30, మార్చి 2016, బుధవారం

రెండు సభలు – ఒకే పాఠం

సూటిగా...సుతిమెత్తగా.... 

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 31-03-2016, THURSDAY)
    
ఈ నెల మొదట్లో ఒకే రోజున మొదలయి ఒక రోజు తేడాతో ముగుస్తున్నాయి అంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల శాసనసభల బడ్జెట్ సమావేశాలు.
ఎలా మొదలయ్యాయి, ఎలా ముగిసాయి అన్నదానికంటే ఎలా జరిగాయి అన్న ప్రశ్నకు మాత్రం షరామామూలుగా అనే జవాబే చెప్పాల్సి వుంటుంది. రెండు రాష్ట్రాల సభలు ఒకే ఆవరణలో ఒకే సమయంలో జరిగాయి కాబట్టి పోలిక సహజం. ఆమాటకు వస్తే తెలంగాణా సభే సజావుగా సాగిందని ఆంధ్రప్రదేశ్ సభలోని సభ్యులే వ్యక్తిగత సంభాషణల్లో చెప్పుకుంటున్న సంగతి సత్య దూరమేమీ కాదు. దీనికి కారణం తెలంగాణా సభలో సరయిన సంఖ్యాబలం కలిగిన ప్రతిపక్షాలు లేకపోవడం అనే వాదన కూడా వుంది. ఏదిఏమైనా తెలంగాణా సభ జరిగిన తీరే బాగుందని రెండు సభల పనితీరును టీవీల్లో చూసిన వాళ్ళు మెచ్చుకుంటున్నారు.
పైకి అంగీకరించడానికి అహం ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆంతరంగికంగానయినా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భం సూచిస్తోంది.
ఈ మధ్యకాలంలో అంటే సమైక్య రాష్ట్రంలో కూడా పద్దులపై గిలెటిన్ వేటు వేసి ‘మమ’ అనిపించడం మినహా, శాఖల వారీ పద్దులపై సభలో చర్చ జరిగిన సందర్భం గుర్తులేదు. ఈసారి తెలంగాణా శాసనసభ ఈ విషయంలో ఆదర్శప్రాయంగా నడుచుకుందనే చెప్పాలి. అంతకంటే మించి సభ్యుల ప్రవర్తనను కట్టడి చేయడంలో కూడా కొత్త పుంతలు తొక్కిందనే ఒప్పుకోవాలి. వాయిదా తీర్మానాలపై పట్టుబట్టి సమయం వృధా చేసే సాంప్రదాయానికి ఈసారి గట్టి కళ్ళెం వేసారు. పని దినాల్లో చాలావరకు ఎజెండా  ప్రకారమే సభ నడుచుకోవడం ఓ విశేషం. అలాగే శని, ఆది వారాల్లో సయితం విరామం ఇవ్వకుండా సభ నడిపిన తీరు కూడా  ఓ కొత్త ప్రయోగం. అలాగని పాలక పక్షం, ప్రతిపక్షాలపట్ల  చాలా ఉదారంగా  వ్యవహరించిందని అర్ధం కాదు. అయితే, గతంతో పోల్చి చూసుకున్నప్పుడు తెలంగాణా శాసనసభ పని తీరు బాగా మెరుగు పడిందనే అనుకోవాలి.
కాకపొతే తెలంగాణా సాగు నీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ విషయంలో   సభను వేదికగా చేసుకుని  పవర్ పాయింటు ప్రెజెంటేషన్ ఇవ్వాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కొంత వివాదాస్పదం అయింది. ఇటువంటి సాంప్రదాయం లేని మాట నిజమే అయినా గతంలో ఇలా జరిగిన సందర్భాలు లేకపోలేదు. కాకపోతే ఆ సందర్భాలు వేరు. ఉమ్మడి రాష్ట్రంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా వున్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రసంగించారు. పవర్ పాయింటు ప్రెజెంటేషన్ సాయంతో ఆయన గ్రామీణాభివృద్ధి అనే అంశంపై చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేసారు.     
అయితే అందుకోసం శాసన సభను ప్రత్యేకంగా సమావేశ పరిచారు. అందునిమిత్తం  గవర్నర్ ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేశారు. ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతి ప్రసంగాన్ని వినే సౌలభ్యం కలిగించారు.
ఈసారి అలా కాదు. ఇది ప్రత్యేక సమావేశం కాదు. అందుకే కాబోలు శాసన మండలి సభ్యులను గేలరీలకి పరిమితం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
