29, నవంబర్ 2011, మంగళవారం

ఒక మహర్షి అస్తమించాడు



కీర్తిశేషులు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారు 


ఈ రోజు నిజంగా దుర్దినం. స్వార్ధాన్ని జయించిన ఒక వ్యక్తి ఈ స్వార్ధ సంకుచిత ప్రపంచం నుంచి నిష్క్రమించాడు. తొమ్మిదిపదుల వయస్సు దాటిన  తరువాత  కాలు విరిగి కోలుకుంటున్నారు అన్న దశలో అందరిని హతాశులను చేస్తూ అస్తమించాడు. జీవన మార్గంలో అనేకమందికి నడక నేర్పిన మనిషికి నడక దూరమవడం విధి వైపరీత్యం. తన జీవితాన్ని చమురుగా మార్చి ఎన్నో ఇళ్ళల్లో దీపాలు వెలిగించిన ఆ మహా జ్యోతి ఆరిపోయింది. ఆఖరి చూపులు అందడం కోసం హడావిడిగా విజయవాడ  వెడుతూ ఆ మహానీయుడుకి అర్పిస్తున్న అశ్రు నివాళి.  
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
(29-11-2011)

28, నవంబర్ 2011, సోమవారం

తోట్లవల్లూరును మరచిపోలేను. - డాక్టర్ నోరి దత్తాత్రేయుడు



క్షణం తీరికలేని మనిషికి దొరికిన మధుర క్షణాలు. - భండారు శ్రీనివాసరావు

అనుక్షణం వార్తలమధ్య గడిపే జర్నలిష్టులను ప్రతిరోజూ  పత్రికల్లో వచ్చే వార్తలు అంతగా ఆకట్టుకోవు. కానీ, నవంబర్ ఇరవై ఐదో తేదీన ఈనాడు లో పడ్డ  వార్తను చూసి,  లోగడ ఆలిండియా రేడియో, దూర దర్శన్ లలో  న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్.వీ.వీ. కృష్ణారావు కాసేపు చకితులయ్యారు. దానికో కారణం వుంది. అది తెలుసుకోవాలంటే అంతకు ముందు శనివారం నాడు హైదరాబాదులో  జరిగిన ఒక పెళ్లి. అది చెప్పుకునే ముందు ఈనాడులో పడ్డ వార్త సారాంశం తెలుసుకుందాం.

తోట్లవల్లూరును మరచిపోలేను.


డాక్టర్ నోరి దత్తా త్రేయుడు 


(తోట్లవల్లూరు, న్యూస్ టుడే-  కేన్సర్ చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాత  కీర్తి గడించిన  డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గురువారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పర్యటించి తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను చిన్నప్పుడు నివసించిన ఇంటిని సాంబశివరావు కొనుగోలు చేసి కొత్తగా  నిర్మించుకున్న ఇంటికి వెళ్లి అంతా  కలయతిరిగిచూసారు. ‘ఇక్కడో బావి వుండాలే!’ అని ఆ ఇంట్లోవారిని వాకబు చేశారు.   పమిడిముక్కల మండలం ఘంటాడలో తాను జన్మించినా, కుటుంబ సభ్యులతో చిన్నతనంలో  గడిపిన తోట్లవల్లూరును జీవితంలో మరచిపోలేనని చెప్పారు. తనకు నామకరణం చేసిన కలగా పూర్ణచంద్ర శాస్త్రి ఇంటివద్ద కొద్దిసేపు గడిపి వేణుగోపాలస్వామి ఆలయంలో  అర్చకులు ప్రసాదంగా ఇచ్చిన చిట్టి గారెలు తిని దాదాపు యాభై అరవై  ఏళ్ళ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.)

