10, జులై 2011, ఆదివారం

‘ఎన్నాళ్ళిలా ? ఎన్నేళ్ళిలా ?’ - భండారు శ్రీనివాసరావు

‘ఎన్నాళ్ళిలా ? ఎన్నేళ్ళిలా ?’ - భండారు శ్రీనివాసరావు


తెలంగాణా ఎంపీల రాజీనామాలపై వచ్చే నెల ఒకటో తేదీన నిర్ణయం తీసుకుంటానని లోకసభ స్పీకర్ మీరాకుమార్ వెల్లడించి ఈ వ్యవహారం పై ముసురుకున్న సస్పెన్స్ ను మరో మూడు వారాలు పొడిగించారు. బహుశా శాసన సభ సభ్యత్వానికి రాజీనామాలు చేసిన తెలంగాణ నేతల విషయంలో కూడా స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఇలాటి నిర్ణయమే తీసుకోవచ్చు. ఈ ఇద్దరు సభాపతులు రాజీనామాల ఆమోద ప్రక్రియ ప్రారంభించి దాని పూర్తి చేయడానికి మరి కొన్ని రోజులు అదనంగా వ్యవధి తీసుకునే అవకాశం వుంది. అంటే రాజీనామాల వల్ల రగిలిన వాడీ వేడీ ఎంతో కొంత చల్లారేలా చూడడమే ఇందులోని పరమార్ధం కావచ్చు. మరి రాజీనామాలు చేసిన మంత్రులు అన్ని రోజులు విధులకు దూరంగా వుంటే అసలే అంతంత మాత్రంగా వున్న పాలన మరింత గాడి తప్పే ప్రమాదం వుంది. ఇప్పటికే సచివాలయంలో వందలాది ఫైళ్ళు అతీగతీ లేకుండా పడివున్నట్టు మీడియాలో సమాచారం. ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం లోనే సుమారు పన్నెండు వందలకు పైగా ఫైళ్ళు ముఖ్యమంత్రి సంతకం కోసం పడిగాపులు పడుతున్నాయని, నలుగురయిదుగులు మంత్రులు మినహా రాజీనామాలు చేసిన వారు, చేయని వారు సచివాలయం వైపే రావడం లేదని భోగట్టా. రాష్ట్రంలో సాగుతున్న రాజకీయాల తీరుతెన్నుల ప్రభావం పరిపాలనపై, దానిని నడిపే యంత్రాంగం పై యెలా పడుతుందో తెలుసుకోవడానికి ఇదో ఉదాహరణ. రాజీనామాలు చేసిన మంత్రుల పేషీల్లో ఫైళ్ళు పేరుకుపోవడాన్ని కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఇదే పరిస్తితి వుండడాన్ని యెలా సమర్ధిస్తారు? అధిష్టానంతో చర్చలకోసం తరచుగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిరావడం వల్ల, రాష్ట్రానికి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ రాకతో పాటు ఆమె పాల్గొంటున్న కార్యక్రమాలు, పర్యటనల వల్ల సీయెం పేషీలో ఫైళ్ళ పరిష్కారంలో కొంత జాప్యం జరుగుతుండవచ్చు. సమర్ధన కోసం చెప్పే ఇలాటి సంజాయిషీలన్నీ రాష్ట్రంలో పాలన స్తంభించి పోయిందని వస్తున్న వార్తలను ఖరాకండిగా ఖండించడానికి ఎంతమాత్రం పనికిరావు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరవాత నిదానంగా పాలనా పగ్గాలను తన చేతిలోకి తీసుకోగలుగుతున్నారని, మెల్లగా పాలనపై తనదయిన పట్టు బిస్తున్నారని జనం అనుకోవడం మొదలయ్యీ కాకముందే మళ్ళీ పరిస్థితులు ఆయన చేజారిపోతున్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించడం దురదృష్టం.

పాలన కుంటుపడడం వల్ల కలిగే విపరీత పరిణామాల ప్రభావం పరిపాలించే వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై వెంటనే పడే అవకాశాలు లేని వ్యవస్థ మనది. ప్రభుత్వం అమలు చేయాల్సిన పధకాలు జాప్యం కావడంవల్ల వాటిల్లే ఇబ్బందులకు జనం ఇప్పటికే అలవాటు పడిపోయారు. కానీ వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పడిపోతే దానివల్ల వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే, రాజకీయ సంక్షోభ పరిష్కారం పట్ల ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చిందనే సాకులను ప్రజలు జీర్ణించుకుని అర్ధం చేసుకోవడం కష్టం. దీనికి తోడు రాజకీయ ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా కదులుతున్న ఉద్యోగ సంఘాలు మరో సారి సహాయ నిరాకరణకు పూనుకోబోతున్నట్టు వస్తున్న వార్తలు కూడా సామాన్య జనానికి ఆందోళన కలిగిస్తున్నాయి. బహుశా ఇవ్వాళో రేపో తెలంగాణా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఈ మేరకు సమ్మె సైరన్ మోగించవచ్చు. గతంలో పద్దెనిమిది రోజులపాటు జరిపిన సహాయనిరాకరణ, లక్ష్య సాధనలో ఎంత ఉపకరించిందన్న విషయాన్ని పక్కన పెడితే ప్రజలు మాత్రం తాముపడ్డ ఇబ్బందులు మాత్రం మరచిపోలేదు. అప్పట్లో విద్యార్ధుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాటి ఇబ్బంది కలిగించకూడదన్న సదుద్దేశ్యంతో తెలంగాణా ఉద్యోగ సంఘాల జే.యే.సీ. సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించారు. పరిపాలనను స్తంభింప చేయడం, రాస్తారోఖోలు చేయడం, నడి రోడ్లపై ధర్నాలకు పూనుకోవడం వంటి చర్యలు ప్రజాస్వామిక హక్కుల్లో భాగం కావచ్చు కానీ, ఈ రకమయిన ఆందోళనలను ఒక కాల పరిమితి లేకుండా నిరవధికంగా నిర్వహిస్తూ పోవడంవల్ల, ఎవరి బాగుకోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ప్రజలే వాటివల్ల నష్టపోతున్నారని, లేనిపోని ఇబ్బందులకు గురవుతున్నారని అర్ధం చేసుకుని వ్యవహరించడం వల్ల సాధారణ ప్రజలనుంచి లభించే సానుభూతి, సహకారం ఉద్యమకారుల లక్ష్య సాధనకు దోహదపడే అవకాశం వుంటుంది. రెండు రోజులపాటు నిర్వహించాలని తలపెట్టిన రైల్ రోఖో, వంటావార్పూ కార్యక్రమాలను వాయిదా వేసినట్టు తెలంగాణా జేయేసీ చైర్మన్ కోదండరాం ప్రకటించిన వెంటనే జనం అమ్మయ్య అని నిట్టూర్పు వొదలడం ఇందుకు ఉదాహరణ.

రాష్ట్ర విభజన అనేది సున్నితమైన, సంక్లిష్టమయిన సమస్య అని అంగీకరించే వారు కూడా ఈ సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నారని భావించడం సత్య దూరం కాదు. ఎందుకంటె, ఈ సమస్యను ఏళ్లతరబడి నానుస్తూ పోవడం వల్ల మరింత జటిలం కావడం మినహా మరే ప్రయోజనం వుండదని అందరూ అర్ధం చేసుకునే రోజులు దగ్గరపడ్డాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలన్న అభిలాష ఆ ప్రాంతపు ప్రజల్లో నాలుగు దశాబ్దాలకుపైగా పాతుకుపోయి వేళ్ళూనుకున్న కోరిక. అప్పటినుంచి ఇప్పటివరకు వారి ఆకాంక్షలో ఎటువంటి మార్పు వచ్చివుండక పోవచ్చు. కానీ, పరిణామక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల పవనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై కూడా పడడంలో ఆశ్చర్యం లేదు. ప్రాంతాలను దాటుకుని పెట్టుబడులు ప్రవహించాయి. సంస్కరణల వల్ల సంస్కృతి బీటలు వారింది. సంపాదనే లక్ష్యంగా మారి విలువలు వెనక్కు పోయాయి. మానవ సంబంధాలు మరుగున పడి ఆర్ధిక సంబంధాలు అవనిక పైకి వచ్చాయి. చదువుల విలువ తెలిసిన వారు అప్పట్లో ఉన్నతవర్గాల్లో మాత్రమే వుండేవారు. ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారి బడుగు బలహీన వర్గాలు సైతం విద్యవల్ల లభించే సాంఘిక గౌరవంలోని రుచిని ఆస్వాదించడం మొదలయింది. విద్యకు తగిన ఉద్యోగాలు, ఉద్యోగాలకు తగిన ఆర్జన - గౌరవప్రదమయిన జీవితాలకు పునాదులు వేయడంతో సమాజ స్వరూప స్వభావాల్లోనే సమూల మార్పులకు బీజాలు పడ్డాయి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న తపన తలితండ్రుల్లో పెరిగిపోయింది. బీదా గొప్పా తారతమ్యం లేకుండా వానయినా వంగడయినా పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపడం అలవాటుగా మారిపోయింది. నలభయ్ ఏళ్ళ క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చెలరేగిన ఉద్యమంలో చాలాకాలం విద్యాసంస్తలు పనిచేయలేదు. కలిగిన వాళ్లు బయటి ప్రదేశాలకు పిల్లలను పంపి చదివించుకున్నారు. లేనివాళ్ళు బడులు నడవకపోవడమే అవకాశంగా తీసుకుని తమ పిల్లలను కూలీ పనుల్లో పెట్టి వారి చదువుకు స్వస్తి చెప్పారు. ఇందుకు వారిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటె వారి ఆర్ధిక నేపధ్యం అలాటిది మరి.

మరి ఇప్పుడో. ఒక్క పూట కూడా బడికి ఎగనామం పెట్టే వీలు లేదు. పరీక్షల సీజను మొదలయిందంటే చాలు తలితండ్రులే ఆఫీసులకు సెలవు పెట్టి చదివించాల్సిన రోజులివి. పెళ్ళిళ్ళు పేరంటాల జోలికి పోకుండా పిల్లల్ని చదివించే తలితండ్రులు లెక్కకు మిక్కిలి కానవస్తారు. అలాగే, ప్రయివేటు ఉద్యోగులు. వాళ్లు ఆఫీసులకు రావడం ఒక్క నిమిషం ఆలశ్యం అయినా అందువల్ల వాటిల్లే నష్టాన్ని రూపాయల్లో లెక్కలు వేసుకుని, వారిని వాహనాల్లో ఆఫీసులకు తరలించే కొత్త యజమానులు తయారయ్యారు. ఉరుకులు పరుగులతో జీవితాలు పరుగులు తీస్తున్నాయి. వేగమయ జీవితాలతో కొత్త సమాజం ఆవిష్కృత మవుతోంది.

ఈ వాస్తవాలను ఉదహరిస్తున్నది ఉద్యమకారుల ఉద్దేశ్యాలను శంకించడానికో, ప్రజాస్వామ్య హక్కులను హేళన చేయడానికో కాదు. మారిన పరిస్తితులకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవడం అన్నది అనాదిగా వస్తోంది. స్వాతంత్రోద్యమ సమయంలో అనుసరించిన పద్దతులు ఆనాటి స్తితిగతులకు తగినట్టుగా వుండవచ్చు. ఈ నాటి పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా ఆందోళనల స్వరూపాలు మారితీరాలనే వాదన సర్వత్రా ప్రబలుతోంది. ఈ వాస్తవాన్ని గమనించి నడుచుకుంటే ప్రజల మన్నన, మద్దతు మరింత ఎక్కువగా లభిస్తాయి.

తెలంగాణా రావాలని మనసా వాచా కర్మణా కోరుకునే వాళ్లు ఎందరో వున్నారు. కానీ వారిలో చాలా మందికి నోరూ వాయీ లేదు. తెలంగాణా కోసం పార్టీలు , సంఘాలు పెట్టి పోరాడుతున్న వారూ వున్నారు. మీడియా ద్వారా మాట్లాడే అవకాశం వీరికున్నట్టుగా నోరు లేని మూగ జీవులకు లేదు. ఆయా పార్టీలు, సంఘాలు చేసే ప్రతిదానినీ సమర్ధించని వారిని తెలంగాణా వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదు. చిన్న విషయాన్ని కూడా గోరంతను కొండంత చేసి యాగీ చెయ్యడం సభ్యత అనిపించుకోదు. తెలంగాణాను మనమెంత గట్టిగా కోరుకుంటున్నామో వద్దని అనుకునేవారు కూడా అంత గట్టిగానే కోరుకుంటూ వుండవచ్చు. మనలాగానే అది వారికున్న ప్రజాస్వామిక హక్కు. లక్ష్య శుద్ధి వున్నంతకాలం ఫలితంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీరిని వారూ వారిని వీరూ

ఆడిపోసుకుంటూ మీడియాలో మాటల యుద్ధాలు చేసుకుంటూ పోవడం వల్ల ఉద్యమ స్పూర్తి పలచబడే అవకాశం వుంటుంది. గమ్యం చేరుకునే క్రమంలో ఎవరో అడ్డం పడుతున్నారని అనుకుంటే మాత్రం మనలో పోరాట శక్తి తగ్గుతోందనే అనుకోవాలి. ఇన్నాళ్ళు ఆగినవాళ్ళం మరికొన్నాళ్ళు ఆగలేమా? – ఆలోచించండి! (08-07-2011) 

8, జులై 2011, శుక్రవారం

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి! – భండారు శ్రీనివాసరావు

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి! – భండారు శ్రీనివాసరావు


(08-07-2011 తేదీ సాక్షి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

"అయాం సోల్డ్" - అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.
ముఖ్యమంత్రి అమ్ముడుపోవడమా!అందులోను వైఎస్సార్? ఎవరికి అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు?

అది డిసెంబరు నెల. 2007 వ సంవత్సరం.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సు ధ్వనిని అనుకరిస్తూ దాని ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే - సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.అదే ఎఫ్ డీ హెచ్ ఎస్. -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశిత దిన వైద్య సేవలు. ఇందుకు పూర్వ రంగం గురించి కొంత ప్రస్తావించాల్సివుంటుంది.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు

ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.ఈ నేపధ్యంలో -

అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ

సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.


ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులేన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్ ఎం ఆర్ ఐ నిర్వాహకులు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ తీసుకుని ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో- రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హటాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.

అంతే! దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

కానీ, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఇప్పుడు ఆయనా లేరు. ఆ పధకాలూ ఆయన లాగానే అంతర్ధానం అయిపోతున్నాయి. ఇవ్వాళో రేపో వాటిని పూర్తిగా అటకెక్కించినా ఆశ్చర్యంలేదు.

(ఈ రోజు కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి)

6, జులై 2011, బుధవారం

తెలంగాణాపై కాంగ్రెస్ తేల్చుడా ? నాన్చుడా ? - భండారు శ్రీనివాసరావు




తెలంగాణాపై కాంగ్రెస్ తేల్చుడా ? నాన్చుడా ?
-భండారు శ్రీనివాసరావు

(06-07-2011 తేదీ ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)

ఏదో జరగబోతోంది అన్న భ్రమలను కల్పించి ప్రజల దృష్టిని మళ్ళించడంలో కాంగ్రెస్ నాయకులు మరోసారి తమ ప్రజ్ఞను నిరూపించుకున్నారు. గత రెండు మూడురోజులుగా రాష్ట్రంలో చక చక కదులుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించినప్పుడు ఈ అభిప్రాయం కలగకమానదు. మూకుమ్మడి రాజీనామాల పర్వం ద్వారా వారు సాధించింది ఏమిటన్న ప్రశ్న జవాబు లేకుండా మిగిలిపోయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకోలేని చందంగా వారి రాజీనామాల వ్యవహారం సాగుతోంది. 12 మంది మంత్రులు, 42 మంది శాసనసభ్యులు, 9 మంది లోకసభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుదు, 12 మంది ఎమ్మెల్సీలు ఇంత మంది, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఒకే ఒక్క రోజున రాజీనామా చేసిన సందర్భం మన రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విషయమే. రానున్న రోజుల్లో ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశాలు కూడా వున్నాయి. అయినా ఇంత సాహసోపేతమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నా దానివల్ల వొనగూడిన ఫలితం మాత్రం అంతంత మాత్రమే కావడం వారి దురదృష్టం. తాబేలు, కుందేలు కధలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ హఠాత్తుగా ఒకడుగు ముందు వేసి మూకుమ్మడి రాజీనామాలు ఇవ్వడంలో తాను ఎంతమాత్రం వెనుకబడిలేనని నిరూపించుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన రాజకీయ మైలేజి కాస్తా టీడీపీ ఖాతాలో జమ పడిపోయింది.

