్పటినుంచి చేస్తున్న వంటే కదా. పక్కన నిలుచుని  ఏమిటీ సతాయింపు?’
‘ఇదిగో ఈ మాట అనాలనే  ఇలా చేసింది. నేను కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చుని నువ్వు చేసే సతాయింపు కంటే ఇదేమన్నా ఎక్కువా చెప్పు.’
(15-02-2012)  
(Note: Courtesy cartoonist).