20, అక్టోబర్ 2018, శనివారం

మంచితనానికి దైవానుగ్రహం తోడయితే..... భండారు శ్రీనివాసరావు


నిన్న తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి కొంత సమయం పట్టిన మాట నిజం.
ఈ అమ్మాయి ఎవరో చెప్పడానికి ముందు కొంచెం నేపధ్యం తెలపడం అవసరం.
1992 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. అద్దె పద్దెనిమిది వందలు. వచ్చే సామాను కోసం అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో  కాపురం ఉంటున్న యాదమ్మ మా  ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం. ఈ తిరుమల అనే అమ్మాయి యాదమ్మ, మల్లయ్యల కడసారి  కుమార్తె. ఆ దంపతులకు  అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ,  తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో  మేము అనేక ఇల్లు మారుతూ వచ్చినా ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే  సందీప్, సంతోష్ అని పెట్టుకుంది.  సందీప్ ఇప్పుడు తొమ్మిదో తరగతి. ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్న అతడికి ఈ ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి  ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్  లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు. 
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
నువ్వేం చేస్తున్నావని అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్.  ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను’ అంది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!

2 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

మీ లాగా ఒక్కొక్క ఫ్యామిలీ వారికున్నంతలో ఇంకొక ఫ్యామిలీని ఎడాప్ట్ చేసుకుంటే చాలా మంది జీవితాలు బాగుపడేవి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Ramakrishna Lakkaraaju : మీరు పొరపడ్డారు. యాదమ్మ కుటుంబమే మమ్మల్ని అడాప్ట్ చేసుకుంది . మేము చాలా ఇళ్ళు మారుతూ వచ్చినా వాళ్ళు చాలా ఏళ్ళు మమ్మల్ని అంటిపెట్టుకుని వున్నారు. కనిపెట్టుకుని వున్నారు.