‘ఈ రోజు – జులై నాలుగు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. తెలంగాణలో రైతాంగ పోరాటం చేసిన చాకలి ఐలమ్మ ప్రాణ త్యాగం చేసిన రోజు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అసువులు బాసిన రోజు ‘ అంటూ తమ రాజీనామాల నిర్ణయాన్ని మీడియాకు వెల్లడిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పంచాయతీరాజ్ శాఖామంత్రి జానారెడ్డి అభివర్ణించారు. కానీ, వీర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో తొలి ఆత్మబలిదానం చేసిన దొడ్డి కొమరయ్య మరణించిన రోజు కూడా అదే అని ఆ సీనియర్ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడుకి గుర్తురాకపోవడం విచిత్రంగా వుందని కొందరు చెవులు కొరుక్కున్నారు.

కారణాలు ఏవయితేనేమి, కారకులు ఎవరయితేనేమి మొత్తం మీద తెలంగాణా ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు చేసి జులై నాలుగో తేదీకి మరో విశిష్టత సంపాదించి పెట్టారు.

టీ ఆర్ ఎస్ ఆవిర్భావం తరవాత రాజీనామాలనేవి నిత్యకృత్యంగా మారిపోయాయని విమర్శించేవారున్నారు. కాంగ్రెస్ వారికి కూడా కొద్దో గొప్పో ఈ అలవాటు అలవడింది. కాకపొతే వాళ్ల రాజీనామాలు ఆమోదించే స్తాయిదాకా రాకుండానే వెనక్కు తీసుకోవడం జరిగింది. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీ అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేసిన దరిమిలా ఆ మరునాడే ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి  చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. డిసెంబర్ 23 వ తేదీన కేంద్ర హోం శాఖ చేసిన మరో ప్రకటనతో మనస్తాపం చెందిన తెలంగాణా ప్రాంతపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా మొత్తం అందరు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఇక ఇప్పడు మళ్ళీ మొన్న జూలై నాలుగో తేదీన మూడోసారి ముచ్చటగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. కాకపొతే ఈసారి ఆ వంతు తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులది కావడం విశేషం.

ఇక్కడ హైదరాబాదులో కాంగ్రెస్ శాసన సభ్యులు, అక్కడ ఢిల్లీ లో పార్లమెంట్ సభ్యులు రాజీనామాల సమర్పణలో చేసిన జాప్యం, పడ్డ మల్లగుల్లాలు ఆ పార్టీకి శోభస్కరంగా లేవు. ట్రాఫిక్ కారణంగా అనుకున్నా సమయానికి లోక్ సభ స్పీకర్ ను కలవలేకపోయామని చెప్పిన కారణాలు కూడా తర్కానికి నిలిచేవిగాలేవు. పైపెచ్చు వారి చిత్తశుద్దిని శంకించేవిగా పరిణమించడం వారి దురదృష్టం. రాజీనామాల విషయంలో వారిలో ఏకాభిప్రాయం కొరవడిందన్న అనుమానాలు రేకెత్తడానికి కారణం ఇదే.

మంచో చెడో తెలుగు దేశం పార్టీ మాత్రం రాజీనామాల విషయంలో ఆఖరు నిమిషంలో అయినా భేషయిన నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు షరతులతో కూడిన సవాళ్లు విసిరినప్పటికీ, కాంగ్రెస్ కంటే ముందే తమ పార్టీకి చెందిన శాసన సభ్యులందరితో రాజీనామాలు ఇప్పించి తెలంగాణా విషయంలో గతంలో ఆ పార్టీపై ముసురుకుని వున్న అనుమాన మేఘాలను కొంతవరకు తొలగించుకోవడంలో జయప్రదమయిందనే చెప్పాలి.

సరే! రాజీనామాలు ఇవ్వడం వరకు జయప్రదంగా జరిగిపోయింది. కానీ, జరగాల్సింది వారి ‘చేతి’లో లేదు. కాంగ్రెస్ అధిష్టానం సయితం సొంత పార్టీవారి ఈ ‘నిరసన’ను అంతగా పట్టించుకున్న దాఖలా కనబడం కనబడడం లేదు. రాజీనామాలకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యతను కూడా అధిష్టానం ఇవ్వడం లేదు. పైపెచ్చు గులాం నబీ ఆజాద్ హైదరాబాదులో ఆడిన నిష్టూరాలనే మరో మారు ఢిల్లీలో వల్లె వేసారు. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ‘నాన్సెన్స్’ అంటూ కొట్టివేసిన తన వ్యాఖ్యలనే అక్షరం పొల్లుపోకుండా తిరిగి అప్పచెప్పారు. తమ రాజీనామాలతో ఢిల్లీ పెద్దలు దిమ్మతిరిగి దోవకు వస్తారని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్న గంపెడు ఆశలపై కుండెడు నీళ్ళు గుమ్మరించారు. రాజీనామాలపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవడానికి ఏండ్లూ పూండ్లూ పట్టకపోయినప్పటికీ రూలు ప్రకారం పోయినా అంత త్వరగా తెమిలే వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు. హీనపక్షం వర్షాకాల సమావేశాల వరకు వేచిచూడక తప్పదు. అలాగే, శాసన సభ్యుల రాజీనామాలు.

మరి ఫలితం వెంటనే ఇవ్వని రాజీనామాలు ఎందుకు ఇచ్చినట్టు?
ఇందులో ఎవరి స్వలాభాలు వారికున్నాయి.

కాంగ్రెస్ వారికి ప్రజలవద్ద మొహం చెల్లుతుంది. ఛీ కొట్టిన జనం చేతనే జై కొట్టించుకునే మహత్తర అవకాశం లభిస్తుంది. అధిష్టానం తమను ప్రతి విషయంలో కించపరుస్తున్న అధిష్టానానికి ఒక ఝలక్ ఇవ్వగలిగామన్న తృప్తి మిగులుతుంది.

‘రెండు కళ్ళ సిద్ధాంతం’ తో ఆత్మరక్షణలో పడిపోయిన తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో మళ్ళీ కాలు కూడ దీసుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది.

‘ఇదిగో తెలంగాణా వస్తోంది, అదిగో వస్తోంది’ అంటూ ఎప్పటికప్పుడు జనాలకు నచ్చచెప్పుకోవాల్సిన పరిస్తితి తెలంగాణా రాష్ట్ర సమితిది. ఇంతపెద్ద సంఖ్యలో శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులచేత- అదీ ఇతర పార్టీలకు చెందిన వారిచేత రాజీనామాలు ఇప్పించగలిగేలా వొత్తిడి తెచ్చిన ఘనత తమదే అని చెప్పుకోవడానికి ఆ పార్టీకి వీలు చిక్కుతుంది.

ఇక - తెలంగాణా సమస్య ఇంత జటిలం కావడానికి మూలకారణమయిన కేంద్రంలోని యూ.పీ.యే. ప్రభుత్వానికి ఈ రాజీనామాల వ్యవహారం మరో విధంగా ఉపయోగపడే అవకాశం వుంది. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ పరిస్తితి చక్కదిద్దలేనంత అధ్వాన్నంగా తయారయిన సంగతి పార్టీ అధిష్టానానికి తెలియని విషయం కాదు. అలాగే, తెలంగాణా అన్నది తక్షణమే పరిష్కరించాల్సినంత ప్రాధాన్య విషయమూ కాదు. ఇవన్నీ పార్టీ అధినాయకత్వం దృష్టిలో అత్యల్ప స్వల్ప విషయాలు. ఎందుకంటె సోనియా నాయకత్వంలో వున్న కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం ఒకటే. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా ఆ పార్టీ నాయకత్వం చేయడం లేదు కూడా. 2014 తరవాత రాహుల్ గాంధీని ప్రధాని పీఠం పై ప్రతిష్టించడం ఒక్కటే ఆ పార్టీ నాయకత్వం ప్రధాన ధ్యేయం. ఆ లక్ష్య సాధనలో తెలంగాణా అంశం ఉపయోగపడుతుందని అంచనాకు వచ్చిన వెంటనే పార్టీ అధిష్టానం పచ్చ జెండా వూపుతుంది. అలా జరిగే అవకాశాలు శూన్యం అనుకున్నప్పుడు ప్రజాభీష్టాన్ని కూడా తోసిరాజని తెలంగాణా అంశాన్ని ఆటకెక్కించడం తధ్యం. రాష్ట్ర విభజన అంశం పరిశీలించేటప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి పెట్టేది ఈ కోణం నుంచే. యెలా చేస్తే ఎక్కువ లోక సభ స్తానాలు గెలుచుకోవడానికి వీలుంటుంది అన్న ఒక్క లెక్క పైనే అన్ని లెక్కలు ఆధారపడివుంటాయి.

ఈ లెక్క తేలగానే అన్నీ తేలిపోతాయి. అది తేలనంతవరకు ప్రస్తుతం సాగుతున్న నాన్చుడు వ్యవహారమే మరికొంత కాలం సాగుతుంది. రాష్ట్రపతి పాలనలు, స్పెషల్ పాకేజీలు రంగప్రవేశం చేస్తాయి.ఎన్నికలకు నిండా మూడేళ్ళ వ్యవధానం వున్న యే అధికార పార్టీ అయినా ఇలానే ఆలోచిస్తుంది. ఎన్నికలప్పుడు చూసుకుందాంలే!

అన్న ధీమాతో ముందుకు అడుగేస్తుంది. ఇక రాజీనామాలా? వాటి పరిష్కారానికి వెయ్యి మార్గాలున్నాయి. బుజ్జగింపులు, లాలింపులు, ఝాడింపులు, బెదిరింపులు. సామదానబేధదండోపాయాలతో సాధించరానిదేదీ లేదన్న సూక్తి రాజకీయాల్లో వున్నవారికి తెలియనిదేమీ కాదుకదా.

అంతవరకూ ఆందోళన బాటలో ప్రజా సంఘాలు, రాజకీయ ప్రయోజనాలు దక్కించుకునే పనిలో రాజకీయ పార్టీలు తలమునకలుగా వుంటాయి. ఒకరిపై మరొకరు ప్రయోగించుకోవడానికి తగినన్ని అస్త్రశస్త్రాలు వారి అంబుల పొదిలో ఎప్పుడూ సిద్ధంగానే వుంటాయి. ఎత్తులు పై ఎత్తులతో వాళ్లు బిజీ. చిక్కులు, చీకాకులతో జనం బిజీ.

అయినా ఎన్నికలు దూరంగా వున్నప్పుడు జనాన్ని దగ్గరకు తీయడం రాజకీయులకు ఇంటావంటా లేని పని. (05-07-2011)

3, జులై 2011, ఆదివారం

వెనుకటి గుణమేలమాను – భండారు శ్రీనివాసరావు


వెనుకటి గుణమేలమాను – భండారు శ్రీనివాసరావు

మునుపటి రోజుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా తమ అధినాయకులను కలుసుకోవడానికి పడే ప్రయాస అంతా ఇంతా కాదని చెప్పుకునేవారు. ఇక అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీని కలవడం అంటే ముఖ్యమంత్రులకు సయితం బ్రహ్మ ప్రళయంగా వుండేది. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపుకోసం ఎదురుచూస్తూ ఏ పీ భవన్లో మన ముఖ్యమంత్రులు రోజుల తరబడి ఎదురుచూస్తూ పడిగాపులు పడిన సందర్భాలు అనేకం వున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్వ్యూ ఓ పట్టాన దొరక లేదంటే ఇక ఆ ముఖ్యమంత్రికి త్వరలోనే పదవీ గండం తధ్యం అనుకునే వాళ్లు. ఈ నేపధ్యం తెలిసినవారికి ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ విషయంలో చాలా అదృష్ట వంతులనే అభిప్రాయం కలగడంలో వింతేమీ లేదు. ముఖ్యంగా యూ పీ యే - 1 ప్రభుత్వ పాలనాకాలంలో ఈ మార్పు మరింత స్పుఠంగా కానవచ్చింది. సోనియా గాంధీ పట్ల ప్రజల్లో కొంత సానుకూల వైఖరి ప్రబలడానికి ఇది కొంత మేరకు దోహదం చేసింది. ఇందిరాగాంధీతో పోల్చి చూసుకుని సోనియాకు కొన్ని మార్కులు అదనంగా వేయడం కూడా మొదలయింది. కాంగ్రెస్ అధిష్టానం తన సహజ వైఖరి నుంచి క్రమంగా దూరం జరుగుతూ ప్రజాస్వామ్య విలువలకు కొద్ది కొద్దిగా దగ్గరవుతున్నదేమో అన్న భ్రమలు ప్రజల్లో కలగసాగాయి. యూపీయే మొదటి అయిదేళ్ళ పాలన పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడానికి సోనియా అనుసరించిన ఈ విధానం ఓ మేరకు ఉపయోగ పడిందనే చెప్పాలి. సహజంగా మృదు స్వ భావి, మంచివాడు అని జనసామాన్యంలో మంచి పేరున్న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన మానాన తన పని చేసుకుపోవడానికి కూడా దీనివల్ల వీలు పడింది. మరోవైపు, సోనియా గాంధీ తన అత్తగారు ఇందిరలా పేనుపెత్తనం చేయదన్న మంచి పేరు ఆమె ఖాతాలో జమ పడింది. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను పదేపదే మార్చడం వంటి అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలకు కాంగ్రెస్ అధిష్టానం స్వస్తి చెప్పినట్టేననన్న అభిప్రాయం ప్రజల్లో బలపడడం ప్రారంభమయింది. కీర్తిశేషులు రాజశేఖరరెడ్డి నిరాఘాటంగా మొదటి అయిదేళ్ళ పదవీ కాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడానికి అప్పట్లో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన ఈ మెతక విధానం ఆయనకు బాగా కలసివచ్చిందని అనుకునేవాళ్ళు కూడా వున్నారు. కానీ, ఖండాంతరాలకు తెలుగు ఖ్యాతిని విస్తరిస్తూ తొమ్మిదేళ్ళకు పైగా చంద్రబాబునాయుడు సాగించిన హైటెక్ పాలనకు ప్రజలు స్వస్తివాక్యం పలికేలా చేయడంలో రాజశేఖరరెడ్డి జరిపిన పాదయాత్ర, ప్రజాసమస్యలపై ఆయన చేసిన నిరంతర పోరాటాలు చాలావరకు ఉపయోగపపడ్డాయనడం వాస్తవానికి దగ్గరగా వుంటుంది.

సరే! ముఖ్యమంత్రుల హస్తిన యాత్రలు గురించి చెప్పుకోవాలంటే ఆ నాటి ముఖ్యమంత్రి రామారావు గురించి గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్తాయిలో రాజకీయ శక్తుల ఏకీకరణకు ఆయన చేసిన ప్రయత్నాలు ఇన్నీ అన్నీ కావు. ఎన్టీయార్ దురదృష్టం ఏమిటంటే ఆయన ముఖ్యమంత్రిగా వున్నన్ని రోజులూ

కేంద్రంలో ఆయనతో ఏమాత్రం పొసగని ఉప్పు నిప్పు లాటి కాంగ్రెస్ ఏలుబడి వుండేది. ఒక వేళ ఢిల్లీ యాత్ర పెట్టుకున్నా, అక్కడ వున్నసమయమంతా ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకులను కలుసుకుని సంప్రదింపులు జరపడంలోనే గడిచిపోయేది. ప్రధానమంత్రిని కానీ, కేంద్ర మంత్రులను కానీ కలుసుకోవాల్సివచ్చినా అది కేవలం మొక్కుబడిగా సాగిపోయేది. అయితే, ఆయన ఢిల్లీ లో ఎంతటి వున్నత స్తానంలో వున్న వ్యక్తులను కలుసుకోవాలని అనుకున్నాకానీ వేచిచూడాల్సిన అవసరం ఆయనకు ఎంతమాత్రం వుండేది కాదు. ముందుగా నిర్దేశించుకున్న అప్పాయింట్ మెంట్ల ప్రకారం ఎన్టీయార్ తన ఢిల్లీ పర్యటనను అనుకున్న వ్యవధిలో, అనుకున్న పద్ధతిలో ముగించుకుని తిరిగి వచ్చేవారు.

