28, మే 2011, శనివారం

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

(28-05-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం) 

రాష్ట్ర రాజకీయాలు దశాదిశా తెలియని స్తితిలో నాలుగు రోడ్ల కూడలిలో చతికిలపడి వున్నాయి.

ప్రధాన పార్టీల్లో పాలక పక్షం కాంగ్రెస్ ది ఒక విచిత్రమయిన స్తితి. అధికారంలో వున్నామా లేదా అని ఎప్పటికప్పుడు గిల్లి చూసుకోవాల్సిన పరిస్తితి. ప్రజలు పగ్గాలు ‘చేతి’కిచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. మామూలుగా అయితే మన్నూ మిన్నూ ఏకమయ్యేలా సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం. రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలు గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన తరుణం. పత్రికలనిండా ప్రకటనలతో హోరెత్తించాల్సిన సమయం. కానీ అంతా గుప్ చుప్. అంతటా నీరవ నిశ్శబ్ధం. దీనికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న కడప గడపలో మాడు బొప్పికట్టేలా తగిలిన దెబ్బ. దెబ్బ తగులుతుందని తెలిసినా కాచుకోలేని దుస్తితి. ఇంత గట్టిగా తగులుతుందని ఊహించలేని నిస్సహాయ స్తితి. ఏదయితేనేం దెబ్బకు ఢిల్లీ దిగివచ్చింది. కేంద్రంలో ఆరోగ్య శాఖ చూస్తున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ పార్టీకి సోకిన అనారోగ్యాన్ని సరిచేయడానికి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. ఆ రెండ్రోజులు రాష్ట్ర రాజధానిలో సందడే సందడి. గొంతెమ్మ కోర్కెలతో కొందరు, గొంతువరకు దిగమింగుకున్న ఆగ్రహంతో మరికొందరు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో, చిన్నాచితకా నాయకులతో ఆజాద్ మంతనాలు ఏకధాటిగా సాగాయి. ఏదో జరగబోతోందన్న భ్రమలు కల్పించాయి. కానీ ఆయన చేతిలో మాత్రం ఏముంది. అసలు మంత్ర దండం హస్తినలో వుంది. రోగ నిర్ధారణ చేయగలరేమోకానీ, రోగనిదానం తన చేతులో లేదన్న విషయం ఆయనకూ తెలుసు. అందుకే చెప్పాల్సిన నాలుగు ముక్కలు పర్యటన చివర్లో ముక్తసరిగా మీడియాకు చెప్పేసి ఢిల్లీ విమానం ఎక్కేసారు. కాంగ్రెస్ కధ తెలిసిన వారికి ఇక చెప్పే కధ ఏముంటుంది. షరా మామూలు ప్రకటనలు. షరా మామూలు ఊహాగానాలు. ముఖ్యమంత్రికి క్లాసు తీసుకున్నారనీ, సహచర మంత్రులతో వ్యవహార శైలిని మార్చుకోవాలంటూ సలహా ఇచ్చారనీ రకరకాల కధనాలు. అసలు ముఖ్యమంత్రినే మారుస్తున్నారంటూ పలురకాల ప్రచారాలు. ఇంతాచేసి ఆజాద్ వచ్చి సాదించింది ఏమిటంటే సున్నకు సున్న హళ్లికి హళ్లి. ఆయన పరిస్తితీ అంతంత మాత్రమే. ఆజాద్ ఇంచార్జ్ గా వున్న తమిళనాడు ఎన్నికల్లో ఏమిజరిగిందో ఎవరికి తెలియంది కనుక.



ఇక తెలంగాణా వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి వొదలని మరో తలనొప్పి. అయితే ఇది కాంగ్రెస్ కు ఒకరకంగా శాపం. ఒకరకంగా వరం. ప్రధాన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీని మరింత ఇరుకున పెట్టడానికి రాష్ట్ర విభజన వ్యవహారం ఆ పార్టీకి కొంతమేరకు కలసివస్తోంది. తెలంగాణాను కోరుకుంటున్న టీఆర్ఎస్ కూడా ఈ విషయం లో టీడీపీ పైనే ఎక్కువగా బాణాలు ఎక్కుపెడుతోంది. ఇది ఒకరకంగా కాంగ్రెస్ కు ఊరటే. కానీ సొంత పార్టీ నాయకులు కలిగిస్తున్న ఇబ్బందులే కాంగ్రెస్ ను ఎక్కువగా ఇరకాటం లోకి నెడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య రగిలిన రగడే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సచివుల సమరానికి ఇంకా తెర పడక ముందే కేంద్రం లో మరో ఇద్దరు మంత్రులు- కపిల్ సిబాల్, జై రాం రమేష్ ల నడుమ కీచులాట తెరపైకి వచ్చింది. ఇక చెప్పేదేముంది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? కల్ల.

స్తానిక సంస్తల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతున్న మరో అగ్ని పరీక్ష. ఎన్నికలు వాయిదా వేయడానికి వీలులేకుండా సుప్రీం ఆంక్షలు. మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో గెలుపు మీద సన్నగిల్లుతున్న ఆశలు. ఏమిచేయాలో పాలుబోని స్తితి. మధ్యేమార్గంగా పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిపితే పోలా అన్న ఆలోచనలు. గెలిచినవాడే మనవాడు అనుకుంటే చిక్కేలేదు. వోడినా వోడిపోయామన్న బాధా వుండదు. వోటమికి బాధ్యతా వుండదు.


ఇక, సొంత పార్టీలో లుకలుకలా కాంగ్రెస్ కు కొత్తేమీ కాదు. పోతే, తెలంగాణా పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారం, వాళ్లు పెడుతున్న డెడ్ లైన్లు. వాటి విషయం అధిష్టానమే చూసుకుంటుందన్న ధీమా. ఏ పార్టీకి లేని అదనపు సౌలభ్యం కాంగ్రెస్ కు మరోటి వుంది. మరో మూడేళ్లదాకా అధికారం చేతిలో వుంటుంది, చేజేతులా చేజార్చుకుంటే తప్ప. అందుకే, ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి రోడ్డు కూడలిలో మరో మూడేళ్ళు నిశ్చింతగా వేచి వుండొచ్చు.

పోతే తెలుగు దేశం. తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురయిన పరాభవం నుంచి పూర్తిగా తేరుకోకముందే కడప ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని వైనం ఆ పార్టీని మరింత కుంగ తీసింది. ప్రధాన ప్రతిపక్షంగా వుంటూ ప్రజా సమస్యలను పట్టించుకుంటున్న పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అవన్నీ నీరు కారిపోతున్నాయన్న బాధ ఆ పార్టీది. ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఆ గుర్తింపును ఎగరేసుకుపోతున్నతీరును టీడీపీ ఓ పట్టాన జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి తోడు పులి మీది పుట్రలా సొంత పార్టీలో తెలంగాణ రగిల్చిన చిచ్చు. రాష్ట్రం చీలకముందే దాదాపు అన్ని పార్టీలు నిట్టనిలువుగా ఈ అంశంపై చీలిపోయాయి. రెండు కళ్ళ సిద్ధాంతంతో నెట్టుకొస్తున్న తెలుగుదేశం కూడా మినహాయింపు కాదు. నాగం ఉదంతమే దీనికి ఉదాహరణ. గండిపేట తెలుగు విజయం ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమయిన ముప్పయ్యో మహానాడు లో కూడా తెలంగాణా చిచ్చు రాజుకోకతప్పేట్టు లేదు. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన స్తితి. తేల్చుకోలేని పరిస్తితి. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ తెలుగుదేశం ఎదుర్కుంటున్న అవస్త ఇది. దీనికి తోడు వారసత్వ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలను గురించి వార్తా కధనాలు వెలువడుతూ వుండడం మరో విచిత్రమయిన పరిస్తితి. నిజమే, తెలుగు దేశం పార్టీ వయస్సులో చిన్నదేమీ కాదు. యువకులుగా వుంటూ ప్రారంభంలోనే పార్టీలో చేరిన వారు ఇప్పటికి షష్టిపూర్తి చేసుకుని వుంటారు. కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఆసన్న మయింది. అలాగని, ఈ ‘వార్’సత్వం వ్యవహారాన్ని మరింత ముదరనివ్వడం అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న ఆ పార్టీకి మేలు చేయదు. మహానాడు లోనయినా దీనికి ముగింపు పలికితే ఆ పార్టీని ఆదినుంచీ అభిమానిస్తున్నవాళ్ళు సంతోషిస్తారు. ఎవరో అన్నట్టు రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం. పార్టీని పునరుజ్జీవింప చేయాలనుకునే వాళ్లు ఈ విషయాన్ని గమనం లో పెట్టుకోవాలి.

క్రాస్ రోడ్డులో వున్న మరో పార్టీ టీ ఆర్ ఎస్. నిజానికి ఉద్యమ పార్టీ అయిన టీ ఆర్ ఎస్ కు కూడలిలో నిలబడి ఎదురుచూపులు చూడాల్సిన పని లేదు. తెలంగాణా ఒక్కటే లక్ష్యం కనుక పక్క దారి పట్టాల్సిన అవసరమూ లేదు. కానీ, కలుపుకుపోతేనే తప్ప విడిపోవాలన్న ప్రధాన ధ్యేయం నెరవేరని స్తితి దానిది. ఎప్పటికప్పుడు గమ్యానికి దగ్గరగా వస్తూ దూరం జరిగిపోతున్న అనుభవాలు ఈ పార్టీ సొంతం. బలమూ, బలహీనతలు తెలిసిన నాయకత్వం కనుక విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ, వైఫల్యాలకు ఇతర పార్టీలను బాధ్యులను చేయడం టీ ఆర్ ఎస్ ప్రధానమయిన ఎత్తుగడగా చేసుకుంది. కిందపడ్డా పైచేయి అనిపించుకోవడంలో ఈ పార్టీకి ఎవ్వరూ సాటి కాదు. పోటీ కాదు. నిర్దేశించిన గడువులను పెంచుకుంటూ పోగల వెసులుబాటు ఈ పార్టీకి వున్నట్టుగా మరొకరికి లేదు. ప్రజల భావోద్వేగాలే పునాది కాబట్టి నాలుగు రోడ్ల కూడలిలో ఎన్నాళ్ళయినా వేచివుండగల అవకాశం వుంది.