ఈ వార్త కళ్లబడగానే  కృష్ణారావు గారికి నెప్పల్లి  ప్రసాద్ గారి అబ్బాయి పెళ్ళిలో జరిగిన సంఘటన సినిమా రీలులా కళ్ళముందు కదలాడింది.
ప్రసాద్ గారు అమెరికాలో పేరుమోసిన చార్టర్డ్ అక్కౌంటెంట్. వారి ఆహ్వానం మేరకు కృష్ణారావు గారు ఆ పెళ్ళికి వెళ్లారు. అక్కడ ఆయనకు  వూహించని అతిధి తారసపడ్డారు. ఆయనే నోరి దత్తాత్రేయుడు గారు. ఆయన హస్తవాసికి తిరుగులేదు. క్షణం తీరికలేని వైద్యులు. కేన్సర్ రక్కసి పీచమడిచే పనిలో పడి దేశదేశాలు తిరుగుతుంటారు. ఇటీవల సోనియా గాంధీ గారికి వైద్యం చేసిన డాక్టర్ల  బృందానికి ఆయనే నేతృత్వం వహించారని పత్రికల్లో  వచ్చింది.  దత్తాత్రేయుడి గారికి  నెప్పల్లి ప్రసాద్ గారు  అత్యంత ఆత్మీయులు. అందుకే వారి కుమారుడి వివాహానికి అమెరికానుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. వారిని పెళ్ళిలో చూడగానే కృష్ణారావు గారికి చిన్నప్పటి తోట్లవల్లూరు సంగతులు మదిలో మెదిలాయి. దత్తాత్రేయుడు గారి కుటుంబం, కృష్ణారావు గారి కుటుంబం యాభయ్ , అరవై ఏళ్ళనాడు ఆ వూళ్ళో ఒకే ఇంట్లో నివాసం వుండేవి. చిరకాలం నాటి  బాల్య మిత్రుడు అన్నేళ్ల తరువాత   తారసపడగానే కృష్ణారావు గారు ఆయనతో మాటలు కలిపారు. మాటల మధ్యలో తోట్లవల్లూరు సంగతి ఎత్తారు. పెళ్ళిలో నలుగురి మధ్యవున్న కారణంగానో యేమో ఆయన  నుంచి వెంటనే  స్పందన కాన రాలేదు. అయినా కృష్ణారావు గారు నిరుత్సాహ పడలేదు. పెళ్ళయిన తరువాతో అంతకు  ముందో కానీ, భోజనాల సమయంలో మరోసారి దత్తాత్రేయుడు  గారితో ముచ్చటించే వీలు చిక్కించు కున్నారు. చిన్నప్పటి సంగతులు కొన్ని  గుర్తు చేశారు. ఈ సారి ఆయన గుర్తుపట్టినట్టే అనిపించింది.
“ఎన్నో ఏళ్ళయింది తోట్లవల్లూరు వెళ్లి. మేము అమ్మేసిన ఇల్లెలా వుంది? వూరేలా వుంది ?” అని అడిగారు.
‘వీలయితే ఈసారి కలసివెడదాం’ అని కూడా అన్నారు.  
“కోట పోయింది. చదువుకున్న స్కూలు అలాగే వుంది. మనం ఆడుకున్న గుడీ అలానే వుంది. పక్కన కృష్ణానది అందరి  జ్ఞాపకాలను వొడిలో దాచుకుని అలాగే పారుతోంది.” బదులు చెప్పారు.
అంతటితో ఆగలేదు. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, మసలిన మనుషులు అన్నింటినీ  గుర్తుచేశారు.
“వేణుగోపాలస్వామి ఆలయం, గుళ్ళో ప్రసాదంగా పెట్టే చిట్టిగారెలు, కట్టు పొంగలి రుచి, వాళ్లు వున్న ఇల్లు, ఇంటి ముందు గిలక బావి, దొడ్లో బాదం చెట్టు” ఇలా ఒకటేమిటి గుర్తుకొచ్చినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పేశారు కృష్ణారావు గారు.
విందు పూర్తయింది. పెళ్లయిపోయింది. ఇంటికి తిరిగివచ్చిన తరువాత కూడా కృష్ణారావు గారికి తోట్లవల్లూరు గురించిన తలపులు వొదలలేదు. అది ఆయన సొంత వూరు  కాకపోయినా, దత్తాత్రేయుడు గారి మాదిరిగానే కృష్ణారావు గారికి కూడా ఆ వూరితో మరచిపోలేని అనుబంధాలు, జ్ఞాపకాలు అనేకం వున్నాయి.
కృష్ణారావు గారి నాన్న గారు రాయసం గంగన్న పంతులు గారు. దేవాదాయ శాఖలో ఉద్యోగి. చిన్న చిన్న దేవాలయాలను పర్యవేక్షించే అధికారి. బదిలీ మీద కుటుంబాన్ని వెంట తీసుకుని తోట్లవల్లూరు వెళ్లారు.
ఆ వూళ్ళో నోరి సత్యనారాయణ గారింట్లో ఓ వాటా అద్దెకు తీసుకున్నారు.
సత్యనారాయణ గారికి   నలుగురు కుమారులు. పెద్దబ్బాయి  నోరి రాధాకృష్ణ మూర్తి గారు. ఐ.పి.ఎస్. అధికారి. పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గానో ఆ పై పదవిలోనో రిటైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగంలో చేరక మునుపు ఆయన బందరు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేవారు.
రెండో కుమారుడు ఎన్.మధురబాబు గారు. స్టేట్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామీణ బ్యాంకుల  వ్యవస్థలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొల్పిన మొట్టమొదటి గ్రామీణ  బ్యాంక్ – నాగార్జున గ్రామీణ బ్యాంక్ కు మొదటి  చైర్మన్ గా పనిచేసి సమర్ధుడయిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట, మూడో కుమారుడు రామతీర్ధ కాగా కనిష్ట  కుమారుడు నోరి దత్తాత్రేయుడు గారు. చిన్నప్పుడు ‘దత్తు’ అని పిలిచేవాళ్ళు.
కొత్త వూరిలో కృష్ణారావుగారికి కొత్త స్నేహితులు లభించారు. ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. ‘అమ్మా నాన్నా ఏదయినా పనిమీద బెజవాడ  వెళ్ళాల్సి వస్తే ఆ నాలుగు రోజులు తన భోజనం పడకా కూడా నోరి  వారింట్లోనే’ అని కృష్ణారావు గారు నాతో  ఈ విషయాలు చెబుతూ గుర్తు చేసుకున్నారు.   
వారి తండ్రిగారి అకాల మరణం తరువాత నోరి వారి మకాం బందరుకు మారిపోయింది.
కృష్ణారావు గారు మాత్రం తండ్రిగారి  ఉద్యోగరీత్యా  తోట్లవల్లూరులోనే మరికొంత కాలం గడిపారు.
ఆ నాటి రోజులు గురించీ, అప్పటి వాతావరణం గురించీ ఆయన మాటల్లోనే.              
‘నదికి ఆనుకునే కాలవ. బెజవాడ నుంచి లాంచీలు తిరుగుతుండేవి. శివ కామేశ్వరి, శివ పార్వతి, గంగ వాటి పేర్లు.         
‘నోరి వారి కుటుంబం యావత్తూ కుసుమ హరనాధ బాబా భక్తులు.  ఇంట్లో  రోజూ భజనలు. పూజలు. తండ్రి చని పోయిన తరువాత వారి కుటుంబం బందరు వెళ్ళగానే ఆ వాటాలోకి అప్పయ్య శాస్త్రి గారు అద్దెకు దిగారు.
‘తోట్లవల్లూరులో వాళ్లు వున్న ఇల్లు బాగా పెద్దదేమీ కాదు. ఉత్తర ముఖంగావున్న ఆ ఇంటి ముందు గిలక బావి. దొడ్లో బాదం చెట్టు. కుడి పక్క  తాడికొండ వారి నివాసం. ఆ ఇంట్లోనే రామమందిరం. దాపునే తోట్లవల్లూరు కరణం గారయిన అడిదం వారి ఇల్లు. మరోపక్క గోవిందరాజుల వాళ్లు వుండేవాళ్ళు. పోతే,  శివలెంక వీరేశ లింగం గారి  ఇల్లు కూడా పక్కనే. వీరేశ లింగం గారు పేరు మోసిన  పెద్ద జ్యోతిష్కులు. సినీ నటుడు   ముదిగొండ లింగమూర్తి గారి  వియ్యంకులు. మద్రాసునుంచి భానుమతి వంటి ప్రముఖ సినీ  కళాకారులు కూడా ఆయనను కలవడానికి తోట్లవల్లూరు వచ్చేవాళ్ళు. వీరేశలింగం గారి  అబ్బాయి ఎస్.వి.ఎం. శాస్త్రి గారు  దక్షిణ  మధ్య రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తోట్లవల్లూరులోని శివాలయానికి శివలెంక వారు అనువంశిక ధర్మ కర్తలు.
‘వూళ్ళో వున్న పెద్దగుడి వేణుగోపాలస్వామిది. ఆ గుడికి తగ్గట్టు  పెద్ద గాలి గోపురం. దాని మీద పావురాళ్ళు. వాటి రక్తం పూస్తే పక్షవాతం వంటి రోగాలు నయమవుతాయని చెప్పుకునే వాళ్లు. అది బొమ్మదేవరపల్లి  జమీందారులు కట్టించిన గుడి కావడం వల్ల వైభోగానికి  తక్కువలేదు. పూజలు, పునస్కారాలు, ప్రసాదాల వితరణ ఘనంగానే  జరిగేవి. తిరునక్షత్రం నాడు పులిహోర చేసేవాళ్ళు. పర్లాంగు దూరంలో  కృష్ణానది. ధనుర్మాసంలో ఆలయ అర్చకులు ఆ బావినుంచి మంగళ వాయిద్యాలతో తీర్ధపు బిందెలు తెచ్చేవాళ్లు. మా  పిల్లల  ఆటలన్నీ గుళ్ళో పొగడ చెట్టు కిందనే.
‘మా వీధి లోనే పోస్టాఫీసు. అన్నంభొట్లవాళ్లు టపా పని చూసేవారు. ఉయ్యూరు నుంచి ప్రతిరోజూ ఒక భారీ మనిషి  (పోస్టల్ రన్నర్) తపాలా సంచీ మోసుకుంటూ అయిదుమైళ్లు గబగబా నడుచుకుంటూ  తోట్లవల్లూరు వస్తుండేవాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ, చేతిలో వున్న పొడుగుపాటి బల్లేన్ని నేల మీద పోటు  పొడుచుకుంటూ  అతగాడు నడిచివస్తుంటే ఆ బల్లెం పైన కట్టిన మువ్వలు అదోరకం శబ్దం  చేస్తుండేవి.
‘తోట్లవల్లూరు  జమీందారులు బొమ్మదేవర వంశీకులు వేణుగోపాలస్వామి దేవాలయానికి అనువంశిక ధర్మకర్తలే కాదు,  దానికి కర్తా కర్మా క్రియా అన్నీ వాళ్ళే.  జమీందార్ల దగ్గర ఏనుగుల్ని సంరక్షించే నాగయ్య అనే వ్యక్తి తరువాతి రోజుల్లో ఈ గుడి వ్యవహారాలూ కనిపెట్టి  చూసేవాడు. కృష్ణారావు గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు ప్రభుత్వం తరపున అంటే దేవాదాయ శాఖ తరపున ఆలయం బాధ్యతలు  చూస్తుండే వారు. అప్పట్లో ఆయన నెల  జీతం  అరవై రూపాయలు. కరవుభత్యం కింద  ఇరవై రూపాయలు. పైన మరో అర్ధ రూపాయి. ఆ వూరి మొత్తంలో  నెలసరి అంత జీతం వచ్చేవాడు మరొకడు లేకపోవడం వల్ల అది చిన్న జీతంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. కాకపొతే అంత జీతం అన్నది ఆయనకు వూళ్ళో ఒక ప్రత్యేకతను,అయాచిత  గౌరవాన్ని కట్టబెట్టింది.