పోతే, ఆ తరువాత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన చంద్రబాబు నాయుడుకి మరింత చక్కని వెసులుబాటు లభించింది. ఎవరు ప్రధానిగా వున్నా, కేంద్ర ప్రభుత్వం ఆయన కనుసన్నల్లో నడిచేదే కాబట్టి ఢిల్లీలో పనులు చక్కబెట్టుకురావడం అన్నది ఆయనకు నల్లేరుపై బండి నడకలా వుండేది. ఎన్టీయార్ వొదిలివెళ్ళిన కాంగ్రెస్ వ్యతిరేక వారసత్వం పుణ్యమా అని ఢిల్లీ లోని ఏలికలందరూ చంద్రబాబు మాటకు ఎదురుచేప్పే సాహసం చేసేవారు కాదు. అందుకే దేశరాజకీయాల్లో చక్రం తిప్పగల సమర్దుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ఇక రాజశేఖరరెడ్డి విషయానికి వస్తే – ఆయన అధికారంలోకి వచ్చేసమయానికి ఢిల్లీ స్తాయిలో కాంగ్రెస్ అధిష్టానం తీరుతెన్నులే సమూలంగా మారిపోయాయి. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తరచూ మార్చే దుష్ట సంస్కృతికి సోనియా గాంధీ మంగళం పాడారు. కాంగ్రెస్ బలానికి తన సొంత బలాన్ని జోడించి, ప్రజలను కాంగ్రెస్ దిక్కుగా మళ్లించి ఇక కాంగ్రెస్ కు రాష్ట్రం లో పుట్టగతులు లేకుండా పోయాయని  అనుకుంటున్న విపత్కర తరుణంలో తెలుగు దేశాన్ని ఓడించి కాంగ్రెస్ కు మళ్ళీ పట్టం కట్టించిన వీరుడిగా అధిష్టానం మెప్పును రాజశేఖరరెడ్డి పొందగలిగారు. అందుకే మరోమాట లేకుండా పార్టీ అధినేత్రి ఆయనకు రాష్ట్ర పాలనా పగ్గాలను అందించారు. ఢిల్లీ పెద్దల అనుగ్రహం పూర్తిగా వుండడంతో రాష్ట్రంలో ప్రత్యేకించి సొంత పార్టీలో వైఎస్సార్ కు ఎదురుచెప్పేవారు లేకుండా పోయారు. కాంగ్రెస్ సంస్కృతిలో భాగమయిన అసంతృప్తి వెల్లుబికి వెల్లువెత్తకుండా నిరోధించగలిగారు. అక్కడక్కడా, అప్పుడప్పుడూ కొందరు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సన్నాయి నొక్కులు నొక్కడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అసంతృప్తి సెగలు ఢిల్లీ వరకు సోకకుండా ఒక స్తాయిలోనే అణిగిపోయాయి.

రాజశేఖరరెడ్డి మొదటి అయిదేళ్ళ పాలన అధిష్టానం జోక్యం అంతగా లేకుండానే అవిచ్చిన్నంగా సాగిపోయింది. వైఎస్సార్ 2004 లో కాకుండా అంతకుముందే అవకాశం లభించి ముఖ్యమంత్రి అయివుంటే గతంలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మాదిరిగానే ఒకటి రెండేళ్లు పాలించి మాజీ ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోవాల్సి వచ్చేదని భావించేవాళ్ళున్నారు. సరయిన సమయంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం వల్లనే ఆయనకు పూర్తి అయిదేళ్ల కాలం పరిపాలించగల అవకాశం చిక్కింది. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ అధిష్టానం తన వైఖరిని ఎంతో కొంత మార్చుకోవడమే దీనికి కారణం.

రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. అప్పటికే వైఎస్సార్ అధినేత్రికి చెక్ చెప్పగల స్తాయినీ, స్తోమతనూ సముపార్జించుకున్నాడన్న సమాచారాన్ని ఆయనంటే గిట్టని కొందరు ఢిల్లీకి చేరవేయడంతో వైఎస్ మరణంతో లభించిన అవకాశాన్ని తనకనుకూలంగా మార్చుకునే చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగానే మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు వుందని పరోక్షంగా ప్రకటించుకున్న వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ని పక్కన బెట్టి రోశయ్యను ముఖ్యమంత్రి గద్దె ఎక్కించింది. అది తాత్కాలికమయిన ఏర్పాటు కావచ్చన్న భ్రమలో జగన్ వర్గం – తాను తాత్కాలిక ముఖ్యమంత్రినే అన్న భావనలో రోశయ్య వుండగానే అధిష్టానం చకచక పావులు కదిపి  రాజశేఖరరెడ్డి కాలంలో  రాష్ట్ర పార్టీపై తాను కోల్పోయిన పాత పెత్తనాన్ని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునే ఎత్తుగడలకు పూనుకుంది. రోశయ్యను మార్చి ఆ స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి, మళ్ళీ వెనుకటి విధానాలకే మళ్లి పోతున్న సంకేతాలను ఇచ్చింది. దానితో, ఇక కుదిరేపనికాదనుకున్న జగన్ సొంత కుంపటి పెట్టి కడప ఉపఎన్నికల్లో చావుదెబ్బ కొట్టడంతో దిమ్మతిరిగి తెప్పరిల్లిన ఢిల్లీ మేధావులు తమ మేధస్సులకు పనిపెట్టి, పదును పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కాయకల్ప చికిత్స మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే, చిరంజీవి పార్టీకి మంగళం పాడించి ఆయనకు కాంగ్రెస్ తీర్ధం ఇవ్వడం, బొత్స సత్యనారాయణకు పీసీసీ పీఠం అప్పగించడం, డిప్యూటీ స్ప్పీకర్ నాదెండ్ల మనోహర్ కు స్పీకర్ గా పదోన్నతి కల్పించడం, తెలంగాణాకు చెందిన ఎస్ స్సీ కాంగ్రెస్ నాయకులు రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి, మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడం మొదలయిన చర్యలన్నీ రాకెట్ వేగంతో తీసుకున్నారు.

కానీ ఎన్ని చేసినా ఏదో ఇంకా మిగిలి పోయిందన్న గుబులే కాంగ్రెస్ ను పట్టి పీడిస్తోంది. జగన్ సమస్యకు పరిష్కారం కనుగొనగలుగుతామన్న ఆశ మినుకు మినుకుమంటూ వుండగానే తెలంగాణా అంశం పీకలమీదకు వచ్చింది. దాంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరోమారు హస్తిన సందర్శన తప్పలేదు. ఢిల్లీలో సోనియాతో సహా అధినాయకులనందరినీ కలిసి వచ్చానన్న సంతోషం ఆయనకు ఎంతో సేపు నిలవలేదు. ఈ లోగా, తెలంగాణా కాంగ్రెస్ నాయకులందరూ హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో సమావేశమై ఈ నెల నాలుగో తేదీన మూకుమ్మడి రాజీనామాలు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కే అందచేస్తామని మరో ఆఖరు గడువుతో పాటు ఆఖరి అస్త్రాన్ని కూడా ఒక్కుమ్మడిగా సంధించారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటనకే కేంద్రం కట్టుబడి వుండాలని, తెలంగాణా ఏర్పాటు మినహా తమకు మరేదీ సమ్మతం కాదనీ వారు తెగేసి చెప్పారు. ఈ వ్యవహారం తెగేదాకా సాగుతుందో, తెగకుండానే మరో ముడి పడుతుందో హైదరాబాద్ వచ్చివెళ్ళిన రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కే తెలియాలి. (01-07-2011)


1, జులై 2011, శుక్రవారం

గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు

గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు



ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం


భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్



‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం

గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.

ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రం లోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం ఇలా చెబుతారు.

• ఓం – భగవంతుడు సర్వ రక్షకుడు.

• భూ: - ఉనికి కలిగినవాడు

• భువః – జ్ఞాన రూపుడు

• స్వః – ఆనంద స్వరూపుడు అంటే దుఖః రహితుడు

• తత్ – అటువంటి లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు

• సవితు: - ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త

• వరేణ్యం – అందరితో ఆరాధింపబడేవాడు

• భర్గః – పరిశుద్ధుడు

• దేవస్యః – ఆవిధమయిన దివ్య గుణములు కలిగిన దైవ స్వరూపుడు

• ధీమహి – ఆత్మలో ఎకమయిన

• యః – ఆ పరమేశ్వరుడు

• నః ధ్యః – మా బుద్ధులను

• ప్రచోదయాత్ – సత్కర్మలలో ప్రేరేపించి శ్రేయస్సు పొందేవిదంగా సమర్ధులను చేయుగాక.

ఇక మూలార్ధం తీసుకుంటే దాని భావం ఇలా వుంటుంది.

“ఓ భగవాన్!
ఏకకాలంలో సమస్త ప్రదేశాలలో వుండగలిగిన ఓ విశ్వరూపీ! అపరిమితమయిన శక్తికలిగిన ధీశాలీ! పరమేశ్వరా!
ఈ చరాచర ప్రపంచంలో లభ్యమయ్యే సమస్త జ్ఞానం నువ్వే. సర్వ ప్రకాశానివి నువ్వే. వరప్రదాతవు నువ్వే.
మాలో భయాన్ని పోగొట్టేది నువ్వే. ఈ విశ్వానికి సృష్టికర్తవు నువ్వే. సర్వోత్తముడివి నువ్వే. శిరసు వంచి నమస్కరిస్తున్నాము. మా మనస్సు, మేధస్సు సత్కర్మలవైపు ఆకర్షించబడేలా చూస్తూ సన్మార్గంలో నడిచేలా మాకు మార్గం చూపు.”

గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.

ఆదునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి.

ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.

మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.

• ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)

ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.

గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం.

అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.

ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.

తత్స వితుర్వరేణ్యం

తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.

ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు.

ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.

ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు.  విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే.

గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు.

భర్గో దేవస్య ధీమహి

భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు.
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.

దియోయోనః ప్రచోదయాత్

ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.

భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.

కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.


ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద

(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)- (29-06-2011)







24, జూన్ 2011, శుక్రవారం

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

(24-06-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)


- కొనసాగుతున్న కాంగ్రెస్‌ ‘సంస్కృతి’

- మళ్ళీ మొదలైన అధిష్ఠానం పట్టు

- వై.ఎస్‌. వ్యతిరేకులకు వరం!

- తెలంగాణలో విశ్వసనీయత ప్రశ్నార్ధకం

- కోస్త, సీమల్లోనూ దయనీయ స్థితి

- పక్కలో బల్లెంలా జగన్‌ సవాళ్ళు



బహుశా రాష్ట్ర కాంగ్రెస్‌ చరిత్రలో మున్నెన్నడు కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్‌ వాదులు నేడు అనుభవిస్తున్నారనుకోవాలి. పార్టీకి చెందిన సీనియర్‌ ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, పొన్నం ప్రభాకర్‌ ఇటీవల టీవీ తెరలపై చేసిన మాటల యుద్ధం చూసిన వారికి ఈ అభిప్రాయం కలగడం సహజం. మువ్వ న్నెల కాంగ్రెస్‌ కండువాలను మినహాయిస్తే, వారిద్దరెవరో తెలియని వారికి ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మడం కష్టం. రాష్ట్ర మంత్రి శంకరరావు, మరో కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ సర్వే సత్యనారాయణ ఇదేమాదిరి మరో అంకానికి తెరలేపారు.



హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వారిద్దరూ ప్రచురణార్హం కాని భాషలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా పుణ్యమా అని ఈ సన్నివేశాన్ని ఇంటిల్లిపాదీ ఇళ్ళల్లో కూర్చుని వీక్షించగలిగారు. కాకపొతే, ఈ రకమయిన దూషణ ఘట్టాలు తరచు సాగిపోవడానికి కాంగ్రెస్‌ నాయకులు గత రెండేళ్లుగా శక్తివంచన లేకుండా సాయపడుతూ వస్తున్నారు. జగన్‌ పార్టీని విమర్శించే క్రమంలో కొందరు, ప్రాంతీయ తత్వంతో మరికొందరు, పదవులపై ఆశ పెంచుకుని అది తీరేదారి దొరకక ఇంకొందరు- ఈ మార్గాన్నే ఎంచుకుని బుల్లితెరలకు అవసరమయిన ముడి సరుకుని పంచిపెట్టడంలో తలమునకలుగా ఉన్నారు.



గతంలో కూడా రాష్టక్రాంగ్రెస్‌ నాయకులు తమ పొరపొచ్చాలను దాచిపెట్టుకుని వ్యవహరించిన దాఖలాలు లేవు. పైపెచ్చు రాజకీయాలలో ఈ విధమయిన ధోరణికి ‘కాంగ్రెస్‌ సంస్కృతి’ అనే ముద్దు పేరు కూడా జత పడింది. అలనాటి కాంగ్రెస్‌ కురువృద్ధులు ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదాదిగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరూ అసమ్మతిని పెంచిపోషించిన వారే. ముఠా సంస్కృతిని అక్కున చేర్చుకున్నవారే. అరవయ్యవ దశకం చివర్లో జరిగిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం సభ్యుల ఎన్నిక సందర్భంలో కాకాని వెంకటరత్నం, మూర్తిరాజుల నడుమ జరిగిన భీకర పోరు కాంగ్రెస్‌లోని ముఠా తగాదాలను బట్టబయలు చేసింది.



ఆ తరువాతి తరంలో రాష్ట్ర రాజకీయాలను తమదైన శైలిలో శాసించిన చెన్నారెడ్డి, రాజశేఖరరెడ్డి వంటి ఘనాపాఠీలు కూడా తమ పూర్వీకుల బాటలోనే మరికొంత ముందుకు సాగారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు వారికి కలసి వచ్చాయి. అధిష్ఠానానికి అనుకూలంగా ఉంటూనే రాష్ట్రంలో తమ మాటకు ఎదురులేకుండా చూసుకోగలిగారు. ఈ విషయలో చెన్నారెడ్డి కంటే రాజశేఖరెడ్డి చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఆయన జీవించి ఉన్నంత కాలం పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు ఆయన వైపు కన్నెత్తి చూడలేని స్థితి, పన్నెత్తి ఎదిరించలేని పరిస్థితి.



రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి తలకిందులైంది. వైఎస్‌ఆర్‌ హయాంలో రాష్ట్ర పార్టీపై ఆజమాయిషీ చేయలేకపోయిన అధిష్ఠానం మళ్ళీ తన పట్టు బిగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్టీలోని వైఎస్‌ వ్యతిరేకులకు ఇది కలసివచ్చింది. మూసుకుపోయిన నోళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీలో ముసలం పుట్టింది. దీనికి తోడు వైఎస్‌ మరణానంతరం ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ విశ్వసనీయతను ప్రశ్నించే స్థాయికి తీసుకు వెళ్ళింది.



శ్రీకృష్ణ కమిటీ వంటి కంటి తుడుపు చర్యలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలను మార్చలేకపోగా ఉద్యమం మరింత ఊపందుకుంది. మరోపక్క వైఎస్‌ఆర్‌ సెంటిమెంటును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిన ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి తన కొత్త పార్టీతో కాంగ్రెస్‌కు పక్కలో బల్లెంగా తయారవడంతో కోస్త, సీమల్లో కూడా పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కడప ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం కాంగ్రెస్‌కు మరింత గడ్డుపరిస్థితిని తెచ్చి పెట్టింది.నాయకుల బలహీనత, చోటా నాయకులకు బలంగా మారింది. పట్టుమని నలుగురు అనుచరులు కూడా లేని చిన్ననాయకులు ముఠా సంస్కృతి పుణ్యమా అని బడానాయకుల అవతారం ఎత్తారు. పదవికి అర్హత సంపాదించుకోవడం కంటే పదవిని అడ్డదార్లలో సంపాదించుకునే క్రమంలో ఆరితేరారు. నాకళ్ళముందు రాజకీయాల్లోకి వచ్చినవాడు అంత పెద్ద పదవిని అందుకోగాలేనిది నేనేనా తక్కువతిన్నదన్న పోటీ మొదలై, అర్హత అనే పదం రాజకీయ పరమ పద సోపా నపఠంలో పెద్దపాము నోట్లోపడి అట్టడుక్కు చేరింది.



ఈ నేపథ్యం కొందరికయినా ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్‌ రోజులను గుర్తుకు తేవడం సహజం. ఆమె శకం మొదలయిన తరువాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తనకు వ్యతిరేకులని లేశమాత్రం అనుమానం కలిగినా సరే, ఇందిర వారిని నిర్దాక్షిణ్యంగా అణిచి వేసేవారు. చదరంగం బల్లపై పావులను కదిపినట్టు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి మార్చివేసేవారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇలాటి ప్రయోగం తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి, దరిమిలా కాంగ్రెస్‌ అవిచ్ఛిన్న పాలనకు ప్రజలు మంగళం పాడడానికి దారితీసింది. ఇందిర హయాంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తమలో తాము ఎన్ని గిల్లికజ్జాలు పెట్టుకుని ఎంత రచ్చ చేసుకున్నా ఢిల్లీలోని అధినాయకుల జోలికి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు.