సభలో పవర్ పాయింటు ప్రెజెంటేషన్ అన్నది నిజానికి అంత అభ్యంతర పెట్టాల్సిన అంశం కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటూ పోవడం సహజం. ఒకప్పుడు సభాకార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాల విషయంలో కూడా ఇలాగే అభ్యంతరాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడవి అందరికీ ఆమోదయోగ్యం అయ్యాయి.
పవర్ పాయింటు ప్రెజెంటేషన్ పట్ల అభ్యంతరం తెలపడానికి ప్రతిపక్షాలు వాటి కారణాలు అవి చెబుతున్నాయి. సభలో ఒక అంశం మీద చర్చ జరిగినప్పుడు, ప్రభుత్వం  తన వాదన వినిపించినప్పుడు ప్రతిపక్షాలకు కూడా అటువంటి అవకాశం వుండాలన్నది వాటి వాదన. తమ వాదనకు మద్దతుగా పవర్ పాయింటు ప్రెజెంటేషన్ ఇచ్చే వెసులుబాటు తమకూ కల్పించాలని ప్రతిపక్ష సభ్యులు కోరుతున్నారు. లేని పక్షంలో సభకు హాజరు కాబోమని సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నాయి. ఈ ప్రెజెంటేషన్  కు సంబంధించిన పెన్ డ్రైవ్ లు సభ్యులు అందరికీ ఇస్తామని, ముఖ్యమంత్రి మాట్లాడిన తరువాత విషయాలను నిపుణులతో మాట్లాడుకుని మళ్ళీ సభలో వాటిని ప్రస్తావించి, సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం వుంటుందని ప్రభుత్వం అంటోంది కానీ దానితో ప్రతిపక్షాలు సంతృప్తి పడిన దాఖలా కానరావడం లేదు. ఈ వ్యాసం రాసే సమయానికి ఈ  ప్రతిష్టంభన కొనసాగుతూనే వుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారం ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారికెవ్వరికీ రుచించని విధంగా వుంది. ఇందుకు పాలక ప్రతిపక్షాలు రెండింటిదీ సమాన బాధ్యత. అయితే  దాని స్వీకరించడానికి ఉభయులు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ సభలో రెండే రెండు పక్షాలు. ఒకరి పొడ ఒకరికి గిట్టని దాయాదుల పోరును అక్కడి పరిస్తితి తలపిస్తోంది.
సమావేశాల తొలి రోజుల్లోనే ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.సీ.పీ. అసెంబ్లీ  స్పీకర్ పైనా, రాష్ట్ర  ప్రభుత్వం పైనా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలతోనే సభ రగిలిపోయింది. సమావేశాలకు ముందు టీడీపీ తెర తీసిన ‘ఫిరాయింపుల పర్వం’, సమావేశాల చివర్లో కూడా కొనసాగడంతో  ప్రతిపక్షం ఆత్మ రక్షణలో పడిపోయింది. ఇక ప్రతిపక్ష సభ్యురాలు రోజా పై ఏడాది పాటు వేసిన బహిష్కరణ వేటు కోర్టు గుమ్మం దాకా వెళ్ళింది. ఒక దశలో ఈ వ్యవహారం శృతిమించి, రెండు రాజ్యాంగ వ్యవస్థల నడుమ అగాధం సృష్టించబోతున్నదా అనే సందేహాలను కలిగించింది. గోటితో పోయేదానికి గొడ్డలి అవసరమా అనే నానుడిని గుర్తు చేసింది. పట్టుదలలు, పంతాల నేపధ్యంలో వివేచన పక్కకు తప్పుకుంటుంది అనే పెద్దల వాక్కును రుజువు చేసింది.
మొదట్లో సంతాప తీర్మానాలు, చివర్లో అంబేద్కర్ శతజయంతి నిర్ణయాలు మినహాయిస్తే సభ జరిగిన పదహారు రోజుల్లో (బుధవారం నాటికి) ఏనాడూ సభ సజావుగా, ఓ పధ్ధతి ప్రకారం జరిగిందన్న అభిప్రాయం ఎవ్వరికీ కలగలేదు. మాటమాటకు అడ్డంకులు, అభ్యంతరాలతోనే పుణ్యకాలం గడిచిపోయింది.  సభాగౌరవానికి ఈ వ్యవహార శైలి ఎంతమాత్రం వన్నె తెచ్చేది కాదన్న వాస్తవాన్ని పాలక, ప్రతిపక్షాలు యెంత త్వరగా గ్రహిస్తే  అంత మంచిది.