గరుడవాహనంపై వేణుగోపాలస్వామి వారు 

(1955 లో తీసిన ఈ ఫోటోలో కుడి నుంచి రెండో వ్యక్తి ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్  అడిదెం కనక వీరభద్ర రావు గారు  మూడో  వ్యక్తి  రాయసం గంగన్న పంతులు గారు, స్వామి వారి పక్కన ఆలయం ప్రధాన అర్చకులు పరాంకుశం అప్పలాచార్యులు గారు. పోతే, కూర్చున్న వారిలో కుడివైపు మొదటి కుర్రవాడు ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు)     

‘ఆ రోజుల్లో బెజవాడ నుంచి  తోట్లవల్లూరుకు  ప్రైవేటు సర్వీసులవాళ్లు బస్సులు నడిపేవాళ్ళు. ఒకటి  రామాంజనేయ మోటార్ సర్వీస్, రెండోది గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్. బస్సులమీద ఆ  పేర్లు రాసివుండేవి. గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్  అని రాసి  పక్కనే ‘ఇన్ లిక్విడేషన్’ అని కూడా వుండేది. దాని అర్ధం ఇప్పటికీ తెలియదు. వీటిల్లో   రామాంజనేయా సర్వీసు బస్సు ఖచ్చితంగా  టైం ప్రకారం నడిచేది. ఒక బస్సు డ్రైవర్  పేరు సుబ్రహ్మణ్యం అని గుర్తు.
‘వెనుక బెజవాడ నుంచి  రావాలంటే చుట్టూ తిరిగి  రావాల్సివచ్చేది. ఇప్పుడు కృష్ణానది కరకట్ట మీదుగా హంసలదీవి దాకా రోడ్డు వేసారు. దాంతో  రాకపోకలు సులువయ్యాయి.
‘తోట్లవల్లూరులో  వున్న హైస్కూలే చుట్టుపక్కల వూళ్ళకు దిక్కు. వల్లూరిపాలెం నుంచి ఆడపిల్లలు  నడుచుకుంటూ స్కూలుకు వచ్చేవాళ్ళు. పక్కనున్న భద్రిరాజుపాలెం నుంచి కూడా చదువుకోవడానికి పిల్లలు  తోట్లవల్లూరు  రావడం గుర్తు.
‘వూళ్ళో గుర్రబ్బళ్లు  కూడా వుండేవి. ఒకరోజు బండి చక్రం కింద ఓ కుక్క పిల్ల నలిగి చనిపోవడం చూసిన పిల్లలకు ఆ రోజు అన్నం తినబుద్దికాలేదు.’
తోట్లవల్లూరు గురించిన  పాత సంగతులు  కృష్ణారావు గారికి  ఇంకా అనేకం గుర్తున్నాయని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకనిపించింది.
పెళ్ళిలో కలసి కాకతాళీయంగా  ఆయన    చెప్పిన నాలుగు ముచ్చట్లు నోరి దత్తాత్రేయుడి గారి తోట్లవల్లూరు పర్యటనకు ‘ప్రేరణ’ కావడం  నా ఈ రచనకు ‘ప్రేరణ’గా మారింది. (28-11-2011)   

    

25, నవంబర్ 2011, శుక్రవారం

కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు



కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు  
వార్త
ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘ఈనాడు-ఈటీవి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక  ప్రశ్న, దానికి సమాధానం ఇలా వున్నాయి.
ప్రశ్న: “పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి సంబంధాలున్నాయి?”
సమాధానం: “బాగున్నాయి. కాంగ్రెస్ దానంతట అది వోడించుకుంటుంది తప్ప వేరే పార్టీకి కాంగ్రెస్ ని వోడించే బలం లేదు.”  మేమంతా ఐకమత్యంగా ఉంటేనే తిరిగి గెలుస్తాం.
(నవంబరు శుక్రవారం నాడు ఈనాడు దినపత్రిక లో ప్రచురించిన ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ)
వ్యాఖ్య
“కుఠార మాలికాం దృష్ట్యా
కంపంతతి తరోవనే!
తత్ర వృద్ధ తరుహ్  ప్రాహుహ్
మామకోనాస్తి కిం భయం”
ఈ సంస్కృత శ్లోకానికి  తెలుగు అనువాదం:
“ఒకడు పది గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం “ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు  మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా!” అని అభయం ఇచ్చింది.
“అదీ కాంగ్రెస్ వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.”
(కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన ‘అప్పుడు –ఇప్పుడు’ గ్రంధం నుంచి)
25-11-2011                         

24, నవంబర్ 2011, గురువారం

ప్లస్ లూ - మైనస్ లూ


ప్లస్ లూ -  మైనస్ లూ  - భండారు శ్రీనివాసరావు


(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి నేటికి (25-11-2011)  సరిగ్గా ఏడాది.)





కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో  కిరణ్ కుమార్ రెడ్డి సరయిన తరుణంలో ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.

కలసివచ్చిన అంశాలు.
1.)  ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించేనాటికి  మరో  మూడున్నరేళ్ల పాలనా  సమయం మిగిలి వుండడం
2.)  అంతకు ముందు పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు తన పార్టీకి చెందినవారే కావడం
3.)  సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏవిధమయిన మరకలు లేకపోవడం
4.) యువకుడు, విద్యాధికుడు కావడం
5.)  అధిష్టానం ఆశీస్సులు  
ఇక కలసిరాని అంశాలు :
1.)  తెలంగాణా సమస్య తీవ్రం కావడం
2.) జగన్ ప్రాబల్యం గురించిన ప్రచారం పెరిగిపోవడం
3.)  సీనియర్లు మొరాయించడం
4.)  జూనియర్లు ఠలాయించడం
5.) పరిష్కారం తన చేతిలో లేని తెలంగాణా వంటి సమస్యలు చుట్టుముట్టడం
6.) అధికారులమీదనే ఎక్కువ ఆధారపడుతూ క్యాంప్ ఆఫీసుకే పరిమితమై ఓ సీనియర్ బ్యూరోక్రాట్ మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న వదంతులను గట్టిగా ఖండించలేకపోవడం
సాఫల్యాలు :
1.)  శాసనసభ నియోజకవర్గంనుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో చతురత చూపి పార్టీకి వున్న బలాన్ని మించి  అదనంగా ఒక సీటు గెల్చుకోవడం 
 2.)  సకలజనుల సమ్మె సందర్భంగా రైల్  రోఖో కార్యక్రమాన్ని నీరుకారుస్తూ పోలీసులతో కలసి వ్యూహ రచన చేయడం
 3.)  ప్రభుత్వం పడకేసిందన్న నిందను సైతం లెక్కచేయకుండా అనవసరమయిన నిర్ణయాలతో లేనిపోని ఆరోపణలకు గురికాకుండా జాగ్రత్త పడడం
4.) మూడున్నరేళ్లు వ్యవధానం వున్న ముఖ్యమంత్రికి కావాల్సింది ప్రభుత్వం నిలుపుకోవడం కానీ ప్రజా సంక్షేమ పధకాలు కాదన్న రాజకీయ కౌశల్యాన్ని ప్రదర్శించి ‘నెంబర్ గేమ్ ‘ కు ప్రాధాన్యం ఇవ్వడం.
5.) ఏడాది పుణ్యకాలం హారతి కర్పూరంలా కరిగిపోయినా ముందు కుర్చీ పదిలం చేసుకున్న తరువాతనే సంక్షేమ పధకాలను వరుసగా ప్రకటించడం
6.) ముఖ్యమంత్రిని మార్చే అవకాశం లేకుండా వచ్చే ఎన్నికలవరకు తననే కొనసాగించేలా అధిష్టానం వద్ద మార్కులు సంపాదించడం
7.) సొంతపార్టీలో అసమ్మతి గళాలు విప్పిన నోళ్లతోనే భజన గీతాలు పాడించడం
ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి సొంత ప్రతిభకు తార్కాణాలయితే అయాచితంగా  కలసివచ్చిన అంశాలు మరికొన్ని వున్నాయి.
 1.) కోర్టు నిర్ణయాలవల్ల మారిన రాజకీయ వాతావరణం
2.) సీ బీ ఐ దర్యాప్తులతో రెండు ప్రధాన ప్రత్యర్ధి వర్గాలు మల్లగుల్లాలు పడుతుండడం
౩.) గత కాలపు చేదు అనుభవాల నేపధ్యంలో పార్టీ హై కమాండ్ ముఖ్యమంత్రి మార్పు గురించి ఆలోచించే పరిస్తితి లేకపోవడం
4.) ప్రత్యర్ధుల బలహీనతలు ముఖ్యమంత్రికి బలంగా మారడం
ఇవన్నీ వున్నా  ఇంకా పొంచే వున్న రాజకీయ కారు మేఘాలు.
1.) సొంతగూటికి చేరుతున్నట్టు  ప్రకటనలు గుప్పిస్తున్న అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతవరకు నమ్మొచ్చన్న అనుమానాలు
2.) ఇంతవరకు కిరణ్ ప్రభుత్వాన్ని చూసీ చూడనట్టు వొదిలేస్తున్న తెలుగుదేశం పార్టీ -   సీ.బీ.ఐ. దర్యాప్తు ముదిరిన తరువాత కూడా అదే దారిలో వెడుతుందా లేదా అన్న విషయంలో అస్పష్టత
౩.) ముదిరి పాకాన పడుతున్న దర్యాప్తుల నేపధ్యంలో పధకాల రూపకల్పనలోనూ, వాటి అమల్లోను , అధికారుల సహకారం మంత్రులకు, ముఖ్యమంత్రికి  ఏమేరకు వుంటుంది అన్న సందేహాలు
కాబట్టి రాజకీయాల్లో ఇవ్వాళ గడిచినట్టే రేపు గడుస్తుంది అన్న భరోసా లేదు. ఇవ్వాళ స్త్రోత్ర పాఠాలు వల్లిస్తున్న భజన బృందాలు అధికారం వున్నంతవరకే వెనకవుంటాయనీ, వెన్నంటి వుంటాయనీ తెలుసుకోవడానికి చరిత్ర తిరగేయనక్కరలేదు. నిన్నమొన్నటి వరకు ఆ గళాలు ఎవరిని వేనోళ్ళ స్తుతించాయో, ఎవరివెంట తిరిగాయో  తెలుసుకోవడానికి రిసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
కాకపొతే, ఈ నగ్న సత్యం ఈనాటి నాయకులకు తెలియందేమీ కాదు. తెలియనట్టు కానవస్తారంతే! ఎందుకంటె రాజకీయాల్లో ఈ భజనపరుల అవసరం కొండంత. పైపెచ్చు పరస్పరాధీనంగా నడిచే వ్యవహారాలు కావడం మరో కారణం. (25-11-2011)