అధిష్ఠానం అంటే బెరుకూ, భయం పైనుంచి కిందిదాకా పాకిపోయాయి. కానీ ఇప్పుడలా కాదు, ఏకంగా అధినేత్రి సోనియా గాంధీ జాతీయతనే ఎత్తిచూపే విధంగా మీడియా ముందు మాట్లాడినా అడిగేవాళ్ళు లేకుండా పోయారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనే తేడాలేకుండా వరసపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే విస్తుపోవడం జనంవంతవుతోంది. పార్టీలోని ప్రత్యర్ధులను విమర్శించడానికి వాడుతున్న భాష వెగటుకలిగిస్తోంది. నిజంగా మనసులో మాట చెబుతున్నారా లేక మీడియా దృష్టిని ఆకర్షించడానికా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.



పైపెచ్చు ఈ అపభ్రంశపు పదప్రయోగాలకు అసెంబ్లీ ఆవరణనో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్నో వేదికగా చేసుకుంటున్న తీరు మరీ విడ్డూరంగా ఉంది. ఇక బుల్లితెరలపై అనునిత్యం జరిగే చర్చల్లో పాల్గొనే కాంగ్రెస్‌ నాయకులు అవకాశం దొరికిన ప్రతి సందర్భాన్ని ఇందుకోసం చక్కగా వాడుకుంటున్నారు. ఈ విషయంలో ఏ పార్టీ వెనుకబడి లేదు కానీ, కాంగ్రెస్‌కు మాత్రం అగ్రతాంబూలం ఇవ్వకతప్పదు. ఎందుకంటె తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అందరికంటే ఎక్కువ అని తమకు తామే కితాబు ఇచ్చుకుంటూ, ఆ ముసుగులో మరిన్ని గుద్దులాటలకు దిగే వీలూ చాలూ వారికే ఎక్కువ కనుక.



అలాగని రాష్ట్ర పార్టీపై ఢిల్లీ నాయకులకు పూర్తిగా అదుపు లేకుండా పోయిందని చెప్పలేము. ఇందుకు తాజా ఉదాహరణ, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు తెలంగాణ వాదాన్ని అధిష్ఠానం ముందు మరోమారు బలంగా వినిపించే ఉద్దేశంతో జరిపిన ఢిల్లీ యాత్ర. దేశ రాజధానిలో పార్టీ అధిష్ఠాన దేవతలను కలుసుకుని తమ గోడు వినిపించుకోవడానికి వాళ్లు పడ్డ పాట్లు వర్ణనాతీతం. చివరికి ఢిల్లీ దొరలకు మరో గడువు పెట్టి తిరిగి రావాల్సిన పరిస్థితి. ఈ పరిణామాలు వారికి కూడా కొరుకుడు పడడంలేదు. వారి స్వరం పెరుగుతోంది. ఆవేదన స్తానంలో ఆక్రోశం చోటుచేసుకుంటోంది. అది ఆగ్రహంగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్య అలాటిది. అట్టడుగునుంచి వారిపై నానాటికీ ఒత్తిడి ఎక్కువవుతోంది.



తిరిగి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇచ్చినా గెలిచి చట్టసభల్లో కాలుమోపుతామన్న ఆశ అడుగంటుతోంది. ఇక టీవీ చర్చల సంగతి సరేసరి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అధిష్ఠానం ముక్కలనే ముక్కున పెట్టుకుని తిరిగి మీడియా ఎదుట వల్లెవేయడానికి నానా అవస్థ పడుతున్నారు. తాము చేస్తున్న ప్రతి ఢిల్లీయాత్రా మరో డెడ్‌ లైన్‌ ప్రక టించడానికి తప్ప విషయం తేల్చడానికి ఉపయోగపడడం లేదన్న అబిప్రా యం వారిలో కలుగుతున్నట్టుంది. ఇప్పుడు కోస్త, సీమ కాంగ్రెస్‌ నాయకు లదీ అదే పరిస్థితి. మొన్నటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పగల మొనగాళ్ళం తామేఅని పెంచుకున్న నమ్మకం వారిలో సైతం సడలుతున్న ట్టుంది. మంత్రి శైలజానాథ్‌ నాయకత్వంలో ఢిల్లీ వెడదామని అనుకుంటు న్నట్టు సీనియర్‌ కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి చేసిన ప్రకటన దీనికి అద్దం పడుతోంది.



మరో వారం పది రోజుల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలను విస్తరిస్తారన్న సమాచారం ఒక్కటే వారిలో కొందరిని అధిష్ఠానం ముందు అదిమి పెడుతోంది. కానీ ఢిల్లీనుంచి తాజాగా అందుతున్న వార్తలు వారిని మళ్ళీ నిరాశలోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులను బట్టి 2014 ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు మొండి చేయి చూపడం ఖాయమన్న అంచనాలకు వచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను పక్కనబెట్టే అవకాశాలు లేకపోలేదన్నది ఆ వార్తల సారాంశం. భావిభారత ప్రధానిగా రాహుల్‌ గాంధీని ప్రతిష్ఠించాలని కలలు కంటున్న కాంగ్రెస్‌ అధిష్ఠాన దేవత గెలుపోటముల బేరీజులో ఆంధ్రప్రదేశ్‌ ను చిన్నచూపుచూసే ప్రమాదం ఉందని పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.



రాహుల్‌ గాంధీ ఆలోచనలు సైతం ఇదే క్రమంలో సాగుతున్నాయన్న వార్తలు నిజమయితే, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మన రాష్ట్రానికి మళ్ళీ మొండిచేయి ఖాయం. ఎందుకంటె, పందెం కాసేవాడు గెలుపు గుర్రాన్నే ఎంచుకుంటాడు. కొడిగడుతున్న కాంగ్రెస్‌ ఆశలకు అధిష్ఠానం తలపెట్టిన కాయకల్ప చికిత్స ఏమేరకు పనికి వస్తుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ కొత్త అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కలసికట్టుగా పనిచేయడం మీదనే పార్టీ భవిష్యత్తు కొంత ఆధారపడి ఉంది. ఇంకా మూడేళ్ల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. వీరిద్దరూ విభిన్న అధికారకేంద్రాలుగా మారిపోకుండా పార్టీ తలరాతను మారుస్తారా లేక తమనే అధిష్ఠానం మార్చే పరిస్థితి కొని తెచ్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిన విషయం.











18, జూన్ 2011, శనివారం

సాధించడమా ? సాగిలబడడమా ? బీసీలే తేల్చుకోవాలి! – భండారు శ్రీనివాసరావు

సాధించడమా ? సాగిలబడడమా ? బీసీలే తేల్చుకోవాలి! – భండారు శ్రీనివాసరావు


(18-06-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

బడుగులపై రాజకీయ పార్టీలు కురిపిస్తున్న ప్రేమ కేవలం నీటి బుడగలేనా ? అగ్రవర్ణ పాలకుల వోటు బాంకు నిర్మాణానికి ఉపయోగపడే పునాది రాళ్ళా వాళ్లు ? స్తానిక సంస్తల ఎన్నికల్లో బీ సీ రిజర్వేషన్ లకు సంబంధించి ఆయా పార్టీలు ప్రదర్శిస్తున్న వైఖరులు గమనిస్తుంటే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అనిపిస్తోంది.


ఈ ఎన్నికల పట్ల వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీ ఆర్ ఎస్ వంటి పార్టీలకు తప్ప మిగిలిన వాటికి ఎలాటి ఆసక్తి లేదన్న సంగతి జగమెరిగిన విషయమే. కడప ఉప ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఊపులోవున్న జగన్ పార్టీ స్తానిక సంస్తల ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా మరోసారి తన తడాఖా చూపించాలని వువ్విళ్ళూరుతోంది. అలాగే, అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే తెలంగాణా అంశాన్ని కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని ఆశించి భంగపడిన టీ ఆర్ ఎస్, సహజంగానే స్తానిక సంస్తల ఎన్నికల్లో మరో సారి తన సత్తా ప్రదర్శించి పాలక పక్షం పై వొత్తిడి పెంచాలని అనుకోవడంలో విడ్డూరమేమీ లేదు. విజయం పై ధీమా ఈ రెండు పార్టీలకు వున్నట్టుగా మిగిలిన పార్టీలకు లేకపోవడంవల్లనే- ఈ ఎన్నికలు ఏదో విధంగా వాయిదా పడితే బాగుండు అన్న ధోరణితో అవి వున్నాయి. పాలక పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే వున్నట్టు కానవస్తోంది. స్తానిక పోరుకు ఏ నిమిషంలోనయినా తాము సిద్ధం అన్నట్టు ఈ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మేకపోతు గాంభీర్యాన్ని తలపిస్తున్నాయి. ఎందుకంటె కడప ఉప ఎన్నికల్లో ఏమి జరిగిందో మరచిపోయేంత సమయం ఇంకా కాలగర్భంలో కలిసిపోలేదు. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే మళ్ళీ ఎన్నికలను ఎదుర్కోవడం అంటే కొరివితో తల గోక్కోవడమే. ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఈ పార్టీలకు కలసివచ్చింది. స్తానిక సంస్తల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులవారికి కల్పించిన 34 శాతం రిజర్వేషన్లకు గండి కొట్టేందుకు ఆ రిజర్వేషన్లనే ఒక ఆయుధంగా వాడడానికి రంగం సిద్ధం అయిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లు యాభయ్ శాతానికి మించకూడదన్న సర్వోన్నత న్యాయస్తానం తీర్పు నేపధ్యంలో బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టే కుట్రకు శ్రీకారం చుట్టారన్నది వారి అభిప్రాయం. సర్పంచుల సంఘం పేరుతొ న్యాయస్తానంలో కేసు వేయించడం వెనుక ప్రభుత్వ హస్తం వుందని, కర్నాటకకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మన రాష్ట్రానికి అన్వయించడం సరికాదని బీసీ నాయకుల వాదన.


రాష్ట్రంలో బీసీ జనాభాకు సంబంధించిన వివరాలు 2001 లో నిర్వహించిన మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడయ్యాయి. ఆ సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో బీసీలు 43 శాతానికి మించి వున్నట్టు తేలింది. బహుశా కడచిన ఈ పదేళ్లలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఈ జనగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 43 శాతానికి పెంచాలన్నది ఆ సంఘాల నేతల అంతరంగంగా కానవస్తోంది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలన్నది కూడా వారి అభిప్రాయంగా వుంది. ఇంత భారీగా కోరడంలో భావ్యత, సంభావ్యత అటుంచితే,
చావుకు  పెడితే లంఖణానికయినా వస్తుందన్న నానుడి ప్రకారం బీసీలకు ఏదో ఒక మేరకు లబ్ది చేకూరగలదన్నది వారి భావన కావచ్చు.


మరో విషయం ఏమిటంటే - కర్నాటకలో ఈ రకమయిన సర్వే అప్పట్లో జరగలేదు. ఆ కారణంగా సుప్రీం తీర్పు మన రాష్ట్రంలో చెల్లుబాటు కాదని చెప్పడానికి కూడా వీలుంది.


ఎన్నికలపట్ల ఆసక్తి లేకపోయినా బీసీల పట్ల లేని ప్రేమను ఒలకబోయడానికి సరయిన అదునుగా భావించి ఎస్టీలకు 8.2 శాతం, ఎస్సీలకు 18.30 శాతం,బీసీలకు 34 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఒక జీవోను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ సర్పంచుల సంఘం తరపున రామ్మోహన రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కు తొలిదశలోనే ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజులు విచారణ జరిపిన హైకోర్ట్ సింగిల్ జడ్జి -రిజర్వేషన్ శాతాల విషయంలో జోక్యం చేసుకోలేమని తెలుపుతూ, ఆ పిటీషన్ ను తోసిపుచ్చారు. స్తానిక సంస్తల ఎన్నికలను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేయడంతో ఇక ఎన్నికలకు మార్గం సుగమం అయినట్టేనని అంతా సంతోషించారు. తమ హక్కులకోసం పోరాడుతున్న బడుగులు ఆ తీర్పును తమ తొలి విజయంగా భావించారు. ఇది జరిగింది ఈ నెల 14 తేదీ మంగళ వారం నాడు. కోర్టు తీర్పు గురించి తెలియగానే, ఎన్నికల నిర్వహణకు తాము సంసిద్ధంగా వున్నామనీ, అయిదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ , జులై 21 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామనీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమాకాంత రెడ్డి ప్రకటించారు కూడా.


ఇరవై నాలుగ్గంటలు గడవకముందే పరిస్తితి తలకిందులయింది. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ ఎదుట పిటీషన్ దాఖలు కాకముందే , ఆ మరునాడే అంటే బుధవారంనాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి జీవోను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని విచారించింది. పిర్యాది తరపు వాదనలు విన్న ధర్మాసనం జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దశలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎలాటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


న్యాయస్తానం ఉత్తర్వుల ధర్మమా అని స్తానిక సంస్తల ఎన్నికలకు బ్రేక్ పడ్డట్టయింది. రోగి కోరిందే వైద్యుడు ఇచ్చినట్టయింది.


కోర్టు తీర్పు దరిమిలా రాష్ట్ర ఎన్నికల సంఘం తన వైఖరిని సవరించుకుంది. ప్రభుత్వం రిజర్వేషన్ లు ప్రకటించే వరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే, ప్రభుత్వం తలచుకుంటే నాలుగయిదు రోజుల్లో ఈ విషయంలో నోటిఫికేషన్ జారీచేయవచ్చంటూ రమాకాంతరెడ్డి బంతిని ప్రభుత్వం కోర్టులోకి నెట్టేశారు.
ఏతావాతా ఏమయితేనేం మొత్తం మీద స్తానిక పోరుకు తెర పడిందనే అనుకోవాలి.
కోర్టు తీర్పులను పాలక పక్షాలు తమకు అనువుగా మలచుకోవడానికి ప్రయత్నించడం కొత్తేమీ కాదు. ఎన్నికలు వాయిదా వేయడానికి వీలయిన కారణాల అన్వేషణలో వున్న ప్రభుత్వానికి హై కోర్టు డివిజన్ బెంచి తీర్పు ఊరట ఇచ్చింది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లితీరుతుందనీ, కోర్టు జోక్యంతో ఎన్నికలు వాయిదాపడే అవకాశం వుందని ఆలోచించే ఉభయతారకమయిన ఈ ఎత్తుగడకు ప్రభుత్వం పూనుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ రిజర్వేషన్ లపై ఎవరయినా కోర్టుకు వెళ్ళిన పక్షంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుందని మంత్రి జానారెడ్డి అంతకు చాలా రోజులముందు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పేర్కొన్నాయి.
కాకపొతే ఈ ఎన్నికలు సర్కారుకు అవసరం లేకపోయినా ఆ అవసరం జగన్ పార్టీకి వుంది. అందుకే ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన రెడ్డి ఒక సరికొత్త కోటా ప్రతిపాదన ముందుకు తెచ్చారు. సుప్రీం తీర్పుకు భంగం కలగకుండానే బీసీలకు 34 శాతం కోటా అమలు చేయవచ్చన్నది దాని సారాంశం. బీసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ లు కల్పించాలని వాదిస్తున్న రాజకీయ పార్టీలు – జనరల్ స్తానాల్లో సయితం బీసీ అభ్యర్ధులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించవచ్చన్నది ఆయన అభిప్రాయం. ఆ విధంగా చేస్తే సకాలంలో ఎన్నికలు జరుపుకోవచ్చనీ, ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని జగన్ మోహన రెడ్డి సలహా ఇచ్చారు. ఆయనకున్న రాజకీయ అవసరాల దృష్ట్యా ఆయన ఈ విధమయిన సూచన చేసి వుండవచ్చు. అన్ని పార్టీలు దీనికి కట్టుబడి నిర్దేశిత జనరల్ సీట్లలో బీసీ అభ్యర్ధులను పోటీకి నిలబెట్టినప్పుడే బీసీలకు న్యాయం జరిగే వీలుంటుంది. అలాకాకుండా జనరల్ స్తానాల్లో కొన్ని పార్టీలు బీసీలను నిలబెట్టి, మరి కొన్ని పార్టీలు ఆర్ధిక,సామాజిక బలాలు దండిగావున్న అభ్యర్ధులను పోటీకి పెడితే ఉపయోగం వుండదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ బీసీల పట్ల సానుభూతి ఒలకబోస్తుంది. వారికి రాజకీయ అధికారం అప్పగించడమే తమ ధ్యేయమని బల్ల గుద్ది చెబుతుంది. తీరా సమయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గి బీసీలకు మొండి చేయి చూపడం వాటికి మామూలయిపోయింది. రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి కొరవడితే ప్రధాన పక్షాల పబ్బం గడవడం మినహా ఈ ప్రతిపాదన వల్ల బీసీలకు ఒరిగేదేమీ వుండదు. పైగా బీసీల ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశం ఇది.
రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాల్స్సిన హక్కుని ఇతరుల దయాదాక్షిణ్యాల ద్వారా పొందడం వారికి రుచించక పోవచ్చు.
అయితే, ఇక్కడ ఒక విషయాన్ని గమనంలో వుంచుకోవడం మంచిది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకడుగు ముందుకు వేసి రెండడుగులు వెనక్కు వేయాలని వామపక్షవాదులు తరచూ పేర్కొంటుంటారు. అంతిమ లక్ష్యమయిన రాజకీయాధికారాన్ని తద్వారా రాజ్యాధికారాన్ని అడ్డదోవలో సాధించుకోవాలా లేక నిర్విరామ పోరాట పద్ధతుల ద్వారా రాజ్యాంగ బద్ధంగా పొందాలా అన్నదే ఈ నాడు బీ సీ సంఘాలముందు నిలచిన సమాధానం లేని ప్రశ్న. (17-06-2011) 

12, జూన్ 2011, ఆదివారం

ఎంతో చిన్నది జీవితం! – భండారు శ్రీనివాసరావు

ఎంతో చిన్నది జీవితం! – భండారు శ్రీనివాసరావు



స్నేహం అనేది నీటి మీద రాత కాదు రాతి మీద గీత.