అన్న ప్రాసన రోజునే ఆవకాయ తిని అరిగించుకోగల పుష్టి పుష్కలంగా వున్నట్టు రుజువు చేసుకుంది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని వై ఎస్ ఆర్ పార్టీ. కడప ఉప ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఆ పార్టీలో అనూహ్యమయిన ఆత్మ స్తయిర్యాన్ని నింపితే, ఇతర పార్టీలలో న్యూనతా భావాన్ని పెంచి పోషించింది. తనది వాపు కాదు బలుపు అని నిరూపించుకోవాలనో ఏమో వై ఎస్ జగన్ స్వరం పెంచి మరీ సవాళ్లు విసురుతున్నారు. తన విజయం కడప గడప వరకే పరిమితం కాదని నిరూపించుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. పాలక పక్షాన్ని ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాడే ప్రధాన ప్రతిపక్ష పాత్రను తనకు తానుగా భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. కడప సమరంలో కకావికలయిన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను మరింత ఉక్కిరిబిక్కిరి చేసే క్రమంలో తన రాజకీయ ఎత్తుగడలకు రూపకల్పన చేసుకుంటున్న తీరు స్పష్టం అవుతోంది. ఏనాటికయినా జగన్ కాంగ్రెస్ పంచన చెరక తప్పదని కాంగ్రెస్ అధినాయకత్వం స్తాయిలో వెలువడుతున్న సంకేతాలను, ప్రచారాన్ని తిప్పికొట్టడాని కేమోనన్నట్టుగా జగన్ అప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు గమనార్హం. కాపురం చేసే కళ కాలిమెట్టెలు చెబుతాయన్నట్టుగా నూతన కార్యవర్గం లో తనదయిన బలమయిన సామాజిక వర్గానికే జగన్ పెద్దపీట వేసి, బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూసారన్న సణుగుళ్ళు, సన్నాయి నొక్కులు అప్పుడే మొదలయ్యాయి. పార్టీ పదవుల పంపకం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో ధక్కామొక్కీలు తిన్న పార్తీలే ఈ విషయంలో తల బొప్పిళ్ళు కట్టించుకున్న దాఖలాలు అనేకం. అయినా అనుభవం నేర్పే పాఠాల ముందు మరొకరు నేర్పే నీతి బోధలు బలాదూరే. అయితే, జనాన్ని నమ్ముకుని నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ వై ఎస్ జగన్ కు లక్ష్యం కడు దూరం లో వుంది. మధ్యలో కాడి వొదిలేయ్యకుండా ముందుకు సాగాల్సిన బరువయిన బాధ్యత కూడా ఆయన భుజస్కందాలపై వుంది. జారిపోతే, పార్టీనే జావకారిపోతుంది.

సామాజిక న్యాయం నినాదంతో ప్రజల ముందుకు వచ్చి, ప్రజా తీర్పుకు కట్టుబడివుండే ఓరిమి లేకుండా కాంగ్రెస్ లో విలీనం కావడానికి సిద్ధపడిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దశా దిశా కోల్పోయి నాలుగు రోడ్ల నడుమ దిక్కులు చూస్తోంది. నిర్దేశించుకున్న గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడానికి వీలులేకుండా ఇంజను పాడయి, ఇంధనం కరువయిన స్తితిలో ఆ పార్టీ అయోమయావస్తలో వుంది.

పోతే, వామపక్షాలు - పశ్చిమ బెంగాల్ లో ఎదురయిన ఘోర పరాభవంతో దిక్కు తోచని స్తితిలో వున్నాయి. రాష్ట్రం లో మారిపోతున్న రాజకీయ సమీకరణాల్లో తమను ఇముడ్చుకోగల రాజకీయ ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నాయి. ఏదో ఆసరాతో కూడలి దాటినా ఎక్కబోయే అధికార పీఠం అంటూ ఏమీ లేదు కనుక వేచిచూసే సహజ వైఖరిని కొనసాగిస్తున్నాయి.

రాష్ట్రం లోని రాజకీయ పక్షాలన్నీ మొత్తం మీద దిశా నిర్దేశనం దొరకని స్తితిలో వున్నాయనే చెప్పాలి. కానీ, దీనివల్ల వాటికి వాటిల్లే తక్షణ ప్రమాదం ఏమీ లేదు. కానీ, జనం మాటేమిటి? వాళ్ళిలా ఎన్నాళ్ళు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడాలి? (27-05-2011)
























21, మే 2011, శనివారం

మూడో కృష్ణుడు రానున్నారా ? – భండారు శ్రీనివాసరావు

మూడో కృష్ణుడు రానున్నారా ? – భండారు శ్రీనివాసరావు


(21-05-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)

కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ హైదరాబాద్ రానున్నారని వార్తలు వచ్చినప్పుడు ఆయన ఎజెండాలో ‘జగన్- తెలంగాణా’ అనే రెండే రెండు అంశాలు వున్నాయని అంతా అనుకున్నారు.



అయితే, రాష్ట్ర రాజధానిలో రెండు రోజులు మకాం వేసిన ఆజాద్ - చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కాంగ్రెస్ నాయకులను విడివిడిగా కలివిడిగా కలుసుకుని అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడే స్తానిక మీడియా ఆయన ఎజెండాలో ‘ముఖ్యమంత్రి మార్పు’ అనే మరో విషయాన్ని తనకు తానుగా చేర్చింది. ఆజాద్ ని కలిసి వచ్చిన వాళ్ళలో అనేకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందినవాళ్ళే మీడియా ముందు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై ఆజాద్ కు ఫిర్యాదు చేసినట్టు బహిరంగంగా చెప్పడం ఈ ఊహాగానాలకు మరింత ఊపిరి పోసింది.

ఆజాద్ హైదరాబాదులో వున్న సమయంలోనే, పార్టీ నాయకులతో, సహచర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న తీరు గురించి, కడప ఉప ఎన్నికల్లో రాష్ట్ర అధినాయకత్వం వైఫల్యం గురించి ఢిల్లీ నాయకులకు పెద్దయెత్తున ఫిర్యాదులు అందినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కార్యకర్తలు కోరుతున్నది సీ ఎం మార్పా లేక సీ ఎం లో మార్పా అని ఆజాద్ వాకబు చేసినట్టు కూడా సమాచారం. బహుశా దీన్ని దృష్టిలో వుంచుకునే కాబోలు ఆజాద్ వెంట హైదరాబాదు వచ్చిన మరో ఏ ఐ సీ సీ ప్రతినిధి కృష్ణమూర్తి ఢిల్లీ తిరిగి వెడుతూనే ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వార్తలను ఖండించారు. కిరణ్ కుమార్ రెడ్డి పై ఎలాటి ఫిర్యాదులు రాలేదని, తమను కలుసుకున్న రాష్ట్ర నాయకుల్లో ముఖ్యమంత్రిని ప్రశంసించిన వారే ఎక్కువనీ వివరణ ఇచ్చుకున్నారు.

నిజానికి ముఖ్యమంత్రి మార్పు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో నష్ట నివారణకు దోహదం చేస్తుందని అనుకోవడానికి లేదు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమయంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య మంత్రుల మార్పు పార్టీకి ఎంత చేటు తెచ్చిందో అందరికీ తెలుసు. అయినా అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకునే సంస్కృతి ఆ పార్టీలో లేదు. అందువల్లనే మళ్ళీ అదే పొరబాటు మళ్ళీ చేసి 1989 లో ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని తదుపరి ఎన్నికల్లో బంగారు పళ్ళెంలో పెట్టి తెలుగుదేశానికి అందించిన ఘనమయిన గతం కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం.

అయితే, ఆజాద్ పర్యటన లక్ష్యం ముఖ్యమంత్రి మార్పు కాదన్నది ఆయన మాటల్లోనే తేలిపోయింది. అలాగని మూడేళ్లలో ఎదురయ్యే ఎన్నికలను ప్రస్తుత ముఖ్యమంత్రి నేతృత్వం లోనే నిర్వహిస్తారా అంటే అనుమానమే. ఎవరిని ఎంతవరకు వాడుకోవాలి? ఎవరిని ఎప్పుడు విసిరి కొట్టాలి? అన్నది కాంగ్రెస్ అధిష్టానానికి వెన్నతో పెట్టిన విద్య.



మొత్తం పదిహేడు గంటల్లో రెండువేలమందిని కలుసుకున్నానని గులాం నబీ ఆజాదే పర్యటన ముగింపులో మీడియాతో చెప్పారు. అంటే తనను కలుసుకున్నవాళ్ళల్లో ఒక్కొక్కరికీ ఆయన ఇచ్చిన సమయం యాభయ్ సెకన్లకు మించదు. అయినా చాలామంది బయట మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ దూతలకు తమ మనసులోని భావాలను పూసగుచ్చి చెప్పుకోగలిగామన్న సంతృప్తిని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఈ రకమయిన భేషజాలు అతి సహజమే. మహిళా కాంగ్రెస్ నేత గంగాభవాని ఒక అడుగు ముందుకు వేసి – మరో మూడేళ్లపాటు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆజాద్ తనకు హామీ ఇచ్చినట్టు మీడియాతో చెప్పడం ఈ భేషజాలకు పరాకాష్టగా భావించాలి లేదా ఆవిడ స్వామి భక్తికి దీన్నొక మచ్చుతునకగా పరిగణించి వొదిలివేయాలి.

ఒక పక్క గుంటూరులో వేలసంఖ్యలో జనం పాల్గొన్న జగన్ రైతు దీక్ష ముగింపు సభకు జగన్ అనుకూల కాంగ్రెస్ శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అనేకమంది హాజరవుతున్న సమయంలోనే మరోపక్క హైదరాబాదులో గులాం నబీ ఆజాద్ ని కలవడానికి తిరునాళ్ళ మాదిరిగా కాంగ్రెస్ శ్రేణులు కదిలివచ్చాయి. వినదగునెవ్వరు చెప్పిన తరహాలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఆజాద్ కొనసాగిస్తూనే తన అజెండాలోని అంశాలు అంటే – జగన్ గురించీ, తెలంగాణా గురించీ ఆరా తీసారని బుల్లితెరలపై స్క్రోలింగులు పరుగులు తీసాయి. ఆయన్ని కలవడానికి వచ్చినవాళ్ళు కూడా తమ మనసులోని అజెండాని మరిచిపోయినట్టులేదు. గాడితప్పిందని అనుకుంటున్న రాష్ట్ర పార్టీ పరిస్తితులను చక్కదిద్దేందుకు అధిష్టానం పనుపున వచ్చిన ఆజాద్ ని దాదాపు అందరూ కోరిన ఒకే విషయం పదవుల పంపిణీ వ్యవహారం. పార్టీ పదవులు, నామినేటేడ్ పదవులు గురించి వేచి చూస్తూనే విలువయిన రెండేళ్ళ కాలం ఇట్టే గడిచిపోయిందని, ఇంకా ఇలానే రోజులువెళ్ళదీస్తే వచ్చేఎన్నికలనాటికి పార్టీ తరపున నిలబడే కార్యకర్తలను కూడా వెతుక్కోవాల్సివుంటుందని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ రకమయిన నాన్చుడు ధోరణి వల్ల నిస్పృహ చెందే పార్టీ శ్రేణులు అందుబాటులోకి వచ్చిన ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించే అవకాశం వుంది కాబట్టి వెంటనే ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం గురించి నొక్కిచెప్పారు.



