28, జనవరి 2013, సోమవారం

సాక్షి న్యూస్ వీక్ 27th Jan

సాక్షి న్యూస్ వీక్ 27th Jan

26, జనవరి 2013, శనివారం

అభివృద్ధిపధంలో - 'భారత రిపబ్లిక్'


అభివృద్ధిపధంలో  - 'భారత రిపబ్లిక్'



దసరా,దీపావళి మొదలయిన పండగల సరసన చేర్చదగిన జాతీయ పర్వ దినాలు ఆగస్టు పదిహేను, జనవరి యిరవయి ఆరు.
పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో జాతి యావత్తు ఒక్కటై  జరుపుకున్ననాటికి  నేను నెలల బిడ్డని. రెండో పండగ- రిపబ్లిక్ డే  తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూఇటుగా నాలుగేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి.
భారత రిపబ్లిక్ కు - దానితోపాటే జాతీయ గీతం 'జనగణమన' కు షష్టిపూర్తి కూడా పూర్తయి నాలుగో ఏడు నడుస్తోంది. నిండు నూరేళ్ళు జీవించ గలిగే అవకాశం వుంటే - అరవై సంవత్సరాలు అన్నది మనుషుల విషయంలో పెద్దమాటే. కానీ ఒక జాతి జీవితంలో అరవై ఏళ్ళు ఒక లెక్క కాదు. కానీ, యే ఏటికాయేడు వెనక్కి తిరిగి చూసుకుని సాధించినది ఎంతో లెక్కలు వేసుకోకపోతే సాధించాల్సిన లెక్కలు తేలడం కష్టం. అందుకని ఈ ఏడాది ఈ పండుగ సమయంలో అందరం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు  'నడిచి వచ్చిన దారి' ని ఒకమారు పరిశీలించుకోవాల్సిన సందర్భం ఇది.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరి లో పాల్గొనే వాళ్ళం.

ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి  భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది.  'జనగణమన' గీతంలో- ఏ ఏ భాషల ప్రస్తావనవుందో, ఏ ఏ ప్రాంతాల  ప్రసక్తి వుందో మాకు తెలియదు.  ఆ గీతాన్ని ఎవరు రాసారో,  ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం. జనగణమన చరణాలలోని - '' ను '' లాగా- '' ను '' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అంటే- ‘కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలు నసిగే  రోజులు వచ్చేసాయి. పండగ దినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా ‘జనగణమన' పాడడం పోయి – ఆ  గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. భారతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండ వాదం పుట్టుకొచ్చింది.ఏటేటా జరిగే  పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్య, నిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ , జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.

సైనిక కవాతులు, శస్త్రాస్త్ర ప్రదర్శనలు, భారీ టాంకులు, వైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతను, జాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
గతమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం ఈనాటి పరిస్తితులను చూసి – మనం కోరుకున్న స్వేచ్చా భారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతో, కులాల కుంపట్లతో, ప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే-
స్వార్ధమే పరమావధిగా, సంపాదనే ఉపాధిగా, అడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా , నీతికి దూరంగా, అవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే-
జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే -
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితం, తానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే –
నిస్సహాయంగా జనం చూడాల్సి రావడం యెంత విషాదం, యెంత దారుణం, యెంత దుస్తరం, యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, ప్రపంచం గర్వించదగిన  గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై ఏళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, అప్రతిహతంగా ఎంచుకున్న మార్గంలోనే పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.

జనాభాలో అత్యధిక భాగం నిరక్షర కుక్షులయినా 'వోటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం. అక్షర జ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి. గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది. అలాగే, వీసెలు, మణుగులనుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా మైలురాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీ, ఎందుకు  పనికిరాని వాళ్ళనీ  ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్ళు - దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.

'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగ లిగాము.       

ఏ ఇంగ్లీష్ వారితో తలపడి, అహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని - దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే ,అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత మాదిరిగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పై చిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీ, నడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. ఒకదానికి మరొకటి అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

వినిపిస్తున్న సందేశం మంచిదే. విభిన్న స్వరాలే అపస్వరాలతో అసలు అర్ధాన్ని మార్చి వేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగా, ధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం రూపుదిద్దుకుంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యం, అతి సహజం. అయితే అవి  తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన భాద్యత మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండా, తప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం.