ఇద్దరు మిత్రులు అడవి మార్గం లో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఓ నది దాటుతుండగా వారి నడుమ ఏదో విషయంలో వాదప్రతివాదాలు మొదలయ్యాయి.


మాటామాటా పెరిగింది. వాటిలో తీవ్రత పెరిగింది. అందులో ఒకడు కోపం పట్టలేక రెండో వాడిని చాచి లెంపకాయ కొట్టాడు.


దెబ్బతిన్నవాడు ఖిన్నుడయ్యాడు. కానీ స్నేహితుడుపై తిరిగి చేయిచేసుకోలేదు.



మౌనంగా తల దించుకుని చేతి వేళ్ళతో నీటిమీద ఓ వాక్యం రాసాడు.


“ఈ రోజు నాకు చాలా దుర్దినం. మంచి స్నేహితుడు అనుకుంటున్న వ్యక్తి నా చెంప పగలగొట్టాడు”


దెబ్బకొట్టినవాడికి స్నేహితుడు రాసినదేమిటో అర్ధం అయింది. కానీ ఏమీ మాట్లాడలేదు. ప్రయాణం సాగుతోంది. కానీ వారి నడుమ మాటలే నిలచిపోయాయి. నీటిలో నడుస్తుండగానే ఉన్నట్టుండి ఓ అల విసురుగా వచ్చింది. దాని తాకిడికి దెబ్బతిన్న వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. రెండోవాడు ప్రమాదాన్ని పసికట్టి ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న స్నేహితుడ్ని కాపాడి వొడ్డుకు చేర్చాడు.


త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నవాడికి, ప్రాణం కాపాడిన వాడికి కృతజ్ఞతలు యెలా చెప్పాలో తెలియలేదు. తీరం చేరగానే కనిపించిన ఓ రాతిపై తన మనసులోని భావాన్ని చెక్కాడు.


“ఈ రోజు నా జీవితంలో మరవలేని రోజు. నా స్నేహితుడు తన ప్రాణాన్ని సయితం లెక్క చేయకుండా నా ప్రాణాన్ని కాపాడాడు. ఈ రోజునూ, అతడు నాకు చేసిన సాయాన్నీ ఎన్నటికీ మరువలేను.”


అది చదివి ఆశ్చర్యపోవడం రెండోవాడి వంతయింది.


‘ఇదేమిటి? దెబ్బ కొట్టినప్పుడు నీటి మీద గెలికాడు. ఇప్పుడేమో రాతి మీద చెక్కాడు.’


మనసులో మెదిలిన సందేహాన్ని మనసులోనే దాచుకోకుండా స్నేహితుడి ముందు బయట పెట్టాడు.


‘చెప్పు మిత్రమా! నాతో దెబ్బతిన్నప్పుడేమో నీటిమీద రాశావు. ఇప్పడేమో రాతిమీద రాశావు. ఏమిటి ఇందులోని మర్మం.’


రెండోవాడు ఇలా జవాబు ఇచ్చాడు.


“ఎవరయినా మనల్ని బాధ పెట్టినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోకూడదు. నీటి మీద రాసిన రాత ఎంతమాత్రం నిలవదు. మరచిపోవాల్సిన విషయం కనుక అలా రాసాను. పోతే నీవు చేసిన సాయం అంటావా. ఒకరోజుతో మరచిపోయేది కాదు. జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాతి మీద గీతలా కలకాలం గుర్తుండిపోవాలి. అందుకే అలా రాశాను”


అందుకే పెద్దలంటారు.


జీవితంలో ఓ విశిష్ట వ్యక్తిని కలుసుకోవడానికి ఓ క్షణం పట్టకపోవచ్చు. వారిని గురించి ఓ అవగాహనకు వచ్చి మెచ్చుకోవడానికి మరో గంట పట్టవచ్చు. వారిని అర్ధం చేసుకుని ఆరాధించడానికి ఓ రోజు తీసుకోవచ్చు. కానీ అలాటి వారిని మరచిపోవడానికి మాత్రం మొత్తం జీవిత కాలం చాలదు.


జీవితమనేది మనకు ఒక్కసారిమాత్రమే భగవంతుడు ప్రసాదించే వరం. దాన్ని వృధా చేయకుండా జీవిత సారాన్ని పూర్తిగా అనుభవించాలి.జీవితంలో తారసపడిన వైభోగాలకు విలువ ఇవ్వవద్దు. మీ అనుకున్నవారికి, నా అనుకున్నవారికి విలువ ఇవ్వండి.


ఇతరులని ద్వేషిస్తూ కూర్చుంటే జీవితం సరిపోదు. ఎందుకంటే –


‘ఎంతో చిన్నది జీవితం!’



10, జూన్ 2011, శుక్రవారం

వయసు నవ్వింది – భండారు శ్రీనివాసరావు

వయసు నవ్వింది – భండారు శ్రీనివాసరావు




రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.


చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే. బస్సెక్కి తుర్రున వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె - నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. ఓ అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు. టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల ఊరోచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.


పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి.అరచేతిమందాన  మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.


రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్న గీత గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు నాగేశ్వర్రావులా వుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు. నవ్వుకోవడం నా వంతయింది.


రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు. తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు. కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. చూశారా నా స్పెషాలిటీ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.


రామారావుకు మెల్లమెల్లగా వయసు మీద పడుతోంది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. కానీ, ఎవరో అతికించినట్టు ఎప్పటిలాగానే పెదాలపై చెరగని చిరునవ్వు. అయితే అందులో జీవమేదీ ?


రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కాదు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.


ఎందుకంటె నా పేరు ‘వయస్సు’ కనుక. (10-06-2011)

ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు


ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు

(10-06-2011 నాటి ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)


తిరుపతి మొక్కు తీర్చుకున్న తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సజావుగా జరిగిపోవడం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నిబంధనల సాకుతో సోదిలో లేకుండా పోవడం - ఇవన్నీ ముఖ్యమంత్రికి సానుకూల పరిణామాలే. స్పీకర్ ఎన్నిక ద్వారా ‘రుజువయిన విశ్వాసం’ ఆయనలో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది. పరిపాలనపై పట్టు పెంచుకునే దిశగా ఆయనతో అడుగులు వేయిస్తోంది. రైతు సదస్సుల పేరుతొ జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పనిలో పైగా పార్టీ కార్యకర్తల సమావేశాల్లో స్వరం పెంచి మాట్లాడేలా చేస్తోంది. దీనికి ఉదాహరణ శ్రీకాకుళంలో ఆయన చేసిన ప్రసంగం. ఆ ప్రసంగంలో జగన్ అనుకూల కాంగ్రెస్ నాయకులను గురించి ఆయన చేసిన ప్రత్యేక ప్రస్తావన. పార్టీలో జగన్ కోవర్టులుగా అభివర్ణిస్తున్న వారికి ముఖ్యమంత్రి కొత్తగా ఇంటి దొంగలని నామకరణం చేశారు. ‘ఇంటి దొంగల్ని ఈశ్వరుడయినా పట్టలేడు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్న వాళ్లు దయచేసి వెళ్ళిపొండి. లేని పక్షంలో మీ పాత స్తానాలకు మేమే పంపిస్తాం.’ అన్న రీతిలో ఆయన ప్రసంగం సాగింది. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వారు కూడా శ్రీకాకుళం లో ఆయన చూపిన తెగువను చూసి ఆశ్చర్య పోయివుంటారు. బహుశా, ఆయన ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తరువాత పార్టీ లోని జగన్ అనుకూల వర్గం వారిపై ఈ విధంగా విరుచుక పడడం ఇదే మొదటి సారి. పైగా శ్రీకాకుళం జిల్లాలో జగన్ వర్గం ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందిన ధర్మాన కృష్ణ దాస్, కొర్ల భారతి ముఖ్యమంత్రి ప్రసంగించిన రైతు సదస్సుకు హాజరయిన వారిలో వున్నారు. ఆ తరువాత జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ముఖ్యమంత్రి తన విమర్శల ప్రస్తావనకు వేదికగా చేసుకోవడం విశేషం.


అయితే, ముఖ్యమంత్రి హెచ్చరికలను ‘నిస్పృహతో చేసిన వ్యాఖ్యలు’ గా రాజకీయపరిశీలకులు పరిగణిస్తున్నారు. స్పీకర్ ఎన్నికతో తన ప్రభుత్వం పట్ల శాసన సభ ‘విశ్వాసం’ రుజువయిందని సంబరపడుతున్న ముఖ్యమంత్రి, అదే నోటితో పార్టీలో ‘ఇంటి దొంగల’ ప్రస్తావన తీసుకురావడం ఆయనలోని ద్వైదీభావానికి అద్దం పడుతోందని అంటున్నారు. అలాగే, ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నియామకం ముఖ్యమంత్రి అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పైపెచ్చు అధిష్టానం ఎంపిక చేసిన బొత్స సత్యనారాయణ సాదా సీదాగా కనబడే అసాధారణ రాజకీయ నాయకుడు. సామాజిక కోణం నుంచి చూసినా లేక ఈనాటి రాజకీయాలకు అవసరమయిన ఇతర కోణాలనుంచి చూసినా బొత్స సత్యనారాయణ అన్ని విధాల ముఖ్యమంత్రికి సమ ఉజ్జీ అనే చెప్పాలి. జగన్ మోహన రెడ్డిని దీటుగా ఎదుర్కొనగల సత్తా వున్న మనిషిగా పార్టీ అధిష్టానం బొత్సను గుర్తించి పీసీసీ పీఠం అప్పగించింది. అందర్నీ కలుపుకుపోయే బొత్స తత్వం పార్టీ పటిష్టానికి ఉపయోగపడవచ్చు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు పట్ల ఆయన గతంలో వెల్లడించిన సానుకూల భావాలే పార్టీ కొత్త అధ్యక్షుడు కావడానికి సానుకూలంగా మారాయని చెప్పవచ్చు. ఒక్క వి.హనుమంతరావును మినహాయిస్తే తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులెవ్వరు ఆయన ఎంపిక పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అలాగే టీ ఆర్ ఎస్ కూడా. ఇవన్నీ ముందు ముందు బొత్సకు కలిసొచ్చే అంశాలే. దానికి తోడు, పదవి రాగానే, ఢిల్లీ నుంచి తిరిగొస్తూనే, అస్వస్తత నుంచి కోలుకుంటున్న కాకా మొదలుకుని సొంత పార్టీ – ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసి కొంగొత్త భ్రమలతో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న చిరంజీవిని కూడా ఇంటికి వెళ్లి కలిసి తనతో కలుపుకోగల కలుపుగోలుతనం బొత్స సొంతం.


సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి ఉత్తరాంధ్రకు చెందిన బొత్సకు అధిష్టానం పీ సీ సీ అధ్యక్ష పీఠం అప్పగించడానికి ఇతరత్రా కారణాలు కూడా వున్నాయి. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలవరపెడుతున్న అంశాలలో తెలంగాణాతో పాటు అంతటి ప్రాధాన్యం కలిగింది జగన్ మోహన రెడ్డి స్తాపించిన కొత్త పార్టీ. ఈ పార్టీవల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ భవితవ్యానికి ఎదురుకాగల ముప్పు ఎలాటిదన్నది కడప ఉప ఎన్నికలలో ఎదురయిన ఘోర పరాజయంతో దానికి అర్ధం అయింది. పైకి ఎన్ని బీరాలు పలుకుతున్నా రాష్ట్రంలో ఆ పార్టీని ఎదుర్కోవడం రాజకీయంగా కాంగ్రెస్ కు పెనుసవాలే అన్నది ఆ పార్టీ నాయకులే ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరిస్తున్న సత్యం. అందుకే, కడప ప్రభావాన్ని కనీసం ఉత్తరాంధ్రలోనయినా నిలువరించగలిగితే రానున్న ఎన్నికల నాటికి కాంగ్రెస్ పడవను వొడ్డు ఎక్కించవచ్చన్నది ఆ పార్టీ వ్యూహంగా కానవస్తోంది. ఉత్తరాంధ్రలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న బొత్స ద్వారా కొంత మేరకయినా నష్టాన్ని పూడ్చుకోవడం అన్నది ఆ పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా తోస్తోంది. వై ఎస్ జగన్ హవాకు అడ్డుకట్ట వేయడం ప్రధాన కర్తవ్యంగా మారిన కాంగ్రెస్ అధిష్టానం కంటికి బొత్స అవసరానికి పనికి వచ్చే తురుపు ముక్కగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.


రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ పట్ల బొత్స అనుసరిస్తున్న వైఖరి కూడా బొత్సకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదపడి వుంటుంది. రాజశేఖరరెడ్డికి అనుంగు శిష్యుడయిన బొత్స- తన విధేయతను కానీ, విశ్వాసాన్ని కానీ ఆయనవరకే పరిమితం చేసి, ఆయన అనంతరం జగన్ మోహన్ రెడ్డిని ఎడంగా వుంచి వ్యవహరించడం అప్పట్లో వై ఎస్ అభిమానులకు కొరుకుడు పడలేదు కూడా. కానీ, ఇప్పుడదే అధిష్టానం వద్ద మార్కులు సంపాదించడానికి బొత్సకు ఉపయోగపడిందని అనుకోవాలి.


అయితే, ఆయనలోని చొరవా చురుకుదనం ఎలాటి ముఖ్యమంత్రికయినా ఇబ్బంది కలిగించే లక్షణాలే. క్రమంగా బలపడుతున్నానన్న ఆశలు కదలాడుతున్న తరుణంలో జరిగిన బొత్స నియామకం కిరణ్ కుమార్ రెడ్డికి ఏ విధమయిన బలమిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటె, సహజంగా మాటకారి అయిన బొత్సను, ముభావంగా ముక్తసరిగా మాట్లాడే ముఖ్యమంత్రితో పోల్చిచూసుకోవడం మొదలవుతుంది. పైపెచ్చు, రాజకీయ పరమపద సోపానపఠంలో నిచ్చెనలన్నీ త్వరత్వరగా ఎక్కేసి మరెన్నో ఎత్తులకు ఎదగాలన్న కాంక్ష బలంగా వున్న బొత్స తదనుగుణంగానే రాజకీయ ఎత్తులకు పూనుకుంటే ఆశ్చర పడాల్సింది ఏమీ వుండదు. పీ సీ సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా వుండాలని బొత్స పట్టుబట్టడం వెనుక ఏదయినా ముందు చూపు కూడా వుండివుండవచ్చు. సీ ఎం కావాలన్న కోరికను కూడా దాచుకోని నైజం ఆయనది.