ఆజాద్ తో భేటీని రవ్వంత బాగానే ఉపయోగించుకున్నామన్న సంకేతాలను మీడియాలోకి వొదలడంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సఫలమయ్యారనే చెప్పాలి. వారికి తీసిపోని రీతిలో సీమాంధ్ర ఎంపీలు సయితం తమ వాణిని, వాదాన్ని బలంగానే వినిపించారు. మధ్యే మార్గంగా అమలాపురం కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ - హైదరాబాదును ఉమ్మడి రాజధానిని చేసి తెలంగాణా ఇచ్చినా సమ్మతమేనన్న ధోరణిలో ఏకంగా ఒక లిఖితపూర్వక మెమోరాండాన్నే ఆజాద్ కు అందచేసినట్టు భోగట్టా. ఇక ఈసారి తెలంగాణా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, గతంలో డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన అనంతరం సీమాంధ్ర సహచరులు తమకు కొట్టిన గండిని గుర్తుపెట్టుకుని కాస్తంత గొంతు పెంచి మరీ తమ వాదాన్ని వినిపించారు. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు మినహా తమకు ఏదీ సమ్మతం కాదన్న హెచ్చరికను ఆజాద్ కోర్టులో వుంచారు. తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం అతి తొందరగా ప్రకటన చేయని పక్షంలో అసలు సిసలు అస్త్రం తమ జేబులోనే వుందని పీ సీ సీ మాజీ నేత కేశవరావు కుండ బద్దలు కొట్టారు. తన అజెండాలో తెలంగాణా అంశం వుండడంవల్లనో ఏమో ఆజాద్ కూడా ఇరుపక్షాల వాదనను శ్రద్ధగా విన్నారు.

కడప ఉప ఎన్నికల ప్రభావం పార్టీపై , ప్రభుత్వంపై ఏమాత్రం వుండదంటూ చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా వైఎస్సార్ పార్టీ గురించి పైకి పట్టనట్టు కనిపించినా, ఢిల్లీ నాయకులు మాత్రం పార్టీ శ్రేణులనుంచి తగిన సమాచారాన్నే రాబట్టినట్టు భోగట్టా.

జగన్ మోహన్ రెడ్డిని ఆదినుంచి వ్యతిరేకిస్తున్నవారు ఆజాద్ తో జరిపిన భేటీలో తమ పాత పల్లవినే మరోమారు వినిపించారు. సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు దిద్దుబాటుకు కూడా వీలులేకుండా పార్టీ దెబ్బతినిపోతుందని అధిష్టానాన్ని హెచ్చరించారు. పార్టీలో వున్న జగన్ కోవర్టులపై వెంటనే వేటు వేయాలని,

ప్రభుత్వం వద్ద వున్న అధికారాలతో విచారణలు ప్రారంభించి జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలని కూడా సలహా ఇచ్చారు.

మంత్రివర్గంలోనే జగన్ కోవర్టులు వున్నారంటూ మరో కలకలం చెలరేగింది. నలుగురు మంత్రులు జగన్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని, వారిని మంత్రివర్గం నుంచి తొలగించాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే గులాం నబీ ఆజాద్ ని కోరినట్టు పత్రికల్లో వార్తలు గుప్పుమన్నాయి. పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి, ఎంపీ మధు యాష్కీ, మంత్రి శంకర్ రావు, మాజీ మంత్రి జే సీ దివాకర్ రెడ్డి బాహాటంగా చేసిన ఆరోపణలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కొందరు మంత్రులు లోపాయికారీగా జగన్ కు సహకరిస్తున్నారన్నది వారి ఆరోపణల సారాంశం.



రెండు రోజులపాటు హైదరాబాదులో మకాం వేసి గులాం నబీ ఆజాద్ పార్టీ పరిస్తితి గురించి కొత్తగా తెలుసుకున్న విషయాలేమిటి అన్నది ఎవ్వరికీ అర్ధం కాని సంగతి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలూ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలీ ఆయనకు కొత్తేమీ కాదు. అలాగే, ఆజాద్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కొత్త కాదు. గతంలో సైతం ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి ఇప్పటి పాత్రనే పోషించి – రాజకీయ జాదూ అన్న కీర్తిని మూటగట్టుకున్నారు. కాకపొతే, రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ఏర్పడిన నూతన రాజకీయ వాతావరణానికి మాత్రం ఆజాద్ కొత్తే అని చెప్పాలి. అలాగే, వై ఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, కొత్త పార్టీ పెట్టి, ఇటీవలి కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ భవిష్యత్ పై ముసురుకుంటున్న నీలి నీడల నేపధ్యంలో రూపుదిద్దుకుంటున్న నూతన రాజకీయ చిత్రం మాత్రం ఆయనకు మరీ కొత్త అని చెప్పుకోవాలి.

అందుకే ఆయన అవసరం అయినదానికన్నా ఎక్కువ సమయమే పార్టీ వారికి కేటాయించారని అనుకోవాలి. పరిమితులు తెలిసిన అనుభవశాలి కనుక పార్టీ శ్రేణులు చెప్పిన విషయాలను ఓపిగ్గా వినడం ద్వారా వారి మనస్సులో గూడుకట్టుకుని వున్న ఆందోళనలు సమసిపోవడానికి ఒక వెంటిలేటర్ మాదిరిగా సాయపడ్డారనుకోవాలి. సమస్య తీర్చడం సాధ్యం కానప్పుడు సమస్యను వినడం ద్వారా దాని తీవ్రతను తగ్గించ వచ్చన్న సూత్రాన్ని ఆజాద్ తన హైదరాబాద్ పర్యటనలో బాగా ఉపయోగించుకున్నారు. ఆయన్ని కలిసిన ఏ ఒక్కరిని ఆయన నిరుత్సాహ పరచకపోవడమే ఇందుకు నిదర్శనం.

మొత్తం మీద ఆజాద్ హైదరాబాద్ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని కొందరు రాష్ట్ర నాయకులు సంతృప్తి పడుతున్నారు. విషయాలన్నీ అర్ధం చేసుకున్న ఢిల్లీ పెద్దలు తమ పీఠాలను ఎప్పుడు కదిలిస్తారో అని మరికొందరు కలత పడుతున్నారు.

కానీ ఒక విషయం.

వచ్చారు – విన్నారు – వెళ్లారు అనికాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆయన దిశా నిర్దేశం ఇచ్చినట్టయితే బాగుండేదని పార్టీ అభిమానులే పెదవి విరుస్తున్నారు. రైతు సమస్యలతో విపక్షాలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ పర్యటనలో పార్టీ సమస్యలు తప్ప ప్రజల సమస్యలు కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న విమర్శలను వాళ్లు ఉదహరిస్తున్నారు.

ఇక నుంచయినా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ‘జగన్నామ స్మరణ’కు స్వస్తిచెప్పి జనాలను పట్టించుకునేలా చేయగలిగితే ఆజాద్ హైదరాబాద్ పర్యటన ఫలవంతమైనదని సంతోషించవచ్చు. (21-05-2011)



13, మే 2011, శుక్రవారం

ఇది నిజం. నిజంగా నిజం – భండారు శ్రీనివాసరావు

ఇది నిజం. నిజంగా నిజం – భండారు శ్రీనివాసరావు




‘నేను చదువుకున్నవాడినన్న మాటే కాని నీకున్న ప్రపంచ జ్ఞానం నాకు లేదు’ అని ఈ మధ్య టీవీలో చూసిన ఓ సినిమాలో నిజాయితీగా వొప్పుకుంటుందొక మగ పాత్ర తన భార్యతో మాట్లాడుతూ.

క్షేత్రస్తాయి సమాచారం తెలుసుకోకుండా టీవీ చర్చల్లో పాల్గొనే కుహనా మేధావులనుంచి కూడా ఈ మాదిరి నిజాయితీని ఆశించడంలో తప్పులేదేమో. ఇప్పటికయినా వారి కళ్లు తెరిపిళ్లు పడివుంటాయేమో.

వీళ్ళతో వచ్చిన చిక్కేమిటంటే - వీళ్ళు తమ వాదమే వేదమనుకుంటారు. దాన్నే జనమంతా నమ్మాలనుకుంటారు.

కొన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. ఓ పెళ్ళిలో బాగా ఎరిగున్న ఓ ముసలావిడ కనిపించింది. ఎప్పుడు తారసపడ్డా ‘దేవుడికి నామీద దయకలగడంలేదల్లే వుంది. ఇంకెన్నాళ్లిలా బతకాలని రాసిపెట్టాడో!’ అని నిర్వేదంగా మాట్లాడుతుండేది. అలాటిది ఆరోజు ‘మరో నాలుగేళ్ళు బతికితే బాగుండు’ అనడం ఎంతో వింతగా అనిపించింది. ‘ఎందుకవ్వా?’ అనడిగితే ‘మరొక్కసారి ఆఖరుసారి వోటు వేసి చనిపోవాలనివుంద’న్నది. అదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే, స్వతంత్రం వచ్చినప్పటినుంచి ఆవిడ వోటు వెయ్యకుండా వున్న సందర్భం లేదు. ఆవిడది కాంగ్రెస్ కుటుంబం. ఆమె వొంట్లో పారేది కాంగ్రెస్ రక్తం. జనతా పార్టీ ప్రభంజనం, ఎన్టీయార్ సుడిగాలి వీస్తున్న రోజుల్లో కూడా ఆవిడ వోటు కాంగ్రెస్ కే. అభ్యర్ధి ఎవరన్నది అనవసరం. కాడి జోడెడ్ల గుర్తు నుంచి ఆవు దూడా గుర్తుకు, అక్కడినుంచి చేతి గుర్తుకు- ఆ పార్టీ గుర్తు మారిపోవడం గుర్తు పెట్టుకుని మరీ వోటు వేసేది. ఆమె గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది.

