31, మార్చి 2011, గురువారం

Opposing JLC is absurd – Bhandaru Srinivas Rao (I.I.S.)

Opposing JLC is absurd – Bhandaru Srinivas Rao (I.I.S.)




The raging controversy over the formation of Joint Legislative Committee (JLC) to probe into land allocations by the state government in the past and suggest new guidelines, is significant in many ways, than been construed by some as 'victimization' of a particular political family or individual, appears as absurd to me.

Such an initiative is a must when successive governments under the guise of `industrial development` and `employment generation` gifted away agricultural as well prime lands to several corporates. One shall appreciate Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy's initiative. As a media practitioner, am sure it was a conscious decision, as he happened to be part and parcel of earlier government headed by Dr Y S Rajasekhara Reddy, in some position or other against whom the main Opposition, Telugu Desam, had levelled serious allegations of impropriety in allocation of lands. These allegations were raised in the state Assembly in the past also by same Opposition Telugu Desam and then Chief Minister Y S Rajasekhara Reddy and his then government chief whip and present chief minister, defended effectively.

The TDP had also incorporate these allegations, especially land allocations to some corporates which helped give berth to late YSR son Y S Jaganmohan Reddy's `Jagapathi Group` which launched the "Saakshi" Telugu newspaper as well "Saakshi TV", in their 2009 election manifesto, but people turned it down. But, yet again TDP raised same allegations and this time around with an obvious intention to embarrass Kiran targetting the late leader’s son, Jaganmohan Reddy, who happens to be the promoter of the media house(s) in question.

Instead of doubting intentions of the Chief Minister for yielding to the Opposition demand for JLC, why not welcome it as he made it clear that only `specific` cases of land allocations will come into probe. The other day, the Saakshi daily has carried an interesting article listing out land allocations done to several corporates during nine year rule of Telugu Desam, headed by Nara Chandrababu Naidu. If those facts are true, then the Opposition too may be floored along with the earlier Congress government if at all there were any flaws.

True any resposible government provide land to a corporate believing it bring in new technology as well provide employment opportunities to locally available skilled labor. None can doubt such intentions of government. If I remember right, YSR during his tenure as Chief Minister, proudly quite often mentioned of the world leader in shoe making Adidas providing succor to 800 or 1000 locals in Nellore. Adidas is benefactor of government land under SEZ. Well, not necessary that single claim of late YSR cannot be taken as face value, to give clean chit for other allocations of his government. He, as Chief Minister, might have believed to those Corporates promises and took the bold step to allocate huge chunks of lands to Corporates. What`s wrong if an action is taken against some of those Corporates who failed to adhere to its time-schedule and misused the lands allotted to them?

No concessions, either to the Congress or earlier TDP governments. The government should only list out those Corporates who grossly violated and have prima facie case of `lease deed` violated to be included into the purview of proposed JLC.

I for one as an analyst don`t see any `conspiracy` against any individual by the ruling Congress or its arch rival Telugu Desam or both together conniving. Can Kiran take the risk of JLC as he heads more or less the same Cabinet that headed by YSR which made these land allocations?

At the same time, I shall also not find fault with aggrieved Saakshi group Chairman and son of former chief minister YS Jaganmohanreddy, for expressing doubts. It is no secret that such ‘opportunities’ are being best utilized in present day politics to outwit their rivals. But, if the intentions of the government as claimed by Kiran Kumar Reddy are true of forming better guidelines by setting up Land Bank for auditing, then why oppose? (31-03-2011)

28, మార్చి 2011, సోమవారం

వీసా - భండారు శ్రీనివాసరావు




వీసా - భండారు శ్రీనివాసరావు

అనగనగా ఒక వూరు. ఆ వూర్లో ఓ జంతు ప్రదర్సన శాల.

అసలే ఇది చిట్టిపొట్టి కధ. ఈ కధలో పదేపదే వచ్చే ఈ పదాన్ని అలా సాగదీసి రాయడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ల భాషలో పొట్టిగా ‘జూ’ అనుకుందాము.

ఆ జూ లోని ఓ బోనులో జూలు బాగా పెంచుకున్న ఓ సింహం వుంది. రోజుకు కనీసం ఓ కిలో మాంసం కూడా తన మొహాన విదల్చడం లేదని ఆ జూ అధికారులపై దానికి తగని కోపం. జూలు విదిల్చి, కాలు దువ్వాలని వుంది కానీ  ఏం లాభం.  తానున్నది అడవికాదాయే. పైగా ఆ జూ అధికారులు అడవి జంతువులకన్నా క్రూరులు. వాళ్లకు తిక్క తిరిగిందంటే దొంగలెక్కలు రాసి ఆ మాత్రం మాంసం కూడా పెట్టకుండా తన డొక్క మాడ్చగల సమర్ధులన్న సంగతి ఆ మృగ రాజుకు తెలుసు. అందుకే ‘అనువుగాని చోట అధికులమనరాదు’ అన్న నీతి వాక్యం ప్రకారం మిన్నకుండి పోయింది.

కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలవదు. దాని గోడు విన్న తధాస్తు దేవతలు కరుణించారేమో తెలియదు. ఏదయితేనేమి. దుబాయిలో వున్న ఓ జూ అధికారి  ఓ రోజు ఈ జూ చూడడానికి వచ్చి, తగిన ఆహారం లేక చిక్కిపోయిన ఈ సింహాన్ని చూశాడు. చక్కనమ్మ చిక్కినా అందం అనుకున్నాడేమో దాన్ని తన దుబాయ్ జూ కు తీసికెళ్ళాడు.

ఎమిరేట్స్ విమానం ఎక్కిన దగ్గరనుంచి సింహానికి ఆకాశంలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. ఆ దేశంలో జూలన్నీ సెంట్రల్ ఏసీ అని ఎవరో చెప్పగా విన్న సంగతి గుర్తు వచ్చి దాని వొళ్ళు పులకరించి పోయింది. ఎంచక్కా చల్లటి బోనులో కూర్చుని దుబాయ్ జూ అధికారులు రోజూ ఆహారంగా పెట్టే ఒకటి రెండు మేకలను కడుపారా తింటూ కడుపులో చల్ల కదలకుండా కాలక్షేపం చేసే సన్నివేశాలను వూహించుకుంటూ ఆ సింహం దుబాయ్ జూ చేరుకుంది.

అది కలలు కన్నట్టే దానిని ఒక ప్రత్యేక బోనులో వుంచారు. నీటుగా దుస్తులు ధరించిన జూ పనివాడు ఒకడు పొద్దున్నే వచ్చి చాలా నీటుగా ప్యాక్ చేసిన ఆహారం పొట్లాన్ని అందించాడు. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయి అని అనుకుంటూ సింహం ఆత్రంగా ఆ పాకెట్ విప్పింది. అందులో మూడు నాలుగు అరటి పండ్లు వున్నాయి. అసలే పరాయి దేశం - భాష అర్ధం కాక పొరపడ్డారేమోనని మొదటి రోజు సర్దిచెప్పుకుంది. కానీ రెండో రోజూ, ఆ మరునాడు కూడా పనివాడు అరటి పండ్లే పెట్టడంతో సింహానికి తిక్కరేగింది.

పండ్లు పట్టుకుని వచ్చినవాడిని నిలబెట్టి దులిపేసింది.

‘ఏం ఇక్కడ మీ అందరికీ నన్ను చూస్తే తమాషాగా వుందా. నేనెవరనుకుంటున్నారు. మొత్తం అడవికే రాజుని. అరటి పండ్లు తినడానికి నేనేమన్నా కోతి ననుకుంటున్నారా?’ అని గాండ్రించింది.

అయితే, సింహం గాండ్రింపులకు బెదిరిపోవడానికి ఆ జూ పనివాడు అడవిలో ఏనుగు కాదు కదా. అందుకే అతగాడు తాపీగా జవాబు చెప్పాడు.

“నువ్వు సింహానివన్న విషయం ఇక్కడ పుట్టిన పిల్లులకు కూడా తెలుసు. కాకపోతే నిన్నిక్కడికి ‘కోతి’ వీసా మీద తీసుకొచ్చిన సంగతే నీకు తెలిసినట్టు లేదు”

నీతి:

పరాయి దేశంలో కోతిగా వుండడంకన్నా మాతృదేశంలో సింహంగా బతకడం మేలు.(28-03-2011)

















27, మార్చి 2011, ఆదివారం

కళ్ళు తెరవని కాంగ్రెస్ - భండారు శ్రీనివాసరావు

కళ్ళు తెరవని కాంగ్రెస్ - భండారు శ్రీనివాసరావు

(  మార్చి27 వ తేదీ 'సూర్య ' దినపత్రికలో ప్రచురితం)


కాల్లో ముల్లా? కంట్లో నలుసా? ముందు దేన్ని తీయాలన్న శషభిషలో వున్నట్టుంది ఢిల్లీ లో కాంగ్రెస్ అధినాయకత్వం.
ప్రత్యేక రాష్ట్ర వాదం, సమైక్య వాదం ఒక సమస్య అయితే, సీమాంధ్ర లో జగన్ దూకుడుకు కళ్ళెం వేయడం యెలా అన్నది పార్టీకి మరో జటిల సమస్య. ఈ రెంటికీ, ‘పైపూత’ వైద్యంతో చికిత్స చేయాలని చూసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ రెండు సమస్యల విషయంలో అధిష్టానానికి పూర్తి అవగాహన వుందని పార్టీ స్తానిక నాయకులు చేస్తున్న ప్రకటనల పట్ల ఎవరికీ విశ్వాసం కుదరడం లేదు. అధిష్టానవర్గం అధికార ప్రతినిధులమని చెప్పుకుంటూ ఢిల్లీ నుంచి తరచూ వెలువరించే ప్రకటనలు, హెచ్చరికలు గమనిస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్తితి తెలిసిమాట్లాడుతున్నారని అనుకోవడానికి నమ్మకం చిక్కడం లేదు.

ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు గత ఏడేళ్ళకు పైగా కాంగ్రెస్ అధికారంలో వున్నప్పటికీ – ‘వున్నామా లేమా!’ అని ఎప్పటికప్పుడు గిల్లి చూసుకోవాల్సిన దుస్తితిలో పడిపోవడం ఆ పార్టీ దురదృష్టం. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం చెలాయిస్తూ కూడా పార్టీని మరింత పటిష్టం చేసుకోవడం సంగతి అటుంచి, చీలికలు పేలికలు కాకుండా చూసుకోలేని పరిస్తితి. రెండేళ్లక్రితం వరకు ఇది కలలో కూడా వూహించలేని విషయం. ఈ పరిణామం పూర్తిగా స్వయంకృతం. దిద్దుబాటు చర్యలపేరుతో ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయే కానీ కలసి రావడం లేదు. ముఖ్యమంత్రుల మార్పు, రాష్ట్ర కాంగ్రెస్ పర్యవేక్షకుల మార్పు ఏదీ కూడా పరిస్తితులను సమూలంగా మార్చలేకపోతున్నాయి. దీనికి కారణం అధిష్టానానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పట్టు సన్నగిల్లడమయినా కావాలి లేదా తాత్సార ధోరణి ఒక్కటే సమస్యలను పరిష్కరించగలదన్న అభిప్రాయానికి వచ్చయినా వుండాలి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తగు వ్యవధానం వున్నప్పుడు పరిష్కారాలను వాయిదా వేస్తె వచ్చే నష్టం ఏముంటుందన్న ధీమా అయినా ఈ అలసత్వానికి కారణం కావచ్చు.

భవిష్యత్తులో ఎన్నికల పరంగా దీనికి భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వస్తే అది ఆ పార్టీకి జరిగే నష్టంగా భావించి సరిపుచ్చుకోవచ్చు . కానీ, కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న ఈ వేచిచూసే సాచివేత వైఖరి వల్ల వాస్తవంగా నష్ట పోతున్నది మాత్రం రాష్ట్ర ప్రజానీకం. గెలిపించి గద్దె మీద కూచోబెట్టిన పార్టీ అంతర్గత కుమ్ములాటలతో పరిపాలనను పక్కనబెడితే ప్రజలు గమనించడం లేదని అనుకుంటే పొరబాటే. ఎన్నికలకు ఇంకా రెండేళ్లపైన వ్యవధి వుంది కదా అన్న ధీమాతో రాష్ట్రాన్ని, రాష్ట్ర సమస్యలను ఇలానే నిర్లక్ష్యం చేస్తూ పోతే, పర్యవసానాలు పార్టీ భవిష్యత్తును మరోరకంగా నిర్దేశించే ప్రమాదం వుంది. ఓటమి’ అనాధ లాటిది. పరాజయానికి ఎవ్వరు బాధ్యత తీసుకోరు. అదే విజయం అయితే – ఆ గెలుపుకు కారణం ‘నేనంటే నేనని’ అనేకమంది సిద్ధం అవుతారు. శాసన మండలికి శాసన సభ నుంచీ, స్తానిక సంస్తల నుంచీ జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ సూత్రాన్నే మరోమారు తేటతెల్లం చేసాయి.

శాసన సభ నుంచి జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీల అధినాయకత్వాలే విజయం కోసం నానా పాట్లు పడ్డాయి. వున్న బలం గెలుపుకు చాలకపోయినా, లేని బలంతో కొత్త బలుపును నిరూపించుకోవాలని అన్ని పార్టీలు సిద్ధాంతాలను, సూత్రాలను నిస్సిగ్గుగా గాలికి వొదిలేశాయి. సాంకేతికంగా, చట్టపరంగా కొన్ని పార్టీలు గెలిచివుండవచ్చు. మరికొన్ని వోడిపోయి వుండవచ్చు. కానీ, నైతికంగా చూసినప్పుడు అన్నీ వోడిపోయాయనే చెప్పాలి.

ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం పాలుచేశాయి. గెలుపే ధ్యేయంగా సాగిన ఈ ఎన్నికల్లో రాజకీయాలకు అంటిన మకిలి ఓ పట్టాన వొదలడం కష్టం. శత్రువు శత్రువు మిత్రుడు అన్న రాజకీయ నీతిని అడ్డం పెట్టుకుని తొక్కని అడ్డదోవంటూ లేదు. పొత్తులు పెట్టుకోవడంలో, పోటీ పెట్టడంలో ఎత్తులు,పై ఎత్తులు, విచ్చలవిడిగా సాగిన ధన ప్రవాహం, ఎవరు యే పార్టీ అన్న దానితో నిమిత్తం లేకుండా గెలుపే పరమావధిగా బట్టబయలయిన స్తానిక నేతల వ్యవహారం - రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని కొంతవరకు ఆవిష్కరించగలిగాయి. అంతేకాదు, ఈ రెండు ఎన్నికల్లో తమ నిర్వాకానికి ఆయా పార్టీలు ఇచ్చుకుంటున్న సంజాయిషీలు చూస్తుంటే, ఒకే నాలుకతో రెండు రకాలుగా యెలా మాట్లాడవచ్చో సులభంగా బోధపడుతుంది.