22, నవంబర్ 2011, మంగళవారం

అప్పుడు - ఇప్పుడు


వార్త – వ్యాఖ్య
( ఆంధ్ర జ్యోతి దినపత్రిక 21-11-2011)
అప్పుడు విజయవాడలో అల్లర్లు జరిగాయి. ఆ ప్రాంతంలో పర్యటించడానికి  ముఖ్యమంత్రి పీ.వీ.నరసింహారావు బయలుదేరుతున్నారు. ఆయన  అక్కడికి వెడితే ... ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతాయని, రావద్దని జిల్లా కలక్టర్,  ఎస్పీ... పీవీని  వారించారు. ముఖ్యమంత్రి హోదా, రాజకీయ ప్రయోజనాలు బేరీజు వేసుకున్న పీవీ వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఇక లాభం లేదనుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వల్లూరి  కామేశ్వరరావు రంగంలోకి దిగారు. వెళ్ళవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. ‘నువ్వు సెక్రెటరీవి. నా ఉద్యోగివి.  నీ పని నువ్వు చూసుకో.  నేను చెప్పింది చేయి. నేను పొలిటీషియన్ని. నా పని నేను చేస్తా. ‘ అంటూ ఆఫీసు  మెట్లు దిగి కారెక్కడానికి వచ్చారు పీవీ. కానీ అక్కడ కారు  డ్రైవర్  లేడు.  ఏడని అడిగితే... ‘సీఎస్  గారు కారు తీయవద్దన్నారని’ సమాధానం వచ్చింది. ‘డ్రైవర్  నా ఉద్యోగి. అతడు నేను చెప్పినట్టే వింటాడు. అతను రాడు.’ అని సీఎస్ కరాఖండిగా చెప్పారు. పీవీ పర్యటన ఆగిపోయింది. మరుసటి రోజు పీవీ వల్లూరిని పిలిచి .....’నిన్న నేను వెళ్ళివుంటే గొడవలు పెరిగేవి. నన్ను ఆపి మంచిపని చేసావు’ అని మెచ్చుకున్నారు.
....విధులపట్ల అదీ ఆనాటి అధికారుల నిబద్ధత. మరి ఇప్పుడో...!
ఓసారి శ్రీశైలంలో ఒక జాతీయ పార్టీ సమావేశం జరుగుతోంది. దాన్ని కవర్ చేయడానికి హైదరాబాద్ నుంచి  ఒక విలేకరి వెళ్లాడు. సమావేశం పూర్తయ్యాక ఫాక్స్ ద్వారా వార్త పంపడానికి కొండకిందకు వెళ్ళబోతున్నాడు. అది గమనించిన ఆ పార్టీ ప్రముఖుడొకరు జీపు ఏర్పాటు చేస్తానన్నా అతగాడు వొద్దన్నాడు. పరవాలేదని నచ్చజెప్పి తన  జీపు డ్రైవర్ ను పిలిచి కాఫీ, టీలు, భోజనం, ఫాక్స్ బిల్లు వగైరాలకు కొంత డబ్బు ఇచ్చి తగిన సూచనలు చేసి ఆ విలేకరిని కిందికి  పంపాడు. ఆయన పనులన్నీ పూర్తయి  హైదరాబాద్ బస్సు ఎక్కేదాకా వుండి  రాత్రికి జీపు డ్రయివర్ తిరిగి వచ్చాడు. రాగానే అతడికి ఇచ్చిన మొత్తం యధాతధంగా తిరిగి వాపసు చేయడంతో  ఆ నాయకుడు ఖంగు తిన్నాడు. ‘ఏమీ ఖర్చు కాలేదా’ అని అడిగితే ‘లేదు సార్ ! కాఫీక్కూడా నన్ను డబ్బులివ్వనివ్వలేదు. పైగా నేను వొద్దంటున్నా మన జీపులో  పది లీటర్ల డీజిల్ కొట్టించి డబ్బులు ఆయనే ఇచ్చాడు సార్  ‘ అని చెప్పేసరికి నివ్వెరపోవడం ఆ నాయకుడి వంతయింది.
......ఒకనాటి విలేకరుల నిబద్దత అది. మరి ఇప్పుడో.....!

(22-11-2011)

కనుక్కోండి చూద్దాం !




కనుక్కోండి చూద్దాం !

ఈ కింది వరుసల్లో సున్నాల మధ్య దాగున్న ఇంగ్లీష్ 'C' అక్షరాన్ని పట్టుకోండి.

OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO COOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO

సంతోషం ఈ పరీక్ష గట్టెక్కారు.  ఇప్పుడు కింద వరుసగా కనిపిస్తున్న'9'  అంకెల నడుమవున్న '6' అంకెని గుర్తుపట్టండి.

9999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999
6999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999

పోతే ఇప్పుడు మూడోది. అదేమిటంటే – కింద ఇంగ్లీష్ ‘M’ అక్షరాలు కనబడుతున్నాయి కదా. వాటి నడుమ కనీకనబడకుండా ఇంగ్లీష్ ‘N’ అక్షరం వుంది. దాన్ని కూడా కనిపెట్టేశారంటే ఒక పనయిపోతుంది.

MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMNMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
అబ్బో! గట్టివాళ్ళే! మీవి  డేగ కళ్ళు సుమా. మూడింట్లోను  నెగ్గారు. అంటే అర్ధం ఏమిటి?
చక్కగా పనిచేస్తున్నవి మీ కళ్ళు మాత్రమే కాదు. మీ నాడీ వ్యవస్థ కూడా బాగా వుందన్న మాట. మీ మెదడు యెంత బాగా పనిచేస్తోందంటే - ‘ఆల్జిమీర్స్’ వ్యాధి వచ్చే అవకాశాలు ఆమళ్ల దూరంలో కూడా లేనట్టే.
తోకపిట్ట : నెట్ లో ఇలాటి జోకులు మామూలే! హాయిగా నవ్వేసి వూరుకోండి నాలాగే!
(22-11-2011)