భారత రిపబ్లిక్ వార్షికోత్సవ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

25, జనవరి 2013, శుక్రవారం

బాపు గారికి పద్మశ్రీ అట! అక్కటా!


బాపు గారికి పద్మశ్రీ అట! అక్కటా!




బాపూ గారికి 'పద్మశ్రీ' పురస్కారమట. నవ్వాలో ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇన్నేళ్ళకు మన ప్రభుత్వాలకు ఆయన గుర్తువచ్చినందుకు సంతోషించాలా. బాపు అనే రెండక్షరాలతో ప్రసిద్దుడయిన మహామనీషికి మరో మూడక్షరాలు తగిలించి అదో గొప్పగా అనుకుంటున్నందుకు బాధపడాలా! అంత గొప్పవాడికి ఇవ్వడానికి ఇంత చిన్న బిరుదే దొరికిందా! బాపు గారికి దీనివల్ల వొనగూడే అదనపు గౌరవం ఏమీ లేదు. నిజానికి ఆ పురస్కారానికే గౌరవం బాపు గారి పేరుకు ముందో వెనకో పట్టుకుని వేళ్ళాడుతున్నందుకు. అందుకే, ఆ గౌరవానికి నా అబినందనలు (25-01-2013)

మన జీవితమే మనకు గురువు





మన జీవితమే మనకు గురువు

ఎక్కడో చదివినట్టు, ఏదో సినిమాలో చూసినట్టు  అనిపించే ఓ కధ ఇది.
అనగనగా ఓ అమ్మడు. పొద్దున్న బెంగళూరు వెళ్ళి ఆఫీసు పనిచూసుకుని  సాయంత్రానికల్లా   హైదరాబాదు తిరిగొద్దామని  శంషాబాదు  ఎయిర్ పోర్ట్ కు వెళ్ళింది. కాస్త వ్యవధానం వుండడంతో  ఓ ఇంగ్లీష్ నవలను,  దాంతో పాటే ఓ బిస్కెట్ ప్యాకెట్టును  కొనుక్కుని  వెయిటింగ్ హాలు కుర్చీలో తీరుబడిగా చేరగిలపడి పుస్తకం చదువుతూ ఒక్కో బిస్కెట్ తీసుకుని నోట్లో వేసుకుంటున్నతరుణంలో ఆ అమ్మడికి వున్నట్టుండి ఓ అనుమానం పొడసూపింది. పక్కన కూర్చున్న కుర్రాడు కూడా తాపీగా తన ప్యాకెట్ నుంచే ఒక్కో  బిస్కెట్టు  తీసుకుని తింటున్నట్టు అనిపించి అతడివైపు తేరిపార చూసింది. అతగాడు ఆమెను, ఆమె చూపుల్ని ఏమాత్రం  పట్టించుకోకుండా ప్యాకెట్ లోనుంచి బిస్కెట్లు తీసుకుని తింటూ చదువుతున్న పేపరులో మునిగిపోయాడు.  అలా ఇతరుల ప్యాకేట్ నుంచి  తింటూ కూడా ఏమీ తెలియని నంగనాచిలా పేపరు చదువుకుంటున్న అతడి తరహా చూసి ఆమెకు  చిరాకేసింది. మొహం మీదే కడిగేయాలన్నంత కోపం వచ్చినా  సభ్యతకోసం పైకి ఏమీ అనకుండా మిగిలిన ప్యాకెట్ ను  అక్కడే వొదిలేసి, చరచరా అడుగులు వేసుకుంటూ వెళ్ళి    బెంగుళూరు విమానం ఎక్కి తన సీట్లో సర్దుకుని కూర్చుంది.  రీడింగ్ గ్లాసులకోసం హ్యాండ్ బ్యాగు ఓపెన్ చేస్తే ఓపెన్ చెయ్యని బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. అప్పుడు కాని ఆమెకు జరిగిన పొరబాటు అర్ధం కాలేదు. నిజానికి తానే అతడి ప్యాకెట్ లోనుంచి బిస్కట్లు తీసుకున్న సంగతి తెలిసివచ్చి ‘అయ్యో ఇంకా ఏదన్నా మాట తూలాను కాదు’ అని మధనపడింది.
ప్రతికధకు ఏదో ఒక నీతి వున్నట్టే  ఈ కధనుంచి నేర్చుకోవాల్సిన నీతి కూడా వుంది.
జీవితంలో  వెనక్కు తీసుకోలేని విషయాలు  మూడు  వున్నాయి. అవేమిటంటే:
1. రాయి :  ఒకసారి విసిరితే దాన్ని మల్ళీ  వెనక్కు తీసుకోవడం కష్టం.
2. మాట : ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.
3.  కాలం :  క్షణం గడిచిందంటే  అది శాశ్వితంగా  గతంలో కలసిపోయినట్టే.
ఇంకా ఇలాటివి మరికొన్ని వుండవచ్చు. నేర్చుకునే తీరిక వుండాలే కాని జీవితమే ఈ మాదిరి  నీతి పాఠాలను నేర్పుతుంది.