కానీ, ఆమె గురించి పూర్తిగా తెలియదన్న సంగతి మాత్రం ఆరోజు మాటల్లో బయట పడింది. ఈ మూడేళ్ళు ఎట్టాగో బతికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వోటు ‘వెయ్యకుండా’ చనిపోవాలన్నది తన ఆఖరు కోరిక అని చెప్పినప్పుడు అక్కడ వున్న వాళ్ళందరం ఆశ్చర్యపోయాము. రాజశేఖరరెడ్డి చనిపోయినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని, ఇక చస్తే ఆ పార్టీకి వోటు వెయ్యననీ ఖరాఖండిగా తేల్చిచెప్పింది. అప్పటికి వై ఎస్ జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీని వొదిలి పెట్టనూ లేదు. కొత్త పార్టీ పెట్టనూ లేదు. కాకపొతే, ఆయన తలపెట్టిన ఓదార్పు యాత్ర గురించి పార్టీలో నానా రభస సాగుతున్న రోజులవి.

కాంగ్రెస్ కు వోటు వెయ్యకుండా చనిపోవాలనివుందని ఆ ముసలావిడ చెప్పిన మాట రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితికి అద్దం పడుతోంది. కానీ, దురదృష్టం, సాధారణ జనంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కారణరహితంగా అభిమానించే వారిలో వచ్చిన ఈ మార్పుని గమనించకుండా ఇటు రాష్ట్ర స్తాయిలోనూ, అటు కేంద్రంలోనూ వున్న ఆ పార్టీ నాయకులు ఒంటెత్తు పోకడలకు పోయారు. దరిమిలా పార్టీ పట్ల ప్రజల్లో ఏర్పడ్డ ఏహ్యతే కడప ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది.(13-05-2011)



కడప ఉపఎన్నికల పోరు తీరు – భండారు శ్రీనివాసరావు

కడప ఉపఎన్నికల పోరు తీరు – భండారు శ్రీనివాసరావు


మే పదమూడు తరువాత ఏ జరగబోతోంది?

ఇప్పుడీ కొత్త ప్రశ్న ఒకటి జనం ముందు వచ్చి నిలుచుంది.

నిరుడు చివరాఖర్లో శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించే సమయంలో ‘డిసెంబర్ ముప్పై ఒకటి తరవాత ఏం జరుగుతుందన్న’ విలేకరుల ప్రశ్నకు గవర్నర్ నరసింహన్ జవాబిస్తూ ‘ఏం జరుగుతుంది జనవరి ఒకటి వస్తుంది’ అని పేర్కొన్న విషయం స్పురణకు వస్తుంది.

కడప ఉపఎన్నికలు ముగిసాయి. చెదురుమదురు స్వల్ప సంఘటనలు మినహాయిస్తే, మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పదమూడో తేదీన వోట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాల గురించి ఎవరికీ సందేహాలువున్నట్టులేదు. మెజారిటీ గురించిన ఊహాగానాలే అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన అనేక విలక్షణ లక్షణాల్లో ఇదొకటి.



ఈ ఎన్నికలతో పాటు దేశంలో మరో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశాన్ని సంకీర్ణ ధర్మంతో పాలిస్తున్న యూపీయే సర్కారు ముఖ్యంగా సోనియా గాంధీ నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాలకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఎందుకంటె మరో రెండేళ్ళల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో లోకసభకు సాధ్యమయినన్ని ఎక్కువ స్తానాలు గెలుచుకుని రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయాలన్న అభిమతం నెరవేరడానికి ఈ ఎన్నికల్లో సాధించే విజయాలే ఆ పార్టీకి కొత్త ఊపిరి పోస్తాయి. అయినా కానీ, అయిదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా కడప ఉప ఎన్నికలు యావద్భారత దృష్టిని ఆకట్టుకోగలిగాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సయితం ఈ ఉప ఎన్నికలపై ఓ కన్ను వేసే వుంచింది. ఎందుకంటె, ఈ ఉపఎన్నికల ఫలితాల వల్ల ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్తాయిలో ప్రభుత్వాలపై కానీ, పార్టీపై కానీ ఎలాటి ప్రభావం వుండదని ఎన్నికలకు ముందూ, పోలింగ్ తరవాత కూడా కాంగ్రెస్ నాయకులు పైకి బీరాలు పోతున్నప్పటికీ లోలోపల ఎవరి సందేహాలు వారికి వున్నట్టున్నాయి. ఏదో రెండు స్తానాలకు జరిగే ఉపఎన్నికల్లో గెలిచినా ఓడినా పోయేదేమీ వుండదని ఎంతమాత్రం ఉపేక్షించకుండా సర్వశక్తులు వొడ్డి పోరాడిన విధానమే ఈ వాస్తవాన్ని వెల్లడిస్తోంది. ఇక్కడే ఆ పార్టీ వ్యూహకర్తలు తప్పులో కాలేసినట్టు వుంది. ఈ ఉప ఎన్నికలకు అనవసర ప్రాముఖ్యత ఇచ్చి కొరివితో తల గోక్కున్నట్టు అయిందని పోలింగ్ ముగిసిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఏళ్లతరబడి పరిశీలిస్తూవస్తున్న తలపండిన మేధావులు, రాజకీయ పరిశీలకులు కూడా ఆ పార్టీలో అంతర్గతంగా వున్న ఒక విలక్షణ తత్వాన్ని మెచ్చుకోవడం కద్దు. మరే పార్టీలో కూడా కానరాని

అంతర్గత ప్రజాస్వామ్యం, దానితోపాటే నిగూఢంగా నిబిడీకృతమైన అధినాయక స్తాయి నియంతృత్వం – ఈ రెండూ కాంగ్రెస్ పార్టీకి బలమూ, బలహీనత. సీతారాం కేసరి కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి పార్టీ అధ్యక్ష స్తానంలో వుంటే చాలు - ఒకేరకమయిన భక్తిప్రపత్తులు ప్రదర్శించగల నాయకులకు, కార్యకర్తలకు కొదవ లేని పార్టీ అది. అదే సమయంలో పదవికి దూరమయిన అధినాయకులకు దూరం జరగడంలో ఎంతమాత్రం సంకోచం చూపనివారు ఆ పార్టీలో కనబడడం కష్టం. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తామని నోటితో ఓ పక్క చెబుతూనే మరోపక్క నొసటితో వెక్కిరించగల సమర్ధులు కాంగ్రెస్ లో లెక్కకు మిక్కిలిగా కనబడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం అంటూనే, కీలక స్తానాల్లో వున్నవారి పట్ల వ్యక్తిఆరాధన బహిరంగంగా ప్రదర్శించేవారయితే కోకొల్లలు. ఇంతటి వైచిత్రం, వైవిధ్యం కాంగ్రెస్ కే చెల్లు. విశ్వసనీయతకంటే విధేయతకే పెద్ద పీట వేస్తారని పార్టీలో కొత్తగాచేరినవారికి కూడా తెలుసు. సొంత నిర్ణయాలు తీసుకోగలిగీ తీసుకోనివారంటే పార్టీ పెద్దలకు చాలా ముద్దు. పైవారిని పల్లెత్తు మాటనకుండా పార్టీని పలుచన చేసే వ్యాఖ్యలు ఎన్ని చేసినా అడిగేవారుండరు.కలహిస్తూ కలసివుండడం అనేది ఈ పార్టీ లోని మరో విలక్షణ లక్షణం. అందుకే, ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ , కిందపడ్డా పైచేయి తనదే అన్న తీరులో దేశ రాజకీయాలను శాసించగలుగుతోంది. బలహీనతలను బలంగా మార్చుకుని నూతన జవసత్వాలతో శ్వాసించ గలుగుతోంది. వెయ్యిన్నొక్క లుకలుకలున్న పార్టీగా ముద్రవున్నా అవసరం వచ్చినప్పుడు పైనుంచి కింద దాకా ఒకే మాటగా వ్యవహరించగలుగుతోంది. పార్టీకి చేటు చేస్తాయనుకునే తప్పులను కూడా పదేపదే చేస్తూ నిభాయించుకోగలుగుతోంది. పార్టీలో కరడుగట్టుకుపోయిన ఈ స్వభావమే కడప ఉపఎన్నికల విషయంలో సయితం తన ధోరణిని ఎంతమాత్రం సడలించుకోనివ్వకుండా అడ్డుపడివుంటుంది. అభ్యర్ధుల నిర్ణయం నుంచి, ప్రచార సరళి వరకు ఇదే వరస. అదే తీరు. ప్రాణాంతకంగా మారగలదని తెలిసికూడా ప్రతిష్టాత్మకంగా పోరాడింది. దీనితో, బరిలోవున్న మిగిలిన రెండు పార్టీలు కూడా దానితో పోటీ పడడంతో ఈ ఉపఎన్నికలకు స్తాయిని మించిన ప్రచారం లభించడంతో కడప ఎన్నికలు రగిల్చి మిగిల్చి వెళ్ళిన వేడి ఇంతా అంతా కాకుండా పోయింది. సాధారణంగా జరగాల్సిన ప్రచారం అవధులు మించి సాగింది. విమర్శలు ఆరోపణలుగా, ఆరోపణలు వ్యక్తిగత నిందారోపణలుగా మారి కొండొకచో మాన్యులను సామాన్యులను ఏవగించుకునేలా చేసాయి. ఓ పక్క డబ్బు వెదజల్లుతూనే, మద్యం పంచుతూనే ఎదుటి పక్షం అదేపని చేయడాన్ని తూర్పార పట్టడాన్ని యెలా అర్ధం చేసుకోవాలో తెలియని పరిస్తితి. అన్నహజారే అవినీతి వ్యతిరేకపోరాటానికి బాసటగా వుంటాం అన్న వాళ్లందరూ ఇలా నిస్సిగ్గుగా వోటర్లను ప్రలోభపరిచే విధంగా అవినీతి కూపంలో కూరుకుపోవడం చూస్తున్న వారికి ‘భళా! రాజకీయం’ అనిపించింది. ‘మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి!’ అని నిలదీయాలని అనిపించివుంటుంది.

వోటరు తలకు విలువకట్టి, అతడు ప్రజాస్వామ్యబద్ధంగా వేయాల్సిన వోటుకు ధరకట్టి, వేలంపాటలో మాదిరిగా కొనుక్కుంటూ పైపెచ్చు వోటర్లను కొనుగోలు చేస్తున్నారని వైరి పక్షంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం



వోటరును నిలబెట్టి అవమానించడమేనని వారికెందుకు అనిపించలేదో అర్ధం కాని విషయం. అయినదానికీ, కానిదానికీ ప్రజాప్రయోజన వ్యాజ్యాలువేసే ప్రచారకండూతులకు ఇలా వోటర్లను అవమానించడం అన్న విషయం పెద్ద విషయంగా అనిపించలేదేమో. ఏ న్యాయస్తానమో, న్యాయమూర్తో కలిపించుకుని ప్రజాస్వామ్యానికి పునాదిరాయి అయిన వోటరును మీడియాలో, బహిరంగసభల్లో కొనుగోలు వస్తువుగా చూపిస్తూ అవమానించే పద్ధతికి స్వస్తి చెప్పేలా చేస్తే బాగుంటుందని ప్రజాస్వామ్య ప్రియులు ఎవరయినా కోరుకుంటారు.