19, నవంబర్ 2011, శనివారం

తెరిపినపడ్డ కాంగ్రెస్


తెరిపినపడ్డ కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు



ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఏంచేయాలి. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాలి. కానీ సాధారణంగా జరిగేదేమిటి ?  పక్క వాటాలో కూడా కరెంట్ వుందో లేదో అని ఓ కంట కనిపెట్టిచూడడం మానవ నైజం. తనకు నష్టం జరిగిందన్న బాధ కన్నా పక్కవారికి కూడా అదే జరిగితే సంతోషించే రోజులివి.
సీ.బీ.ఐ. దర్యాప్తులకు న్యాయస్తానాలు ఆదేశిస్తున్న ఉదంతాలపై  ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరు కూడా ఈ స్వభావాన్నే సూచిస్తోంది.
ఏమయితేనేం! చేతులారా తెచ్చిపెట్టుకున్న సమస్యలతో కుడితినపడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలం తరువాత చక్కని  ఊరట దొరికింది.
జగన్ అండ చూసుకుని కొరకరాని కొయ్యలుగా తయారయిన కొందరు ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక నిస్సహాయస్తితిలోవున్న అధికార కాంగ్రెస్ కు, కోర్టు ఆదేశాలపై సీ.బీ.ఐ. ప్రారంభించిన జగన్ ఆస్తుల కేసు విచారణ  కొంత ఊరటనిస్తే,  చంద్రబాబు అధికార దుర్వినియోగం గురించి హైకోర్టు ఆ  సీ.బీ.ఐ. నే దర్యాప్తుచేయమని తాజాగా ఆదేశించడం పూర్తి ఊరటను ఇచ్చింది. అటు  సీమాంధ్ర లో పూర్తిగా, ఇటు తెలంగాణలో ఓ మోస్తరుగా  ఏకుమేకై కూర్చున్న వైఎస్సార్ పార్టీని, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా యెలా ఎదుర్కోవాలో తెలియని పరిస్తితిలో బాగా డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు కొత్త ఊపిరి పోస్తున్నాయి. సరికొత్త ఆశలు  చిగురింపచేస్తున్నాయి.
కారణాలు ఏమయితేనేం, కారణ’భూతం’ ఏదయితేనేం చాలాకాలం తరువాత, అదీ ఏడాది పాలన పూర్తిఅవుతున్న తరుణంలో ‘కిరణ్ సర్కార్’ కొంత తెరిపిన పడింది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కాబోలు (18-11-2011)   


           

15, నవంబర్ 2011, మంగళవారం

ఎటు పోతున్నాం? – భండారు శ్రీనివాసరావు


ఎటు పోతున్నాం? – భండారు శ్రీనివాసరావు

సామాన్యుడికోసం రూపొందిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఇటీవలి కాలంలో అసామాన్యులకోసం నిర్విరామంగా పనిచేస్తున్న క్రమంలోఅవి  క్రమక్రమంగా తమ పూర్వ వైభవాన్ని కోల్పోతున్నాయనే చెప్పాలి. ఈ వ్యవస్థలు దారితప్పినప్పుడు సరిదిద్ది గాడిన పెట్టాల్సిన కర్తవ్యం  భుజస్కందాల మీద వున్న ‘మీడియా’ సైతం ఆరోపణల నీలినీడలను తప్పించుకోలేకుండా వుండడం మరో విషాదం.
ప్రత్యర్ధి పార్టీలను  నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం రాజకీయ రంగంలో చాలా సహజమయిన విషయం. ఎన్నికల్లోనూ, ఇతరత్రా కూడా ఈ లక్ష్య సాధనకోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూనే వుంటాయి. నైతికంగా ఇది తప్పే అయినా రాజకీయకోణం నుంచి చూస్తే వాటికి ఇది  తప్పనిసరి వ్యవహారం. అందుకే ఎన్నికల్లో తేలని విషయాలను న్యాయస్తానాల ద్వారా తేల్చుకోవాలని ప్రయత్నించడం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఒకరకంగా చెప్పాలంటే సివిల్ కేసుల్లో సెటిల్మెంట్ మాదిరి. భూములు, ఆస్తి తగాదాలను పరిష్కరించే మిషతో లావాదేవీలు నడిపే పోలీసు అధికారులు, ఇతర సంబంధిత సిబ్బంది - ‘కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో! మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం!’  అనే రీతిలో హామీలు ఇస్తుండడం కద్దు. కోర్టు నిర్ణయాలను ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది కాబట్టి సెటిల్మెంట్  వ్యవహారాలు నడిపేవారికి మరింత వెసులుబాటుగా మారింది. ఇప్పుడిది రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రంగా తయారయింది.
మొన్నటికి మొన్న జగన్ మోహన రెడ్డి పై ఇదే బాణం ఎక్కుబెట్టారు. మళ్ళీ ఈ రోజున అదే బాణం చంద్రబాబు వైపు తిరిగింది. అధికారం అండగా చేసుకుని ఆర్ధిక నేరాల ఆరోపణల్లో చిక్కుకున్న వారిపై దర్యాప్తులు జరిపి నేరం రుజువు చేస్తే తప్పుబట్టేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అలా కాకుండా ఇది కేవలం రాజకీయ కక్షలను సెటిల్ చేసుకునే  క్రమంలో సాగే వ్యవహారం అయితే పరిణామాలు దారుణంగా వుంటాయి. పొరుగున వున్న  తమిళనాడులో ఈ విష సంస్కృతి ఇప్పటికే  వూడలు దిగివుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడి పార్టీలు  ప్రత్యర్ధులపై కక్షలు తీర్చుకునే విధానాలు ఏ మేరకు దిగజారాయో అందరికీ తెలిసిన విషయమే. కాకపొతే  గుడ్డిలో మెల్ల అన్నట్టు    అక్కడి ప్రధాన పార్టీల వాళ్లు తమ  పోరాట క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే రీతిగా నడుచుకోరు. కానీ మన రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. అందుకే రాజకీయ సెటిల్మెంట్ల వ్యవహారం ఇంతగా ఆందోళన కలిగిస్తోంది.
ఇది ఒక పార్శ్వం. దీన్ని మించిన  ప్రమాదకరమయిన పరిణామం మరొకటి వుంది.
జగన్ మోహన రెడ్డి మీద సీ.బీ.ఐ. దర్యాప్తుకు కోర్టు ఆదేశించినప్పుడు ఆయనకు చెందిన సాక్షి పత్రిక, సాక్షి టీవీ-   కొన్ని పత్రికలు, మరికొన్ని  మీడియా సంస్తలు అందిస్తున్న సమాచారంపై అనేక ఆరోపణలు చేశాయి. దర్యాప్తు క్రమంలో ప్రచురితమవుతున్న వార్తలను అభూతకల్పనలుగా కొట్టివేశాయి. నాలుగు గోడలమధ్య జరుగుతున్నవిచారణ సంగతులను  అక్షరం పొల్లుపోకుండా కళ్లకుకట్టినట్టు వైనవైనాలుగా వర్ణించి రాయడం  ఫక్తు  ‘ఎల్లో జర్నలిజం’ అని అభివర్ణించాయి. మీడియాలో ఒక వర్గం చంద్రబాబుకు కొమ్ముకాస్తోందని ఆరోపించాయి. గత కొద్ది రోజులుగా సాగుతూ వస్తున్న  తతంగం ఇది.
సాక్షి అభియోగాలను ఖండించాల్సిన అగత్యం ఆ మీడియాకు వుండకపోవచ్చు. కాకపొతే తాము ఇన్ని రోజులు నిస్పాక్షికంగా వార్తలు అందిస్తున్నామనీ, ఎవరిపైనో  బురదజల్లే వార్తాకధనాలు అందించడం లేదని నిరూపించుకునేందుకు  వాటికి ఇప్పుడొక సువర్ణావకాశం లభించింది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీ.బీ.ఐ. ఇక ముందు జరపబోయే దర్యాప్తు గరించి కూడా మునుపటి విధంగానే,  అదేవిధమయిన రీతిలో వార్తా కధనాలను అందించగలిగితే సాక్షి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోతుంది. రాజకీయ దురుద్దేశాలతో వార్తలు వండివారుస్తున్నారన్న అపప్రధ కూడా తొలగిపోతుంది. (15-11-2011)                   