అనుభవ రాహిత్యం ప్రతిపక్షానికి పెద్ద అడ్డంకి అనుకుంటే పుష్కలమైన అనుభవం వున్న పాలకపక్షానికి కూడా ఏమంత మంచిపేరు రాకపోవడం ఇందులో విశేషం. పక్కన సాగుతున్న తెలంగాణా అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష సభ్యుడిని నిబంధనలతో లొంగతీసి, హద్దులో వుంచిన తీరును ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం ఒక పాఠంగా తీసుకోవాలి. 
పొతే, ఎన్ని విబేధాలు వున్నా అటు తెలంగాణా శాసన సభ, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండూ ఎమ్మెల్యేల జీత భత్యాలను రికార్డు స్థాయిలో పెంచే ప్రతిపాదనలను  ఆమోదించాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వై.ఎస్.ఆర్.సీ.పీ.సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర రెడ్డి వ్యతిరేకించడం కొసమెరుపు.
ఇక అసలు విషయం ఒకటి బుధవారం ఏపీ  సభ ముగిసేలోగా తేలాల్సి వుంది. ద్రవ్య వినిమయ బిల్లుని సభ ఆమోదించే సమయంలో, పార్టీ మారిన వై.ఎస్.ఆర్.సీ.పీ. సభ్యులు పార్టీ జారీ చేసిన విప్ ని ధిక్కరిస్తారా లేదా అనే విషయం. గతంలో మాదిరిగానే స్పీకర్ మూజువాణీ ఓటుతో ఆమోదిస్తే ఇక చిక్కే లేదు. అది ఎలాగూ జరుగుతుంది. 
ఉపశ్రుతి:
1959 ఆగష్టు ఒకటో తేదీన  ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, గవర్నర్ ప్రసంగాని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానంగా ఒక విషయం  చెప్పారు.
“ఎవరూ చెప్పని ఒక విషయం బాగారెడ్డి గారు చెప్పారు. మిగిలినవారికి ధైర్యం లేక చెప్పలేదని నా ఉద్దేశ్యం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏమంటే ఏమో, న్యాయం అని తోచినప్పుడు కూడా పైకి చెప్పడానికి సంకోచిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చే మొత్తం (ఆదాయంలో) యాభయ్ శాతం  సాలరీల కింద ఇస్తున్నారు. వాట్ ఈజ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్? ఒక్క శాతం. పన్నులు కడుతున్న రైతాంగానికి, పల్లెతూరివారికి తెలియదు కానీ, తెలిస్తే ముఖ్యమంత్రి మొదలుకుని కిందివరకు రాళ్ళతో కొడతారు. 330  లక్షలమంది ప్రజానీకం రాష్ట్రంలో వుంటేఒక లక్షమందో, రెండు లక్షల మందో చదువుకున్నవాళ్ళమని మనం అనుకుని, వచ్చే రాబడిలో సగం మొత్తాన్ని పంచేసుకుంటూ- (వుంటే బాగుంటుందా!) ఎవరేమి అడిగినా డబ్బు లేదంటాము. కాలువ రిపేరు చేయమంటే డబ్బు లేదంటాము. విద్యుచ్చక్తి  ఇవ్వవయ్యా అంటే డబ్బు లేదంటాము. శ్రీ రామాచార్యులు గారు ధర్మల్ స్టేషన్ పెట్టండి,  రాయదుర్గం నుండి లైను వేస్తె ఎన్నో ఊర్లకి కరెంటు వస్తుంది అని అడిగితె అలాట్ మెంటు లేదని సమాధానం చెబుతాము. పాపం ప్రజలకి తెలియడం లేదు. అమాయకులుగా వున్నారు.  చదువు సంధ్యలు లేవు. వారికి లక్ష అంటే  ఏమిటో, కోటి అంటే ఏమిటో తెలియదు. వాళ్లకి మన గురించి అసలు నిజాలు తెలిస్తే మనల్ని బయటకు పంపుతారు. 'మీరూ వద్దు, మీ రాజ్యమూ వద్దు, మీ గుమాస్తాలు వద్దు. బాబూ మమ్మల్ని విడిచిపెట్టండి, మా బతుకు మేము బతుకుతాము' అంటారు. పచ్చి నిజాన్ని బాగారెడ్డి గారు చెప్పినందుకు నేను ఆయన్ని అభినందిస్తున్నాను"
ఇది ఒక ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రసంగం అంటే నమ్మడం సాధ్యమా. ఒక ప్రతిపక్ష నేత కూడా విధంగా నిజాలు మాట్లాడడానికి సాహసించడని అనుకునే రోజులివి. (30-03-2016)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