ఎదురయిన పరాభవాన్ని సమర్ధించుకుంటూ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు – ప్రజాభిప్రాయాన్ని మదింపు వేసుకోవడంలో వారి అభిజాత్యానికి అహంకారానికి అద్దం పడుతున్నాయి. ఓటమి నుంచి హుందాగా గుణపాఠం నేర్చుకోవడానికి బదులు అదొక ఓటమే కాదనే పద్దతిలో సమర్ధించుకునే క్రమం ప్రజల్లో వారిని పలుచన చేస్తోంది. ఉదాహరణకు కడప జిల్లానే తీసుకుంటే, అక్కడ జరిగిన ఎన్నికల్లో సర్వశక్తులు వొడ్డి పోరాడింది కాంగ్రెస్ పార్టీయే. ఇంచార్జ్ మంత్రితో సహా జిల్లాకు చెందిన మంత్రులందరినీ సమరాంగణంలో మోహరించినా, సాక్షాత్తు వైయస్సార్ సోదరుడు, రాష్ట్ర మంత్రి వివేకానంద రెడ్డి జిల్లాలోనే మకాం వేసి కాపుకాసినా, చివరాఖరుకు కాంగ్రెస్ కు జన్మతః విరోధి అయిన తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయినా, - పది వోట్ల తేడాతో ప్రత్యర్ధి చేతిలో పరాజయం పాలయిన విషయాన్ని తేలిగ్గాతీసుకుంటున్న తీరు ఆక్షేపణీయం. కింద పడ్డా పైచేయి మాదే అన్న రీతిలో – కడప జిల్లాలో కాంగ్రెస్ పరిస్తితి పటిష్టంగానే వుందని బీరాలు పలకడం ఏ ప్రమాణాల ప్రకారం చూసినా శోభ స్కరం రం కాదు. ఎన్నికల్లో డబ్బు స్వైరవిహారం చేయడం వల్లనే తమ అభ్యర్ధులు ఓడిపోయారంటూ అధికార పార్టీ చేస్తున్న వాదనలకు సయితం సరయిన పునాదులు లేవు. పైగా అలాటి ఆరోపణలు అధికారంలో వున్న పార్టీ చేస్తే నమ్మేవారు వుంటారని అనుకోవడాన్ని మించిన భ్రమ మరోటి వుండదు. ఈ ఎన్నికల్లో వోటు హక్కు కలిగిన స్తానిక సంస్తల ప్రజాప్రతినిధుల పదవీ కాలం మరికొద్ది నెలల్లో ముగియనున్నందున, జగన్ వర్గం డబ్బు వెదజల్లి వారిని టోకుగా కొనుగోలుచేశారని, అలాటి టక్కుటమార విద్యల్లో పట్టాలు పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులే ఆరోపించడం మరింత విడ్డూరంగా వుంది. ఇలా ఓటమిని సమర్ధించుకునే నాయకులు, శాసన సభ నియోజకవర్గం నుంచి విధాన మండలికి అంతకు కొద్ది ముందు జరిగిన ఎన్నికల విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారు. సొంత పార్టీ వారే క్రాస్ ఓటింగుకు పాల్పడ్డ కారణంగా, విధానమండలి ప్రస్తుత ఉపాధ్యక్షుడే ఓటమి అంచువరకు వెళ్లి , ప్రాధాన్యతా వోట్ల పుణ్యమా అని గట్టెక్కిన సంగతి వారు వీలునుబట్టి మరచిపోయినా జనాలకు మాత్రం ఇంకా గుర్తుంది. సభలో వున్న సంఖ్యాబలాన్ని బట్టి కాకుండా మిగులు ఓట్లకు అదనపు ఓట్లను రాబట్టుకుని మరో అభ్యర్ధిని అదనంగా గెలిపించుకోవడం అన్నది చట్టబద్ధమే అయినా, అది అనైతిక విధానాలకు మార్గం వేసే ప్రమాదం వుందన్న విషయం గుర్తెరిగి కూడా ఆ మార్గాన్నే ఎంచుకోవడం కాంగ్రెస్ వారికే మింగుడు పడలేదు. పార్టీ అధికార అభ్యర్ధి మహమ్మద్ జానీ గెలుపోటముల మధ్య చాలాసేపు కొట్టుమిట్టాడిన వైనం , ఎన్నికల ఎత్తుగడలు కొండొకచో ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం వుందనడానికి మరో ఉదాహరణ. ప్రాధాన్యతా ఓట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి రాజకీయ చతురతను అద్భుతంగా ప్రదర్శించి, నిలబెట్టిన అభ్యర్ధుల నందరినీ గెలిపించుకోగలిగారన్న ఆనందం అధికార పార్టీకి ఆవిరై పోయింది. పోతే, కోడింగ్ విధానం ద్వారా ‘రహస్య బాలెట్’ లోని రహస్యాన్ని బట్టబయలుచేసే వ్యవహారాలు ఎంతవరకు చట్ట సమ్మతం అన్నదానిపై కూడా సమగ్రమయిన చర్చ జరగాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు బయటపెట్టాయి. అదేవిధంగా, మరికొద్ది కాలంలో పదవీకాలం పూర్తయ్యే తరుణంలో స్తానిక సంస్తల ప్రజా ప్రతినిధులను ఓటర్లుగా పెట్టి ఎన్నికలు జరిపే బదులు, వాటికి కొత్తవారు ఎన్నికయినదాకా ఆగి ఈ ఎన్నికలు నిర్వహించి వుంటే సరిపోయేది. అమ్ముడుపోయారన్న అపవాదు ఇప్పుడున్న వారికి మిగిలేది కూడా కాదు.

ఏదయితేనేం –ప్రత్యక్ష ప్రజాతీర్పు కాకపోయినా –శాసన మండలికి జరిగిన ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయపార్టీల బలాబలాలను కొంతమేరకయినా ప్రజలముందు వుంచాయి. కాంగ్రెస్ లో కుమ్ములాటలు తమకు ముందు ముందు రాజకీయంగా మేలుచేస్తాయని తెలుగు దేశం పార్టీ నమ్మడానికి ఈ ఫలితాలు దోహదం చేసాయి. పసికూనగానే వున్న యువనేత పార్టీ నేరుగా ఈ ఎన్నికల్లో పాల్గొనకపోయినా తన అభ్యర్ధులను స్వతంత్రులుగా నిలబెట్టి కాంగ్రెస్, టీ.డీ.పీ. లకు దీటుగా, వాటితో సమానంగా ఫలితాలను సాధించి రాష్ట్ర రాజకీయాలపై తన పట్టును ప్రదర్శించి చూపింది. రానున్న కాలంలో పార్టీని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి తగిన ఊతం ఇచ్చాయి. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే -ఇంకా రెండేళ్లు అధికారం లో వుంటామన్న ఆశ మినహా భవిష్యత్తు అంధకార బంధురమే అనిపించేలా వున్నాయి ఈ పార్టీ సాధించిన విజయాలు.
అయితే, అఖిలభారత స్తాయిలో చూసినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమయిన రాష్ట్రం. ఎందుకంటె, ఈ రాష్ట్రం నుంచి గెలిచిన పార్టీ ఎంపీలే కేంద్రంలో యుపీఏ ప్రభుత్వానికి ప్రాణ వాయువు అందిస్తున్నారు. కానీ, వారంతా ప్రాంతీయ ప్రాతిపదికపై రెండుగా చీలిపోయి కునారిల్లుతు వుండడం పార్టీ అధిష్టానానికి కలిసి వచ్చింది. మంత్రి పదవుల పంపిణీలో సంఖ్యాబలానికి తగ్గ వాటా దక్కకపోయినా, కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ లలో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినా, అభివృద్ధి పధకాల మంజూరులో ఆంధ్ర ప్రదేశ్ కు చిన్న పీట వేసినా ఎవరూ కిమ్మనలేని పరిస్తితి.

ప్రాంతీయ విభేదాలతో సతమవుతూ, ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ నలుగురిలో నగుబాటు అవుతున్న సొంత పార్టీ ఎంపీల వ్యవహారం నానాటికి తీసికట్టు చందంగా తయారవుతూ వుండడంతో, రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు కొత్త కాని సరికొత్త పార్టీ ఇంచార్జ్ - గులాం నబీ అజాద్ సర్దుబాటు చర్యలకు నడుం బిగించారు. ఆదిలోనే హంసపాదు మాదిరిగా, ఇరుపక్షాలను ఒక్క చోట చేర్చి మాట్లాడడం ‘జాదూ సామ్రాట్’ గా పేరున్న అజాద్ కు కూడా సాధ్యం కాలేదంటే పరిస్థితులు ఎంతగా ముదిరి పోయాయో అర్ధం అవుతుంది. కలివిడిగా కాకపోయినా, విడివిడిగా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ ఎంపీలతో ఎట్టకేలకు సమావేశం కాగలిగానన్న తృప్తి మాత్రం ఆయనకు మిగిలింది. తెలంగాణా మినహా మరే ఇతర ప్రతిపాదన కూడా తమకు ఎంత మాత్రం సమ్మతం కాదని కుండ బద్దలు కొట్టి చెప్పామని తెలంగాణా ఎంపీలు తరువాత బయట మీడియాతో బల్లగుద్ది మరీ చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు మాత్రం కొంత లౌక్యం ప్రదర్శించారు.. తెలంగాణా ప్రస్తావనే రాలేదని వాళ్ళు స్పష్టం చేసారు. అయితే, రాష్ట్రం లో పార్టీ పరిస్తితి ఆశాజనకంగా లేదన్న విషయాన్ని ఆజాద్ చెవిన వేసారు.

వరసగా రెండు పర్యాయాలు అధికార పీఠం ఎక్కిన యుపీఏ సర్కారుకు మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటె, రాహుల్ ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలన్న సోనియా అభిలాష నెరవేరాలంటే, రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే పార్టీ ఎంపీల సంఖ్య ఇతోధికంగా వుండేట్టు చూసుకోవాలి.కనీసం ఇప్పటికంటే తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఈ దృష్ట్యా అయినా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సి వుంటుంది. జగన్ పార్టీ విషయంలో తాత్సారమయినా, టీ. ఆర్. ఎస్. విలీన ప్రతిపాదన అయినా ఈ కోణం నుంచి ఆలోచించి చేస్తున్నవే అన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వుంది. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లుతాయో లేదో ఓ మేరకు తెలిపే అవకాశం వుంది. అందుకే, తెలంగాణా అయినా, జగన్ వ్యవహారం అయినా అప్పటివరకు ఇంత తాత్సారం.(26-03-2011)



26, మార్చి 2011, శనివారం

ఎదగడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు

ఎదగడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు


ఈనాటి ప్రపంచం యావత్తు కార్పోరేట్ లోకం చుట్టూ పరిభ్రమిస్తోంది. లోకం పోకడలూ, విలువలు అన్నీ కార్పోరేట్ ప్రపంచానికి అనుగుణంగానే మారిపోతున్నాయి.

‘ఎదగడానికెందుకురా తొందరా!’ అనే పాటలకు ఈ ప్రపంచంలో స్తానం లేదు. ఎదుగుదలకు అవకాశం లేని విలువలకు కూడా అందులో స్తానం లేదు. ఎంత త్వరగా ఎదగాలన్నదే కార్పోరేట్ జీవుల ఏకైక ధ్యేయం.

మారిపోతున్న ఈ విలువలు గురించి, వాటి ఆవశ్యకత గురించీ కార్పోరేట్ ప్రపంచాన్ని ఆపోసన పట్టిన ఓ పెద్దమనిషి ఇంగ్లీష్ లో ఓ వ్యాసం రాసేసి నెట్ లో పెట్టి చేతులు దులిపే సుకున్నాడు. ఆ వ్యాసం లోని భావం మాత్రం తీసుకుని తెలుగులోకి స్వేచ్చానువాదం చేయగా, ఇదిగో ఇలా వచ్చింది. వీలయితే చదవండి.అవసరమనుకుంటే ఎదగండి.

“విజయం అంటే మాటలు కాదు. చేతలతో కూడిన వ్యవహారం. గెలుపే ధ్యేయంగా పనిచేసేవాడు తనని తాను పెంచుకుని భూతద్దంలో పెద్దది చేసి చూపుకోగల సామర్ధ్యం కలిగివుండాలి. పనిచేసే సంస్త లోనే కాకుండా బయట కూడా అతగాడి గురించి నలుగురికీ తెలిసివుండాలి. సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు పైకి తెలియకుండా సుతారంగా ప్రచారం చేసుకోవాలి. ఇదంత సులభమేమీ కాదు. దీనికి ఎన్నో తెలివితేటలు కావాలి. పెద్ద పెద్ద కంపెనీలే తమ గురించి తాము ప్రచారం చేసుకుంటూ వుండడం మనం చూస్తున్నాం. అలాటప్పుడు కార్పోరేట్ ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళు కూడా ఈ స్వీయ ప్రచార కార్యక్రమానికి సిద్ధపడే వుండాలి. పువ్వుమీద వాలిన భ్రమరం పువ్వుకు కూడా తెలియనంత సుకుమారంగా మధువును గ్రోలినట్టు ఈ ఆత్మస్తుతి,పరనింద తంతును నిర్వర్తించగలగాలి.

“నిన్ను గురించి నువ్వు ఎప్పడూ చెప్పుకోకు. నిజం చెప్పుకుంటే నమ్మేవారెవరూ వుండరు. నీ గురించి అబద్ధాలు చెప్పుకుంటే మాత్రం ఇంకా ఎంతో వుంది, కావాలనే తగ్గించి చెప్పు కుంటున్నారని అనుకుంటారు”.

ఇది పాతకాలం మాట. కార్పోరేట్ కాలంలో ఇది ఎంతమాత్రం చెల్లుబడి కాదు. ఎందుకంటె, ఇతరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే మంచితనం కలికానికి కూడా దొరికే కాలం కాదిది. అందుకని మనకి మనమే పీ.ఆర్.వో. లం అన్నమాట. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అవతల మనిషి నమ్మడం లేదని నమ్మకంగా తెలిసినా సరే, మన గురించి మనమే చెప్పుకుని తీరాల్సిన రోజులివి. ఎదుటివాడు నమ్మినా నమ్మకపోయినా, మన అదృష్టం బాగుంటే ఎదుటివాడి పక్కవాడయినా మన మాటలు నమ్మే ఛాన్స్ వుంటుంది.”

ఆ కార్పోరేట్ గురు ఇంకా ఇలా సెలవిచ్చారు.

“మిమ్మల్ని మీరే ఒక ఉత్పాదక వస్తువుగా ఊహించు కోండి. మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకోండి. మీరు పనిచేస్తున్న సంస్త లో గానీ, లేదా పనిచేయడానికి అవకాశంవున్న సంస్త లో గానీ నిర్ణయాత్మక పాత్ర పోషించే అధికారులకు మీ గురించి తెలిసే విధంగా ప్రయత్నాలు చేయండి. ఈ విషయంలో వెనుకబడేవాళ్ళు వెనుకనే వుండిపోతారు. ఈ సూత్రం హమేషా గుర్తుంచుకున్నవాళ్ళే ముందుకు పోగలుగుతారు. ఆ ఉన్నతాధికారులు తమ సంస్త లో ఏదయినా ముఖ్యమయిన ఉద్యోగాన్ని భర్తీ చేసే సమయంలో తటాలున మీరు గుర్తుకొచ్చే రీతిలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. లేని పక్షంలో మీరు ఎంత ప్రతిభావంతులన్నది లెక్కలోకి రాదు. వున్న చోటనే వుండి పోతారు. ఈ రకమయిన తెలివితేటలున్నవాళ్ళు మాత్రం సులువుగా మిమ్మల్ని దాటి నిచ్చెనలెక్కి కెరీర్ లో ఉన్నత స్తానాలకు ఎదిగిపోతారు. ఇప్పుడున్న కార్పోరేట్ సూత్రాల ప్రకారం ఇవన్నీ నీతిబాహ్యమయిన చర్యలు కాదు. ఒకరకంగా చెప్పాలంటే వీటికి అందరి ఆమోదం వుంది. కాలమాన పరిస్తితులకు అనుగుణంగా మారడం ఈ నాటి నీతి. మారకపోతే, కెరీర్ లో కూడా మార్పు వుండదు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు.

“మీ గురించి మీరే తెలియచేప్పుకోవడానికి కొన్ని పద్ధతులు వున్నాయి.