రాజకీయ నీరజాక్షులు - భండారు శ్రీనివాసరావు


 వార్త – వ్యాఖ్య

“........తను నిర్దోషినని నమ్ముతున్నట్టయితే  సీ.బీ.ఐ. దర్యాప్తుని నిర్భయంగా ఎదుర్కోవాలి.”
“........ఏ తప్పూ చేయకపోతే దర్యాప్తుకు సహకరించి అగ్ని పునీతుడిలా బయట పడాలి”
“........కోర్టు ఆదేశాల ప్రకారం జరిగే దర్యాప్తు. రాజకీయకక్షతో చేస్తున్నారన్న అనుమానాలు నిరాధారం”
నిన్నా ఇవ్వాళా వినబడుతున్న ఈ మాటలన్నీ ఈ మధ్యనే ఎక్కడో  విన్నట్టుంది కదూ. ఎవరో ఒకరు అన్నట్టుంది కదూ.
ఇదే రాజకీయం అంటే. ఈ రాజకీయ నీరజాక్షులు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. రాగానే మాటకు మాట అప్పజెప్పి ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పు వారిది కాదు కదా. అంతకు ముందు ‘ఈ ఆట’ మొదలుపెట్టినవారికి కూడా ఇందులో  కొంత భాగముంటుంది కదా.
అందుకే అన్నారు ఒకరిపై వేలెత్తి చూపితే నాలుగువేళ్ళు మనవైపు చూస్తుంటాయని. కాకపొతే, ఇది తెలియని అజ్ఞానులెవరూ లేరు. తెలియనట్టు వుంటారంతే. (15-11-2011)    

6, నవంబర్ 2011, ఆదివారం



మితిమీరిన మీడియా ఉత్సాహం




(సత్యం రామలింగరాజు ఆర్ధిక నేరాల ఆరోపణల ఉచ్చులో చిక్కుకుని అరెస్ట్ అయినప్పుడు – ఆ నాటి సత్యం సామ్రాజ్యానికి ‘షేర్ల’ రూపంలో పెట్టుబడులు పెట్టి ఆ తరవాత గగ్గోలు పెడుతున్న నేపధ్యంలో - ఆరోజుల్లో నేను  రాసిన ఒక ఆర్టికిల్  ని  – రాజు గారికి బెయిల్ దొరికి ఇంటికి చేరుకున్నారన్న సంగతి తెలిసి  దాన్ని మళ్ళీ  పోస్ట్ చేస్తున్నాను. రాజు గారికీ నాకూ ఏవిధమయిన వ్యక్తిగత పరిచయం లేదన్న విషయం గమనంలో వుంచుకోవాల్సిందిగా మనవి – భండారు శ్రీనివాసరావు - 06-11-2011-)









నిప్పులు చిమ్ము కుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు -

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నేరాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరే!                     -శ్రీశ్రీ


ఒక మహావృక్షం కూకటి వేళ్లతో కూలిపోతున్న దారుణ దృశ్యం గతవారం విశ్వవ్యాప్తంగా ఆవిష్కృతమైంది.  శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని జీవిస్తున్న లెక్కకు మిక్కిలి బుద్ధిజీవులు,  సమృద్ధిజీవులు, మాన్యులు, సామాన్యులు, లబ్ధిదారులు, ప్రారబ్ధదారులు ఆ విషాదాంతాన్ని మౌనంగా, జాలిగా, కసిగా, ఆగ్రహంగా, బరువెక్కిన గుండెలతో, చెమ్మగిల్లిన కళ్లతో గమనిస్తూ వచ్చారు. కొందరికిది కడుపుకోత. మరికొందరికి కడుపుమంట. కొందరిది వేదన. మరికొందరిది ఆవేదన.



ఏళ్ల తరబడి శిలా సదృశ్యంగా నిలబడి,  నిరంతర శ్రమతో,  నిర్విరామ కృషితో,  మొక్కవోని పట్టుదలతో-  ఆకాశం అంచులు తాకేలా నిర్మించుకున్న సువిశాల, సుందర సౌధం పునాదులు కళ్లెదుటే కదలిపోయాయి.


సత్యమేరా జీవితం - సత్యమేరా శాశ్వితం
 `సత్యమైట్లు' గా -  సగర్వంగా చెప్పుకుంటూ, వర్తమాన సమాజంలో పరువుతో, పరపతితో నెగ్గుకొస్తున్న వేలాదిమంది యువతీ యువకుల కలలన్నీ వారి కనురెప్పల కిందే కరగిపోయాయి. నిన్నటివరకూ ఎదురులేని సత్యం. నేటికది  చెదిరిన స్వప్నం.