(Image Courtesy :  inspired.gumnet.net)

22, జనవరి 2013, మంగళవారం

వెనక్కు తీసుకోలేనిది నోరు జారిన మాట ఒక్కటే!





వెనక్కు తీసుకోలేనిది నోరు జారిన మాట ఒక్కటే!

మాధవరావుకు ఎదురుగా ఎవరన్నా కనిపిస్తే నమిలి మింగేయాలన్నంత కోపంగా వుంది. ఆస్పత్రి కారిడారులో అసహనంగా తిరుగుతున్న తీరే ఆయన మానసిక స్తితిని తెలుపుతోంది. మద్ధ్యమధ్యలో ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేస్తున్నాడు. డాక్టర్ ఇంకా రాలేదా అని అడుగుతున్నాడు. రోడ్డుప్రమాదంలో గాయపడ్డ తన కొడుకుని తీసుకుని ఆసుపత్రికి వస్తే డాక్టర్ అయిపు లేడు.  ‘కబురు చేశాం! వచ్చి చూస్తారు’ అన్న సిబ్బంది అరకొర జవాబులు పుండు మీద కారం చల్లిన చందంగా ఆయనకు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. చుట్టుపక్కలే కాదు చుట్టుపక్కల వూళ్ళల్లో కూడా మరో ఆసుపత్రిలేదు. ఇటు కొడుకు పరిస్తితి ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. అటు డాక్టర్ లేకపోవడం ఆ ఆందోళనను ఆగ్రహంగా మారుస్తోంది.
కాసేపటికి ఎదురు చూస్తున్న డాక్టర్ వచ్చాడు. ఆయన మొహం నిర్వికారంగా వుంది. రాగానే గాయపడ్డ బాలుడి గురించి సిబ్బందిని అడిగి లోపలకు వెడుతుంటే మాధవరావుకు కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపం మాటల రూపంలో బయటకు వచ్చింది.
‘నువ్వేనా ఇక్కడ డాక్టరువి. ఇక్కడ పేషెంట్లు చావుబతుకుల్లో కొట్టుకు చస్తుంటే ఇప్పటిదాకా ఎక్కడ చక్కర్లు కొడుతున్నావు.’
సిబ్బంది మాధవరావుని వారించాలని చూసారు. కానీ ఆయన వినే పరిస్తితిలో వుంటే కదా. అతడి కళ్ళ ముందు గాయపడి రక్తంవోడుతున్న కొడుకు రూపమే కనబడుతోంది.
‘ఏం మాట్లాడవు. అవునులే ఏం  చెబుతావు. ఇదే నీ కన్న కొడుకు ఇలా ఆసుపత్రిలో పడివుంటే ఇలానే తాపీగా, నింపాదిగా  వస్తావా? అసలు  జనం ప్రాణాలంటే మీకు లెక్కలేకుండా పోతోంది’
మాధవరావు మాటల తీవ్రత పెరుగుతూనే  వుంది. డాక్టర్ మాత్రం  ఏమీ పట్టించుకోనట్టు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోవడం చూసి ఆయన అరికాలు మంట నెత్తికెక్కింది.
ఆపరేషన్ జరిగినంత సేపు మాధవరావు శాపనార్ధాలు సాగుతూనే వున్నాయి.
కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు.
‘భగవంతుడు దయామయుడు. నా మానవ ప్రయత్నానికి ఆయన పూర్తిగా సహకరించాడు. మీ అబ్బాయికి ఇక ఏం భయం లేదు, మా వాళ్ళు చూసుకుంటారు’  అంటూ ఎవరో తరుముతున్నట్టుగా వెళ్ళిపోయాడు.
మాధవరావుకు డాక్టర్ మాటలు యెంత ఉపశమనం కలిగించాయో, ఆయన అలా ఉరుకులు పరుగుల మీద బయటకు వెళ్లిపోవడం అంతే  ఆగ్రహాన్ని కలిగించింది.
‘ఛీ! ఏం డాక్టర్లు. బయట ఇంత ఆందోళనగా ఎదురు చూస్తున్న మమ్మల్ని  ఏమాత్రం పట్టించుకోకుండా, ఏదో మా ప్రయత్నం మేము చేసాము. దేవుడి దయవల్లే మీ వాడు బతికాడంటూ  పొడిపొడిగా చెప్పేసి అలా  వెళ్ళిపోతాడా? యెంత నిర్లక్ష్యం? యెంత పొగరు?’ అంటూ చిందులు వేసాడు.
నర్సు కళ్లనీరు పెట్టుకుంటూ చెప్పింది.
‘అయ్యా! మీ పిల్లవాడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మా డాక్టర్ గారిది అమృత హస్తం.  పోతే, మీరు వచ్చినప్పుడు ఆసుపత్రిలో డాక్టరు గారు లేని మాట నిజమే. ఆ సమయంలో ఆయన శ్మశానంలో వున్నారు. వొక్కగానొక్క కొడుకు రాత్రే రోడ్డు  ప్రమాదంలో అక్కడికక్కడే  చనిపోయాడు. కర్మకాండలో వున్నాకూడా,  మేము కబురు చేయగానే  అంత్య క్రియల కార్యక్రమం మధ్యలో వొదిలేసి వచ్చారు. మీ అబ్బాయికి ఆపరేషన్ చేసి మళ్ళీ మిగిలిన తంతు పూర్తిచేయడం కోసం అక్కడికే వెళ్లారు’