“మీరు పనిచేసే సంస్త కు అవసరమయ్యే రెండు మూడు ప్రధానమయిన విషయాలను ముందు బాగా ఆకళింపు చేసుకోవాలి. వాటిని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. వీలుచిక్కిన ప్రతి సందర్భంలో ఏమాత్రం సంకోచించకుండా వాటిని గురించి మాట్లాడుతుండాలి. సందర్భం, అసందర్భం అని ఆలోచించ కూడదు. వాక్చాతుర్యంతో అందర్నీ కట్టిపడేయాలి. మనం చెబుతున్నదానిని అంతా నమ్ముతున్నారా లేదా అన్న సంశయం పెట్టుకోకూడదు. అయితే, ధారాళంగా ఒక విషయం గురించి చెప్పగలిగినప్పుడు ఆ మాటల ప్రభావం శ్రోతలపై కొంతకాలం వుంటుంది. విడిపోయిన తరువాత కూడా కొంతమంది వాటిని గురించే మాట్లాడుకుంటారు. మన గురించి వారి అవగాహన కొంత సానుకూలంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మన పట్ల చులకన భావం వున్న వాళ్ళు కూడా పరోక్షంలో మన గురించి మాట్లాడేటప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకోవాల్సివుంటుంది.

“అలాగే, సీనియర్ మేనేజ్ మెంట్ వ్యక్తులతో సంభాషించే అవకాశం వచ్చినప్పుడు మీరు ఈ చిట్కాను మరింత ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ఉన్నతాధికారులు తలపెట్టే ప్రాజెక్ట్ లలో స్వచ్చందంగా పాలు పంచు కోవాలి. మీ పనిలో ఎంత చిన్న విజయం సాధించినా మొహమాటపడకుండా ఆ విషయం మొత్తం ప్రపంచానికి చాటిచెప్పుకోవాలి. ఇవన్నీ మీ వ్యక్తిత్వ శోభను మరింత పెంచుతాయి. మీ చుట్టూవున్న వారు మీ పట్ల ఆరాధనాభావం పెంచుకోవడానికి తోడ్పడతాయి.

“కెరీర్ గురించి అంతా మరచిపోయిన మాట ఒకటుంది. ‘జీవితంలో సరయిన సమయంలో సరయిన స్తానాన్నిఅందుకోగలగడాన్ని లోగడ కెరీర్ కు అర్ధం గా చెప్పుకునే వారు.

ఈ నాడు దీని అర్ధం పూర్తిగా మారిపోయింది. ‘సరయిన స్తానం ఏదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. దాన్ని సంపాదించుకునే పద్ధతులను స్వయంగా నిర్ణయించుకోవాలి. అందుకు అవసరమయ్యే అవకాశాలను కూడా సొంతంగా సృష్టించుకోవాలి.’

ఇప్పటికే మీరు ఇవన్నీ చేసివుంటే మీరు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో వున్నట్టే లెక్క.

మాయ తివాచీ మీ చేతికి దొరికినట్టే. దాని మీద కూర్చోవడమే తరువాయి అదే మిమ్మల్ని మీరు కోరుకున్న శిఖరాలకు చేరుస్తుంది.”
(26-03-2011)

24, మార్చి 2011, గురువారం

మంచీ చెడు – భండారు శ్రీనివాసరావు

మంచీ చెడు – భండారు శ్రీనివాసరావు


“ఆనో భద్రాః క్రతవో యన్తు విశ్వతః” అని రిగ్వేదం చెబుతోంది. అంటే అన్ని వైపులనుంచి ఉత్తమమైన భావాలు నాలో ప్రవేశించు గాక అని అర్ధం.

పరీక్ష జరిగే హాలు నిశ్శబ్దంగా వుంది. విద్యార్ధులందరూ జవాబులు రాసే క్రమంలో తలమునకలైవున్నారు.

పరీక్షరాసే వారిలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వున్నారు. తరగతి మొత్తంలో చాలా తెలివిగల విద్యార్ధి. అతడి వెనుకనే మనీష్ కూర్చుని ప్రశ్నాపత్రాన్ని దీక్షగా చూస్తున్నాడు. సహజంగా మందబుద్ధి అయిన మనీష్ కు ఆ పరీక్ష గట్టెక్కడం అన్నది ఒక పరీక్ష గా తయారయింది. అందుకే అతడు ఈ విషయంలో తన స్నేహితుడయిన విద్యాసాగర్ సాయం కోసం ఎదురుచూస్తూ బిత్తర చూపులు చూస్తున్నాడు. ఈలోగా ఈశ్వరచంద్ర విద్యాసాగ ర్ జవాబులురాసే పని పూర్తయింది. రాసిన సమాధానాలను మరోమారు పరిశీలించుకునే పనిలో పడిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనీష్ మరో మారు ఈశ్వర్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసాడు. తన స్నేహితుడు కోరుతున్నదేమిటో ఈశ్వర్ కు సులువుగానే అర్ధం అయింది. కానీ ఈ విషయంలో స్నేహితుడికి సాయం చేయడానికి అతడికి మనస్కరించ లేదు. కానీ, దీనంగా అభ్యర్ధిస్తున్న స్నేహితుడి చూపులకు అతడి మనసు మెత్తపడింది. దాంతో అప్పటి వరకు తాను రాసిన సమాధాన పత్రాన్ని మనీష్ కు రహస్యంగా అందించాడు. ఇది ఎవరూ చూడలేదనుకున్నాడు కానీ, ఈశ్వర్ కాపీ అందిస్తూ వుండడం పరీక్ష హాలులో పర్యవేక్షణ చేస్తున్న ఉపాధ్యాయుడి కంటబడింది. అయ్యవారు ఆగ్రహంతో వూగిపోతూ ఈశ్వర్ ని పట్టుకుని కఠినంగా శిక్షించాడు. నలుగురిలో జరిగిన ఈ అవమానంతో స్వతహాగా అభిమానధనుడయిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎంతగానో కుంగిపోయాడు.

పరీక్ష పూర్తి కాగానే ఉపాధ్యాయుడు ఈశ్వర్ ని తన గదికి పిలిపించుకున్నాడు.

“చూడు. ఈశ్వర్. నువ్వు చాలా తెలివైన విద్యార్ధివి. బాగా చదువుకుని పైకి రావాల్సినవాడివి. నీలాటి తెలివయిన కుర్రవాడిని అలా శిక్షించినందుకు నాకెంతో బాధగా వుంది” అంటూ ఓదార్చే ప్రయత్నం చేసాడు.

స్నేహితుడికి సాయం చేయాలన్న సదుద్దేశ్యం తప్ప దగా చేయాలన్న అభిప్రాయం తనకు యే కోశానా లేదని విద్యాసాగర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

డానికి ఉపాధ్యాయుడు ఇలా జవాబు చెప్పారు.

“తప్పుచేసినవాడు పాపితో సమానం. కానీ తప్పుచేసేవాడికి సాయం చేసేవాడు కూడా వాడితో సమానమే. అందుకే, నిన్నుశిక్షించాల్సి వచ్చింది. నిజమే. నువ్వు మనీష్ కి సాయం చేయాలని అనుకున్నావు. కానీ అలా చేయడం ద్వారా అతడిలోని బద్ధకానికి కూడా సాయం చేస్తున్న సంగతి మరచిపోయావు. అల్లా ఎవరో ఒకరు నీలా సాయం చేస్తూ పోతుంటే, ముందు ముందు తోటివారి సాయం తీసుకోకుండా అతడికయేపనీ చేయలేడు”

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి మహా మేధావి స్వయంగా వెల్లడించిన ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఒకటుంది.

“మనం చేసే ప్రతి పని వల్ల వచ్చే ఫలితం మంచి చెడుల సమ్మిశ్రమం. ఇతరుల జీవితాలను మంచి వైపు నడిపించే దిశగా మనం చేసే పనుల ఫలితం వుండేలాగా చూసుకోవాలి. అటువంటి చక్కటి భావనలు అన్ని వైపులనుంచి మన మనస్సులో ప్రవేశించేలా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూవుండాలి.” (24-03-2011)













21, మార్చి 2011, సోమవారం

నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు

నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు


నిదురించే తోటలోకి తీపి కబురు వచ్చింది.

‘ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకా’ దాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికి - ఈ ఏడాది  మార్చి పద్దెనిమిది పండుగ రోజు లాటిది. ఏటా మార్చి నెల మూడో శుక్రవారాన్ని  అంతర్జాతీయ నిద్రా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) నిర్వహించారు. ‘మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!’ అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..

అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులు, స్కూలు పిల్లలు, ఈడొచ్చిన పిల్లలు, యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకా, మన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా – నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె, ఎంత నిద్రపోతే అంత బలం అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి లోగో గా పెట్టుకునేవారు. రాక్షసుడి చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే మన వేంకటేశ్వర స్వామి వారి అనుంగు సోదరులు వరద రాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన నిద్రాదేవత మరొకరు దొరకడం దుర్లభం కూడా.

అయితే, ఈ నిద్ర తెరపీ అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్ర పోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలి, ఎంత నిద్ర పోవాలి అని వీరు సలహాలు ఇస్తారు. నిద్ర పట్టడం లేదు బాబోయ్ అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారు, రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూ, రాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నడకలు సాగించే వారూ – ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ తెరపీ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ‘నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!’ అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ‘మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!’ అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమే, మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణులవారి చేత ‘మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!’ అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్ర మాధుర్యం అలాటిది మరి.

“నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!” అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగం’ అని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదా, మనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూ, లేనివాడూ హాయిగా ఆరుబయట పండుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు వాళ్లకు తెలుసుకానీ కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈ నాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం మందే మందు అనుకునే వారు, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడేవారు ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు వున్న కుబేరులకన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.

హైదరాబాదులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే హెచ్ ఎం ఆర్ ఐ – 104 అనే ఒక సంస్త వుంది. 104 నెంబరుకు ఫోన్ చేస్తే అక్కడ ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే డాక్టర్లు అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా సలహాలు, సూచనలు ఇస్తారు. రోజుకు దాదాపు యాభయ్ వేల మంది వైద్య సలహాలకోసం ఈ కాల్ సెంటర్ ను సంప్రదిస్తుంటారు. వీరికొచ్చే కాల్స్ లో చాలామంది ‘నిద్రపట్టడం లేదు ఏం చేయాలని అడిగేవారు వుంటున్నా’రట. బహుశా, రాత్రింబగళ్ళు సలహాలు దొరికే కేంద్రం కావడంవల్ల, అర్ధరాత్రీ అపరాత్రీ అనకుండా సలహాలు ఇచ్చే వైద్యులు అందుబాటులోవుండడం వల్ల - నిద్రపట్టని వారిపాలిట ఈ కేంద్రం వరంగా మారి వుంటుంది. ప్రపంచ జనాభాలో 45 శాతం నిద్రలేమితో అనారోగ్యాలబారిన పడుతున్నారని ఈ కేంద్రం సేకరించి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

హెచ్ ఎం ఆర్ ఐ 104 ఉచిత ఆరోగ్య వైద్య సలహా కేంద్రం విశ్లేషణ ప్రకారం యువతలోనే, ప్రధానంగా నగర ప్రాంతాలలోని యువతీ,యువకుల్లో ఈ నిద్రలేమితనం ఎక్కువగా వున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తుపై ఆందోళన, రకరకాల మానసిక వొత్తిళ్ళు ఇందుకు కారణగా అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.నిద్ర లేమితో బాధపడుతున్న వారిలో 92 శాతం మంది 16 నుంచి 40 ఏళ్ళ మధ్య వారేనని తేలింది. వీరిలో అధిక సంఖ్యాకులు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే వుండడం విశేషం. దాదాపు తొంభయ్ వేలమందికి పైగా వివిధ వయస్కుల వాళ్ళు ఈ కేంద్రానికి ఫోన్ చేసి నిద్ర సంబంధిత రుగ్మతల విముక్తికి సలహాలు తీసుకున్నారంటే ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటె, పర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. ఉత్తిష్టత జాగ్రత - మేలుకోండి. మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. మంచి నిద్రతో చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారం లాటి నిద్రకు దూరం కాకండి.

చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూ, చేతిలో ఘంటం వుంటే చాలదూ - “నిరుపహతీ స్తలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబు, బంగరు టూగుటుయ్యెల” ఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి, వేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకా, పడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకు మని మెరిసే తారలతో కూడిన నీలాకాశాన్ని పడక గది పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతే, మత్తు పదార్దాలకూ, మాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ మందు కొడితేనే కానీ నిద్రపట్టదు అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు.అయితే,  వైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీ, పట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదు, మందు తప్ప.

ముందే చెప్పినట్టు – పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా హాయిగా నిద్దుర పోండి. (18-03-2011)

20, మార్చి 2011, ఆదివారం

కోతిచేష్ట – భండారు శ్రీనివాసరావు


కోతిచేష్ట – భండారు శ్రీనివాసరావు


విమానం కూలిపోయింది. పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లతో సహా అందులో ప్రయాణిస్తున్నవారందరూ ఈ దుర్ఘటనలో మరణించారు, ఒక్క ఒక కోతి తప్ప. (విమానంలో కోతియేమిటంటే ఇక కధే లేదు)  


దాన్ని ఆసుపత్రిలో చేర్చారు. కాస్త కోలుకున్న తరవాత దుర్ఘటన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ఆ కోతిని విచారించడం ప్రారంభించారు. ఈ కధలో కొత్తదనం ఏమిటంటే ఆ కోతికి మనిషి భాష తెలుసు.


దర్యాప్తు ఇలా సాగింది.


అధికారి: “విమానం బయలుదేరినదగ్గరినుంచి అన్ని విషయాలు చెప్పు. అసలేం జరిగింది.”


కోతి: “ఏముంది ఎయిర్ హోస్టెస్ నాకు పళ్ళూ బిస్కెట్లు పెట్టింది. అవి తింటూ కూర్చున్నాను.”


“నీ సంగతి సరే! మిగిలినవారు ఏం చేస్తున్నారు?”


“సీటు బెల్టులు పెట్టుకున్నారు. మందు కొడుతూ కూర్చున్నారు”


“పైలట్లు ఏం చేస్తున్నారు?


“ కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు”


“తరవాత?”


“తరవాత ఏముంది ? ప్రయాణీకులందరూ ఫుల్లుగా మందు కొట్టి, ఎయిర్ హోస్టెస్ లు పెట్టింది తిని నిద్రలోకి జారుకున్నారు”


“మరి ఎయిర్ హోస్టెస్ లు ఏం చేస్తున్నారు?”


“ తీరిగ్గా కూర్చుని లిప్ స్టిక్ దిద్దుకుంటూ, మేకప్ సరిచేసుకుంటున్నారు.”


“పైలట్లు?”


“యధామాదిరి కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు.”


“అది సరే! ప్రమాదం జరగడానికి ముందు ఎవరేం చేస్తున్నారు ?”


“ఎయిర్ హోస్టెస్ లు పైలట్లకు ముద్దు పెడుతున్నారు.”


“మరి. పైలట్లు ?”


“ ఎయిర్ హోస్టెస్ లకు తిరిగి ముద్దు పెడుతున్నారు”


“నువ్వేం చేస్తున్నావు?”


“ఏం చేస్తాను. కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నాను.”