నిజానికి ఉపఎన్నికల పోలింగ్ కడప జిల్లా గురించి ప్రచారం లో వున్న అపోహలకు, అపప్రధలకు భిన్నంగా జరిగింది. ఒక్క బాంబు పేలకుండా, ఒక్క పోలీసు తూటాకు కానీ, లాఠీకి కానీ పనిచెప్పకుండా, ఒక్క నెత్తురు చుక్క నేల రాలకుండా ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ‘వోటు మాకున్న ఏకైక హక్కు దాన్ని వాడుకుని తీరతాం’ అన్న పద్ధతిలో పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటలముందే పోలింగ్ కేంద్రాలముందు బారులుతీరి నిలబడ్డ కడప వోటర్లు శతధా అభినందనీయులు. ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా స్త్రీలు, పురుషులు, వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి వేచివుండి తమ వోటుహక్కు వినియోగించుకున్న తీరు టీవీల్లో గమనించిన వారికి ‘పరవాలేదు. మన దేశంలో ప్రజాస్వామ్యానికి ధోకా లేదనిపించివుంటుంది. కానీ, అదేసమయంలో మన రాజకీయనాయకులు ప్రచార వ్యవధిని సద్వినియోగం చేసుకోకుండా ఒకరిమీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం చూసినప్పుడు మన ప్రజాస్వామ్య సౌధంలో సేదదేరేవారు ఇలాటి వారా అన్న ఆవేదన కలుగుతుంది. బహిరంగ సభల్లో ప్రసంగించినా, రోడ్ షో లల్లో మాట్లాడినా, మీడియా సమావేశాల్లో ముచ్చటించినా, టీవీ చర్చల్లో పాల్గొన్నా అందరిదీ ఇదే తంతు.

చింతించి వగచడమే చివరికి మిగిలింది. (09-05-2011)



12, మే 2011, గురువారం

కడప పోరు తీరు – భండారు శ్రీనివాసరావు

కడప పోరు తీరు – భండారు శ్రీనివాసరావు
(12-05-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)  


మే పదమూడు తరువాత ఏ జరగబోతోంది?

ఇప్పుడీ కొత్త ప్రశ్న ఒకటి జనం ముందు వచ్చి నిలుచుంది.

నిరుడు చివరాఖర్లో శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించే సమయంలో ‘డిసెంబర్ ముప్పై ఒకటి తరవాత ఏం జరుగుతుందన్న’ విలేకరుల ప్రశ్నకు గవర్నర్ నరసింహన్ జవాబిస్తూ ‘ఏం జరుగుతుంది జనవరి ఒకటి వస్తుంది’ అని పేర్కొన్న విషయం స్పురణకు వస్తుంది.

కడప ఉపఎన్నికలు ముగిసాయి. చెదురుమదురు స్వల్ప సంఘటనలు మినహాయిస్తే, మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పదమూడో తేదీన వోట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాల గురించి ఎవరికీ సందేహాలువున్నట్టులేదు. మెజారిటీ గురించిన ఊహాగానాలే అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన అనేక విలక్షణ లక్షణాల్లో ఇదొకటి.

ఈ ఎన్నికలతో పాటు దేశంలో మరో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశాన్ని సంకీర్ణ ధర్మంతో పాలిస్తున్న యూపీయే సర్కారు ముఖ్యంగా సోనియా గాంధీ నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాలకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఎందుకంటె మరో రెండేళ్ళల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో లోకసభకు సాధ్యమయినన్ని ఎక్కువ స్తానాలు గెలుచుకుని రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయాలన్న అభిమతం నెరవేరడానికి ఈ ఎన్నికల్లో సాధించే విజయాలే ఆ పార్టీకి కొత్త ఊపిరి పోస్తాయి. అయినా కానీ, అయిదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా కడప ఉప ఎన్నికలు యావద్భారత దృష్టిని ఆకట్టుకోగలిగాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సయితం ఈ ఉప ఎన్నికలపై ఓ కన్ను వేసే వుంచింది. ఎందుకంటె, ఈ ఉపఎన్నికల ఫలితాల వల్ల ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్తాయిలో ప్రభుత్వాలపై కానీ, పార్టీపై కానీ ఎలాటి ప్రభావం వుండదని ఎన్నికలకు ముందూ, పోలింగ్ తరవాత కూడా కాంగ్రెస్ నాయకులు పైకి బీరాలు పోతున్నప్పటికీ లోలోపల ఎవరి సందేహాలు వారికి వున్నట్టున్నాయి. ఏదో రెండు స్తానాలకు జరిగే ఉపఎన్నికల్లో గెలిచినా ఓడినా పోయేదేమీ వుండదని ఎంతమాత్రం ఉపేక్షించకుండా సర్వశక్తులు వొడ్డి పోరాడిన విధానమే ఈ వాస్తవాన్ని వెల్లడిస్తోంది. ఇక్కడే ఆ పార్టీ వ్యూహకర్తలు తప్పులో కాలేసినట్టు వుంది. ఈ ఉప ఎన్నికలకు అనవసర ప్రాముఖ్యత ఇచ్చి కొరివితో తల గోక్కున్నట్టు అయిందని పోలింగ్ ముగిసిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఏళ్లతరబడి పరిశీలిస్తూవస్తున్న తలపండిన మేధావులు, రాజకీయ పరిశీలకులు కూడా ఆ పార్టీలో అంతర్గతంగా వున్న ఒక విలక్షణ తత్వాన్ని మెచ్చుకోవడం కద్దు. మరే పార్టీలో కూడా కానరాని

అంతర్గత ప్రజాస్వామ్యం, దానితోపాటే నిగూఢంగా నిబిడీకృతమైన అధినాయక స్తాయి నియంతృత్వం – ఈ రెండూ కాంగ్రెస్ పార్టీకి బలమూ, బలహీనత. సీతారాం కేసరి కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి పార్టీ అధ్యక్ష స్తానంలో వుంటే చాలు - ఒకేరకమయిన భక్తిప్రపత్తులు ప్రదర్శించగల నాయకులకు, కార్యకర్తలకు కొదవ లేని పార్టీ అది. అదే సమయంలో పదవికి దూరమయిన అధినాయకులకు దూరం జరగడంలో ఎంతమాత్రం సంకోచం చూపనివారు ఆ పార్టీలో కనబడడం కష్టం. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తామని నోటితో ఓ పక్క చెబుతూనే మరోపక్క నొసటితో వెక్కిరించగల సమర్ధులు కాంగ్రెస్ లో లెక్కకు మిక్కిలిగా కనబడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం అంటూనే, కీలక స్తానాల్లో వున్నవారి పట్ల వ్యక్తి ఆరాధన బహిరంగంగా ప్రదర్శించేవారయితే కోకొల్లలు. ఇంతటి వైచిత్రం, వైవిధ్యం కాంగ్రెస్ కే చెల్లు. విశ్వసనీయతకంటే విధేయతకే పెద్ద పీట వేస్తారని పార్టీలో కొత్తగాచేరినవారికి కూడా తెలుసు. సొంత నిర్ణయాలు తీసుకోగలిగీ తీసుకోనివారంటే పార్టీ పెద్దలకు చాలా ముద్దు. పైవారిని పల్లెత్తు మాటనకుండా పార్టీని పలుచన చేసే వ్యాఖ్యలు ఎన్ని చేసినా అడిగేవారుండరు.కలహిస్తూ కలసివుండడం అనేది ఈ పార్టీ లోని మరో విలక్షణ లక్షణం. అందుకే, ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ , కిందపడ్డా పైచేయి తనదే అన్న తీరులో దేశ రాజకీయాలను శాసించగలుగుతోంది. బలహీనతలను బలంగా మార్చుకుని నూతన జవసత్వాలతో శ్వాసించ గలుగుతోంది. వెయ్యిన్నొక్క లుకలుకలున్న పార్టీగా ముద్రవున్నా అవసరం వచ్చినప్పుడు పైనుంచి కింద దాకా ఒకే మాటగా వ్యవహరించగలుగుతోంది. పార్టీకి చేటు చేస్తాయనుకునే తప్పులను కూడా పదేపదే చేస్తూ నిభాయించుకోగలుగుతోంది. పార్టీలో కరడుగట్టుకుపోయిన ఈ స్వభావమే కడప ఉపఎన్నికల విషయంలో సయితం తన ధోరణిని ఎంతమాత్రం సడలించుకోనివ్వకుండా అడ్డుపడివుంటుంది. అభ్యర్ధుల నిర్ణయం నుంచి, ప్రచార సరళి వరకు ఇదే వరస. అదే తీరు. ప్రాణాంతకంగా మారగలదని తెలిసికూడా ప్రతిష్టాత్మకంగా పోరాడింది. దీనితో, బరిలోవున్న మిగిలిన రెండు పార్టీలు కూడా దానితో పోటీ పడడంతో ఈ ఉపఎన్నికలకు స్తాయిని మించిన ప్రచారం లభించడంతో కడప ఎన్నికలు రగిల్చి మిగిల్చి వెళ్ళిన వేడి ఇంతా అంతా కాకుండా పోయింది. సాధారణంగా జరగాల్సిన ప్రచారం అవధులు మించి సాగింది. విమర్శలు ఆరోపణలుగా, ఆరోపణలు వ్యక్తిగత నిందారోపణలుగా మారి కొండొకచో మాన్యులను సామాన్యులను ఏవగించుకునేలా చేసాయి. ఓ పక్క డబ్బు వెదజల్లుతూనే, మద్యం పంచుతూనే ఎదుటి పక్షం అదేపని చేయడాన్ని తూర్పార పట్టడాన్ని యెలా అర్ధం చేసుకోవాలో తెలియని పరిస్తితి. అన్నహజారే అవినీతి వ్యతిరేకపోరాటానికి బాసటగా వుంటాం అన్న వాళ్లందరూ ఇలా నిస్సిగ్గుగా వోటర్లను ప్రలోభపరిచే విధంగా అవినీతి కూపంలో కూరుకుపోవడం చూస్తున్న వారికి ‘భళా! రాజకీయం’ అనిపించింది. ‘మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి!’ అని నిలదీయాలని అనిపించివుంటుంది.