29, మార్చి 2016, మంగళవారం

ఎన్టీఆర్ పార్టీ పేరు ప్రకటించిన విధంబెట్టిదనిన


మంగళవారం సాయంత్రం రెండు ఛానళ్ళ  నుంచి ఆహ్వానాలు. ఈరోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక చర్చకు రావాల్సిందని ఎక్స్  ప్రెస్ టీవీ, టీవీ ఫైవ్ నుంచి. అయితే ఇంటికి కొంతమంది అతిధులు రావాల్సి ఉన్నందున వెళ్ళలేని పరిస్తితి.
1982 మార్చి  29 టీడీపీ శ్రేణులకే కాదు ఆనాటి నాబోటి జర్నలిష్టులకు కూడా గుర్తుండిపోయే రోజు.


ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నట్టు అప్పటికి వారం క్రితమే ఆయనే స్వయంగా సూచనప్రాయంగా విలేకరుల సమావేశంలో వెల్లడించినందువల్ల ఆ విషయానికి సంబంధించి ఆసక్తి లేదు. కానీ ఒక సినీ నటుడు పెట్టబోయే పార్టీ పేరు ఎలా వుంటుంది అన్న విషయంలోనే   అందరికీ ఉత్సుకత. పొలోమని హైదరాబాదులోని విలేకరులం చాలామందిమి ఆఘమేఘాల మీద న్యూ  ఎమ్మెల్యే  క్వార్టర్స్ చేరుకున్నాము.  పార్టీ పేరు ప్రకటనలో కూడా  ఎన్టీఆర్  ఓ కొత్తదనం చూపారు. పార్టీ ‘పేరేమిటి’ అన్న ప్రశ్నకు ‘నేను తెలుగు వాడిని, నా పార్టీ తెలుగు దేశం పార్టీ’ అంటూ జవాబు. అంతవరకూ తెలుగునాట అలాంటి పార్టీ ఉంటుందని ఊహకు కూడా అందని రోజుల్లో అటువంటి పేరు తన పార్టీకి పెట్టిన తీరు ఆ రోజుల్లో విస్మయాన్ని కలిగించింది. ‘ఇదేమి పేరు, ఒక రాజకీయ పార్టీకి ఇలాంటి పేరు పెడతారా ఎవరన్నా’ అని నొసళ్ళు నొక్కుకున్నవారు కూడా వున్నారు.
సరే! ఒక సస్పెన్సుకు తెర పడింది. ముహూర్తాల పట్ల బాగా నమ్మకం వున్న  మనిషి కాబట్టి కరెక్టుగా విలేకరుల సమావేశం   మధ్యాన్నం  రెండున్నరకి నిర్ణయించారు. అదేమో కానీ ఆ ముహూర్తం రేడియోకి బాగా కలిసివచ్చింది. ఈ వార్త సాయంత్రం ఆరుంబావు వార్తల్లో ఎలా ఇవ్వాలి, యెంత వివరంగా ఇవ్వాలి అని చర్చించుకునే వ్యవధానం మాకు దొరికింది.
అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వ్వాలే. ఎలా ఇస్తే ఏం చిక్కు వస్తుందో తెలవదు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందని పార్టీల పేర్లు రేడియోలో చెప్పడానికి వీల్లేదని కొందరి అభ్యంతరం. కానీ అప్పటికే జనంలోకి బాగా పోయిన వ్యవహారం. నిబంధనల పేరుతొ వార్త ఇవ్వకపోతే ఇంకా పెద్ద విమర్శలు వస్తాయి. చివరికి వార్త ఇవ్వాలని నిర్ణయం జరిగిపోయింది. న్యూస్ ఎడిటర్  కీర్తిశేషులు నర్రావుల సుబ్బారావు గారు ఆ వార్తను మొదటి హెడ్  లైన్ గా పెట్టాలని నిర్ణయించారు. బహుశా డీ. వెంకట్రామయ్య గారు అనుకుంటాను, ఆరోజు వార్తలు చదివింది. ఆయన  నోట రేడియోలో ఈ సమాచారం సాయంత్రానికల్లా తెలుగు నేల నాలుగు చెరగులా చేరిపోయింది.    (29-03-2016) 