(నెట్లో కనబడిన ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేఛ్చానువాదం - ఇమేజ్ సొంతదారుకు కృతజ్ఞతలు)


19, జనవరి 2013, శనివారం

డస్ట్ బిన్



డస్ట్ బిన్
ఖరీదయిన మద్యం సీసాకు ఓ కరెన్సీ నోటు తారసపడింది. ఎంతో గొప్ప  గొప్పవాళ్ళు తనంటే ఎంతో మోజుపడతారు. కానీ, అదేమిటో కరెన్సీ నోటు కళ్లబడగానే వాళ్ల మొహాల్లో తెలియని ఆనందం.
మద్యం సీసా కరెన్సీ నోటుతో అంది. ‘ఏం చూసుకుని నీకా మిడిసిపాటు? నువ్వొక కాగితం ముక్కవి. ఇంకా చెప్పాలంటే  నాతో  పోలిస్తే  ఎందుకూ పనికిరాని  చిత్తు కాగితానివి.’
కరెన్సీ నోటు తాపీగా జవాబిచ్చింది.
‘నువ్వన్నది నిజమే. నేనొక కాగితాన్నే. కానీ నా జన్మలో నేనెప్పుడూ నీలా ‘చెత్త బుట్ట’ని చూడలేదు’
(19-01-2013)

చింతించి వగచిన ఏమి ఫలము ?




చింతించి వగచిన ఏమి ఫలము ?


వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే కలను సాకారం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి వోట్లు, సీట్లు కావాలి.
అందుకు మొదటి మెట్టయిన ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక వోట్లు, సీట్లు  గతంలో మాదిరిగా కాంగ్రెస్ కు రావాలి.
ఇందుకు అవసరమయితే రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలి.
ప్రజల ఆకాంక్షలమేరకు ఇలాటి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర విభజనకు పూనుకునే ప్రయత్నం చేస్తే మాత్రం  అంతకంటే అమానుషం మరొకటి వుండదు.
కిందటి ఎన్నికల్లో రెండోమారు యూపీయే అధికార పీఠం ఎక్కడానికి తోడ్పడింది రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు. ఈ సంగతి కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆ పార్టీ  అధినాయకులకు గుర్తు రాదు. కొత్త రైళ్ళు మంజూరు చేసేటప్పుడు స్మరణకు రాదు. నిధుల కేటాయింపుల సమయంలో సరేసరి.  
పోతే, జైపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశం గురించి  ‘చింతన్ శిబిర్, చింతన్ సివిర్’ అంటూ తెలుగు మీడియాలో వస్తున్న పదాలు వింటుంటే, తాము వోట్లు,సీట్లు కోరుకుంటున్న  దక్షిణాది రాష్ట్రాల  పౌరులకు కూడా  అర్ధమయ్యే రీతిలో ఈ సమావేశానికి పేరు పెడితే బాగుండేది అనిపిస్తోంది.  అందరికీ అర్ధం అయ్యే పదాలు హిందీలో కూడా వున్నాయి. ఈ  విషయం నిర్వాహకులకు గుర్తు రాకపోవడమే నిజానికి చింతించ వలసిన విషయం.
(19-01-2013)

18, జనవరి 2013, శుక్రవారం

ఈ నెల 28 న ఏం జరుగుతుంది ?



 ఈ నెల 28 న ఏం జరుగుతుంది ?

ఢిల్లీ నుంచి  గల్లీ దాకా ఇదే చర్చ. ఈ నెల 28 న ఏం జరుగుతుంది ?
తెలంగాణాకు పచ్చ జెండా చూపుతారా?
సమైక్యానికే ‘సై’ అంటారా?
‘ప్యాకేజీలతో’ సరిపుచ్చాలని చూస్తారా?
హైదరాబాదును ఏం చేస్తారు?  
అసలేమీ చేయకుండా  ఏదో నెపం, ఎవరిమీదో మోపి, తాము  చల్లగా తప్పుకుని మొత్తం సమస్యను శీతల గిడ్డంగిలోకి నెట్టేస్తారా?
అన్నీ ప్రశ్నలే. సమాధానం లేని ప్రశ్నలు. అన్ని రకాల సమాధానాలు వస్తున్న ప్రశ్నలు. ఎవరికి తోచిన జవాబు వారిస్తున్నారు. తమ మనసులోని మాటనే వాటికి  సమాధానంగా ఇస్తున్నారు. తాము ఏమి కోరుకుంటున్నారో దానికే అక్షర రూపం కల్పిస్తున్నారు.
కాంగ్రెస్ సంస్కృతిని గమనం లోకి తీసుకుంటే ఇలాగే జరిగితీరుతుందని చెప్పడానికి  వీలులేదు. కానీ ఇలా జరగొచ్చని చెప్పడానికి మాత్రం వీలుంది.
అలా వీలున్న ప్రత్యామ్నాయాలు  ఇప్పటికి ఇలా కనబడుతున్నాయి.
ఆప్షన్ నెంబర్ వన్ – ఏమయినా జరగనీ. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం.