వోటరు తలకు విలువకట్టి, అతడు ప్రజాస్వామ్యబద్ధంగా వేయాల్సిన వోటుకు ధరకట్టి, వేలంపాటలో మాదిరిగా కొనుక్కుంటూ పైపెచ్చు వోటర్లను కొనుగోలు చేస్తున్నారని వైరి పక్షంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం

వోటరును నిలబెట్టి అవమానించడమేనని వారికెందుకు అనిపించలేదో అర్ధం కాని విషయం. అయినదానికీ, కానిదానికీ ప్రజాప్రయోజన వ్యాజ్యాలువేసే ప్రచారకండూతులకు ఇలా వోటర్లను అవమానించడం అన్న విషయం పెద్ద విషయంగా అనిపించలేదేమో. ఏ న్యాయస్తానమో, న్యాయమూర్తో కలిపించుకుని ప్రజాస్వామ్యానికి పునాదిరాయి అయిన వోటరును మీడియాలో, బహిరంగసభల్లో కొనుగోలు వస్తువుగా చూపిస్తూ అవమానించే పద్ధతికి స్వస్తి చెప్పేలా చేస్తే బాగుంటుందని ప్రజాస్వామ్య ప్రియులు ఎవరయినా కోరుకుంటారు.

నిజానికి ఉపఎన్నికల పోలింగ్ కడప జిల్లా గురించి ప్రచారం లో వున్న అపోహలకు, అపప్రధలకు భిన్నంగా జరిగింది. ఒక్క బాంబు పేలకుండా, ఒక్క పోలీసు తూటాకు కానీ, లాఠీకి కానీ పనిచెప్పకుండా, ఒక్క నెత్తురు చుక్క నేల రాలకుండా ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ‘వోటు మాకున్న ఏకైక హక్కు దాన్ని వాడుకుని తీరతాం’ అన్న పద్ధతిలో పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటలముందే పోలింగ్ కేంద్రాలముందు బారులుతీరి నిలబడ్డ కడప వోటర్లు శతధా అభినందనీయులు. ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా స్త్రీలు, పురుషులు, వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి వేచివుండి తమ వోటుహక్కు వినియోగించుకున్న తీరు టీవీల్లో గమనించిన వారికి ‘పరవాలేదు. మన దేశంలో ప్రజాస్వామ్యానికి ధోకా లేదనిపించివుంటుంది. కానీ, అదేసమయంలో మన రాజకీయనాయకులు ప్రచార వ్యవధిని సద్వినియోగం చేసుకోకుండా ఒకరిమీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం చూసినప్పుడు మన ప్రజాస్వామ్య సౌధంలో సేదదేరేవారు ఇలాటి వారా అన్న ఆవేదన కలుగుతుంది. బహిరంగ సభల్లో ప్రసంగించినా, రోడ్ షో లల్లో మాట్లాడినా, మీడియా సమావేశాల్లో ముచ్చటించినా, టీవీ చర్చల్లో పాల్గొన్నా అందరిదీ ఇదే తంతు.

చింతించి వగచడమే చివరికి మిగిలింది. (11-05-2011)



10, మే 2011, మంగళవారం

Will Cong, TDP dare take action against rebels?-Bhandaru SrinivasRao (I.I.S.)

Will Cong, TDP dare take action against rebels?-Bhandaru SrinivasRao (I.I.S.)

Growing indiscipline within the ruling Congress and Telugu Desam indicates what is in store for state politics in coming days. Though show cause notices were slapped on all those erring Congress as well Telugu Desam members by the deputy speaker Nadendla Manohar, on receiving complaints from these two respective parties, the final decision of their ‘disqualification’ likely to take some more time.
This was in the wake of fluid political situation. The ruling Congress and Telugu Desam may not pressurize the deputy speaker to take action, instead may request him to put on hold for some more time. Reason; scared of a split within their parties. As if this was not enough, the Telugu Desam faces new challenge from one of its most powerful member from Telangana, Dr Nagam Janardhan Reddy. He openly raised the banner of revolt against the party leadership and successfully organized a rally in support of state bifurcation. His meeting, which was held at Nagarkurnool in Mahabubnagar district, was also attended by six of his colleagues in the party. This send ripples down the spines of the party leadership and worried how to grapple with the situation. Already, the party had lost another equally powerful leader from Nizamabad, Pocharam Srinivas Reddy, who crossed over to the separatist Telanagana Rashtra Samiti led by K Chandrasekhara Rao.

On the other hand, the ruling Congress rocked by two major threats – T-factor and Jagan. With the conclusion of Kadapa battle, now the focus bound to be shifted towards state bifurcation and the TRS threatened to intensify the agitation from May 15. The MPs and MLAs from the region belonging to both the Congress and TDP are under tremendous pressure to take a decision either way. Or else, they bound to face hostility in their own constituencies and thus their public life may become risky. Undoubtedly, they were caught between the ‘devil and deep’ kind situation, and any decision either way ‘set’ or ‘upset’ their political futures.

In that backdrop, the ruling Congress is in more vulnerable position, more so after the merger of Chiranjeevi’s Praja Rajyam Party. The yesteryear ‘mega star’ declared himself as the ‘integrationist’ and faced the wrath of people of T-region. Even his lone legislator from the region had resigned protesting against his party chief decision, no sooner he announced. Ironically, after the demise of Y S Rajasekhara Reddy and later his ‘charismatic’ son Y S Jaganmohan Reddy revolting against none other the party leadership, the Congress in Andhra Pradesh pushed itself in a precarious position. With the PRP merger, though the Congress was happy to find replacement to YSR in the form of ‘Chiru” as its icon, the T-factor likely to dash of their future hopes in the state.

Incidentally, unlike his cine predecessor NTR, Chiru proved himself a disaster. If his Tollywood senior N T Ramarao could form Telugu Desam party in 1982 and sweep polls that followed within nine months, Chiru failed to win even from his native Palakollu in West Godavari district, and his newly born Praja Rajyam could win just 18 seats.

Majority of the Congressmen are of the opinion that neither Chiru can become their party ‘icon’ nor help anyway to polarize his own Kapu community members in the state. Thus far, the ‘future’ for Congress looks more ‘dim’ than ‘bright.’

Not much change even in case of Telugu Desam. The party’s base eroded in all three regions of the state due to its leadership’s lop-sided policies. Had TDP not aligned with TRS and fought 2009 polls independently, today the situation would have been different. It could have been riding high in the rest of the state. Having created hope for T-creation in 2009 elections, some of its members from the region taken advantage of that and now trying to pounce on the leadership.

Hence, the Congress and TDP may choose to go slow on taking any stringent action against those who openly align with T-protogonists or Jagan and try to buy time, hoping against hopes to enhance their party’s life span, at least closer to the next round of Battle Royal in 2014. Can they? Or Can’t they? Only time will tell! (10-052011)





9, మే 2011, సోమవారం

ఒసామా – ఒబామా – భండారు శ్రీనివాసరావు

ఒసామా – ఒబామా – భండారు శ్రీనివాసరావు


(08-05-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)

ఒసామా – ఒబామా

వీరిద్దరి మధ్యా నామ సారూప్యత మాత్రమే కాదు, భావ సారూప్యత కూడా వుంది.

‘మతం కోసం ఎలాటి మారణహోమానికయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ది.

‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాది.

అయితే, ఆలోచన ఒక్కటే అయినా ఆచరణలో కొద్ది తేడా వుంది.

‘పాముకు పాలుపోసి పెంచుతాను కానీ తనను తప్ప అది ఎవరినయినా కరవ్వచ్చన్న థియరీ’ ఒబామాది.

‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికిరాదనే భావజాలం’ ఒసామాది.

ఒకప్పుడు అమెరికా తన అవసరాలకోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు - పదేళ్లక్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి పాలు పోసిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని, తనకు తానుగా అమెరికా పెంచుకుంటూ వచ్చిన అహంభావాన్ని బిన్ లాడెన్ తనదయిన శైలిలో దెబ్బ తీసినప్పుడుకానీ, ‘పాము-పాలు’ కధ లోని అంతరార్ధం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా, 2001, సెప్టెంబర్ 11 దుర్ఘటన తరవాత గాని ఉగ్రవాదం వల్ల పొంచివున్న ముప్పు ఎలావుంటున్నన్నది ఆ దేశానికి అర్ధం కాలేదు.

న్యూయార్క్ నగరానికి – ఇంకా చెప్పాలంటే – మొత్తం అమెరికాకే మాన్యుమెంట్స్ అనదగ్గ – ప్రపంచ వాణిజ్య సంస్థ – వరల్డ్ ట్రేడ్ సెంటర్ – జంట భవనాలను ఉగ్రవాదులు విమానాలతో పడగొట్టి నేలమట్టం చేసిన రోజది. యావత్ ప్రపంచానికి పెద్దన్న మాదిరిగా వ్యవహరిస్తూ, తమ అధికారానికీ, ఆధిపత్యానికీ ఎదురులేదనీ, తాము నిర్మించుకున్న భద్రతా వ్యవస్తకు తిరుగులేదనీ – ఏళ్ళ తరబడి పెంచి పోషించుకున్న అమెరికన్ల ఆత్మవిశ్వాసానికి తూట్లు పడ్డ దుర్దినం అది. ఆ రోజు నుంచి అమెరికాలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న అభద్రతాభావం అధికారవర్గాలలోనే కాక, సామాన్య జనంలో కూడా పెరిగిపోయింది.



ఆనాటి పరాభవం అగ్రరాజ్యంలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి గత దశాబ్ద కాలంగా అగ్రరాజ్యం అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, మొన్నటికి మొన్న, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్ ను – జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా అగ్రరాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకులేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదం అవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హై టెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలను జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్ లో కూర్చుని పధకం అమలవుతున్న తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ హావభావాలనుబట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్షకులు లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్ధం చేసుకోగలిగారు.





బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది – 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖయిదా విసిరిన పంజా దెబ్బకు అమెరికా గడగడ లాడిన తరువాతనే జరగడం గమనార్హం. తమ పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్ వోటర్లు తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. అధ్యక్ష ఎన్నికకు ముందూ, ఆ తరువాతా ‘నేను క్రైస్తవుడినే’ అని బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన పేరును మాత్రం మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత చేసిన తొలి విదేశీ పర్యటనలో మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది కూడా. అయినా ఒబామా విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అమెరికా రాజ్యాంగ రీత్యా అవకాశం వున్న కారణంగా వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అభిమతాన్ని ఒబామా ఇటీవల వ్యక్తం చేశారు. కానీ స్వదేశంలో చోటుచేసుకుంటున్న ప్రతికూల పరిస్థితులు ఒబామాకు ప్రజల్లో వున్న ఆదరణకు గండి కొడుతున్నాయి. అందువల్లనో ఏమో కాని, పరిస్తితులను తనకు సానుకూలంగా మలచుకోవడానికి ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేయడం ఒక్కటే ఆయనకు మార్గంగా కనబడిందేమో తెలియదు. అయితే, బిన్ లాడెన్ మృతితో అమెరికాకు ఉగ్రవాద ముప్పు పూర్తిగా తొలగిపోతుందని అనుకోవడం కూడా తెలివితక్కువతనమే అవుతుంది.

ఇక, అమెరికన్ల ప్రతీకారేచ్ఛకు బలయిన ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్ లో కడునిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, యెమెన్ నుంచి ఉదరపోషణార్ధం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టాడు. అక్కడినుంచి అతడు పట్టింది బంగారమయింది. సౌదీ రాజ్య కుటుంబీకులతో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధాలు అతడి స్తితి గతుల్ని పూర్తిగా మార్చివేశాయి. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తాడు.

సౌదీ అరేబియాలో దాదాపు ఎనభయ్ శాతం రహదారులను మహమ్మద్ కంపెనీయే నిర్మించింది. అతడికి అనేకమంది భార్యలు. పదో భార్య సిరియన్ దేశీయురాలు. ఆమెకు జన్మించినవాడే ఒసామా బిన్ లాడెన్. మహమ్మద్ సంతానం 52 మందిలో ఒసామా 17వ వాడు. ఆరడుగులు ఎత్తు. అయినా మనిషి బక్క పలచన. సంపన్న కుటుంబంలో పుట్టి విలాసాలకు అలవాటుపడాల్సిన ఒసామా మనసు మతం వైపు మళ్ళింది. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా తన భూభాగంలో అమెరికా మిలిటరీ స్తావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం అనుమతించడాన్నిఒసామా జీర్ణించుకోలేకపోయాడు. ఆ సందర్భంలో అతడు చేసిన విమర్శలను ప్రభుత్వం తప్పుపట్టింది. ఒసామా పౌర సత్వాన్ని, పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం ఒసామాను తమనుంచి వెలి వేసింది. దరిమిలా అల్ ఖయిదాకు అనేక దేశాల్లో బలమయిన స్తావరాలు ఏర్పాటుచేసే కృషిని కొనసాగించిన ఒసామా మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద ఉగ్రవాదిగా గుర్తింపు పొందాడు. అల్ ఖయిదా పేరు చెబితే పాశ్చాత్య దేశాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేసాడు. ’భౌతికంగా నన్ను రూపుమాపగలరేమోకాని నా భావజాలాన్ని, నా లక్ష్యాన్ని ఏనాటికీ, ఎవ్వరూ రూపుమాపలేరు’ అని ఒసామా బిన్ లాడెన్ తరచుగా చెబుతుండేవాడు. ధనరాశుల నడుమ జన్మించి, సంపదలతో వచ్చే సుఖాలనన్నిటినీ కాలదన్నుకుని, కొండలు, గుట్టల్లో జీవనాన్ని ఎన్నుకుని, నిరంతర పోరాటాలతో కాలం గడిపిన ఆయన తీరు ఎంతోమందిని ఆయన వైపు నడిపించింది. చేస్తున్నది తప్పా వొప్పా అన్న విచక్షణ నుంచి వారిని దూరం చేసింది.



‘కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.

‘మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోలేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం.

పవిత్ర యుద్ధం పేరుతొ సంవత్సరాల తరబడి సాగించిన పోరాటంలో ఒసామా బిన్ లాడెన్ చివరకు తన ప్రాణాలనే తర్పణంగా విడవాల్సివచ్చింది. కళ్లుచెదిరే సంపద కలిగిన కలవారి కుటుంబంలో పుట్టి కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొండకోనల్లో దుర్భర జీవితం గడిపిన అనుభవం ఒసామాది. నిరుపేద కుటుంబంలో పుట్టి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు కాగలిగిన అదృష్టం ఒబామాది. తరాలకు పూర్వం మత మూలాలు ఒక్కటే అయినా, వేర్వేరు మతాలకు ప్రతినిధులుగా వీరిద్దరూ పోరుబాటలో పయనించిన తీరు విధి వైపరీత్యానికి పరాకాష్ట.

ఇక పేరులో వీరిద్దరికీ వున్న సాపత్యం గురించి చెప్పుకోవాలంటే - ఒసామా మరణ వార్తను ఒబామా ప్రపంచానికి వెల్లడిస్తున్న సందర్భంలో ప్రపంచ మీడియా సంగతి పక్కన బెట్టండి, అమెరికా లోని అనేక టెలివిజన్ ఛానళ్ళే ఈ వార్తా ప్రసార సమయంలో ఒబామాకు, ఒసామాకు తేడా తెలియని రీతిలో తడబడిన సంగతి గుర్తు తెచ్చుకోవాలి.(05-05-2011)





5, మే 2011, గురువారం

సీఎం కిరణ్ - యధా రాజా తధా భాష - భండారు శ్రీనివాసరావు


సీఎం కిరణ్ - యధా రాజా తధా భాష

హైదరాబాదులో జనసమ్మర్ధం బాగావుండే ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం కూడలిలో ఒక పెద్ద హోర్డింగ్ వద్దనుకున్నా కంట్లోపడి పలకరిస్తుంది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తనదయిన తెల్లని పైజామా లాల్చీ మార్కు దుస్తులు ధరించి కనబడుతుంటారు. ఇంతవరకు బాగానే వుంది. కాకపొతే ముఖ్యమంత్రి నిలువెత్తు చిత్రంతో పాటు కనబడే తెలుగు కవిత్వమే వెగటు కలిగించేదిగానేకాదు, అర్ధంపర్ధం లేకుండా కూడా వుంది. అంత్య ప్రాసలకోసం ఆరాటపడి రాసిన ఈ కవిత (?) ముఖ్యమంత్రి హోదాకు ఎంతమాత్రం అనుగుణంగా లేదని చెప్పడానికి ఈ నాలుగు పంక్తులు చదివితే చాలు.

“ప్రజా సంస్కరణల సారధి

అవినీతిజ్ఞుల విరోధి

------------------స్తిత ప్రజ్ఞతి

ఓ హైదరాబాదీ! ఇక నీవే మా బాదరబందీ!!”

బాదరబందీ అంటే అర్ధం తెలిసే ఇది రాసారా అని ఎవరయినా అనుకుంటే ఎవరిది తప్పు?

3, మే 2011, మంగళవారం

వై ఎస్ కుటుంబానికి తొలి పరాజయం ఎదురు కానున్నదా!- భండారు శ్రీనివాసరావు


వై ఎస్ కుటుంబానికి తొలి పరాజయం ఎదురు కానున్నదా!- భండారు శ్రీనివాసరావు

(03-05-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)

కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి తొలి పరాజయం ఎదురు కానున్నదా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఎదురవుతోంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆ జిల్లాలో అప్రతిహత రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుంటూ వస్తున్న వైఎస్ కుటుంబ సభ్యులలో ఒకరు ఓటమి పాలయ్యే స్తితిని కడప ఉపఎన్నికలు కల్పించాయి. పులివెందుల అసెంబ్లీకి జరుగనున్న ఉపఎన్నికలో వైఎస్ సతీమణి విజయమ్మతో వైఎస్ అనుంగు సోదరుడు వివేకానందరెడ్డే స్వయానా తలపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా వైఎస్ కుటుంబ సభ్యులలో ఒకరు ఓటమి పాలయినట్టే లెక్క.

ఇక, కడప పార్లమెంట్ స్తానానికి జరగనున్న ఉప ఎన్నికలో జగన్ గెలిస్తే, ఆ విజయంలో అతడు పడ్డ కష్టంతో పాటు ఇన్నాళ్లబట్టి వైఎస్ఆర్ గురించి కొందరు కాంగ్రెస్ నాయకులు పేలిన అవాకులు చెవాకులకు కూడా భాగం వుంటుంది. వైఎస్ మరణం తరువాత ఆయనకు రాజకీయవారసుడిగా ఎదగడానికి జగన్ చేసిన ప్రయత్నాలకు- అదేపనిగా వాళ్ళు చేస్తూ వస్తున్న విమర్శలు, ఆరోపణలు చాలావరకు తోడ్పడ్డాయని చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయాలలో బహుశా ఇంత త్వరితగతిన ఎదిగివచ్చిన యువనేత జగన్ ఒక్కరే. కాకపొతే ఆయనకు ఇంత స్తాయిలో ‘హీరోయిజం’ కట్టబెట్టిన ఘనత మాత్రం కాంగ్రెస్ వారిదే.

కడప ఉప ఎన్నికల ప్రచార సమరం మొదలయిన ఇన్నాళ్లకు కాంగ్రెస్ నాయకులకు బీజేపీ రూపంలో ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. మతతత్వ పార్టీతో జగన్ దోస్తీ కట్టకతప్పదంటూ వారు ప్రారంభించిన ప్రచారానికి జగనే స్వయంగా ఆజ్యం పోశాడు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తన తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నానంటూ – వీటికి వొప్పుకుంటే బెజీపీతో పొత్తుకు తనకు అభ్యంతరం వుండబోదన్న భావం ధ్వనించేలా చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. జగన్ వ్యాఖ్యను సమర్ధించాల్సిన ఆత్మరక్షణలో వైఎస్ఆర్ పార్టీ పడిపోయింది. పెదవి దాటితే పృధివి దాటుతుందన్న సామెత చందంగా తయారయిన ఈ వ్యవహారం రాజకీయనాయకులందరికీ ఒక గుణపాఠం. అయితే, కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నట్టు కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో లక్షకు పైగా వున్న ముస్లిం మైనారిటీ ఓటర్లందరూ కట్టగట్టుకుని ఈ అంశంపై జగన్ పార్టీకి దూరమవుతారనుకోవడం కూడా వాస్తవం కాదు. ఎందుకంటె, బీజేపీని ఒక మతబూచిగా చూపిస్తూ మాట్లాడుతున్నవారిలో చాలామంది గతంలో ఆ పార్టీతో అంటకాగిన వారే కావడం ఒక కారణం.

దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా ప్రజాస్వామ్యం అంటే తెలియని ప్రజలు కడప జిల్లాలో వున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. వోటు హక్కు ఇంతవరకు వాడుకొననివారు, వాడుకోలేనివారు ఆ జిల్లాలో ఇప్పటికీ అనేకమంది వున్నారన్నది వారి అభిప్రాయం. ఏకపక్ష పోలింగ్ అంటే రిగ్గింగ్ జరిగే గ్రామాలు వందల సంఖ్యలో వున్నాయని లెక్కలు తీస్తున్నారు. అయితే ఇది ఈ ఉప ఎన్నికలకు మాత్రమే పరిమితమయినదన్నట్టుగా మాట్లాడం సరికాదు. ఎన్నోనాళ్ళుగా కడప జిల్లాలో ఎన్నికల సమయంలో వినవచ్చే మొదటి ఆరోపణ ఇదే. ఇది నిజమనుకుంటే దీనికి తప్పు పట్టాల్సింది అక్కడ పోటీ చేసే రాజకీయ పార్టీలను కాదు. రాజకీయ నాయకులనూ కాదు. మొదటి ముద్దాయి ఎన్నికల కమిషన్ అయితే – తరువాత వరుసలో పేర్కొనాల్సింది ఆయా సందర్భాలలో రాష్ట్రాన్ని పాలించిన లేదా పాలిస్తున్న ప్రభుత్వాలను.

ప్రస్తుతం పత్రికలు చదువుతున్న వారికీ, ఇరవై నాలుగ్గంటల టీవీ ప్రసారాలు చూస్తున్నవారికీ కడపలో జరగరానిదేదో జరిగిపోతున్నదన్న భావం కలుగుతోంది. వోటర్లను లోబరచుకోవడానికి కోట్ల కొద్దీ డబ్బు విచ్చలవిడిగా వెదజల్లుతున్నారనీ, మద్యం ఏరులై పారుతోందనీ, ఇంత ఖరీదయిన ఎన్నికలను దేశంలో మరెక్కడా చూడబోమనీ మీడియాలో అనుదినం అనేక కధనాలు దర్శనమిస్తున్నాయి. వీటికి తోడు ఈ రెండు నియోజకవర్గాలలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనీ, వోటు వెయ్యరన్న అనుమానం వున్నవారిపై పోలీసులతో వేల సంఖ్యలో బైండోవర్ కేసులు పెట్టిస్తున్నారనీ, గుప్పెడు వోట్లు రాబట్టగలరన్న ఆశ లేశమాత్రం వున్నాసరే అలాటి ఛోటానాయకులను గాలం వేసిపట్టి, భయపెట్టో, భ్రమపెట్టో - ఒక్క వోటు కూడా ప్రత్యర్ధి ఖాతాలోపడకుండా చూసుకుంటున్నారనీ – ఇలా అనేక రకాల సమాచారంతో జనం అయోమయానికి గురవుతున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడ్డ డబ్బే ఇంతవరకూ కోటి రూపాయలు దాటిపోయిందంటే ఎన్నికలు ముగిసేనాటికి ఇది ఏ లెక్కకు తేలుతుందో అంచనాలకు చిక్కడం లేదు. కరెన్సీ నోట్లు కట్టలు కట్టలుగా దొరికాయంటున్న వార్తలే కాని వాటి సొంతదారులెవరు, పంపిణీదారులెవరు అన్నది తేల్చిచేప్పే నాధులే కరువయ్యారు. పొరుగున వున్న కర్నాటక నుంచి డబ్బు ముందే పంపిణీ అయిందని కొందరు ఆరోపిస్తుంటే, ఇంతమంది మంత్రులు కట్టకట్టుకుని జిల్లాలో మకాం వేసిందే ఇందుకని వారి ప్రత్యర్ధులు అంటున్నారు. మొత్తం మీద డబ్బు ప్రభావం ఓటర్లపై ఎంత వుంటుందో తెలవదు కానీ వోట్లు కొనుగోలు చేయకపోతే తరువాత తీరిగ్గా విచారించాల్సివస్తుందేమోనని ఏ పార్టీ కూడా ఛాన్స్ తీసుకుంటున్న దాఖలాలు కనబడడం లేదు. ఇంత ఖరీదయిన ఎన్నిక ఇదే అంటూ ఈ పరిస్తితులను ఇలాగే కొనసాగనిస్తే ముందు ముందు ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది తమ బోటివారికి అందని మానిపండేనంటూ రాజకీయాల్లో తలపండినవాళ్ళు తలలు పట్టుకుంటున్నారు.

ఇంతకుపూర్వం జరిగిన ఎన్నికల సందర్భంగా మీడియాలో పురుడు పోసుకున్న పెయిడ్ న్యూస్ అనే వికృత శిశువు ఈ ఉపఎన్నికలనాటికి తన విశ్వరూపాన్ని మరింత విశృంఖలంగా ప్రదర్శిస్తోంది. పత్రికలు (సంచికలు) అమ్ముడుపోవడం కాదు ఏకంగా పత్రికలే అమ్ముడుపోయాయి అనే తీరులో ఈ పెయిడ్ న్యూస్ వ్యవహారం పత్రికారంగానికే మాయని మచ్చగా తయారవుతోంది. పత్రిక ప్రతులు బాగా అమ్ముడు పోతే మంచి సర్క్యులేషన్ వున్న పత్రికగా చెప్పుకునే రోజులు గత కాలపు ముచ్చటగా మారిపోయి, ఎవరికో ఒకరికి అమ్ముడుపోయిన పత్రికగా ముద్ర వేసుకునే దరిద్రపు కాలం దాపురించింది. దీనికి తోడు కొత్తగా ప్రవేశించిన ఎలెక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు కొన్ని రాజకీయ పార్టీ నాయకుల జేబు సంస్తలు కావడంతో - ఇప్పుడు ఏది పెయిడ్ న్యూస్? ఏది కాదు? అన్న ప్రశ్నకు జవాబు దొరకడం క్లిష్టంగా మారింది. తమిళనాడులో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా మీడియాకు రాజకీయాలకు నడుమ వుండాల్సిన విభజన రేఖ త్వరితగతిన అదృశ్యమవుతోంది. దానితో పెయిడ్ న్యూస్ అన్న పదానికి కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన పరిస్తితి ఏర్పడింది. మిగిలిన అన్ని రంగాలలో మాదిరిగానే ఈ రంగంలో కూడా విలువలు తగ్గిపోతున్నాయని నలుగురూ అనుకునే విధంగా, పత్రికా స్వేచ్చ పట్ల పలచన భావం పెచ్చరిల్లేలా వాతావరణం రూపుదిద్దుకోవడం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన మీడియాకు ఎంతమాత్రం శోభనివ్వదు.

పోతే, ఎన్నికల కమిషన్ పాత్ర.

ఓటర్లందరూ స్వేచ్చగా ఓటు వేయడానికి వీలయిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఈ వ్యవస్తపై వుంది. దీనికి తగిన అధికారాలు రాజ్యాంగం కల్పించింది. వాటిని తుచ తప్పకుండా వినియోగించి ఎన్నికలు సక్రమంగా నిర్వహించగల సమగ్ర యంత్రాంగం రాష్ట్ర స్తాయి ఎన్నికల సంఘానికి లేదు. పరిమిత సిబ్బందితో, పరిమిత వ్యవధిలో అపరిమితమయిన బాధ్యతలను నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత ఎన్నికల ప్రధానాధికారిపై వుంటుంది. రాష్ట్ర కేడర్ కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారే ఎన్నికల సంఘానికి ప్రధానాధికారిగా వ్యవహరిస్తుంటారు. ఈ పదవిలో వున్నవారు తిరిగి ఏదో ఒక రోజు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేయాల్సి వుంటుంది. అందువల్ల వారిది ఒకరకంగా అసిధారావ్రతం అనే చెప్పాలి. వున్న స్వల్ప కాలంలో అనుమానాలకు తావు లేకుండా, నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్న మాట రాకుండా, నిబద్ధత ప్రశ్నార్ధకం కాకుండా వున్నంతలో బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చాల్సివుంటుంది. కత్తిమీద సాములాటి కర్తవ్య నిర్వహణలో ఎంత జాగరూకత ప్రదర్శించినా ఎవరో ఒకరు అసంతృప్తికి గురయ్యే అవకాశాలే ఎక్కువ. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన గురించి ఆయా పార్టీలు చేసే ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి నిర్ణయం తీసుకునే వ్యవధానం లేకపోవడంతో ఎన్నికల అధికారి కార్యాలయం ఏవో ఒకటి రెండు ముఖ్యమయిన విషయాలపై స్పందించి ఉనికిని కాపాడుకునే పరిస్తితిలో వుంది. శాశ్విత యంత్రాంగం లేని పరిస్థితుల్లో, అందుబాటులో వున్న అధికార వ్యవస్తపై ఆధారపడి పని చేయాల్సిన స్తితిలో, సాధారణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు వివాదాస్పద అంశాలపై నిర్ణయాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వొదిలి పెడతారన్న అపవాదు వుంది. ఒక్కోసారి స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నా వాటిని అమలు చేయాల్సింది క్షేత్ర స్తాయి అధికారులు, సిబ్బంది కావడం వల్లా, వారిపై నియంత్రణ అధికారం పరిమితం కావడం వల్లా – ఆశించిన తీరులో ఫలితాలు రావడం లేదనే అభిప్రాయం వుంది. కొన్ని సందర్భాలలో దిగువ స్తాయి సిబ్బంది స్తానిక పరిస్థితులు, రాజకీయ వొత్తిళ్లకు అనుగుణంగా తీసుకునేచర్యలకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి వస్తోంది. చదిపరాళ్ల గ్రామంలో మల్లెల రామలక్ష్మమ్మ వంటి వయస్సు మళ్ళిన మహిళలపై కూడా పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నట్టు ఫిర్యాదులు రావడం, స్పందించిన అధికారులు ఆ కేసులను ఉపసంహరించుకోవడం ఇందుకు ఉదాహరణ.

అనేకరకాలుగా తన ప్రత్యేకతలను చాటిచెబుతున్న ఈ కడప ఉపఎన్నికలలో ఎవరో ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. అది గొప్ప విషయమేమీ కాదు. కానీ ప్రజాస్వామ్యానికి పునాది వంటి ఓటరు మాత్రం ఓడిపోకూడదు. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురికాకూడదు. తాత్కాలిక ప్రయోజనాలకోసం శాశ్విత విలువలను తాకట్టు పెట్టకూడదు. రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల వేళ గుర్తుపెట్టుకోవాల్సిన కట్టుబాటు ఇది. (03-05--2011)