       

పాత జ్ఞాపకం

34 ఏళ్ళక్రితం ఇదేరోజున తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించింది. ఆసందర్భంలో ఎన్టీఆర్ అభిమానసంఘం వాళ్ళు ఇచ్చిన పత్రికాప్రకటన.
Photo

28, మార్చి 2016, సోమవారం

అందరూ అత్తలే


అదేవిటో దురదృష్టం. కోడళ్ళకు సరే. సినిమావాళ్ళకు కూడా  అత్త అంటే పడదు. అత్త అంటే సూర్యాకాంతం లాంటి గడుసు మనిషని  అనుకునేలా సినిమాలు తీసారు. తీస్తున్నారు.  అత్తలందరికీ అసలు పేరు ఒకటి వుంటుంది కాని, గయ్యాళితనానికి మారుపేరనే పాడుపేరొకటి వారి సొంతం.  సొంతానికి సాధించింది ఏవీ లేకపోయినా పొద్దస్తమానం కోడళ్లను సాధిస్తారనే  ట్యాగ్ లైన్ మరోటి. కోడలు యెంత గుణవంతురాలయినా, నడుం దించకుండా అడవా చాకిరీ యెంత  చేస్తున్నా, 'అదేం రోగమో మా కోడలు పిల్లకు నడుం ఒంగి చావదు, చచ్చినట్టు ప్రతిపనీ నేనొక్కత్తినే చేసుకు చావాలిఅనే టీవీ సీరియళ్ల అత్తళ్ళకు కొదవ వుండదు. ఇంతకీ ఈ అత్తల పురాణం ఎందుకంటే? -
సాధించే గుణం, వంకలు పెట్టే గుణం, 'అన్ని పనులు నేనే చేస్తున్నాను, వేరేవారికి పనులు చేతకాదు' అనే అత్తల సహజ స్వభావం సమాజంలో అందరిలోను ఎంతో కొంత వుందని చెప్పడానికే.
ఏదయినా ఆఫీసరును కదిపి చూడండి. అక్షరం పొల్లుపోకుండా ఇదే సోది చెబుతాడు. 'తను తప్ప పనిచేసేవారు ఎవ్వరూ లేరనీ, అందరి పనులు తానే నెత్తికెత్తుకుని చేస్తుండబట్టే ఆఫీసు ఈ మాత్రం నడుస్తోంద'నీ అంటాడు. ఆయన కింద పనిచేసేవాడిని అడిగితే ఆయనా తన కింద వాళ్లని గురించి ఇదేవిధమైన అమూల్యాభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అంటే ఏమిటన్న మాట, అత్తలకీ వీళ్ళకీ ఏమీ తేడా లేదన్న మాట.
'ఎవ్వరూ పనిచేయడం లేదు అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని అనుక్షణం మధన పడిపోయేవాళ్లు  అడుగడుక్కీ కనిపిస్తుంటారు. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. వంకలు పెట్టే వంకర గుణం నాకూ వుంది.
ఈ మధ్య రైల్లో పోతుంటే బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞాన బోధ అయినట్టు జీవిత  సత్యం బోధపడింది. వెచ్చటి వేసవి కాలంలో చల్లటి ఏసీ కోచ్ లో అంతా ముసుగుతన్ని పడుకున్న సమయంలో, ప్రపంచం అంతా నిద్రలో జోగుతున్న సమయంలో  పట్టాలపై రైలు  అలుపులేకుండా  పరుగులుతీస్తోంది. ఏదయినా స్టేషన్ వచ్చినప్పుడల్లా రైలు దడదడా  పట్టాలు మారుతున్న ధ్వని వినబడుతూ వుంది. ఆ అర్ధరాత్రి వేళ పట్టాలు