(నెట్ లో చక్కర్లుకొడుతున్న చిన్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్చానువాదం)

19, మార్చి 2011, శనివారం

రైల్లో అమెరికా ప్రయాణం - రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు

రైల్లో అమెరికా ప్రయాణం - రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు


రైల్లో అమెరికా ప్రయాణం

కొందరు తాము నవ్వుతూ ఇతరులను నవ్వించాలని చూస్తారు. మరికొందరు తాము మాత్రం నవ్వుతూ పక్కవారిని ఏడిపించాలని చూస్తారు. ఇంకొందరు తాము నవ్వరు. కానీ, తమ మాటలతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంటారు. ఇదిగో ఈ కోవలోని వారే ఈనాటి నా వ్యాసుల వారు. అంటే వ్యాస మహర్షులు కాదు. ఈ వ్యాసానికి ప్రేరకులని కవి హృదయం. ఆయనే తురగా కృష్ణ మోహనరావుగారు. బోలెడంత ఘన కీర్తిని తన వెంటబెట్టుకుని, బోలెడు బోలెడు జ్ఞాపకాలను మనందరికీ వొదిలిపెట్టి స్వర్గానికి వెళ్లిపోయి రమారమి ముప్పయ్యారేళ్ళు అవుతోంది. ఈ రోజు పోతే రేపటికి మూడు అని తేలిగ్గా తీసుకునే రోజుల్లో – ఫిబ్రవరి పదో తేదీన (ఫిబ్రవరి 21 ఆయన జయంతి – అక్టోబర్ రెండో తేదీ వర్ధంతి. ఆరోజు కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవాన్ని కవర్ చేయడానికి వెళ్లి, తప్పిపోయిన రైలును అందుకోవడానికి రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో వెడుతూ నక్రేకల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించి ఎవరికీ అందనంత దూరాలకు వెళ్లి పోయారు) హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన ఆయన సంస్మరణ సభకు ఎక్కడెక్కడినుంచో వచ్చిన ఆత్మీయులను చూస్తుంటే మంచి మనిషికీ, మంచి జ్ఞాపకాలకూ ఏనాటికీ మరణం లేదనిపించింది.


కృష్ణమోహనరావు గారు రేడియో మనిషి. ఆ మీడియాన్ని ఆయన ఆపోసన పట్టారు. ఈ ప్రజా మాధ్యమం పూర్తిగా సర్కారు చేతుల్లో వున్నప్పుడు ఆయన రేడియో కొలువుని అటు ఉద్యోగ ధర్మానికి మాట రాకుండా, ఇటు సామాజిక బాధ్యతకు లోటు రాకుండా నెగ్గుకొచ్చిన తీరును ఈ సమావేశంలో ఆనాటి ఆయన సహోద్యోగులు మరోసారి గుర్తు చేసుకున్నారు. అక్షరాలను అందమయిన చిత్రాలుగా గీస్తూ వాటితో వెన్నెట్లో, చీకట్లో సయితం సతతం ఆడుకునే  'రేడియో'  సుధామ - కృష్ణమోహన రావు గారితో రేడియో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటే, దూరదర్శన్ డైరెక్టర్ శైలజా సుమన్ - జానకీరాణి గారి కుటుంబంతొ తన సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు.


ఆయన పేరిట నెలకొల్పిన అవార్డును అందుకున్నది దూరదర్శన్ కరస్పాండెంటు ఈమని కృష్ణారావు. రేడియో జర్నలిజంలో తనకు అక్షరాభ్యాసం చేసింది తురగా కృష్ణ మోహనరావుగారే అని అప్పటి రోజులను మననం చేసుకుంటూ, విధి నిర్వహణలో తురగావారి అంకితభావమే తనకు మార్గదర్శిగా నిలుస్తూవచ్చిందని పేర్కొన్నారు. కాజువల్ సిబ్బందిని కూడా ‘నా సహోద్యోగి’ (మై కొలీగ్) అంటూ బయటవారికి పరిచయం చేసే ఔన్నత్యం కృష్ణమోహన రావుగారి రక్తంలో వుందన్నారు.


కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీనియర్ ఐ .ఏ. ఎస్. అధికారి శ్రీ రమణాచారి మాట్లాడుతూ- ‘వీలయితే నాలుగు మాటలు, కుదిరితే కప్పుకాఫీ అనుకునే రోజుల్లో ఇంతమంది ఆత్మీయులు హాజరు కావడం కృష్ణమోహన రావు గారి గొప్పదనానికి అద్దంపడుతోంద’న్నారు.


కర్నాటక మాజీ గవర్నర్ శ్రీమతి వీ.ఎస్. రమాదేవి తమ ప్రసంగంలో వినిపించిన – కృష్ణమోహనరావు, జానకీ రాణిల ‘పెళ్ళికి ముందు ప్రేమ కధను’ శ్రోతలు ఆసక్తితో విన్నారు. ‘గుంభనగా, నిదానంగా వుండే కృష్ణమోహనరావు, చెంగు చెంగునా గంతులువేసే జానకీ రాణి- యాదగిరిగుట్టలో చేసుకున్న ప్రేమపెళ్లికి తానే ప్రత్యక్ష సాక్షిన’ని అంటూ వారి కుటుంబంతో తనకున్న చనువును కళ్ళు చెమర్చేలా చెప్పుకొచ్చారు. భర్త ప్రాణం కోసం యముడిని వెంటాడిన సతీ సావిత్రిలా – జానకీరాణి – ఇన్నేళ్ళ తరవాత కూడా భర్తను సజీవంగా వుంచే ఇలాటి కార్యక్రమాలను– పైపెచ్చు వొంట్లో బాగాలేకపోయినా లేని సత్తువను తెచ్చుకుని నిర్వహిస్తూ వుండడం చూస్తూ – ఒకనాటి సహోద్యోగిగా గర్వపడుతున్నానని చెప్పారు.


ఇలాటి సభల్లో వక్తలు దారితప్పి అనవసర ప్రసంగాలతో చీకాకు పెడతారన్న అపోహను తొలగించడానికా అన్నట్టు కార్యక్రమం ఆసాంతం ఆసక్తిగా సాగిపోవడం కృష్ణ మోహనరావు గారి అభిమానులను మరింత అలరించింది. స్వతహాగా హాస్యప్రియుడయిన తురగా వారికి నిజమయిన శ్రద్ధాంజలి రీతిలో ప్రసిద్ధ రచయిత్రి  సోమరాజు సుశీలాదేవి – కధా ప్రసంగం పేరుతొ చదివిన కధ – సభా ప్రాంగణాన్ని నవ్వులతో కదిలించింది. అమెరికాలో వున్న పిల్లల దగ్గరకు ప్రయాణమై వెడుతున్నప్పుడు ఒక గృహిణికి  ఎదురయిన అనుభవాలను హాస్యంతో రంగరించి శ్రోతలను అలరించారు. కధలు రాయడంలో చేయి తిరిగిన సుశీలా దేవి గారు కధను చదివి వినిపించడంలో కూడా అందెవేసిన చేయి అనిపించారు. ఆరోజుల్లో అమెరికా వెళ్ళాలంటే రైల్లో మద్రాసు వెళ్లి అక్కడినుంచి విమానంలో ఆ దేశానికి వెళ్ళేవారు. అమెరికాకు రైల్లో బయలుదేరామంటూ ప్రారంభించి హాస్యం తొణికించారు.


తురగా దంపతుల ముద్దుల కుమార్తెలు ఉషారమణి (ఆకాశవాణి న్యూస్ రీడర్ ) శోభ, జర్నలిస్ట్ కేబీ లక్ష్మి  - ముగ్గురూ  కార్యక్రమాన్ని ముందునుంచి, వెనుకనుంచి దన్నుగా నిలబడి  విజయవంతంగా నిర్వహించారు.


ఇక, నాకు తెలిసి తురగా కృష్ణ మోహనరావు గారు ఒక అద్భుతమయిన హాస్య రచయిత. సునిశితమయిన వ్యంగ్యానికి ప్రతీక. ‘ప్రవీణ్’ పేరుతొ ఆంధ్ర పత్రిక వార పత్రికలో వారం వారం వారు రాసిన ‘రాజధాని కబుర్లు’ నా బోటి పాఠకులకు అక్షరామృతం. వారి అకాల మరణం తరవాత ఆయన  వొదిలి వెళ్ళిన రేడియో విలేకరి  ఉద్యోగంలో నేను ప్రవేశించడం కేవలం నా సుకృతం.(10-02-2011)









జపాన్ ఉపద్రవమే ఇక్కడ జరిగివుంటే? – భండారు శ్రీనివాసరావు

జపాన్ ఉపద్రవమే ఇక్కడ జరిగివుంటే? – భండారు శ్రీనివాసరావు


ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలలు చెలియలికట్టదాటి అంతెత్తున ఎగసిపడి మిన్నూ మన్నూ ఏకం చేస్తూ తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శించినప్పుడు –

ప్రకృతి ప్రకోపానికి గురయి, మానవ నిర్మిత కట్టడాలన్నీ పేకమేడల్లా కూలిపోతున్నప్పుడు,

పొంగి పొరలిన సంద్రపు నీటిలో పెద్ద పెద్ద కార్లూ, విమానాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నప్పుడు-

ఈ వార్తా చిత్రాలనన్నింటినీ టీవీ తెరలపై చూస్తున్న ప్రతి ఒక్కరూ – జపాన్ లో జరిగిన ఘోరకలి ఇక్కడ జరిగుంటే ఏమయ్యేదని ఒక్క క్షణమయినా కలవరపాటుకు గురయివుంటారు.

‘యుగాంతం’ వంటి హాలీవుడ్ సినిమాల్లో చూపించిన గ్రాఫిక్ దృశ్యాలను తలదన్నే విధంగా ప్రకృతి ప్రదర్శించిన విలయతాండవం ముందు – మనిషి మరుగుజ్జుతనం మరోసారి ప్రపంచానికి వెల్లడయింది.

మూడింట రెండువంతులు నీరు ఆవరించివున్న ఈ భూమండలంలో – జపాన్ అనేది అనేకానేక చిన్న చిన్న దీవుల సమూహం. ఈ దీవుల్లో – హోన్షూ, షికోకు, హూక్కై దో, క్యుషూ అనేవి ప్రధానమైనవి.

అయితే బయట ప్రపంచానికి తెలిసిన జపాన్ అంటే హోన్షూ నే. ఎందుకంటె, జపాన్ అనగానే అందరికీ తటాలున గుర్తొచ్చే టోకియో, ఒసాకా,నగాయో,క్యోటో నగరాలు హోన్షూ అనే ఈ ప్రధాన భూభాగం లోనే వున్నాయి. జపాన్ జనాభాలో అత్యధిక భాగం హోన్షూ లోనే నివసిస్తూవుండడం కూడా మరో కారణం. పైగా, దేశ ఆర్ధిక వ్యవస్తకు ఇది గుండెకాయ లాటిది. విస్తీర్ణం దృష్ట్యా పెద్దదే అయినా, ప్రపంచపఠంలో చూస్తే మాత్రం హోన్షూ దీవి ఒక అరటి పండు మాదిరిగా కనిపిస్తుంది. పసిపిక్ మహా సముద్రం మధ్య వున్న ఈ దీవి, యావత్ ప్రపంచంలో ఒక సంపన్నదేశంగా జపాన్ ఆవిర్భావానికి దోహదం చేసింది. ఎలెక్ట్రానిక్, మోటారు పరిశ్రమలతో మొత్తం ప్రపంచ దేశాలలోనే పేరుపొందిన జపాన్ – సునామీలు, భూకంపాలకు కూడా పెట్టింది పేరు.

జపాన్ ఆర్ధిక,రాజకీయ,సాంఘికాభివృద్ధికి టోకియో నగరం నిర్వహించిన పాత్రను బట్టి, ఈ దేశం గురించి ఇతర దేశాల వారు అంచనాలు వేసుకుంటూ వుండడం కద్దు. అలాగే, అవసరం అయినదానికంటే ఎక్కువ ప్రచారం ప్రపంచ మీడియా జపాన్ కు ఇస్తూవస్తోంది. అందువల్లనే, ఇటీవలి ప్రకృతి భీభత్సంలో జరిగిన నష్టం గురించిన అంచనాలు కూడా ఆ కోవలోనే సాగాయని ఆ దేశానికి చెందిన నిపుణులు అంటున్నారు. దీనికి వారు చెప్పే కారణం ఇలాటి ఉపద్రవాలపట్ల ఆ దేశం సాధించిన సంసిద్ధత. ఈ విషయంలో జపాన్ కు సరితూగగల మరో దేశం ప్రపంచంలో లేదనడం అతిశయోక్తికాదు. ఎందుకంటె సునామీలు, భూకంపాలు ఈ దేశానికి కొత్తకాదు. అక్కడి ప్రజలు వాటితో సహజీవనం చేయాల్సిన పరిస్తితి. నిజానికి సునామీ, (త్సునామీ ) టైఫూన్ అనే పదాలు జపాన్ భాషకు చెందినవేనంటారు. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏమి చేయాలన్నది పైనుంచి కింద దాకా అన్ని స్తాయిల్లోని వారికి కరతలామలకం.

ప్రజలందరికీ ఈ విషయంలో చక్కని అవగాహన వుంటుంది. మిన్ను విరిగి మీద పడే సందర్భాలలో సయితం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను గురించి అతి తక్కువ స్తాయిలోని ఉద్యోగికి కూడా తెలిసివుంటుంది. ముఖ్యంగా గత పది సంవత్సరాల కాలంలో అక్కడి నిపుణులు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో తక్షణం స్పందించాల్సిన తీరు గురించి శాస్త్రీయ పద్ధతుల్లో ఒక నిర్దిష్టమయిన విధానాన్ని రూపొందించుకున్నారు. మొన్నటి దుర్ఘటనలో జన నష్టం నివారణకు అది బాగా ఉపయోగపడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో వారు అధునాతన కంప్యూటర్ వ్యవస్తను కూడా చక్కగా వాడుకుంటున్నారు.ఈ కోణం దృష్ట్యా ఆలోచిస్తే, ఆ దేశం నుంచి ఇతర దేశాలు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తోంది.

భూకంపాలవంటి విపత్తులు ముంచుకొచ్చినప్పుడు ప్రతి పౌరుడు ఎలాటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించడం వల్ల – ఒకరినుంచి ఆదేశాలు కానీ, సూచనలు కానీ అందుకోవాల్సిన అవసరం లేకుండా అందరూ ఎవరికివారు పరిస్తితికి తగ్గట్టుగా వెంటనే స్పందించగలిగారని ఒక ప్రత్యక్ష సాక్షి కధనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రకృతి  వైపరీత్యం గురించిన అనుమానం తలెత్తగానే ఎవరికి వారు ముందు తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం  ఇవ్వాలనేది శిక్షణ లో నేర్పే తొలి పాఠం. ఆ జాగ్రత్త తీసుకున్న తరువాత ఆ సమాచారాన్ని ఇతరులకు తక్షణం తెలియచెప్పాలన్నది రెండో పాఠం. అదేసమయంలో తోటి వారి భద్రతకు ఏం చెయ్యాలని ఆలోచించాలి. మిన్నువిరిగి మీదపడే సందర్భాలలో సయితం ఇలా స్తితప్రజ్ఞతతో ఆలోచించగల నైపుణ్యాన్ని జనాలకు కలిగించడం ఈ శిక్షణ లక్ష్యం.

ఉదాహరణకు ఒగాకీ నగరాన్ని తీసుకుందాము. అక్కడి జనాభా లక్షా యాభయ్ వేలు. ఇంగ్లీషు మాట్లాడే దేశాలనుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పట్టుమని పాతికమంది కూడా వుండరు. అయినా ఇంగ్లీష్ అనువాదకుల జాబితా అధికారుల వద్ద సిద్ధంగా వుంటుంది. విపత్కర పరిస్తితులను ఎదుర్కోవడానికి ఈ రకమయిన సంసిద్ధత చాలా అవసరమని జపానీయులు నమ్ముతారు.