మామూలు పరిస్థితుల్లో అయితే పీసీసీ అధ్యక్ష పీఠం అన్నది అలంకారప్రాయమే. ఎన్నికల సమయంలో మాత్రం ఈ పదవికి ఎంతో కొంత ప్రాధాన్యత వుంటుంది. పార్టీ అభ్యర్ధుల ఎంపిక సమయంలో కొందరి విషయంలో నయినా పీసీసీ అధినేత మాట చెల్లుబాటు అయ్యే అవకాశం వుంటుంది. ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వుంది. పోనీ, స్తానిక సంస్తల ఎన్నికలయినా కనుచూపు మేరలో వున్నాయనుకుంటే, ఆ ఆశ కూడా కనబడడం లేదు. కడప ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో స్తానిక సంస్తల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంటుందనే ఆశలు ఆవిరవుతున్నాయి. పాలక వర్గాలు రద్దయిన స్తానిక సంస్తలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించే ఆర్డినెన్స్ ఇవ్వాళో రేపో జారీ అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో అనుభవంలోకి వచ్చిన ఉద్రిక్త క్షణాలు ముఖ్యమంత్రిని ఇంకా కలవరపెడుతూనే వుండి వుండవచ్చు. ఆ ఎన్నికలో సాధించిన విజయం కేవలం సాంకేతిక మైనదే అన్న విషయం ఆయనకు తెలియంది కాదు. ప్రజారాజ్యం విలీనంతో పెరిగిన బలం, మజ్లిస్ పార్టీ మద్దతు, అనర్హత వేటు పడుతుందన్న భయంతో జగన్ అనుకూల వర్గీయులయిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వత్తాసు పలకడం – అధికార పార్టీ అభ్యర్ధుల గెలుపుకు దోహదం చేసాయి. అయినా కూడా రావాల్సిన వోట్లకన్న అత్తెసరు వోట్ల ఆధిక్యం మాత్రమే లభించడం ఆ పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేసింది. ప్రస్తుతానికి బయటపడినా ముందు ముందు మరోసారి ఇదే పరీక్ష ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అవిశ్వాసం అనే కత్తి ముఖ్యమంత్రి నెత్తిమీద వేలాడుతూనే వుంటుంది. మరో అగ్ని పరీక్ష తెలంగాణా రూపంలో తయారుగా వుంది. (09-06-2011)


7, జూన్ 2011, మంగళవారం

Cong's "Chanakya neeti" on T-issue - Bhandaru Srinivas Rao (I.I.S.)

Cong's "Chanakya neeti" on T-issue - Bhandaru Srinivas Rao (I.I.S.)


During last one week two major political developments took place. One

is the ‘no confidence’ motion moved by Telugu Desam in the Assembly

convened to elect Speaker and Deputy Speaker, while the second being

the Congress high command’s decision to appoint one of their senior

member hailing from north coastal Andhra (Vizianagaram), Botsa

Satyanarayana, as APCC Chief. Added to these two is the state party

in-charge and Union Minister Ghulam Nabi Azad’s statement on

pot-boiling Telangana issue, generated enough heat.

First, let us look at the no-confidence motion moved by the main

Opposition Telugu Desam. The way it has been moved, in fact, raised

many eyebrows. Aware of the legislature rules, the TDP made light of

the issue, by handing over the letter two days in advance, only to

face Opposition wrath. Perhaps, my media colleague and MLC, Prof

Nageshwar, was right saying it was for media conception. While

finding fault with technicalities, he said in the same breadth that

the TDP may as well handover another ‘no-confidence’ letter an hour

before the session begins to the Secretary. As expected, the TDP has

given on the day when Speaker and Deputy Speaker of the Assembly being

convened last Saturday.


As expected the government conveniently ‘ignored’ it by the Speaker

adjourning the House sine die. But as per Rules, Prof Nageshwar,

argues that the ‘no-confidence motion’ should have been entertained by

even the Pro-tem Speaker. The main Opposition had also come under

fire for not pressing for it, though its leader, Nara Chandrababu

Naidu, got opportunities twice. However, the TDP realizing the fact

that they got exposed, rushed to Raj Bhavan to lodge a complain as

well request the Governor ESL Narasimhan to reconvene the assembly.


Meanwhile, the newly-elected Speaker Nadendla Manohar’s tacit denial

that the ‘no confidence’ motion moved by the TDP had not come to his

notice, not only sounds ridiculous, but absurd. On Speaker’s remarks,

Prof Nageshwar, also made it clear ruling out legal remedy to it. As

per rules, the Speaker cannot shirk his responsibility, but if he does

by quoting earlier parliament precedents or practices, none can help.


Whether Speaker acted on government’s directions or not, the message

is clear and loud – neither the ruling Congress nor Telugu Desam – are

willing to face electorate as of today. They fear, total rout and

lack confidence. The Congress and Telugu Desam combine, in fact, yet

again succeeded to restrain their common enemy “Jagan” at bay for some

more time.

Coming to PCC chief election, optimists of separate Telangana see the

Congress high command’s move to appoint Botsa Satyanarayana as APCC

chief, as yet another major step closer to consider the state

bifurcation favorably. Whether this argument holds any water, one has

to wait and see. But, pessimists look at it, adding Azad’s remarks, as

a move to further dilute the T-issue.

To me it appears, the Centre reluctant to spell out its decision

either way, as it wanted to further consolidate lost ground,

especially after the sudden demise of its most popular leader YS

Rajasekhara Reddy, two years ago. The Congress high command treading

cautiously, giving ‘hope’ to optimists as well pessimists and willing

to drag on still it completely come to grips with its own problems at

the Centre, especially the scams that almost wreck the UPA boat.


For Congress, the Telangana issue is certainly not in its priority

list, as it had to protect government’s survival with coalition

partners like DMK holding out threats on either 2G scam or ‘war

against corruption’ unleashed by the civic society leaders like Anna

Hazare and Baba Ramdev.


As I argued in my last article “T-issue: Is it fizzling out”, the

Congress bound to find some excuse or the other to drag on the issue,

till its MPs and MLAs dare to resign en masse, which is more unlikely,

than to become a realty. (07-06-2011)

3, జూన్ 2011, శుక్రవారం

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు


(04-06-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)


ప్రజలు గమనిస్తున్నారు అన్నది రాజకీయనాయకులు తరచుగా వాడే ఊతపదం.


ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని వారు భావిస్తున్నట్టు లేదు. బహుశా ఆ అవసరం వారికి లేదేమో కూడా. ఎందుకంటె మన దేశంలో రూపొందించుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అలాటిది మరి.


ఈ వ్యవస్థకు మూలస్తంభం ఎన్నికలు. రాజ్యాంగం ధర్మమా అని కుల,మత,వర్ణ,లింగ,వయో వివక్ష లేకుండా ప్రజలందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని తమకు నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం వుంది. కానీ, దురదృష్టం ఏమిటంటే వోటు హక్కు వినియోగించుకోవడంతో పౌరుల ప్రజాస్వామ్య ధర్మం పూర్తవుతుంది. అంతటితో వారి పని సరి. మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా ప్రజలతో పని లేదన్న సంగతి రాజకీయులందరికీ తెలుసు. పోతే, ఇక అక్కడనుంచి ప్రజాస్వామ్య రధం ఎన్నికయిన ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాలతో నడుస్తుంది. సంఖ్యలు, అంకెలు లెక్కలోకి వస్తాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం కోరలనుంచి తప్పించుకునే వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం సాగుతుంది. అంకెల గారడీలు, టక్కు టమార విద్యలు రంగప్రవేశం చేస్తాయి. ప్రజల విశ్వాసంతో ఎవరికీ నిమిత్తం వుండదు. ప్రజాప్రతినిధుల విశ్వాసం వుంటే చాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల నడక నల్లేరుపై బండిలా సాగిపోతుంది.


గత ఇరవై నాలుగ్గంటల్లో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యమయిన మలుపులు తిరుగుతున్నాయి. రాజ్యాంగంలోని సాంకేతికతలను అడ్డం పెట్టుకుని తమదే పై చేయి అనిపించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ విషయంలో ఆరితేరిన కాంగ్రెస్ ఈ పాచికలాటలో ఇంతవరకు ముందంజలో వుంది.


దాదాపు రెండేళ్లుగా నిష్క్రియాపియత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన పాలక పక్షం లోని వ్యూహకర్తలు, తాము పదిలంగా దాచిపెట్టిన అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. వైరి పక్షం వూహలకు అందని వేగంతో పావులు కదుపుతున్నారు. ఎన్నాళ్ళబట్టో అటకెక్కించి వుంచిన పదవుల పందేరానికి వున్నట్టుండి తెర తీసారు. అదీ ఎంతో వ్యూహాత్మకంగా. స్పీకర్ ఎన్నిక పేరుతొ హడావిడిగా శాసన సభ సమావేశాలను ఏర్పాటుచేసారు. డిప్యూటీ స్ప్పీకర్ నాదెండ్ల మనోహర్ తో ఒక రోజు ముందుగానే రాజీనామా చేయించారు. దానితో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు లేని పరిస్తితి ఏర్పడింది. గవర్నర్ తో ప్రమేయం లేని రీతిలో, గత శాసన సభ సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా జాగ్రత్త పడడాన్ని బట్టి చూస్తే చాలా ముందుగానే కాంగ్రెస్ తన వ్యూహరచన చేసుకున్నట్టు అర్ధం అవుతోంది. ఈ సమయంలోనే, తెలుగుదేశం పార్టీ మహానాడు ముగింపులో చేసిన ప్రకటనకు అనుగుణంగా కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. కానీ అలా ఇచ్చే సమయానికి దాన్ని తీసుకోవాల్సిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు ఖాళీ. నోటీసు ఇవ్వడానికి అసెంబ్లీకి వెళ్ళిన తెలుగుదేశం శాసన సభ్యులు చాలాసేపు వేచి చూసి, ఇక చేసేదేమీ లేక అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చి వెనుదిరగాల్సివచ్చింది. దానితో ఆ నోటీసు సాంకేతికంగా చెల్లుబాటు కాదన్న వాదన బయలుదేరింది. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు స్పీకర్ కు ఇచ్చిన నోటీసునే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఎన్నిక అనంతరం తిరిగి అదే నోటీసు ఇవ్వాల్సి వుంటుంది. దానిని పరిశీలించి అనుమతించడానికి కొత్త స్పీకర్ పది రోజులు వ్యవధి తీసుకోవచ్చని మరో సాంకేతిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంటే శాసన సభ మరో సారి సమావేశం అయ్యేదాకా టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అసెంబ్లీ అలమరా లోనే వుండిపోయే అవకాశం వుంది.


స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తంతు ముగిసిన తరువాత వారిద్దరినీ శాసన సభ అభినందించే కార్యక్రమం మొదలవుతుంది. సభావ్యవహారాల సలహా సంఘం సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. స్పీకర్ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన ఒకరోజు సమావేశంలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు మృగ్యంగా కనబడుతున్నాయి. ఈ విషయం పూర్తిగా కొత్త స్పీకర్ విచక్షనాధికారానికి లోబడి వుంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే, జగన్ బలం ఎంతో లెక్కలు తేల్చుకోవాలని గట్టిగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా కోరుకున్న పక్షంలో కొత్త స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టే అవకాశం వుంటుంది. అలా జరగని పక్షంలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి వున్న ప్రస్తుత నిబంధనలను అడ్డం పెట్టుకుని శనివారం సభ ముగిసిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేసి ప్రోరోగ్ చేస్తే మళ్ళీ అవకాశం లభించేది వర్షాకాల సమావేశాల్లోనే. బీరాలు పలికిన పార్టీలన్నీ అప్పటిదాకా వేచిచూడాల్సిందే.


రెండు రోజులుగా నిబంధనల పేరుతొ నడుస్తున్న ఈ తంతును పరికిస్తున్నవారికి ఒక విషయం ఇట్టే అర్ధం అవుతుంది. ఇదంతా జగన్ పార్టీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ పన్నిన పధకంగా తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినట్టూ అవుతుంది. సాంకేతిక కారణాలతో దాన్ని అనుమతించనట్టు అవుతుంది. రోగి కోరిందే వైద్యుడు ఇవ్వడం అంటే ఇదే కాబోలు.


మహానాడుతో కొత్త జవసత్వాలు పుంజుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు - కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని, చాలినంత బలం లేకపోయినా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ పెట్టాలని రెండు కీలక నిర్ణయాలను ప్రకటించి రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించారు. అనుకున్నదే తడవుగా స్పీకర్ పదవికి మాజీ మంత్రి కేఈ కృష్ణ మూర్తినీ, డిప్యూటీ స్పీకర్ పదవికి మరో మాజీ మంత్రి సుద్దాల దేవయ్యను
అభ్యర్ధులుగా ప్రకటించి ఆటలో తానూ వెనకబడిలేనన్న సంకేతాలను ఇచ్చారు. బీసీ, ఎస్సీలపట్ల తమ పార్టీకి వున్న చిత్తశుద్ధిని ఈ విధంగా వెల్లడించుకున్నారు. ఈ పరిణామం సహజంగానే కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టింది. పాలక పక్షం తన ధోరణి మార్చుకోకుండా సీమాంధ్ర వారికే పదవుల పందేరంలో పెద్ద పీట వేస్తోందని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలకు దిగారు కూడా. పార్టీలోని సొంత శాసన సభ్యులు కొందరు సయితం ఈ ఆరోపణలతో గొంతుకలిపారు. వీటికి తోడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఇటీవల పులివెందుల నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో శాసన సభకు ఎన్నికయిన వైఎస్ సతీమణి విజయమ్మ అసెంబ్లీ సభ్యురాలిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పదమూడు మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఆవిడ వెంట తరలి రావడం కూడా పాలకవర్గం లొ చర్చనీయాంశం అయింది. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయడం కొత్త కాకపోయినా, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో, అంతమంది శాసన సభ్యులు కట్టగట్టుకుని బాహాటంగా వైరి పక్షం నేత వెంట నడవడాన్ని ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి అందరూ కలసి రావాలని పాలక పక్షం తరపున ఇతర పార్టీలకు విజ్ఞప్తులు చేయడం జరిగింది.


తగినంత బలం వున్నప్పటికీ, ఒకేసారి, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం ఎడుర్కొవాల్సిరావడంతో, చేతిలో వున్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వొదులుకునే స్తితిలో ఆ పార్టీ వున్నట్టు కనబడడం లేదు. కాంగ్రెస్ శాసన సభ్యులలో వున్న జగన్ సానుభూతిపరులతో కలసి మరికొందరు చేయి కలిపి అనర్హత వేటుకు సిద్ధపడితే, పరిస్థితులు మరోరకంగా మారే అవకాశాలు వుంటాయన్న భయం దాన్ని వేధిస్తూ వుండవచ్చు.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నిలబెట్టే అభ్యర్ధులకు జగన్ పార్టీ లేదా ఆయనతో వున్న శాసన సభ్యులు మద్దతు ఇవ్వాలనేది కూడా వ్యూహాత్మక ప్రతిపాదనే. ఎందుకంటె ఓడిపోతే జగన్ వర్గంపై అనర్హత వేటు పడుతుంది. తెలుగుదేశానికి ఓడిపోయామన్న నామర్దా తప్ప వేరే నష్టం లేదు. జగన్ ఇంతవరకు తనకుందని చెప్పుకుంటున్న బలం ఏపాటిదో జనాలకు తెలిసిపోతుంది. గెలిస్తే మాత్రం పాలక పక్షం సభావిశ్వాసం కోల్పోయినట్టు అవుతుంది. ప్రభుత్వం కూలిపోవచ్చు. కానీ వెనువెంటనే మధ్యంతర ఎన్నికలు వచ్చే వీలు లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ సభ్యుల మద్దతు వుందని ముందుకు వచ్చే నాయకుడికి గవర్నర్ అవకాశం ఇవ్వవచ్చు. కానీ, దరిమిలా శాసన సభ రద్దయినా, దానిని సుప్తచేతనావస్థలో వుంచినా – తెలుగు దేశం తరపున గెలిచిన వ్యక్తే శాసన సభ స్పీకర్ పదవిలో కొనసాగుతారు. బహుశా ఇదే కారణంతో వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరిస్తోందని భావించాలి.


కడప ఉప ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువు ప్రతిష్టలను మళ్ళీ ఏదో ఒక మేరకు పూరించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నిబంధనలను అడ్డం పెట్టుకుని ఆడే ఈ ‘నెంబర్ గేమ్’ కు తెర తీసిందని అనుకోవాలి.