మార్చే మనిషి కాస్త ఏమరు పాటుగా వున్నా, కాసింత రెప్ప వాల్చినా రెప్పపాటు కాలంలో ఆ రైల్లోని ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తధ్యం. అంటే ఏమిటి, రైల్లో ఇంతమంది జనం హాయిగా కంటినిండా నిద్రపోగలుతున్నారు అంటే ఇంతమందికోసం ఎవరో ఒకరు ఆ నిశిరాత్రివేళ  నిద్ర లేకుండా పనిచేస్తున్నారనే అర్ధం. 'అది అతని డ్యూటీ చేయక ఏం చేస్తాడు' అంటే అతడు పనిచేస్తున్నాడు అనేకదా! కాబట్టి 'మనం ఒక్కళ్ళమే పనిచేస్తున్నాం, మిగిలిన వాళ్లు అందరూ పని దొంగలు' అని రొమ్ము విరుచుకోవడంలో అర్ధం లేదు.
అలాగే మరో ఉదాహరణ. చలి కాలం. నిద్రలేచి కూడా  లేవడానికి బద్దకించి ముసుగు తన్నిపడుకున్నవేళ, మన ఇంటి ముందు ఎవరో పాల ప్యాకెట్లు వుంచి వెడతారు. 'అవి అంత పొద్దున్నే  యెలా వచ్చాయి' అని ఒక్క క్షణం కూడా ఆలోచించం. 'ఇంటింటికీ ఇలా పొద్దున్నే వేస్తున్నాడు అంటే అతడు యెంత పొద్దున్న లేచి వుంటాడు అనే ప్రశ్న నేనయితే ఎప్పుడూ వేసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నాలోనూ కనిపించని 'అత్త' అవుంది. అదే నాచేత 'అది  అతడి డ్యూటీ' అనే మాట చెప్పిస్తుంది.  అనేది నా థియరీ. అంటే మరి అతడు తన డ్యూటీ చేస్తున్నప్పుడు 'ఎవ్వరూ పనిచేయడం లేదు' అని నేనిచ్చే స్టేట్ మెంట్లకి అర్ధం ఏమిటి?
వేడి వేడి కాఫీ తాగుతూ పత్రికల్లో వచ్చే తాజా వార్తలు  చదివే భోగం  మనకు పట్టింది అంటే ఎవరో  పిల్లాడు తెల్లవారుఝామున్నే నిద్ర లేచి, ఏజెంట్లు  ఇచ్చిన పత్రికలు సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికీ తిరిగి వేయబట్టే కదా! అలాగే తెల్లారకముందే అన్నన్ని వార్తలు మోసుకుని పత్రికలు మన ఇళ్లకు వస్తున్నాయి అంటే  పత్రికాఫీసుల్లో ఎంతమందో మనకోసం నిద్ర కాచి పనిచేయబట్టే కదా!   ఇలాగే, మన  చుట్టూ వున్న పని మనుషులు, వీధులు వూడ్చేవాళ్ళు, ఒకళ్లా ఇద్దరా అనేకమంది ఒళ్ళు దాచుకోకుండా, పనికి బద్ధకించకుండా ఎవరి పనులు వాళ్లు చేస్తూ వుండడం వల్లే, హాయిగా కాలు మీద కాలేసుకుని  కూర్చుని, 'ఎవ్వరూ పనిచేసేవాళ్ళే లేరు, నేనొక్కడ్ని తప్ప. అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని   సన్నాయి నొక్కులు నొక్కుతున్నాము.
ఒక్కటి నిజం. ఎవ్వరూ పనిచేయకుండా మనకు రోజు గడవడం లేదు. ఒక్కళ్ళూ పనిచేయడం లేదని వంకలు పెట్టకుండా కూడా రోజు గడవడం లేదు. అందుకే అన్నది, అందరిలోనూ ఎంతో కొంత 'అత్తల గుణం' వుందని.