అలాగే, ఇంటర్ నెట్ ను ఇలాటి సందర్భాలలో వినియోగించుకుంటున్న తీరు కూడా అమోఘం. సాధారణంగా ఈ సదుపాయాన్ని వాడుకునే వారి సంఖ్య ఆ దేశంలో చాలా అధికం. విద్యార్ధి దశ నుంచే అక్కడి వారు దీన్ని బాగా ఉపయోగిస్తారు. అక్కడి విద్యాసంస్తలు విద్యార్ధులతో అనుసంధానం కావడానికి ప్రత్యేక పోర్టల్ ఉపయోగిస్తాయి. విద్యార్ధులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తరగతి షెడ్యూల్ సరి చూసుకోవడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని వెనువెంటనే తెలియచేయడానికి ఇది వారికి బాగా అక్కరకు వస్తోంది. ఈ పోర్టల్ లో ముందు కానవచ్చేదే ఎర్రటి పెద్ద అక్షరాలతో కూడిన హెచ్చరిక. ఈ రోజు తరగతిలో ఏ ఏ పాఠాలు బోధించబోతున్నారనే విషయం తెలుసుకోవడానికి ఆతృతతతో పోర్టల్ తెరిచిన విద్యార్ధులకు ఆ దుర్ఘటన జరిగిన రోజు కనబడిన

హెచ్చరిక ఏమిటో తెలుసా? “తరగతి సంగతి మరచిపోండి. సునామీ విరుచుక పడబోతోంది. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపొండి”

ఈ విధమయిన ఏర్పాట్లు అన్ని కార్యాలయాలలో, సంస్త లలో వుండే విధంగా ఆ దేశంలో అనేక చర్యలు తీసుకున్నారు. అందుకే, సెకన్ల వ్యవధిలోనే సమాచారం దేశంలోని నలుమూలలకు చేరిపోయింది. జనాలను గాభరా పెట్టేందుకు కాక అప్రమత్తం చేసే ఉద్దేశ్యంతో చేసిన ఈ హెచ్చరికలు సత్ఫలితాలను ఇచ్చాయని అక్కడివారు చెబుతున్నారు.

పాట్రిక్ అనే సిస్టం ఇంజినీర్ తన అనుభవం గురించి చెప్పిన వివరాలు వింటే ‘యుద్ధ ప్రాతిపదిక’ అని తరచుగా వినబడే మాటకు అసలుసిసలు అర్ధం బోధపడుతుంది.

భూకంప ప్రకంపనలకు సంబంధించిన తొట్టతొలి సూచనను గమనించిన ఆ ఇంజినీర్ పంపిన సమాచారం రెండు సెకన్ల వ్యవధిలోనే చేరాల్సిన చోటికి చేరిపోయింది. తూర్పు జపాన్ తీరానికి దగ్గరలో తీవ్రమయిన భూకంపం సంభవించిందన్న ప్రభుత్వ సమాచారం వేలమైళ్ళ దూరంలో వున్నవారికి సయితం చేరడానికి మరో రెండు సెకన్ల కంటే ఎక్కువ వ్యవధి పట్టలేదు. మరో రెండు సెకన్లలో భూకంపం సంభవించిన ప్రాంతాలతో టెలిఫోన్ సంబంధాలు తెగిపోయిన సమాచారం అందింది. అయితే, వెనువెంటనే రిమోట్ ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్ సదుపాయాన్ని పునరుద్ధరించిన కబురు అందింది. ఇదంతా జరగడానికి పట్టిన సమయం కేవలం తొంభయ్ సెకన్లు. మరోపక్క సహోద్యోగులు, ఇరుగుపొరుగువారి రక్షణ బాధ్యతను ఎవరికివారు స్వచ్చందంగా భుజాన వేసుకున్నారు. ఎవరు ఎక్కడ వున్నారు అన్న సమాచారాన్ని క్షణాల మీద తెప్పించుకుని వారిని అప్రమత్తం చేసారు.

ఇదేమాదిరి సన్నివేశాలు ఆ రోజు జపాన్ దేశమంతటా కానవచ్చాయంటే ఇలాటి సందర్భాలలో ఆ దేశ సంసిద్ధత ఎలావున్నదన్నది వూహించుకోవచ్చు.

ఆ ఇంజినీర్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియచేసారు.

“నేనున్న చోట ఆ రోజు భూమి కంపించడం మొదలయింది. బాగా గాలి వీస్తోంది కాబట్టి భవనం వూగుతోందని ముందు భ్రమ పడ్డాను. మా దేశం భూకంపాలకు నిలయం కనుక వాటిని తట్టుకునేలా భవనాలను నిర్మించుకోవడం ఇక్కడి పధ్ధతి. అందుకోసం ప్రచండమయిన గాలులు వీచినప్పుడు భవనాలు కదిలిపోయేలా వాటిని నిర్మిస్తారు.భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం వీలయినంత తగ్గించడానికి ఈ విధమయిన నిర్మాణ పద్ధతులను అనుసరిస్తున్నారు.

“ఆ రోజు నేను వున్న భవనం వూగిపోవడం మొదలుకాగానే, కిటికీ నుంచి బయటకు చూసాను. దాపున వున్న రైల్వే స్టేషన్ నుంచి ఓ రైలు బయటకు వస్తోంది. వున్నట్టుండి ఆ రైలుకు బ్రేకులు పడ్డాయి. కీచుమని శబ్దంచేస్తూ పట్టాలపై ఆగిపోయింది. బహుశా, భూకంపం గురించిన సమాచారం తెలిసినవారెవ్వరో రైలు డ్రయివర్ కు ఇంటర్నెట్ ద్వారా ఆ కబురు చేరవేసివుంటారు. అందువల్లనే

రైలును వెంటనే నిలిపివేసారు. ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రయాణీకులకు లౌడ్ స్పీకర్ల ద్వారా తెలియచేసివుంటారు. అది వేరే విషయం. ఈ దేశంలో ఇవన్నీ సర్వ సాధారణం.

“గంటకు నూట యాభయ్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న రైళ్ళు కూడా, ముందస్తు సమాచారం అందుకున్న కారణంగా ఎక్కడికక్కడ నిలచిపోయాయి. వాటిల్లో వున్న ప్రయాణీకులందరూ క్షేమంగా వున్నారు. ఇలాటి ఏర్పాట్లు సమగ్రంగా వున్నందువల్ల ఎక్కడా రైళ్ళు పట్టాలు తప్పలేదు. సునామీ సమయంలో జపాన్ రైల్వే వ్యవస్థ పనిచేసిన తీరు అమోఘం. మొత్తం మీద హోన్షూదీవిలో ప్రతిచోటా ఇదే సీను. విమానాలు గాలిలో ఎగిరాయి. భవనాలు కూలకుండా నిలిచాయి. ప్రజాజీవనం అస్తవ్యస్తం కాలేదు.

“ఒగాకీ నుంచి రైల్లో నగోవా వెడుతున్నప్పుడు అనేక కర్మాగారాలు కానవస్తాయి. వీటిల్లో చెప్పుకోదగింది బీరు తయారుచేసే ఓ కర్మాగారం. పైకి పెద్ద పెద్ద బీరు సీసాల మాదిరిగా కానవచ్చే ట్యాంకుల్లో విపరీతమయిన వొత్తిడి మధ్య బీరు నిలవచేస్తారు. ఈ ఫాక్టరీలలో ప్రమాదకరమయిన రసాయనాలు వుంటాయి. నిజానికి ట్రిగ్గర్ లేని దారుణమయిన ఆయుధాల వంటివి ఈ కర్మాగారాలు. కానీ, వీటిల్లో ఏ ఒక్కటీ పేలిపోలేదు. ఎందుకంటె,సునామీలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తట్టుకోవడానికి వీలయిన వ్యవస్తలను జపాన్ సిద్ధంచేసి పెట్టుకుంది. సమయానికి ఆ వ్యవస్తలు అనుకున్నవిధంగా పనిచేశాయి. కనీవినీ ఎరుగని విపత్తు వాటిల్లినప్పుడుకూడా లక్షలాదిమంది ప్రాణాలు నిలబడ్డాయంటే, ముందే పకడ్బందీగా నిర్మించుకున్నఈ వ్యవస్తలన్నీ అనుకున్నవిధంగా పనిచేయడమే కారణం. ఇందులో అతిశయోక్తి ఏమీలేదు. నిజంగా వ్యవస్థ పనిచేసింది. ఇది మానవ నాగరిక సమాజం సాధించిన విజయం. జపాన్ లోని ప్రతి ఇంజినీరు ఈ విపత్కర సమయంలో తన దేశం కోసం, తన తోటివారికోసం కష్టించి పనిచేసాడు. అయితే, ఇది అప్పుడే గట్టిగా పైకి చెప్పుకోలేని పరిస్తితి. ఎందుకంటే జరగాల్సినంత స్తాయిలో దారుణం జరగకుండా నిరోధించగలిగినామన్న సంతోషం మాకెవరికీ మిగలలేదు. జరగకూడనిది జరిగిపోయింది. అనేకమంది మరణించారు. ఇంకా అనేకమంది జాడ తెలియడం లేదు. వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. మిగిలిన మేమందరం వారందరికీ బాసటగా నిలవాల్సిన తరుణం ఇది” అని ఆ ఇంజినీర్ తన భావాలను పంచుకున్నాడు.

అంత నిబ్బరంగా కర్తవ్యాలను నిర్వర్తించిన జపాన్ ప్రజలు సర్వదా అభినందనీయులు.

పోతే, పులిమీది పుట్రలా విరుచుకు పడిన అణు ప్రమాదం నుంచి కూడా సామాజిక బాధ్యతకు కట్టుబడిన వారి పౌర ధర్మమే వారిని కాపాడగలదని ఆశిద్దాం. (19-03-2011)

జపాన్ సునామీని కళ్ళారా చూడాలనుకుంటే ఈ కింది లింకు ను నొక్కండి. ఓ కారులో అమర్చిన ఆటోమాటిక్ వీడియో కెమెరా ఆ భీభత్సాన్ని కనులకు కట్టినట్టు చూపించింది. ఆ కారు యజమాని ఏమయినాడో ఆ సునామీకే ఎరుక. - రచయిత

http://www.wimp.com/japanesetsunami/



17, మార్చి 2011, గురువారం

నీటిలా సాగిపోవాలి! - భండారు శ్రీనివాసరావు

నీటిలా సాగిపోవాలి! - భండారు శ్రీనివాసరావు


వియత్నాం వీరుడు హోచిమిన్ తన జ్ఞాపకాలలో ఇలా రాసుకున్నారు.


“నాకప్పుడు తొమ్మిదేళ్ళు. స్కూలు పరీక్ష తప్పాను. నాకొచ్చిన మార్కులు చూసుకుని ఎంతో బాధ పడ్డాను. జీవితం వృధా అనిపించింది. యావత్ ప్రపంచం నన్నో పనికిమాలినవాడిగా చూస్తున్న భావన కలిగింది. ఆ మానసిక వేదనతో వున్ననేను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను. ఐతే, మా నాన్నగారు నామానసిక స్తితిని కనిపెట్టారు. తండ్రిగా దగ్గరకు తీసి లాలించారు. పరీక్ష పాసవడం ఒక్కటే జీవితంలో ప్రధానం కాదన్నారు. మా అమ్మ మరీను. ఎంతో ఆప్యాయంగా మృదువయిన మాటలతో నాకు సర్దిచెప్పింది. నా మనోవేదనను చేత్తో తీసివేసినట్టు మాయం చేయడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. మా కుటుంబానికి ఎల్లవేళలా దన్నుగావుండే మాఇంటి ఆధ్యాత్మిక గురువు గారు నాకు మరింత ధైర్యాన్ని నూరిపోశారు. ఆ సమయంలో వారినుంచి నాకు లభించిన భరోసా నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసిందనే అనుకున్నాను. అయినా, నాలో గూడుకట్టుకుపోయిన దైన్యం తొలగిపోలేదు. అధైర్యం మాసిపోలేదు. వారి మాటలతో, చేతలతో తెచ్చిపెట్టుకున్నకూసింత ధైర్యం కాస్తా మరునాటికే జావకారిపోయేది. నిరాశ ,నిస్పృహ రోజురోజుకూ పెరిగిపోవడంతో ఇక తట్టుకోలేక ఓ రాత్రి ఇంటి నుంచి పారిపోయాను.


“అలా దిక్కుతోచకుండా తిరుగుతూ ఒక బౌద్ద ఆరామం చెంతకు చేరుకున్నాను. బౌద్ద బిక్షువు ఒకరు సుమధురంగా ఆలపిస్తున్న ప్రార్ధనా గీతం నా చెవిన పడింది. అతడు పాడుతూనే వున్నాడు. నేను వింటూనే వున్నాను.


“నీరు స్వచ్చంగా ఎలావుంటుంది? ఎందుకంటె అది నిరంతరం పారుతూనే వుంటుంది. అలా పారే నీటికి అడ్డంకులు వుండవా? వుంటేనేం నీటికి వున్న పారే గుణం ఆ అడ్డంకులను అధిగమించేలా చేస్తుంది. ఒక నీటి బొట్టు ఓ పెద్ద జలపాతంలా ఎలా మారుతుంది ? ఎందుకంటె దానికున్న పారే గుణమే దానికా శక్తి నిచ్చింది. ఆ జలపాతం ఒక వాగులా, ఆ వాగు ఓ నదిలా ఎలా రూపం మార్చుకుని సముద్రం లో కలుస్తుంది ? ఎందుకంటె ఒకే జవాబు. నీటికి వున్న పారే ఆ లక్షణమే దానికి కారణం.


అందుకని ఓ నా జీవితమా! ఎక్కడా ఆగిపోకు. నిరంతరం సాగిపోతూవుండు. పారుతూనేవుండు. అలా అలా సాగిపోతూనే వుండు.”


“ఆ గీతం వింటూ చాలాసేపు నన్ను నేను మరచిపోయాను. ఎంత గొప్ప భావం. ఎంత చక్కని సందేశం. చలనం లేని ప్రపంచం ఎంత నిరర్ధకం.


“ఆ బౌద్ద బిక్షువు ప్రార్ధన నాలో కొత్త మనిషిని తట్టిలేపింది. అంతే! అప్పటినుంచి నేను నిరంతరం పారే నీటిలా మారిపోయాను. నాటినుంచి ఇప్పటివరకు సదా ప్రవహిస్తూనే వున్నాను. ఎక్కడా ఆగిపోలేదు. అన్నిచోట్లకూ వెళ్ళ గలుగుతున్నాను. అందరినీ చేరగలుగుతున్నాను. ఎందుకంటె సతతం పారే నీటి గుణాన్ని నేను కూడా అలవరచుకున్నాను కనుక. కనుకే, ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోతున్నాను.” అని తన స్మృతుల్లో రాసుకున్నారు- మహా నాయకుడు, అశేష జనాలకు పద నిర్దేశకుడు అయిన హోచిమిన్.






నీతి: విజయాన్ని చూసుకుని పొంగిపోవద్దు. అపజయంతో కుంగి పోవద్దు. ఎలాటి ప్రతికూల తలపుల ప్రభావం మనసుపై పడకుండా చూసుకోవాలి. మరో మంచి లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిక్కుగా సాగిపోవాలి. అడుగు ముందుకే పడాలి. ఆగిపోయామా ఇక జీవితం ఆగిపోయినట్టే. ఎందుకటే చలనం లేని జీవితం మృత్యువుతో సమానం. (17-03-2011)

వినదగునెవ్వరు చెప్పిన –భండారు శ్రీనివాసరావు



వినదగునెవ్వరు చెప్పిన –భండారు శ్రీనివాసరావు

రహదారులన్నీ నున్నగా ఎలాటి ఎగుడుదిగుళ్ళూ లేకుండా వుంటే చూడడానికి చాలా బాగా వుంటాయి. కానీ, వాటిపై వాహనాలు నడిపే వారు మంచి డ్రైవర్లుగా రూపుదిద్దుకోవడం కష్టం. అలాగే ఆకాశం ప్రశాంతంగా నిర్మలంగా వున్నప్పుడు విమానాలు నడిపే పైలట్లు చక్కని నైపుణ్యం కలిగిన విమాన చోదకులుగా తయారు కాలేరు. సమస్యలు లేని జీవితం కూడా అలాటిదే. ఆవిధమయిన జీవితం గడిపేవారు శక్తి వంతమయిన వ్యక్తిత్వం కలిగిన వారు కాలేరు. సమస్య వున్న చోటే అవకాశం వుంటుంది. దాన్ని వొడిసి పట్టుకోగలిగిన వారే విజయాలు సాధించగలుగుతారు.