అసలు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందో రాదో తెలియని స్తితిలో సభలో పార్టీల బలాబలాలనుగురించీ, తీర్మానం గెలుపోటములు గురించీ చర్చించుకోవడం - జరగని పెళ్ళికి బాజాలు వాయించిన చందమే కాగలదు. (03-06-2011)


 

28, మే 2011, శనివారం

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

(28-05-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం) 

రాష్ట్ర రాజకీయాలు దశాదిశా తెలియని స్తితిలో నాలుగు రోడ్ల కూడలిలో చతికిలపడి వున్నాయి.

ప్రధాన పార్టీల్లో పాలక పక్షం కాంగ్రెస్ ది ఒక విచిత్రమయిన స్తితి. అధికారంలో వున్నామా లేదా అని ఎప్పటికప్పుడు గిల్లి చూసుకోవాల్సిన పరిస్తితి. ప్రజలు పగ్గాలు ‘చేతి’కిచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. మామూలుగా అయితే మన్నూ మిన్నూ ఏకమయ్యేలా సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం. రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలు గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన తరుణం. పత్రికలనిండా ప్రకటనలతో హోరెత్తించాల్సిన సమయం. కానీ అంతా గుప్ చుప్. అంతటా నీరవ నిశ్శబ్ధం. దీనికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న కడప గడపలో మాడు బొప్పికట్టేలా తగిలిన దెబ్బ. దెబ్బ తగులుతుందని తెలిసినా కాచుకోలేని దుస్తితి. ఇంత గట్టిగా తగులుతుందని ఊహించలేని నిస్సహాయ స్తితి. ఏదయితేనేం దెబ్బకు ఢిల్లీ దిగివచ్చింది. కేంద్రంలో ఆరోగ్య శాఖ చూస్తున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ పార్టీకి సోకిన అనారోగ్యాన్ని సరిచేయడానికి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. ఆ రెండ్రోజులు రాష్ట్ర రాజధానిలో సందడే సందడి. గొంతెమ్మ కోర్కెలతో కొందరు, గొంతువరకు దిగమింగుకున్న ఆగ్రహంతో మరికొందరు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో, చిన్నాచితకా నాయకులతో ఆజాద్ మంతనాలు ఏకధాటిగా సాగాయి. ఏదో జరగబోతోందన్న భ్రమలు కల్పించాయి. కానీ ఆయన చేతిలో మాత్రం ఏముంది. అసలు మంత్ర దండం హస్తినలో వుంది. రోగ నిర్ధారణ చేయగలరేమోకానీ, రోగనిదానం తన చేతులో లేదన్న విషయం ఆయనకూ తెలుసు. అందుకే చెప్పాల్సిన నాలుగు ముక్కలు పర్యటన చివర్లో ముక్తసరిగా మీడియాకు చెప్పేసి ఢిల్లీ విమానం ఎక్కేసారు. కాంగ్రెస్ కధ తెలిసిన వారికి ఇక చెప్పే కధ ఏముంటుంది. షరా మామూలు ప్రకటనలు. షరా మామూలు ఊహాగానాలు. ముఖ్యమంత్రికి క్లాసు తీసుకున్నారనీ, సహచర మంత్రులతో వ్యవహార శైలిని మార్చుకోవాలంటూ సలహా ఇచ్చారనీ రకరకాల కధనాలు. అసలు ముఖ్యమంత్రినే మారుస్తున్నారంటూ పలురకాల ప్రచారాలు. ఇంతాచేసి ఆజాద్ వచ్చి సాదించింది ఏమిటంటే సున్నకు సున్న హళ్లికి హళ్లి. ఆయన పరిస్తితీ అంతంత మాత్రమే. ఆజాద్ ఇంచార్జ్ గా వున్న తమిళనాడు ఎన్నికల్లో ఏమిజరిగిందో ఎవరికి తెలియంది కనుక.



ఇక తెలంగాణా వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి వొదలని మరో తలనొప్పి. అయితే ఇది కాంగ్రెస్ కు ఒకరకంగా శాపం. ఒకరకంగా వరం. ప్రధాన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీని మరింత ఇరుకున పెట్టడానికి రాష్ట్ర విభజన వ్యవహారం ఆ పార్టీకి కొంతమేరకు కలసివస్తోంది. తెలంగాణాను కోరుకుంటున్న టీఆర్ఎస్ కూడా ఈ విషయం లో టీడీపీ పైనే ఎక్కువగా బాణాలు ఎక్కుపెడుతోంది. ఇది ఒకరకంగా కాంగ్రెస్ కు ఊరటే. కానీ సొంత పార్టీ నాయకులు కలిగిస్తున్న ఇబ్బందులే కాంగ్రెస్ ను ఎక్కువగా ఇరకాటం లోకి నెడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య రగిలిన రగడే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సచివుల సమరానికి ఇంకా తెర పడక ముందే కేంద్రం లో మరో ఇద్దరు మంత్రులు- కపిల్ సిబాల్, జై రాం రమేష్ ల నడుమ కీచులాట తెరపైకి వచ్చింది. ఇక చెప్పేదేముంది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? కల్ల.

స్తానిక సంస్తల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతున్న మరో అగ్ని పరీక్ష. ఎన్నికలు వాయిదా వేయడానికి వీలులేకుండా సుప్రీం ఆంక్షలు. మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో గెలుపు మీద సన్నగిల్లుతున్న ఆశలు. ఏమిచేయాలో పాలుబోని స్తితి. మధ్యేమార్గంగా పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిపితే పోలా అన్న ఆలోచనలు. గెలిచినవాడే మనవాడు అనుకుంటే చిక్కేలేదు. వోడినా వోడిపోయామన్న బాధా వుండదు. వోటమికి బాధ్యతా వుండదు.


ఇక, సొంత పార్టీలో లుకలుకలా కాంగ్రెస్ కు కొత్తేమీ కాదు. పోతే, తెలంగాణా పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారం, వాళ్లు పెడుతున్న డెడ్ లైన్లు. వాటి విషయం అధిష్టానమే చూసుకుంటుందన్న ధీమా. ఏ పార్టీకి లేని అదనపు సౌలభ్యం కాంగ్రెస్ కు మరోటి వుంది. మరో మూడేళ్లదాకా అధికారం చేతిలో వుంటుంది, చేజేతులా చేజార్చుకుంటే తప్ప. అందుకే, ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి రోడ్డు కూడలిలో మరో మూడేళ్ళు నిశ్చింతగా వేచి వుండొచ్చు.

పోతే తెలుగు దేశం. తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురయిన పరాభవం నుంచి పూర్తిగా తేరుకోకముందే కడప ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని వైనం ఆ పార్టీని మరింత కుంగ తీసింది. ప్రధాన ప్రతిపక్షంగా వుంటూ ప్రజా సమస్యలను పట్టించుకుంటున్న పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అవన్నీ నీరు కారిపోతున్నాయన్న బాధ ఆ పార్టీది. ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఆ గుర్తింపును ఎగరేసుకుపోతున్నతీరును టీడీపీ ఓ పట్టాన జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి తోడు పులి మీది పుట్రలా సొంత పార్టీలో తెలంగాణ రగిల్చిన చిచ్చు. రాష్ట్రం చీలకముందే దాదాపు అన్ని పార్టీలు నిట్టనిలువుగా ఈ అంశంపై చీలిపోయాయి. రెండు కళ్ళ సిద్ధాంతంతో నెట్టుకొస్తున్న తెలుగుదేశం కూడా మినహాయింపు కాదు. నాగం ఉదంతమే దీనికి ఉదాహరణ. గండిపేట తెలుగు విజయం ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమయిన ముప్పయ్యో మహానాడు లో కూడా తెలంగాణా చిచ్చు రాజుకోకతప్పేట్టు లేదు. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన స్తితి. తేల్చుకోలేని పరిస్తితి. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ తెలుగుదేశం ఎదుర్కుంటున్న అవస్త ఇది. దీనికి తోడు వారసత్వ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలను గురించి వార్తా కధనాలు వెలువడుతూ వుండడం మరో విచిత్రమయిన పరిస్తితి. నిజమే, తెలుగు దేశం పార్టీ వయస్సులో చిన్నదేమీ కాదు. యువకులుగా వుంటూ ప్రారంభంలోనే పార్టీలో చేరిన వారు ఇప్పటికి షష్టిపూర్తి చేసుకుని వుంటారు. కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఆసన్న మయింది. అలాగని, ఈ ‘వార్’సత్వం వ్యవహారాన్ని మరింత ముదరనివ్వడం అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న ఆ పార్టీకి మేలు చేయదు. మహానాడు లోనయినా దీనికి ముగింపు పలికితే ఆ పార్టీని ఆదినుంచీ అభిమానిస్తున్నవాళ్ళు సంతోషిస్తారు. ఎవరో అన్నట్టు రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం. పార్టీని పునరుజ్జీవింప చేయాలనుకునే వాళ్లు ఈ విషయాన్ని గమనం లో పెట్టుకోవాలి.

క్రాస్ రోడ్డులో వున్న మరో పార్టీ టీ ఆర్ ఎస్. నిజానికి ఉద్యమ పార్టీ అయిన టీ ఆర్ ఎస్ కు కూడలిలో నిలబడి ఎదురుచూపులు చూడాల్సిన పని లేదు. తెలంగాణా ఒక్కటే లక్ష్యం కనుక పక్క దారి పట్టాల్సిన అవసరమూ లేదు. కానీ, కలుపుకుపోతేనే తప్ప విడిపోవాలన్న ప్రధాన ధ్యేయం నెరవేరని స్తితి దానిది. ఎప్పటికప్పుడు గమ్యానికి దగ్గరగా వస్తూ దూరం జరిగిపోతున్న అనుభవాలు ఈ పార్టీ సొంతం. బలమూ, బలహీనతలు తెలిసిన నాయకత్వం కనుక విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ, వైఫల్యాలకు ఇతర పార్టీలను బాధ్యులను చేయడం టీ ఆర్ ఎస్ ప్రధానమయిన ఎత్తుగడగా చేసుకుంది. కిందపడ్డా పైచేయి అనిపించుకోవడంలో ఈ పార్టీకి ఎవ్వరూ సాటి కాదు. పోటీ కాదు. నిర్దేశించిన గడువులను పెంచుకుంటూ పోగల వెసులుబాటు ఈ పార్టీకి వున్నట్టుగా మరొకరికి లేదు. ప్రజల భావోద్వేగాలే పునాది కాబట్టి నాలుగు రోడ్ల కూడలిలో ఎన్నాళ్ళయినా వేచివుండగల అవకాశం వుంది.

అన్న ప్రాసన రోజునే ఆవకాయ తిని అరిగించుకోగల పుష్టి పుష్కలంగా వున్నట్టు రుజువు చేసుకుంది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని వై ఎస్ ఆర్ పార్టీ. కడప ఉప ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఆ పార్టీలో అనూహ్యమయిన ఆత్మ స్తయిర్యాన్ని నింపితే, ఇతర పార్టీలలో న్యూనతా భావాన్ని పెంచి పోషించింది. తనది వాపు కాదు బలుపు అని నిరూపించుకోవాలనో ఏమో వై ఎస్ జగన్ స్వరం పెంచి మరీ సవాళ్లు విసురుతున్నారు. తన విజయం కడప గడప వరకే పరిమితం కాదని నిరూపించుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. పాలక పక్షాన్ని ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాడే ప్రధాన ప్రతిపక్ష పాత్రను తనకు తానుగా భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. కడప సమరంలో కకావికలయిన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను మరింత ఉక్కిరిబిక్కిరి చేసే క్రమంలో తన రాజకీయ ఎత్తుగడలకు రూపకల్పన చేసుకుంటున్న తీరు స్పష్టం అవుతోంది. ఏనాటికయినా జగన్ కాంగ్రెస్ పంచన చెరక తప్పదని కాంగ్రెస్ అధినాయకత్వం స్తాయిలో వెలువడుతున్న సంకేతాలను, ప్రచారాన్ని తిప్పికొట్టడాని కేమోనన్నట్టుగా జగన్ అప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు గమనార్హం. కాపురం చేసే కళ కాలిమెట్టెలు చెబుతాయన్నట్టుగా నూతన కార్యవర్గం లో తనదయిన బలమయిన సామాజిక వర్గానికే జగన్ పెద్దపీట వేసి, బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూసారన్న సణుగుళ్ళు, సన్నాయి నొక్కులు అప్పుడే మొదలయ్యాయి. పార్టీ పదవుల పంపకం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో ధక్కామొక్కీలు తిన్న పార్తీలే ఈ విషయంలో తల బొప్పిళ్ళు కట్టించుకున్న దాఖలాలు అనేకం. అయినా అనుభవం నేర్పే పాఠాల ముందు మరొకరు నేర్పే నీతి బోధలు బలాదూరే. అయితే, జనాన్ని నమ్ముకుని నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ వై ఎస్ జగన్ కు లక్ష్యం కడు దూరం లో వుంది. మధ్యలో కాడి వొదిలేయ్యకుండా ముందుకు సాగాల్సిన బరువయిన బాధ్యత కూడా ఆయన భుజస్కందాలపై వుంది. జారిపోతే, పార్టీనే జావకారిపోతుంది.

సామాజిక న్యాయం నినాదంతో ప్రజల ముందుకు వచ్చి, ప్రజా తీర్పుకు కట్టుబడివుండే ఓరిమి లేకుండా కాంగ్రెస్ లో విలీనం కావడానికి సిద్ధపడిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దశా దిశా కోల్పోయి నాలుగు రోడ్ల నడుమ దిక్కులు చూస్తోంది. నిర్దేశించుకున్న గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడానికి వీలులేకుండా ఇంజను పాడయి, ఇంధనం కరువయిన స్తితిలో ఆ పార్టీ అయోమయావస్తలో వుంది.

పోతే, వామపక్షాలు - పశ్చిమ బెంగాల్ లో ఎదురయిన ఘోర పరాభవంతో దిక్కు తోచని స్తితిలో వున్నాయి. రాష్ట్రం లో మారిపోతున్న రాజకీయ సమీకరణాల్లో తమను ఇముడ్చుకోగల రాజకీయ ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నాయి. ఏదో ఆసరాతో కూడలి దాటినా ఎక్కబోయే అధికార పీఠం అంటూ ఏమీ లేదు కనుక వేచిచూసే సహజ వైఖరిని కొనసాగిస్తున్నాయి.

రాష్ట్రం లోని రాజకీయ పక్షాలన్నీ మొత్తం మీద దిశా నిర్దేశనం దొరకని స్తితిలో వున్నాయనే చెప్పాలి. కానీ, దీనివల్ల వాటికి వాటిల్లే తక్షణ ప్రమాదం ఏమీ లేదు. కానీ, జనం మాటేమిటి? వాళ్ళిలా ఎన్నాళ్ళు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడాలి? (27-05-2011)
























21, మే 2011, శనివారం

మూడో కృష్ణుడు రానున్నారా ? – భండారు శ్రీనివాసరావు

మూడో కృష్ణుడు రానున్నారా ? – భండారు శ్రీనివాసరావు


(21-05-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)

కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ హైదరాబాద్ రానున్నారని వార్తలు వచ్చినప్పుడు ఆయన ఎజెండాలో ‘జగన్- తెలంగాణా’ అనే రెండే రెండు అంశాలు వున్నాయని అంతా అనుకున్నారు.



అయితే, రాష్ట్ర రాజధానిలో రెండు రోజులు మకాం వేసిన ఆజాద్ - చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కాంగ్రెస్ నాయకులను విడివిడిగా కలివిడిగా కలుసుకుని అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడే స్తానిక మీడియా ఆయన ఎజెండాలో ‘ముఖ్యమంత్రి మార్పు’ అనే మరో విషయాన్ని తనకు తానుగా చేర్చింది. ఆజాద్ ని కలిసి వచ్చిన వాళ్ళలో అనేకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందినవాళ్ళే మీడియా ముందు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై ఆజాద్ కు ఫిర్యాదు చేసినట్టు బహిరంగంగా చెప్పడం ఈ ఊహాగానాలకు మరింత ఊపిరి పోసింది.