(ఈ అంచనాకు ఆధారాలు: వాయలార్ రవి వ్యాఖ్యలు. సమైక్యంగా వుంచినా సీమాంధ్ర లో జగన్ పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్ ను బట్టకట్టించడం కుదరని పని అని నిర్ధారణకు రావడం. తెలంగాణలో అయినా నష్టాన్ని కొంత మేరకు భర్తీ చేసుకోవచ్చన్న ఆలోచన. ఒకవేళ జగన్ పార్టీ  పైకి  అనుకున్నంత బలంగా లేకపోయినా దానికున్న బలం వోట్లను చీల్చి తెలుగుదేశానికి లేనిపోని లాభం కలిగించడానికి పనికొస్తుందేమో  అన్న సందేహం. అదీ ఇదీ కాకుండా, తెలంగాణా ఏర్పాటు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన  కారణం జగన్ పార్టీయే అన్న భావన ప్రజల్లో  కలిగించి సీమాంధ్ర లో  దాని ప్రభావాన్ని తగ్గించడం.)
ఆప్షన్ నెంబర్ టు – రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడం.
(ఈ అంచనాకు ఆధారాలు : ఈ రకమైన ప్రకటన చేయాల్సివస్తే  ఉత్పన్నమయ్యే శాంతి భద్రతల సమస్యలను ఎదుర్కోవడానికి  తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై  అత్యున్నత స్థాయిలో జరుగుతున్న సమాలోచనల గురించి వెలువడుతున్న సమాచారం)
ఆప్షన్ నెంబర్ త్రీ : హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా లేక కేంద్రపాలిత ప్రాంతంగా చేసి రాష్ట్రాన్ని విభజించడం
( ఈ అంచనాకు ఆధారాలు : ప్రత్యేక తెలంగాణా కోసం పట్టుబడుతున్న టీ.ఆర్.ఎస్. వంటి ఉద్యమ పార్టీల నాయకులను విశ్వాసంలోకి తీసుకుని కనీసం కొన్ని సంవత్సరాల వరకైనా  ఈరకమైన  ఏర్పాటుకు అంగీకరించేలా వొత్తిడి చేయడం – ‘హైదరాబాదు విషయంలో రిఫరెండానికి సిద్ధం’ అంటూ టీ.ఆర్.ఎస్. అధినేత చేసిన ప్రకటనను  ఇందుకు సంకేతంగా తీసుకోవచ్చు. పుష్కర కాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితం కనుచూపుమేరలోకి వచ్చిన సూచనలు స్పష్టంగా కానవస్తున్నప్పుడు, సిద్దాన్నాన్ని మరో మారు నేలపాలు చేసుకోకుండా, కొన్ని  సడలింపుల ద్వారా లక్ష్యాన్ని సాధించుకోగలిగామన్న సంతృప్తితోనైనా  వారు అంగీకరించకపోతారా అన్న  ఆశ.)
ఆప్షన్ నెంబర్ ఫోర్: ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు వుండవు’ అన్న సూక్తిని మరోమారు రుజువు చేస్తూ ఇరవయ్యెనిమిదవ తేదీన ‘అంతా హుష్ కాకీ’ అన్న తరహాలో సమస్యను తేల్చకుండా మరింత నానబెట్టే ధోరణిని కొనసాగించడం. (దీనికి ఆధారాలు కనబడవు. ఎందుకంటే ఇలాటి  ఎత్తుగడలన్నీ ఎలాటి  ఆధారాలు కనబడకుండా పన్నుతుంటారు కాబట్టి)
ముహూర్తం దగ్గర్లోనే వుంది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ‘కానున్నది కాకమానదు. కానిది కానే కాదు’ అనే వేదాంతం వొంటబట్టించుకున్న బాపతుకదా!
‘విదియనాడు కళ్ళు చికిలించుకున్నా కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడ’ని  కదా నానుడి.
చూద్దాం. ఇరవయ్యెనిమిదిన చంద్రుడు కనబడతాడేమో! (18-01-2013)            