జీవితంలో అన్నింటికన్నా పెద్ద భ్రమ ఏమిటంటే- ఇవాల్టి కంటే రేపు ఇంకా ఎక్కువ తీరుబడి వుంటుందని అనుకోవడం. చేతిలోవున్న ఐస్ క్రీం - కరిగి పోవడానికి ముందు తిన్నవాడే ఉత్తముడు.


మరుగుతున్న నీళ్ళల్లో మన ప్రతిబింబాన్ని చూడలేం. ఆలాగే, ఆగ్రహంతో వూగిపోయే వ్యక్తి వాస్తవాన్ని గ్రహించే పరిస్తితిలో వుండడు.


ఎవరో మెచ్చుకుంటారనో చప్పట్లు కొడతారనో ఏపనీ చేయవద్దు. జీవితం అన్నది జీవించడానికి కానీ మరెవరి మెహర్బానీకో కాదు. నలుగురిలో వునికిని చాటుకోవాలని అనుకోకూడదు. నలుగురిలో లేకపోయినా ఆ నలుగురూ మనం లేని విషయాన్ని గుర్తెరిగేలా మన వ్యక్తిత్వం వుండాలి.


జీవితంలో కెల్లా అత్యంత గొప్ప రోజు ఏదో తెలుసా! ఈ జీవితం నాదే అని ఎవరికి వారు నిర్ణయించుకున్న రోజే అతి మంచి రోజు. అంతేకాదు. నాది అనుకున్న జీవితాన్ని అతి గొప్పగా తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా నాదే అని గట్టిగా నిశ్చయించుకున్న రోజే భలే మంచి రోజు.


అభద్రతాభావం నుంచి పుట్టేదే అసూయ. సత్తా వున్న మనిషి దాన్ని దరిచేరనివ్వడు.


ప్రతి రోజూ మంచి రోజని అనుకున్నట్టయితే, ‘రేపు’ అనే రోజుని భగవంతుడనేవాడు అసలు సృష్టించేవాడు కాదేమో. అందువల్ల, ఆశించిన విధంగా ఈ రోజు గడవకపోతే పుట్టి మునిగేదేమీ వుండదు. రేపనేది వుందన్న ఆసతో ఆశ తో ఈ రోజును గడిపేయాలి.


గెలుపు వైపు ప్రయాణించే మార్గంలో రెండే రెండు అడ్డంకులు తగులుతాయి. ఒకటి నిరుత్సాహం. రెండోది అపజయం గురించిన భయం. ఈ రెంటినీ అధిగమిస్తే విజయం వచ్చి వొళ్ళో వాలుతుంది. (17-03-2011)

15, మార్చి 2011, మంగళవారం

బడుగులకు బడాబాబులకు ఒకే పీటా! – భండారు శ్రీనివాసరావు

(మార్చ్ 15వ తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)


బడుగులకు బడాబాబులకు ఒకే పీటా! – భండారు శ్రీనివాసరావు

బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహాన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు శ్రీ టి. అంజయ్య.


రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన ఇంగ్లీష్ ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి అంజయ్య విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు ‘మన పక్కా ఇళ్ళ ప్రణాళికలు’ అచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.


పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశన స్తలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, స్తలాలకు ఈనాడు వున్న ధరలు లేని ఆ రోజుల్లో కూడా పేదలకు ఇళ్ళ స్తలాలు అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు స్తలాలను పేదవారికి ఇళ్ళ స్తలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ స్తలాల కేటాయింపు అనేది ‘అదనపు పెద్దరికాన్ని’ కట్టబెట్టింది. కేటాయించిన స్తలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత ‘పక్కాగా’ అమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో ‘పక్కా ఇళ్ళ పధకం’ అనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రదానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈ నాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు – లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం


ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత పదేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి ‘తిలాపాపం తలా పిడికెడు’ చందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.


సరే! ఆరోపణలంటే గిట్టని వారు చేస్తారని కొట్టిపారవేయవచ్చు. కానీ, సాక్షాత్తూ శాసన సభకు సమర్పించిన ప్రభుత్వ నివేదికలోనే కళ్ళు చెదిరే కొన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్నప్పుడు కాదనడం ఎలా! రాష్ట్రంలో పేద కుటుంబాలకోసం ప్రభుత్వం – అది యే పార్టీ అయినా కానీ - 1982 నుంచి ఇప్పటివరకు నిర్మించి ఇచ్చిన ఇళ్ళ వివరాలు ఈ నివేదికలో పొందుపరిచారు. పేద వారికి ఇళ్లు కట్టించి ఇచ్చే మహత్తర కార్యక్రమం తమ హయాం లోనే బాగా ఊపందుకుందని గొప్పలు చెప్పుకోవాలన్న తాపత్రయంతోనో ఏమో కానీ – సంబంధిత మంత్రిగారు తమ నివేదికలో సంవత్సరాలవారీగా లెక్కలు ఉదహరిస్తూ – రాష్ట్రంలో ఇంతవరకూ అక్షరాలా ‘తొంభయి తొమ్మిది లక్షల పందొమ్మిదివేల నూట నలభయ్ తొమ్మిది’ ఇళ్ళ నిర్మాణాన్ని ఈ ఏడాది జనవరి ఆఖరు నాటికి పూర్తి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో పేదకుటుంబాల సంఖ్య కొంచెం అటూఇటూగా రెండు కోట్లు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వారికి కట్టించి ఇచ్చిన ఇళ్లు ఇంచుమించు ఒక కోటి. ఈ నెలాఖరుకల్లా మరో ఎనభయ్ వేలు పూర్తికాగలవని అంచనా. రెండుకోట్ల పేద కుటుంబాలలో దాదాపు సగానికి తలదాచుకునే గూడు అమరిందని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇవికాక ఇందిరమ్మ పధకం కింద మరో 30 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న ప్రభుత్వ హామీనీ, మొన్నటికి మొన్న రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వానికి అందిన అర్జీలను కూడా కలుపుకుంటే మరో పదిహేను లక్షల ఇళ్లూ – అన్నీ కూడుకుంటే రాష్ట్ర జనాభాలో మూడింట రెండువంతుల కుటుంబాలకు ఏదో ఒకవిధమయిన గూడు అమరుతున్నట్టే అనుకోవాలి. అయినా ప్రభుత్వం ద్వారా అందే పేదల ఇళ్లకు ఏటేటా గిరాకీ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదని సర్కారు గణాంకాలే చెబుతున్నాయి. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నామని ఓ పక్క గొప్పలు చెప్పుకుంటూ, మరో పక్క పేదల సంఖ్య యే ఏటి కాయేడు పెరిగిపోతున్నదని వెల్లడించే ఈ అంకెలు, సంఖ్యలు ప్రభుత్వాలకు యే మాత్రం శోభనివ్వవు.





అదేసమయంలో మరో మాట కూడా చెప్పుకోవాలి. పారిశ్రామిక వర్గాలకు పెద్దపీట వేసే క్రమంలో వేల, లక్షల ఎకరాల భూపంపిణీ ఓపక్క నిరాఘాటంగా, నిర్లజ్జగా సాగిస్తున్నప్పుడు, కేవలం పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పధకాన్ని ‘భూ భాగోతంగా’ ముద్రవేసి వారి కడుపులపై కొట్టడం కూడా మంచిది కాదు. దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే కడుపు నిండిన వాడు, కడుపు మండిన వాడు అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే నిజమయిన పాలకుల అసలయిన కర్తవ్యం. (14-03-2011)



13, మార్చి 2011, ఆదివారం

Jagan’s party - threat to whom? – Bhandaru Srinivasrao

Jagan’s party - threat to whom? – Bhandaru Srinivasrao




At last, the former Congress MP from Kadapa and son of former chief minister Y S Rajasekhara Reddy, has launched his much trumpeted YSR Congress Party and unveiled the flag.
The timing of the launch and unveiling flag at Idupalapaya, the family estate, where YSR, who died in chopper crash, was laid to rest, looks perfect as it happens to be on eve of elections to state legislative council. Though the young scion had to drop addressing a public meeting after the formal unveils of the party flag along with his politician mother due to election code, he did drop enough hints to his supporters to start training their guns against Kiran Kumar Reddy-led Congress government.
For Kiran Kumar Reddy, the council polls will prove first litmus test, especially when rumors are rife that rebels all set to cause embarrassment in his native Chittoor district. Apart from CM's native Chittoor and his bete noir Jagan's Kadapa, the other districts where the ruling party nominees are placed vulnerably are the two Godavari districts (East and West), besides politically most volatile Krishna and Guntur. The party polls prospects also too precariously hanging in other parts of coastal Andhra Rayalaseema districts. Any upsets bound to have its bearing on the political future of Kirankumar as chief minster.
After the polls to Council, the immediate challenge that is staring at the Chief Minister is the two bypolls to Kadapa parliament and Pulivendla assembly. Both these are considered to be the strongholds of YSR family. But, the Congress, which succeeded in dividing the family by weaning away YSR brother Vivekananda Reddy and inducting him in Kiran's cabinet. The Congress party expects Viveka to spring a surprise by ensuring the defeat of his nephew and sister-in law in bypolls. But, the ground realities look quite opposite. At the most Viveka's candidature may reduce the victory margins of Jagan and his mother Vijayamma, but cannot prevent their victory march. Except for the three ministers from the district, the rank and file of the ruling Congress already crossed over to Jagan's camp. If the party faces electoral reversals in Council polls, then Viveka may as well opt out from the fight against his nephew and sister-in law in bypolls which are likely to be held after five state elections.
Back to Jagan's camp, analysts feel that support to the young scion seen dwindling. Only 12, including two of PRP legislators, took attending the flag unveiling function at Idupulapaya. What does it mean? Does Jagan enjoy support of only 10-12 legislators and two MPs? Why those who attended his earlier 'deekshas' or 'dharnas' on public issues choose to keep away now? Are they scared of party high command cracking the whip against them now as Jagan officially launched the party?
Or was it due to their inability to take a decision either way in the wake of stalemate on Telangana issue in the state?
However, Jagan appears to be unperturbed over how many legislators will join his bandwagon as he is depending solely on mass support, rather than number games. He determined to take the support of the people who will ultimately decide the future of his party, since his his crowd pulling ability is proved beyond doubt many a times on earlier occassions.
That apart, to whom the new party likely to pose serious threat – to ruling Congress? Or, main Opposition Telugu Desam? Or, to both? Or will vanish in thin air like yesteryear ‘mega star’ Chiranjeevi’s Praja Rajyam Party?
People of the state find answers themselves as results start unfolding with Council polls, followed by bypolls and thereafter. Till that time, he and his party will be a nightmare for all other parties.(13-03-2011)

11, మార్చి 2011, శుక్రవారం

తెలివి ఎవరి సొత్తు? – భండారు శ్రీనివాసరావు

తెలివి ఎవరి సొత్తు? – భండారు శ్రీనివాసరావు


ఓడంటే ఏదో చిన్న ఓడ కాదు. ఓ పెద్ద మేడంత అతి పేద్ద ఓడ. వున్నట్టుండి అంత పెద్ద ఓడా ఓ చిన్న యంత్రం చెడి పోయి ఠక్కున ఆగిపోయింది. ఓడ యజమానికి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఓడ నడిస్తేకానీ ఆయన వ్యాపారం నడవదు. అందుకని ఓడను వెంటనే బాగుచేసేందుకు తక్షణం పెద్ద పెద్ద ఇంజినీర్లకు కబురు పెట్టారు. అంతా హుటాహుటిన వాలిపోయారు కానీ, అంత పెద్ద ఇంజినీర్లకు కూడా ఆ చిన్న యంత్రాన్ని సరిచేయడం వల్ల కాలేదు. దాంతో సిబ్బంది మళ్ళీ ఒడ్డునపడి వెతికి వేసారి మొత్తం మీద ఓ చిన్న మెకానిక్కుని పట్టుకొచ్చారు. చిన్నప్పటినుంచీ ఇలా చిన్నా చితకా రిపేర్లు చేస్తున్న ఆ చిన్న మెకానిక్కు వచ్చీరాగానే అంతా కలయచూసాడు. లోపం ఎక్కడ వున్నదా అని చుట్టూ తిరిగి చూసాడు.
ఓడ యజమాని దగ్గరే వుండి అతడేమి చేస్తున్నాడన్నది అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. వచ్చిన మెకానిక్కు మరో ధ్యాస లేకుండా తన పనిలోనే మునిగిపోయాడు. చెడిపోయిన యంత్రం లోని అన్ని భాగాలను జాగ్రత్తగా తడిమాడు. ఒక చోట ఏదో అనుమానం వచ్చి అక్కడే మరోమారు తడిమి చూసాడు.వెంట తెచ్చుకున్న చేతి సంచీ నుంచి చిన్న సుత్తిని బయటకు తీసాడు. దానితో అక్కడ సున్నితంగా ఓ దెబ్బ వేసాడు. అంతే! ఓడలో ఇంజిను పనిచేయడం ప్రారంభించింది.

ఓడ యజమానికి అతడు చేసిన రిపేరు ఏమిటో అర్ధం కాలేదు. ఎందరో చేయి తిరిగిన ఇంజినీర్లు చేయలేని పని ఇతగాడు ఇంత తక్కువ వ్యవధిలో ఎలా చేయగలిగాడని ముందు ఆశ్చర్య పోయాడు. అతడి ఆశ్చర్యం రెట్టింపయింది ఆ మామూలు మెకానిక్కు అడిగిన మజూరీ విన్న తరవాత. అతడు ఏకంగా లక్ష రూపాయలు అడిగాడు. సుత్తితో చిన్న దెబ్బ వేసినట్టువేసి అంత డబ్బు అడగడం యజమానికి సుతరామూ నచ్చలేదు. అందుకని చెల్లింపు దగ్గర ఓ మెలిక పెట్టాడు. చేసిన పనికి ఐటం వారీ బిల్లు ఇమ్మన్నాడు. ఆ మెకానిక్కు క్షణం ఆలశ్యం చేయకుండా యజమాని కోరిన విధంగా రాసిచ్చాడు. అందులో ఇలావుంది.

“సుత్తితో కొట్టినందుకు కూలీ – రెండు రూపాయలు.
“ఎక్కడ సుత్తితో కొట్టాలో తెలిసి కొట్టినందుకు కూలీ - అక్షరాలా తొంబయి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబయి ఎనిమిది రూపాయలు."
నీతి: పని ప్రధానమే. అయితే ఆ పని ఎప్పుడు ఎలా చేయాలో తెలియడం కూడా ముఖ్యమే. (11-03-2011)



















వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ!– భండారు శ్రీనివాసరావు

వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ!– భండారు శ్రీనివాసరావు


‘అసలేంజరుగుతోంది?’ - ఒక కేసుకు సంబంధించి, దేశంలో పరిస్తితులపై అత్యున్నత న్యాయస్తానం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య ఇది.

గత కొద్దిమాసాల పాత పేపర్లు తిరగేసినా, టీవీ చర్చలు పునశ్చరణ చేసుకున్నా – సామాన్య జనానికి సయితం మనసులో మెదిలే ప్రశ్న ఇదే.

ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంత చెడిపోయిన రాజకీయపార్టీకయినా ఏవోకొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్తిరమయిన భావజాలాలుంటాయి.కానీ ఈనాడు దాదాపు అన్ని రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.