ఒక మెగా సంస్థ మహా పతనం గురించీ, దానికి కారణాలు గురించీ పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలతో, వార్తలతో, వార్తా కథనాలతో మీడియా రగిలించిన వేడి అంతా ఇంతా కాదు. సత్యం సంస్థ ఉత్థాన పతనాలకు కారకుడైన రామలింగరాజు కథ చంచల్‌గూడా జైలుకు చేరింది. ఈ పరిణామ క్రమాన్ని గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఈ ఉదంతంలో దాగున్న మరో కోణాన్ని స్పృశించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఆర్ధిక నేరాలు మనదేశానికి కొత్తవేమీకాదు. నూతన ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కూడా ఇవి జరిగాయి. స్వతంత్ర భారతంలో స్వదేశీ నౌకా పరిశ్రమ ఆవిర్భావానికి, అభివృద్ధికీ ఆద్యుడూ, మూలకారకుడూ అయిన తెలుగుతేజం జయంతి షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థాపకుడు ధర్మతేజ చరిత్రే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

సత్యం రామలింగరాజును హర్షద్‌మెహతా, కృషి వెంకటేశ్వరరావు, కోలా కృష్ణమోహన్‌ వంటి వారితో ముడిపెట్టి వార్తాకథనాలు వెలువరించిన మీడియా అత్యుత్సాహం అర్థం చేసుకోలేని అధమస్థాయిలో ఉంది. సామాజిక సేవా కార్య కలాపాల విషయంలో కానీ, నిర్మాణాత్మక దక్షాదక్షతల విషయంలోకానీ, సిబ్బంది మంచి చెడులను కొసకంట కనిపెట్టి చూసేవిషయంలో కానీ -  రాజుకీ, వారికీ ఏమాత్రం సాపత్యం లేదు సరికదా నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆశ, అత్యాశ, దురాశల నడుమ ఉన్న అంతరాన్ని అర్ధం చేసుకోవడంలో విశ్లేషకులు విఫలమయ్యారు. ఆశ చచ్చినా, దురాశపుట్టినా ఆ మనిషి చచ్చిన వాడితో సమానమంటారు. పెంచి పెద్ద చేసిన సంస్థను కాపాడుకోవాలనే ఆత్రంతో, అత్యాశతో వేసిన అడుగు రామలింగరాజుదయితే, రెండో వర్గంవారిది దురాశతో కూడిన దుస్తర మనస్తత్వం.

ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఆ నేరాన్ని తమంతతాముగా, విచారణకు ముందే ఒప్పుకోవడం చాలా అరుదయిన విషయం. ఒక రకమైన విషవలయంలో చిక్కుకుపోయి మింగలేకా, కక్కలేకా డోలాయమానంలో కొట్టుకుంటుంటారు. అలాంటిది చేసిన దానికి, జరిగిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటూ, మరెవరి మీదా నెపం మోపకుండా, గరళం మింగిన శివుడిలా రామ `లింగ' రాజు జారీచేసిన `ఒప్పుకోలు' ప్రకటన ఆయన ధీరోదాత్త వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. స్వయం నిర్మిత సువిశాల వ్యాపార సామ్రాజ్యం కళ్లెదుటే కుప్పకూలిపోతున్న స్థితిలో కూడా తన వద్ద పనిచేసే సిబ్బంది బాగోగులను గమనంలో ఉంచుకోవడం ఆయన స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం.


ఇక ఈ మొత్తం ఉదంతంలో రామలింగరాజుకూ, రాష్ట్రప్రభుత్వానికీ లంకెపెడుతూ వెలువడిన వార్తా కథనాలు పత్రికా విలువలకు తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. మితిమీరిన మీడియా ఉత్సాహం ఒక ప్రముఖ సంస్థ పతనాన్ని మరింత వేగిరం చేసింది. తప్పుదిద్దుకునే అవకాశాన్ని దూరం చేసింది.


 `బర్డు ఫ్లూ' వార్తలతో బెంబేలెత్తించి, లక్షలాది కోళ్ల సామూహిక సంహారానికి కారణమైన మీడియా, వేలాదిమంది సత్యం సిబ్బంది ప్రయోజనాలను కాపాడడానికి, తన సొంత ప్రయోజనాలను వదులుకోగలదని ఆశించడం అత్యాశే అవుతుంది.
అదే  జరిగింది కూడా.



 


 ఇక వాటాదారులు విషయం అంటారా!
 మోసం చేసి డబ్బు సంపాదించాలనుకునే నేరగాళ్లకీ, జూదం ఆడి డబ్బు గడించాలనుకునే జూదగాళ్లకీ పెద్ద తేడాలేదు.

సత్యం షేరు ధర చుక్కల్లో ఉన్నప్పుడు ఆ వాటాలు కలిగిన బడాబాబులు ఎంతగా బడాయిలకు పోయారో అందరికీ తెలుసు. ఆడేది జూదం అయినప్పుడు ఆటుపోట్లకి కూడా సిద్ధంగా ఉండాలన్న విషయం కూడా వారు తెలుసుకోవాలి. లక్షలు కోల్పోయామని బాధపడేవారు లక్షణమైన సంస్థను తిరిగి ఎలా నిలబెట్టాలా అన్న విషయం ఆలోచించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నది అదే. నేరాలు చేసిన వారిని విచారించి, నిర్ధారణ చేసే సంస్థలు వేరే ఉన్నాయి. కానీ, తెలుగు గడ్డపై పురుడుపోసుకుని, దిగంతాలకు ఒక వెలుగు వెలిగిన సంస్థ ఆరిపోకుండా చూసుకోవాలి. తమ తెలివితో, మేధస్సుతో ఒక మహా సంస్థ నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బంది భవితవ్యాన్ని కాపాడుకోవాలి. పుడమితల్లి నలుదిక్కులా తెలుగు వెలుగులను విస్తరించిన దీపం కొడిగట్టకుండా కనిపెట్టి చూడాలి. రాజకీయాలన్నవి ఆ పరిధికే పరిమితం కావాలి కానీ, తెలుగు యువత ఉజ్వల భవితకు రేచీకటిగా మారరాదు. ఆ దిశగా అడుగులు వేయడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం.
 అంతేకానీ, ఎద్దుల పోట్లాటలో లేగదూడలు నలిగిపోకూడదు.

-భండారు శ్రీనివాసరావు - జనవరి 2009

NOTE:All the images in the blog are copy righted to the respective owners

2, నవంబర్ 2011, బుధవారం

కాశ్మీర్ జోక్




కాశ్మీర్ జోక్
ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.
కాశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ముందు భారత  పౌరాణిక ఇతిహాసంలోని  ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కాశ్యప మహర్షి అనే దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన కాశ్మీర్ లో  సంచారం చేస్తుండగా ఒక చోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార  వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు చేరేసరికి అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....”
భారత ప్రతినిధి ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.
“ అంత పురాతన కాలంలో పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.”
“అదే నేను కూడా చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్ ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.”
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు  వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు.
తోక: నెట్లో కనబడ్డ ఓ ఇంగ్లీష్ జోక్ కు ఇది తెలుగు అనువాదమని నేను కూడా వేరే రాయనక్కరలేదు (02-11-2011)