    

17, జనవరి 2013, గురువారం

చావు తెలివి


చావు తెలివి
సుబ్బారావుకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి.



ప్రాణాలు పట్టుకు పోవడానికి వచ్చిన యమదూత  మంచం పక్కన నిలబడి పోదాం పదఅనేదాకా అతగాడికావిషయం తెలియదు.
అల్లా అంటే ఎల్లా? ఇలా వచ్చి హడావిడి పెడితే యెలా?’ అన్నాడు సుబ్బారావు యమదూతతో.
అదంతా నాకు తెలియదు. నా లిస్టులో ఈరోజు నీ పేరే మొదట వుంది.
సరే! వచ్చినవాడివి వచ్చావు. పోయే వాడిని నేను ఎలాగో పోతున్నాను. పిలవకుండా  ఇంటికి వచ్చిన అభ్యాగతికి అతిధి మర్యాద చేయకపోతే ఏం మర్యాదగా వుంటుంది చెప్పు. ఎండనబడి ఇన్ని లోకాలు దాటుకుంటూ నాకోసం వచ్చావు. అలా కూర్చో. నిమ్మ కాయ పిండి తేట మజ్జిగ కలిపి ఇస్తాను’ అన్నాడు సుబ్బారావు.
సుబ్బారావు వొంటింట్లోకి వెళ్ళి పెద్ద గ్లాసుడు మజ్జిగ తెచ్చాడు. చావు తెలివి చూపించబోయి అందులో నిద్ర మాత్రలు గుప్పెడు కలిపి మరీ తెచ్చి ఇచ్చాడు.
మజ్జిగ తాగిన యమదూత నిద్రలోకి జారిపోయాడు. అదే సందనుకుని సుబ్బారావు యమదూత దగ్గర వున్న జాబితా తీసుకుని  అందులో ముందు రాసివున్న  తన పేరు చెరిపేసి దాన్ని  ఆఖరున రాసాడు.  సుబ్బారావు తన తెలివికి తానే మురిసిపోయేలోగా యమదూత నిద్ర నుంచి లేచాడు.
లేచి ఇలా అన్నాడు. మజ్జిగ మహత్తరం. దాని రుచి అద్భుతః. నీ ఆతిధ్యం మరింత అద్భుతః. నేను కనబడగానే ఏడుపులు పెడబొబ్బలు పెట్టేవాళ్ళే  కాని నీలా మర్యాద చేసిన వాడు నాకు ఇంతవరకు కనబడలేదు. అందుకని నీకో మేలు చేద్దామనుకుంటున్నాను. యమలోకానికి తీసుకువెళ్ళే మనుషుల జాబితాను పైనుంచి కాకుండా అడుగునుంచి మొదలుపెడతాను
చావు దగ్గరపడ్డ సుబ్బారావు ఆ మాటలతో బిక్క చచ్చిపోయాడు.
(17-01-2013)

15, జనవరి 2013, మంగళవారం

మిధునం సినిమా మహిమ





మిధునం సినిమా మహిమ

ఓ మూడు రోజులపాటు హైదరాబాదు వొదిలిపెట్టి - దాదాపు యాభై ఏళ్ళ తరువాత మా స్వగ్రామం కంభంపాడులో నిద్ర చేసాము. దాదాపు ముప్పై మందిమి -  కొడుకులూ,  కోడళ్ళు, పిల్లజెల్లాతో కలసి ఈ 'పల్లెకు పోదాం’  కార్యక్రమంలో పాల్గొన్నాము. వీళ్ళల్లో సగానికిపైగా ఎప్పుడూ పల్లెటూరు మొహం చూసిన వాళ్లు కాదు.  ‘మిధునం’ సినిమా చూసిన తరువాత  వీళ్ళందరికీ పల్లెటూరు చూడాలన్న కోరిక పుట్టుకొచ్చింది. ఎన్నడూ రుచి చూడని జొన్నన్నం వండడం కోసం నగరాల్లో పుట్టి పెరిగిన మా కోడళ్ళు జొన్నలు దంచేందుకు రోకళ్ళు చేతబట్టారు. ఆ సన్నివేశం  అద్భుతః

  

11, జనవరి 2013, శుక్రవారం

రేడియో రోజులు




రేడియో రోజులు

రేడియోలో పనిచేసేవారు ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీ వీ.వీ. శాస్త్రి  చెప్పిన ఆసక్తికర ఉదంతం ఇది.


ఆయన భోపాల్ లో పనిచేసేటప్పుడు  జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి శ్రీ కె.పీ.ఎస్. మీనన్ ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆ నగరానికి రావడం జరిగింది. ఆయన వద్ద గతంలో పనిచేసిన సంగ్లూ అనే అధికారి అప్పుడు భోపాల్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన పూనికపై శ్రీ వీ.వీ. శాస్త్రి, శ్రీ మీనన్ ను కలసి రేడియో స్టేషన్ కు ఆహ్వానించారు. నిజానికి ఆయన మరునాడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అయినా, రేడియో మీది గౌరవంతో, సంగ్లూ మీది అభిమానంతో తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఆరోజు  రేడియో స్టేషన్ కు వచ్చిన మీనన్, మాటల సందర్భంలో తన అనుభవాలు కొన్ని చెప్పారు.
మీనన్ గారు  ఆరోజు చెప్పిన విషయాల్లో  ఒకటి మన రాష్ట్రానికి సంబంధించింది  కావడం వల్ల శాస్త్రి  గారికి బాగా  గుర్తుండిపోయింది.
“ భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
‘ ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.’
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.
అంతటితో ఆ సమావేశం ముగిసింది.