అలాగే అన్ని రాజకీయ పార్టీలకు, పేరు ఏదయినా అధిష్టానం అంటూ ఒకటుంటుంది. ‘అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువ’ అని గొప్పలు చెప్పుకునే పార్టీలలో కూడా ఎవరూ నోరెత్తి అధిష్టానాన్ని బాహాటంగా ఎగర్తించే సాహసం చెయ్యరు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చోటామోటా నాయకులు సయితం తమ పార్టీ అధినాయకులను విలేఖరుల ముందే పూచికపుల్లలుగా తీసివేస్తున్నారు. ‘ఔరా! వీరికెంత ధైర్యం!’ అని నలుగురూ అనుకునేలా నలుగురిముందే తమ నాయకులను చెరిగి పారేస్తున్నారు.

నాయకురాలి జాతీయతను ప్రశ్నించినా, నాయకుడి రెండు కళ్ళ విధానాన్ని విమర్శించినా ఇదేరకమయిన తెగింపు. ఏం చేస్తారులే అనే ధైర్యం.

ఏకంగా పార్లమెంటును, శాసన సభను వేదికగా చేసుకుని తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూ, సొంత పార్టీనే నగుబాటు చేసినా ఏం కాదన్న ధీమా.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ ధిక్కార స్వరాన్ని బాహాటంగా వినిపించినా పోయేదేమీలేదన్న మొండితనం.

రాష్ట్రం రెండు ముక్కలవుతుందా మూడు చెక్కలవుతుందా తేలే రోజు ఎప్పుడో తేలకముందే పార్టీలన్నీ రెండుముక్కలుగా పైనుంచి కిందవరకూ చీలిపోయాయి. ప్రాంతాల విషయం వచ్చేసరికి ఎవరికీ పార్టీల సంగతి పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. పార్టీలు వేరయినా మాట్లాడేది ఒక్కటిగానే వుంటోంది. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. విద్వేషాగ్నులు రగల్చడానికి, నిందారోపణలు చేయడానికి సొంత పార్టీ వారు, పరాయి పక్షం వారు అన్న తేడా లేకుండా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్తితిని గమనించేవారికి ఎవరు యే పార్టీ వారో చప్పున ఒక పట్టాన చెప్పడం కష్టమవుతోంది. పైపెచ్చు వీరిలో అనేకమంది  ఏదో ఒక పార్టీని నిజాయితీగా అంటిపెట్టుకుని నిష్కళంక రాజకీయాలు చేస్తున్నవారు కాకపోవడం వల్లకూడా అయోమయం పెచ్చుపెరుగుతోంది. మొన్న మొన్నటి వరకూ వేరే పార్టీలో వుండి ఆ గూటి పలుకులు పలికి ఇప్పుడు మళ్ళీ అదే నోటితో వేరే పలుకులు వల్లె వేయడం చూసి విస్తుబోవడం వీక్షకుల వంతు అవుతోంది. కళ్ళకు గంతలు కట్టి - ‘వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ’ అని అడిగినట్టు అడిగితె ఎవరు ఎవరో చెప్పలేని దుస్తితి.

గతంలో పార్టీ విధానాలను మీడియాకు వివరించడానికి ప్రతి పార్టీకి అధికార ప్రతినిధులు వుండేవారు. ఇప్పటికీ లేకపోలేదు. కానీ పార్టీ పేరుపెట్టుకుని ప్రతిఒక్కరూ మీడియాతో మాట్లాడేస్తున్నారు. దానికి పార్టీ అనుమతి వుందా లేదా అన్నది వారికి అప్రస్తుతం. వారు చెప్పేది పార్టీ విధానమా కాదా అన్నది మీడియాకు అప్రస్తుతం. ఇలా - ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా అప్పటికామాటలాడేవారితోనే మరింత గందరగోళం ఏర్పడుతోంది.

ఒక పార్టీ వారు చెప్పిన దానిని మరో పార్టీ వారు ఖండించే పద్దతి పోయి ఎవరి పార్టీవారిని వారే దుయ్యపట్టే కొత్త సంస్కృతి తాజాగా రూపుదిద్దుకుని వున్న అయోమయాన్ని మరింత పెంచింది. అలాగే ఒక పార్టీని మరో పార్టీ సమర్ధించే విధానం కూడా పరిస్తితిని మరింతగా గందరగోళపరుస్తోంది. అవసరాన్నిబట్టి అవలంబిస్తున్న ఈ రెండు నాల్కల ధోరణి రాజకీయపార్టీల దివాళాకోరుతనాన్ని ఎత్తి చూపుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.

వీటన్నిటికీ తోడు, క్రికెట్ పరిభాష లోని ‘మ్యాచ్ ఫిక్సింగ్’ పదం రాజకీయాల్లోకి దూసుకువచ్చింది. వీరు వారితో ఫిక్సయ్యారని ఒకరంటే, వారు వీరితో కుమ్మక్కయ్యారని మరొకరంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే – ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, స్తానిక సంస్తల నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో – ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. బహుశా ఈ అపవాదును తప్పించుకోవడానికే శాసన సభలో వారిద్దరూ రైతుల సమస్యను అడ్డం పెట్టుకుని పోటాపోటీగా మాటల యుద్ధం సాగించాల్సివచ్చిందనే వారు కూడా లేకపోలేదు. కాకపొతే, ముఖ్యమంత్రి అయిన నాటినుంచి అనేక రకాల సమస్యల వలయంలో చిక్కుకుని మనసారా నవ్వుకునే అవకాశం కోల్పోయిన కిరణ్ కుమార్ రెడ్డికి – నిండు సభలో చిరునవ్వులు చిందించే అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడిని అభినందించాలి. (11-03-2011)



10, మార్చి 2011, గురువారం

తిరుక్షవరం – భండారు శ్రీనివాసరావు


తిరుక్షవరం – భండారు శ్రీనివాసరావు

పిల్లలకు చెడ్డీలు మార్చినంత సులభంగా రాజకీయనాయకులు పార్టీలు మార్చగలరన్న అపవాదును వారు మోస్తున్నారు. ఈ దేశంలో ప్రతిదీ తమ సొంతం , ప్రతిదీ తమకు ఉచితం అనే భావన వారిలో ప్రబలిపోయిందనడానికి సంకేతంగా ఇంటర్ నెట్ లో ప్రచారంలోకి వస్తున్న ఓ కధనం మీ కోసం.

క్షవరం చేయించుకుందామని పువ్వులమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఓ రోజు ఓ క్షవరశాలకు వెళ్లాడు. పని పూర్తయిన తరవాత డబ్బులు ఇవ్వబోయాడు. ‘ఈ వారం రోజులూ నేను నా తోటివారికి నా చేతనయిన సర్వీసు ఉచితంగా చేద్దామనుకుంటున్నాను. అందువల్ల డబ్బులు తీసుకోను’ అని అతగాడు మృదువుగా తిరస్కరించాడు. ఆ మాటలకు ముగ్ధుడయిన ఆ పూల వ్యాపారి అక్కడినుంచి నిష్క్రమించాడు. మరునాడు క్షురకుడు తన దుకాణం వద్దకు వెళ్లేసరికి అందంగా తయారు చేసిన పూల బొత్తి షాపు ముందు కనిపించింది. ‘మీ సేవకు ధన్యవాదాలు’ అని దానికో చీటీ పెట్టివుంది.

తరువాత, ఆ షాపుకు ఓ పోలీసు వచ్చాడు. బిల్లు చెల్లించబోయేటప్పుడు అతడికి కూడా అదే సమాధానం వచ్చింది. ఈ వారమంతా అందరికీ ఉచిత సేవ అందించాలన్న నిర్ణయానికి అనుగుణంగా డబ్బులు తీసుకోనని క్షురకుడు తెగేసి చెప్పాడు. మరునాటి ఉదయం అతడు దుకాణం తెరవడానికి వచ్చినప్పుడు ఆ పోలీసు పంపిన ధన్యవాదాల సందేశం, దానితో పాటు అతడి ఇల్లాలు స్వయంగా తయారు చేసిన మిఠాయిలు కనిపించాయి.

ఆ మరునాడు, ఘనత వహించిన పార్లమెంట్ సభ్యుడు ఒకరు క్షవరం చేయించుకుందామని ఆ దుకాణానికే వెళ్లాడు. క్షురకుడు యధావిధిగా డబ్బులు తీసుకోకపోవడానికి కారణం ఆయన గారికి నివేదించుకున్నాడు. ఈ వారమంతా ఉచిత సేవ చేయాలని అనుకున్నానని పార్లమెంటు సభ్యుడితో చెప్పాడు. అస్తమానం ప్రజాసేవలో తరించే ఆ ప్రజా ప్రతినిధి ఆ మాటలు విని ఎంతో మురిసిపోయి వెళ్లి పోయాడు.

మరుసటి రోజు ఉదయం క్షురకుడు తన దుకాణం తెరవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బారులు తీరి జనం కనబడ్డారు . విచారిస్తే తెలిసినదేమిటంటే వారంతా గౌరవ పార్లమెంటు సభ్యులేనని. ఉచితంగా దొరికే క్షవర సేవను అందుకుందామని వచ్చారని. తీరిగ్గా విచారించడమే ఇక అతగాడికి మిగిలింది.
సాధారణ జనాలకు, వారిని పాలించే రాజకీయ నాయకులకు - మనస్తత్వాల్లో స్తూలంగా వున్న తేడాను ఎత్తిచూపుతూ వెలువడిన ఈ కధనం ముక్తాయింపు ఇలా వుంది.

‘చంటి పిల్లలకు వాడే ‘డైపర్’ లనూ, రాజకీయనాయకులనూ తరచూ మారుస్తుండడం చాలా అవసరం.’

(10-03-2011)

7, మార్చి 2011, సోమవారం

వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


ఆనందమే జీవితమే మకరందం అని హాయిగా జీవించేవాడి ముందు ఎంతటి శక్తిమంతుడయినా బలాదూరే.

వయసు పైన పడుతున్న కొద్దీ మనలో నవ్వగలిగే లక్షణం తగ్గిపోతున్నదని అనుకోవడం సరికాదు. నవ్వడం మానేసిన తరువాతనే మనకు ముదిమి మీద పడుతున్నదనుకోవాలి.

ఏదయినా లక్ష్యం ఏర్పరుచుకోవడానికి విశ్వాసం సాయపడుతుంది. అయితే, ఆ లక్ష్య సాధనకు ఆత్మ విశ్వాసం ఉపయోగపడుతుంది.

కరిగిపోయిన కాలాన్నీ, చేజారిపోయిన గతాన్నీ తిరిగి సంపాదించుకోవడం ఎంతటి భాగ్యవంతుడికీ సాధ్యం కాదు. అందుకే, వర్తమానం గతం లోకి జారిపోయేలోగా జీవితంలోని ప్రతి క్షణాన్ని అనుభవించాలి.

ఇతరులు మీకు ఏదో చేయాలని ఆశించి అది జరగకపోతే పడే బాధ అంతా ఇంతా కాదు. అదే, మీనుంచి మీరుగా ఆశించింది జరిగితే అది అందించే ప్రోత్సాహం మాత్రం లెక్కపెట్టలేనిది.

అంధుడయిన వ్యక్తి ఓ మేధావిని అడిగాడు. చూడలేకపోవడం కన్నా జీవితంలో ఇంకేదయినా విషాదం వుంటుందా అని.

‘ఎందుకు లేదు. వుంది – దూరదృష్టిలేక పోవడం అన్నది దృష్టిని పోగొట్టుకోవడం కంటే చాలా దారుణం’ మేధావి జవాబు.

క్షమాపణను మూడురకాలుగా వ్యకం చేయవచ్చు.

‘అయాం సారీ’

‘నేను తప్పుచేసాను’

‘తప్పు సరిచేసుకోవడానికి నేనేం చేయాలి?’

కాకపొతే, చాలామంది మూడోదాని జోలికిపోరు.


చిన్నపిల్లదగ్గరనుంచి అందరం నేర్చుకోవాల్సిన మంచి విషయాలు రెండున్నాయి.

ఒకటి- కారణం లేకుండానే సంతోషంగా వుండడం.

రెండోది- ఏదో ఒకటి చేస్తూ అస్తమానం బిజీ గా వుండడం.


కంప్యూటర్ పరిభాష ప్రకారం జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించడానికి మూడు పద్ధతులు వున్నాయి. అవి: CTRL+ALT+DEL

CTRL అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం.

ALT అంటే సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం అన్వేషించడం.

DEL అంటే మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్న అంశాన్ని వెంటనే తొలగించుకోవడం.


భార్యను ఎవడయినా రాక్షసుడు అపహరించుకుపోతే ఆ భర్త ఏం చేయాలి? ఏమీ చేయక్కరలేదు. తప్పుచేసినవాడే దాని ఫలితాలను కూడా అనుభవిస్తాడని జాలిపడి వూరుకోవాలి.

పెద్ద పెద్ద విషయాలకంటే అత్యల్ప విషయాలే మనుషుల్ని కష్టపెడుతుంటాయి. పెద్ద కొండ మీద ఎక్కి నిలబడగలం కానీ, ఓ సూదిమొనపై నిలబడడం అయ్యే పనా!
మనిషి జీవితంలో మరచిపోలేని మూడు విషయాలుంటాయని ఓ పెద్దమనిషి చెప్పాడు. అవేమిటంటే- ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాన్నం భోజనం, రాత్రికి మళ్ళీ డిన్నర్.

జీవితంలో వారంటీలు, గ్యారంటీలు అంటూ ఏమీ వుండవు. సాధ్యాసాధ్యాలను, అవకాశాలను మాత్రమే అది అందిస్తుంది. అందిపుచ్చుకోవడం మాత్రం మీ చేతుల్లోనే వుంటుంది.

మనం ఎవరు, ఏం చేస్తున్నాం అన్నది నలుగురూ చూస్తున్నప్పుడు గమనంలో వుంచుకోవడం మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

ఎవరూ గమనించడం లేదని తెలిసినప్పుడు కూడా మనం ఎవరు? ఎలా మసలుకుంటున్నాం అని గుర్తుపెట్టుకోవడం సహజ స్వభావాన్ని తెలియచేస్తుంది.

ఓ పిల్లిని కుక్క అడిగింది: రతిక్రీడ సమయంలో ఎందుకంత గోప్యత పాటిస్తారని.

‘అలాటి సమయాల్లో మనుషులు మమ్మల్ని గమనించడం మాకిష్టం వుండదు. ఇప్పటికే వాళ్ళు ఈ విషయంలో మీ పద్ధతులను అనుకరిస్తున్నారు కూడా.’ పిల్లి ఠకీమని జవాబు చెప్పింది. (07-03-2011)

6, మార్చి 2011, ఆదివారం

వర్కింగ్ కమిటీ వాలకం – భండారు శ్రీనివాసరావు

వర్కింగ్ కమిటీ వాలకం – భండారు శ్రీనివాసరావు


(06-03-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)

- సంకీర్ణం పేరిట అన్నింటా అవమానాలే

- రాష్ట్ర ఎంపీల మనో వేదన

- పార్టీ పదవులకూ భంగపాటేనా?