ఆజాద్ హైదరాబాదులో వున్న సమయంలోనే, పార్టీ నాయకులతో, సహచర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న తీరు గురించి, కడప ఉప ఎన్నికల్లో రాష్ట్ర అధినాయకత్వం వైఫల్యం గురించి ఢిల్లీ నాయకులకు పెద్దయెత్తున ఫిర్యాదులు అందినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కార్యకర్తలు కోరుతున్నది సీ ఎం మార్పా లేక సీ ఎం లో మార్పా అని ఆజాద్ వాకబు చేసినట్టు కూడా సమాచారం. బహుశా దీన్ని దృష్టిలో వుంచుకునే కాబోలు ఆజాద్ వెంట హైదరాబాదు వచ్చిన మరో ఏ ఐ సీ సీ ప్రతినిధి కృష్ణమూర్తి ఢిల్లీ తిరిగి వెడుతూనే ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వార్తలను ఖండించారు. కిరణ్ కుమార్ రెడ్డి పై ఎలాటి ఫిర్యాదులు రాలేదని, తమను కలుసుకున్న రాష్ట్ర నాయకుల్లో ముఖ్యమంత్రిని ప్రశంసించిన వారే ఎక్కువనీ వివరణ ఇచ్చుకున్నారు.

నిజానికి ముఖ్యమంత్రి మార్పు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో నష్ట నివారణకు దోహదం చేస్తుందని అనుకోవడానికి లేదు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమయంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య మంత్రుల మార్పు పార్టీకి ఎంత చేటు తెచ్చిందో అందరికీ తెలుసు. అయినా అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకునే సంస్కృతి ఆ పార్టీలో లేదు. అందువల్లనే మళ్ళీ అదే పొరబాటు మళ్ళీ చేసి 1989 లో ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని తదుపరి ఎన్నికల్లో బంగారు పళ్ళెంలో పెట్టి తెలుగుదేశానికి అందించిన ఘనమయిన గతం కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం.

అయితే, ఆజాద్ పర్యటన లక్ష్యం ముఖ్యమంత్రి మార్పు కాదన్నది ఆయన మాటల్లోనే తేలిపోయింది. అలాగని మూడేళ్లలో ఎదురయ్యే ఎన్నికలను ప్రస్తుత ముఖ్యమంత్రి నేతృత్వం లోనే నిర్వహిస్తారా అంటే అనుమానమే. ఎవరిని ఎంతవరకు వాడుకోవాలి? ఎవరిని ఎప్పుడు విసిరి కొట్టాలి? అన్నది కాంగ్రెస్ అధిష్టానానికి వెన్నతో పెట్టిన విద్య.



మొత్తం పదిహేడు గంటల్లో రెండువేలమందిని కలుసుకున్నానని గులాం నబీ ఆజాదే పర్యటన ముగింపులో మీడియాతో చెప్పారు. అంటే తనను కలుసుకున్నవాళ్ళల్లో ఒక్కొక్కరికీ ఆయన ఇచ్చిన సమయం యాభయ్ సెకన్లకు మించదు. అయినా చాలామంది బయట మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ దూతలకు తమ మనసులోని భావాలను పూసగుచ్చి చెప్పుకోగలిగామన్న సంతృప్తిని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఈ రకమయిన భేషజాలు అతి సహజమే. మహిళా కాంగ్రెస్ నేత గంగాభవాని ఒక అడుగు ముందుకు వేసి – మరో మూడేళ్లపాటు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆజాద్ తనకు హామీ ఇచ్చినట్టు మీడియాతో చెప్పడం ఈ భేషజాలకు పరాకాష్టగా భావించాలి లేదా ఆవిడ స్వామి భక్తికి దీన్నొక మచ్చుతునకగా పరిగణించి వొదిలివేయాలి.

ఒక పక్క గుంటూరులో వేలసంఖ్యలో జనం పాల్గొన్న జగన్ రైతు దీక్ష ముగింపు సభకు జగన్ అనుకూల కాంగ్రెస్ శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అనేకమంది హాజరవుతున్న సమయంలోనే మరోపక్క హైదరాబాదులో గులాం నబీ ఆజాద్ ని కలవడానికి తిరునాళ్ళ మాదిరిగా కాంగ్రెస్ శ్రేణులు కదిలివచ్చాయి. వినదగునెవ్వరు చెప్పిన తరహాలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఆజాద్ కొనసాగిస్తూనే తన అజెండాలోని అంశాలు అంటే – జగన్ గురించీ, తెలంగాణా గురించీ ఆరా తీసారని బుల్లితెరలపై స్క్రోలింగులు పరుగులు తీసాయి. ఆయన్ని కలవడానికి వచ్చినవాళ్ళు కూడా తమ మనసులోని అజెండాని మరిచిపోయినట్టులేదు. గాడితప్పిందని అనుకుంటున్న రాష్ట్ర పార్టీ పరిస్తితులను చక్కదిద్దేందుకు అధిష్టానం పనుపున వచ్చిన ఆజాద్ ని దాదాపు అందరూ కోరిన ఒకే విషయం పదవుల పంపిణీ వ్యవహారం. పార్టీ పదవులు, నామినేటేడ్ పదవులు గురించి వేచి చూస్తూనే విలువయిన రెండేళ్ళ కాలం ఇట్టే గడిచిపోయిందని, ఇంకా ఇలానే రోజులువెళ్ళదీస్తే వచ్చేఎన్నికలనాటికి పార్టీ తరపున నిలబడే కార్యకర్తలను కూడా వెతుక్కోవాల్సివుంటుందని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ రకమయిన నాన్చుడు ధోరణి వల్ల నిస్పృహ చెందే పార్టీ శ్రేణులు అందుబాటులోకి వచ్చిన ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించే అవకాశం వుంది కాబట్టి వెంటనే ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం గురించి నొక్కిచెప్పారు.



ఆజాద్ తో భేటీని రవ్వంత బాగానే ఉపయోగించుకున్నామన్న సంకేతాలను మీడియాలోకి వొదలడంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సఫలమయ్యారనే చెప్పాలి. వారికి తీసిపోని రీతిలో సీమాంధ్ర ఎంపీలు సయితం తమ వాణిని, వాదాన్ని బలంగానే వినిపించారు. మధ్యే మార్గంగా అమలాపురం కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ - హైదరాబాదును ఉమ్మడి రాజధానిని చేసి తెలంగాణా ఇచ్చినా సమ్మతమేనన్న ధోరణిలో ఏకంగా ఒక లిఖితపూర్వక మెమోరాండాన్నే ఆజాద్ కు అందచేసినట్టు భోగట్టా. ఇక ఈసారి తెలంగాణా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, గతంలో డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన అనంతరం సీమాంధ్ర సహచరులు తమకు కొట్టిన గండిని గుర్తుపెట్టుకుని కాస్తంత గొంతు పెంచి మరీ తమ వాదాన్ని వినిపించారు. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు మినహా తమకు ఏదీ సమ్మతం కాదన్న హెచ్చరికను ఆజాద్ కోర్టులో వుంచారు. తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం అతి తొందరగా ప్రకటన చేయని పక్షంలో అసలు సిసలు అస్త్రం తమ జేబులోనే వుందని పీ సీ సీ మాజీ నేత కేశవరావు కుండ బద్దలు కొట్టారు. తన అజెండాలో తెలంగాణా అంశం వుండడంవల్లనో ఏమో ఆజాద్ కూడా ఇరుపక్షాల వాదనను శ్రద్ధగా విన్నారు.

కడప ఉప ఎన్నికల ప్రభావం పార్టీపై , ప్రభుత్వంపై ఏమాత్రం వుండదంటూ చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా వైఎస్సార్ పార్టీ గురించి పైకి పట్టనట్టు కనిపించినా, ఢిల్లీ నాయకులు మాత్రం పార్టీ శ్రేణులనుంచి తగిన సమాచారాన్నే రాబట్టినట్టు భోగట్టా.

జగన్ మోహన్ రెడ్డిని ఆదినుంచి వ్యతిరేకిస్తున్నవారు ఆజాద్ తో జరిపిన భేటీలో తమ పాత పల్లవినే మరోమారు వినిపించారు. సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు దిద్దుబాటుకు కూడా వీలులేకుండా పార్టీ దెబ్బతినిపోతుందని అధిష్టానాన్ని హెచ్చరించారు. పార్టీలో వున్న జగన్ కోవర్టులపై వెంటనే వేటు వేయాలని,

ప్రభుత్వం వద్ద వున్న అధికారాలతో విచారణలు ప్రారంభించి జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలని కూడా సలహా ఇచ్చారు.

మంత్రివర్గంలోనే జగన్ కోవర్టులు వున్నారంటూ మరో కలకలం చెలరేగింది. నలుగురు మంత్రులు జగన్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని, వారిని మంత్రివర్గం నుంచి తొలగించాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే గులాం నబీ ఆజాద్ ని కోరినట్టు పత్రికల్లో వార్తలు గుప్పుమన్నాయి. పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి, ఎంపీ మధు యాష్కీ, మంత్రి శంకర్ రావు, మాజీ మంత్రి జే సీ దివాకర్ రెడ్డి బాహాటంగా చేసిన ఆరోపణలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కొందరు మంత్రులు లోపాయికారీగా జగన్ కు సహకరిస్తున్నారన్నది వారి ఆరోపణల సారాంశం.



రెండు రోజులపాటు హైదరాబాదులో మకాం వేసి గులాం నబీ ఆజాద్ పార్టీ పరిస్తితి గురించి కొత్తగా తెలుసుకున్న విషయాలేమిటి అన్నది ఎవ్వరికీ అర్ధం కాని సంగతి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలూ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలీ ఆయనకు కొత్తేమీ కాదు. అలాగే, ఆజాద్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కొత్త కాదు. గతంలో సైతం ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి ఇప్పటి పాత్రనే పోషించి – రాజకీయ జాదూ అన్న కీర్తిని మూటగట్టుకున్నారు. కాకపొతే, రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ఏర్పడిన నూతన రాజకీయ వాతావరణానికి మాత్రం ఆజాద్ కొత్తే అని చెప్పాలి. అలాగే, వై ఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, కొత్త పార్టీ పెట్టి, ఇటీవలి కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ భవిష్యత్ పై ముసురుకుంటున్న నీలి నీడల నేపధ్యంలో రూపుదిద్దుకుంటున్న నూతన రాజకీయ చిత్రం మాత్రం ఆయనకు మరీ కొత్త అని చెప్పుకోవాలి.

అందుకే ఆయన అవసరం అయినదానికన్నా ఎక్కువ సమయమే పార్టీ వారికి కేటాయించారని అనుకోవాలి. పరిమితులు తెలిసిన అనుభవశాలి కనుక పార్టీ శ్రేణులు చెప్పిన విషయాలను ఓపిగ్గా వినడం ద్వారా వారి మనస్సులో గూడుకట్టుకుని వున్న ఆందోళనలు సమసిపోవడానికి ఒక వెంటిలేటర్ మాదిరిగా సాయపడ్డారనుకోవాలి. సమస్య తీర్చడం సాధ్యం కానప్పుడు సమస్యను వినడం ద్వారా దాని తీవ్రతను తగ్గించ వచ్చన్న సూత్రాన్ని ఆజాద్ తన హైదరాబాద్ పర్యటనలో బాగా ఉపయోగించుకున్నారు. ఆయన్ని కలిసిన ఏ ఒక్కరిని ఆయన నిరుత్సాహ పరచకపోవడమే ఇందుకు నిదర్శనం.

మొత్తం మీద ఆజాద్ హైదరాబాద్ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని కొందరు రాష్ట్ర నాయకులు సంతృప్తి పడుతున్నారు. విషయాలన్నీ అర్ధం చేసుకున్న ఢిల్లీ పెద్దలు తమ పీఠాలను ఎప్పుడు కదిలిస్తారో అని మరికొందరు కలత పడుతున్నారు.

కానీ ఒక విషయం.

వచ్చారు – విన్నారు – వెళ్లారు అనికాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆయన దిశా నిర్దేశం ఇచ్చినట్టయితే బాగుండేదని పార్టీ అభిమానులే పెదవి విరుస్తున్నారు. రైతు సమస్యలతో విపక్షాలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ పర్యటనలో పార్టీ సమస్యలు తప్ప ప్రజల సమస్యలు కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న విమర్శలను వాళ్లు ఉదహరిస్తున్నారు.

ఇక నుంచయినా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ‘జగన్నామ స్మరణ’కు స్వస్తిచెప్పి జనాలను పట్టించుకునేలా చేయగలిగితే ఆజాద్ హైదరాబాద్ పర్యటన ఫలవంతమైనదని సంతోషించవచ్చు. (21-05-2011)



13, మే 2011, శుక్రవారం

ఇది నిజం. నిజంగా నిజం – భండారు శ్రీనివాసరావు

ఇది నిజం. నిజంగా నిజం – భండారు శ్రీనివాసరావు




‘నేను చదువుకున్నవాడినన్న మాటే కాని నీకున్న ప్రపంచ జ్ఞానం నాకు లేదు’ అని ఈ మధ్య టీవీలో చూసిన ఓ సినిమాలో నిజాయితీగా వొప్పుకుంటుందొక మగ పాత్ర తన భార్యతో మాట్లాడుతూ.

క్షేత్రస్తాయి సమాచారం తెలుసుకోకుండా టీవీ చర్చల్లో పాల్గొనే కుహనా మేధావులనుంచి కూడా ఈ మాదిరి నిజాయితీని ఆశించడంలో తప్పులేదేమో. ఇప్పటికయినా వారి కళ్లు తెరిపిళ్లు పడివుంటాయేమో.

వీళ్ళతో వచ్చిన చిక్కేమిటంటే - వీళ్ళు తమ వాదమే వేదమనుకుంటారు. దాన్నే జనమంతా నమ్మాలనుకుంటారు.

కొన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. ఓ పెళ్ళిలో బాగా ఎరిగున్న ఓ ముసలావిడ కనిపించింది. ఎప్పుడు తారసపడ్డా ‘దేవుడికి నామీద దయకలగడంలేదల్లే వుంది. ఇంకెన్నాళ్లిలా బతకాలని రాసిపెట్టాడో!’ అని నిర్వేదంగా మాట్లాడుతుండేది. అలాటిది ఆరోజు ‘మరో నాలుగేళ్ళు బతికితే బాగుండు’ అనడం ఎంతో వింతగా అనిపించింది. ‘ఎందుకవ్వా?’ అనడిగితే ‘మరొక్కసారి ఆఖరుసారి వోటు వేసి చనిపోవాలనివుంద’న్నది. అదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే, స్వతంత్రం వచ్చినప్పటినుంచి ఆవిడ వోటు వెయ్యకుండా వున్న సందర్భం లేదు. ఆవిడది కాంగ్రెస్ కుటుంబం. ఆమె వొంట్లో పారేది కాంగ్రెస్ రక్తం. జనతా పార్టీ ప్రభంజనం, ఎన్టీయార్ సుడిగాలి వీస్తున్న రోజుల్లో కూడా ఆవిడ వోటు కాంగ్రెస్ కే. అభ్యర్ధి ఎవరన్నది అనవసరం. కాడి జోడెడ్ల గుర్తు నుంచి ఆవు దూడా గుర్తుకు, అక్కడినుంచి చేతి గుర్తుకు- ఆ పార్టీ గుర్తు మారిపోవడం గుర్తు పెట్టుకుని మరీ వోటు వేసేది. ఆమె గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది.

కానీ, ఆమె గురించి పూర్తిగా తెలియదన్న సంగతి మాత్రం ఆరోజు మాటల్లో బయట పడింది. ఈ మూడేళ్ళు ఎట్టాగో బతికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వోటు ‘వెయ్యకుండా’ చనిపోవాలన్నది తన ఆఖరు కోరిక అని చెప్పినప్పుడు అక్కడ వున్న వాళ్ళందరం ఆశ్చర్యపోయాము. రాజశేఖరరెడ్డి చనిపోయినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని, ఇక చస్తే ఆ పార్టీకి వోటు వెయ్యననీ ఖరాఖండిగా తేల్చిచెప్పింది. అప్పటికి వై ఎస్ జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీని వొదిలి పెట్టనూ లేదు. కొత్త పార్టీ పెట్టనూ లేదు. కాకపొతే, ఆయన తలపెట్టిన ఓదార్పు యాత్ర గురించి పార్టీలో నానా రభస సాగుతున్న రోజులవి.

కాంగ్రెస్ కు వోటు వెయ్యకుండా చనిపోవాలనివుందని ఆ ముసలావిడ చెప్పిన మాట రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితికి అద్దం పడుతోంది. కానీ, దురదృష్టం, సాధారణ జనంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కారణరహితంగా అభిమానించే వారిలో వచ్చిన ఈ మార్పుని గమనించకుండా ఇటు రాష్ట్ర స్తాయిలోనూ, అటు కేంద్రంలోనూ వున్న ఆ పార్టీ నాయకులు ఒంటెత్తు పోకడలకు పోయారు. దరిమిలా పార్టీ పట్ల ప్రజల్లో ఏర్పడ్డ ఏహ్యతే కడప ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది.(13-05-2011)