- కల్లలైన సీనియర్ల కలలు

- సీడబ్ల్యుసీ ప్రాధాన్యతను తగ్గించిన ‘కోర్‌ కమిటీ’

‘ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడదేల ఆ ధర్మము నేనెరుంగుదు’ అంటాడు శ్రీరాముడు ఆంజనేయుడితో ఓసారి తగవు పడిన సందర్భంలో. బహుశా ధర్మకోవిదుడయిన రాముడికి కూడా సంకీర్ణ ధర్మం అనే ధర్మం తెలిసి ఉండదు. ఆయనకీ తెలియని ఈ ధర్మం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకి క్రమంగా తేటతెల్లం అవుతున్నట్టుంది. ‘మన రాష్ట్రం నుంచి అక్షరాలా ముప్పయి మూడు మందిమి కాంగ్రెస్‌ పార్టీ తరపున లోక్‌ సభలో కాలు పెట్టాము. నిజానికి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నదంటే దానికి ఆక్సిజన్‌ ఇస్తోంది మా ముప్పయి మూడు మందే. కానీ మనకు దక్కిన మంత్రి పదవులెన్ని? దక్కినవాటిల్లో పనికొచ్చేవెన్ని? రైల్వే బడ్జెట్‌లో కానీ, కేంద్ర బడ్జెట్‌లో కానీ రాష్ట్రానికి ఏమాత్రం గిట్టుబాటయింది? కేవలం ఒకరిద్దరు ఎంపీలతో మద్దతిస్తున్న చిన్నా చితకా పార్టీలకు ఇస్తున్న గౌరవ మర్యాదలు కానీ, పదవుల పంపకంలో వారికి ఇస్తున్న ప్రాధాన్యతలు కానీ ఇంతమంది సభ్యులు ఉన్న మన రాష్ట్రం వారికి ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వం మనదన్నమాటే కానీ మన మాట ఏమాత్రం చెల్లుతోంది? ప్రతి చిన్న పనికీ ఢిల్లీలో అందరిముందూ సాగిలపడాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది? సంకీర్ణ ధర్మం పేరుతో ఇంకా ఎన్నాళ్ళు ఈ అవమానాలు భరించాలి?’- ఢిల్లీలో మన కాంగ్రెస్‌ ఎంపీలు ప్రైవేటు సంభాషణల్లో పబ్లిక్‌గా చెప్పే మాటలు ఇవి. సరే, ప్రభుత్వ వ్యవహారాల్లో సంకీర్ణ ధర్మం పేరు చెప్పి దాటవేస్తున్నారు కానీ, పార్టీ పదవుల దగ్గర కూడా భంగపాటు తప్పకపోవడమే రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను మరింత కుంగదీస్తోంది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పునర్వ్యవస్థీకరణ తరవాత వారి మాటల్లో వాడీ వేడీ మరింత పెరిగింది. కానీ ఏం లాభం? అధిష్ఠానం మాటే శిరోధార్యం అని అనునిత్యం వల్లించే వారికి, తమకు జరిగిన అన్యాయం గురించి నిలదీసే హక్కు ఎక్కడ ఉంటుంది? కాకపొతే, తనదాకా వస్తేగాని తత్త్వం బోధపడదు అన్న చందంగా ఇప్పుడు వారికి అధిష్ఠానం తమ పట్ల ప్రదర్శిస్తున్న చిన్న చూపు గురించి పెద్ద మనోవ్యధ పట్టుకుంది. ఢిల్లీ పెద్దల దృష్టిలో తమ స్థానం ఏమిటో వారికి బోధపడింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిశ్చితి, తెలంగాణ అంశం పార్టీలో తెచ్చిన చీలికలు, జగన్‌ మోహన రెడ్డి తిరుగుబాటు- నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచడానికి సీడబ్ల్యుసీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం మరింత పెరగగలదని కన్న కలలన్నీ కల్లలయ్యాయి.

పునర్వ్యవస్థీకరణకు ముందు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీలో సభ్యులుగా చక్రం తిప్పిన రాష్ట్ర నేతలు నలుగురికి కొత్త కమిటీలో మొండిచేయి చూపారు. పార్టీలో కురువృద్ధుడు అన్న ప్రాతిపదికపై దేశంలోనే అత్యున్నత పదవిపై ఆశ పెట్టుకుని అది నెరవేరకపోవడంతో నేరుగా పార్టీ అథినేత్రిపైనే నిప్పులు చిమ్మిన జి. వెంకటస్వామిని కమిటీ నుంచి తప్పించి, అవిధేయతను సహించేది లేదన్న స్పష్టమయిన సందేశాన్ని పార్టీ నాయకులకు పంపారు.

అలాగే, కె. కేశవరావు! పశ్చిమ బెంగాల్‌, అండమాన్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జ్‌గా పనిచేసిన కేకేను ఆ బాధ్యతలనుంచి తప్పించడమే కాకుండా, శాశ్వత ఆహ్వానితుడుగా కమిటీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాన్ని కూడా ఆయనకు దూరం చేశారు. తెలంగాణ కోసం సీ డబ్ల్యుసీ పదవిని తృణప్రాయంగా త్యజిస్తానని లోగడ కేకే చేసిన గర్జింపుకు ఇది అధిష్ఠానం ఇచ్చిన జవాబుగా పరిశీలకులు భావిస్తున్నారు. పోతే, ఉద్వాసనకు గురయిన మరో నాయకుడు నేదురుమల్లికి మళ్ళీ పదవి రాకపోవడానికి ఆయన వయసు అడ్డుపడి ఉండవచ్చు.

మరో సీనియర్‌ నాయకుడు కిశోర్‌ చంద్రదేవ్‌కు కూడా చోటు లభించలేదు. అందుకు కారణం రెండు మూడు నెలల్లో జరగలదని అనుకుంటున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించాలన్న యోచనలో పార్టీ అథినాయకత్వం ఉండడమేనని చెబుతున్నారు. అధిష్ఠానం రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరి పట్ల కాస్త కరుణ చూపిందనుకోవాలి. పార్టీ కార్యదర్శులుగా ఉన్న వి.హెచ్‌. హనుమంతరావు, పి.సుధాకరరెడ్డి- లకు మరో మారు అవకాశం కల్పించారు. సుధాకర రెడ్డిని గోవాకు, హనుమంతరావును మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, హర్యానా రాష్ట్రాల పార్టీ ఇంచార్జి బి.కె. హరిప్రసాద్‌కు సహాయకుడిగా నియమించారు.

మన రాష్ట్రానికి సంబంధించినంతవరకూ మరో ప్రధానమయిన మార్పు వీరప్ప మొయిలీని ఇంచార్జిగా తప్పించి ఆ స్థానంలో గులాం నబీ ఆజాద్‌ను నియమించడం. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలన్నీ ఆయనకు కొట్టినపిండి. గతంలో ఈ బాధ్యతను ఆజాద్‌ చాలా విజయవంతంగా నిర్వహించిన రికార్టు ఉంది. పార్టీని పట్టి కుదుపుతున్న జగన్‌ అంశం, తెలగాణ వాదంతో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర పార్టీని ఆజాద్‌ తన వ్యూహ చతురతతో గట్టెక్కించగలరనే నమ్మకంతోనే అధినాయకత్వం ఈ మార్పు చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఇక ఈ మార్పు చేర్పులన్నింటినీ అధిష్ఠానం దృష్టితో పరికిస్తే చాలా ముందు చూపుతోనే పునర్వ్యవస్థీకరణ కసరత్తును అది పూర్తి చేసిందనుకోవాలి. మరో మూడేళ్లదాకా ఎన్నికలు లేని ఆంధ్ర ప్రదేశ్‌ పై దృష్టి సారించడం దండుగ అన్న భావనలో అధిష్ఠానం ఉండి ఉండవచ్చు. అందువల్ల అనవసరం అనుకున్న వారిని తప్పించేందుకు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ఉండవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి వీరి అవసరంకూడా పార్టీకి ఉండకపోవచ్చు. కొన్ని విషయాలలో అధిష్ఠానాన్ని తప్పు దోవ పట్టించారన్న అనుమానం ఢిల్లీ పెద్దలకు కలిగి ఉండవచ్చన్న వాదన కూడా కొట్టిపారవేయతగినది కాదు. అలాగే పార్టీ అధినేత్రిపై గానీ, అధిష్ఠానం పై గానీ లేనిపోని వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్న హెచ్చరిక కూడా ఇందులో దాగి ఉండవచ్చు.

కాంగ్రెస్‌ పార్టీ నియమావళి ప్రకారం వర్కింగ్‌ కమిటీ అనేది అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ. అయితే, కోర్‌ కమిటీ పేరుతొ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసుకున్న మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ సీడబ్ల్యూసీ ప్రాధాన్యాన్ని కొంతవరకు తగ్గించిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల అనంతరం రాహుల్‌ గాంధీని ప్రధానిగా ప్రతిష్ఠించాలనే లక్ష్యం నెరవేరడానికి సీడబ్ల్యూసీలో చేసిన ఈ మార్పులు, చేర్పులు ఏమాత్రం సహకరిస్తా యో చెప్పడం కష్టం. కొత్త కమిటీలో రాహుల్‌కు రెండు ప్రధాన బాధ్యతలు అప్పగించినప్పటికీ, యువతరాన్ని ఆకర్షించేవిధంగా దానిపై ఆయన ముద్ర లేదన్నది మరో అభిప్రాయం. అనుభవానికే పెద్ద పీట వేసి, కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించడంలో అధినాయకత్వం అంతగా శ్రద్ధ చూపలేదని పరిశీలకుల ఉవాచ.

ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలలో రాహుల్‌ గాంధీ ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వకపోవడం కూడా ఇందుకు కారణం అయి ఉండవచ్చు. కొత్త కమిటీలో స్థానం సంపాదించుకున్న వారందరూ వయసు మళ్లినవారే కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. తలపండిన పెద్దల అనుభవ సారాన్ని ఉపయోగించుకుంటూ పార్టీని పటిష్ఠం చేయడం అన్న ఒక్క విషయమే అధినాయకత్వం ముందున్న ప్రాధాన్యం అయి ఉండాలి.రోజురోజుకూ చీమల పుట్టల్లా అనేక అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తూ, పార్టీ అస్తిత్వానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న దశలో ఉడుకు నెత్తురు కంటే, అనుభవాన్ని నమ్ముకోవడమే మంచిదన్న నమ్మకానికి అధిష్ఠానం వచ్చి ఉంటుంది!



3, మార్చి 2011, గురువారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు


పాలయినా పెట్రోలయినా ఒకటే ధర

ఎముకలు కొరికే చలిలో ఏమి చెయ్యాలనిపిస్తుంది ? నాకయితే ఇంట్లో కూర్చుని వేడి వేడి పకోడీలు తింటూ రేడియోలో పాత పాటలు వినాలనిపిస్తుంది. కానీ రష్యన్లు చలి ముదురుతున్న కొద్దీ చల్లటి బీరు తాగాలనో, ఇంకా చలచల్లటి ఐస్ క్రీములు తినాలనో ఉత్సాహపడతారు. మంచుకురిసే వేళలో – ఆపాదమస్తకం ఉన్ని దుస్తులు ధరించి ఐస్ క్రీములకోసం ఆడామగా, పిల్లాపెద్దా తేడాలేకుండా వీధి దుకాణాల ముందు ఆరుబయట బారులుతీరి నిలబడే రష్యన్లను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆనాటి మాస్కోలో ఎక్కడికిపోయినా ముందు కనిపించేవి పెద్ద పెద్ద క్యూలే. ఆఖరికి పాలుకొనాలన్నా, పెరుగుకొనాలన్నా క్యూలను తప్పించుకోలేము. ధరాభారం లేకపోవడంవల్లనో, మళ్ళీ ఈ చలిలో బయటకు రావడం ఎందుకనో, అవసరంవున్నా లేకపోయినా ప్రతివస్తువును దొరికినప్పుడే కొనుక్కోవడం మంచిదనో కారణం ఏదయితేనేమి కానీ ప్రతిచోటా పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తాయి. ఉత్పాదక వ్యయంతో నిమిత్తం లేకుండా ప్రజల అవసరాలనుబట్టి ధరలను బాగా అదుపులో వుంచడంవల్ల కొనుగోలు శక్తి బాగా పెరిగిపోయి, వారు చేసే అనవసర కొనుగోళ్ళతో కృత్రిమ కొరతలు ఏర్పడి, ఏది ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్తితి ఏర్పడిందని మాస్కోలో చాలా కాలం నుంచి వుంటున్న మా తోటి ఉద్యోగులు చెబుతుండేవారు. మాటవరసకు పాల విషయమే తీసుకుందాం. ప్రతి నివాసానికి చేరువలోనే పాలు, పాల ఉత్పత్తులు అమ్మే ‘ప్రోదుక్తి’ దుకాణం వుంటుంది. పాలు లీటరు ముప్పయి కోపెక్కులు. ఇంత చలిలో మళ్ళీ ఏం వస్తామనుకునే బద్దకస్తులు అవసరానికి మించి కొనుగోలుచేసేవారు. వాడకానికి పోను మిగిలిన పాలను డస్ట్ బిన్ లో పారేసి మర్నాడు మళ్ళీ కొనుక్కునేవాళ్లను చూసాము. ధర బహు తక్కువగా వుండడం వల్ల ఇలా దుబారా జరుగుతోందని చెప్పుకునేవాళ్ళు. అలాగే పెట్రోలు. లీటరు పాల ధర, లీటరు పెట్రోలు ధర ఒకటే విధంగా వుండడం ఆ దేశంలోనే చెల్లు. ట్యాంకు నిండిన తరవాత పెట్రోలు లీటర్లకు లీటర్లు కారిపోతున్నా చోద్యం చూస్తూ నిలబడేవాళ్ళు, ఒకటో రెండో రూబుళ్ళు అదనంగా విదిలిస్తే పోలా అనుకునేవాళ్ళు అక్కడే కానవస్తారు.

అక్కడ ప్రతివారు ఒక చేతి సంచిని సిద్ధంగా దగ్గరవుంచుకుంటారు. వీధిలోకి వెడితే ఎప్పుడు ఏది దొరుకుతుందో తెలవదు. క్యూ పొడుగ్గావుంటే చాలు అక్కడ ఏమి అమ్ముతున్నారన్నదానితో నిమిత్తం లేకుండా వెంటనే అందులో దూరిపోతారు. జనం బాగా వున్నారంటే క్యూబానుంచి దిగుమతి చేసుకున్న అరటి పండ్లో లేక ఇంకా అపురూపమయిన టమాటాలో అక్కడ అమ్మకానికి పెట్టారనుకోవచ్చు. టమాటాలు కనబడితే కిలోలకు కిలోలు కొనేస్తారు. వాటిని ఇంటికి చేర్చడానికి పడే ప్రయాస ఆ క్షణంలో ఎవరికీ గుర్తు వుండదు.ఎందుకంటె అవి ఏడాది పొడుగునా దొరికేవికావు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ తో పాటు పెద్ద పెద్ద డీప్ ఫ్రిజ్ లు కూడా వుంటాయి. ఇలా కొనుక్కొచ్చిన టమాటాలను వాటిల్లో భద్రం చేస్తుంటారు. అవి గట్టిపడి రాళ్ళ మాదిరిగా తయారవుతాయి. టమాటాలు దొరకని రోజుల్లో వాటిని బయటకు తీసి వేడి నీటిలో ఉడకపెట్టుకుని వంటల్లో వాడుకుంటూ వుంటారు.

ఇక ఇండియన్లకు, ప్రత్యేకించి దక్షిణాది శాకాహారులకు సంబంధించి ప్రధాన సమస్య రోజూ తినే బియ్యం. రష్యన్ బియ్యం బాగా మొద్దుగా వుంటాయి. చూడడానికి ఇంపుగా వుండకపోవడమే కాకుండా వాటితో వండిన అన్నం నోటికి హితవుగా వుండదు. అందుకే ఏ షాపులోనయినా ఇండియా నుంచి వచ్చిన బియ్యం అమ్ముతున్నారని తెలిస్తే అందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఆ షాపుపై ఎగబడేవారు.దీనికి సంబంధించి ఒక జోకు ప్రచారంలో వుండేది. మాస్కోలోని బారత రాయబారి కార్యాలయానికి కొత్తగా ఓ ఉన్నతాధికారి వచ్చారు. ప్రతి రోజూ ఉదయం జరిగే అధికారుల సమావేశానికి ఒకరు ఆలస్యంగా వచ్చారు. కొత్త అధికారి పాత అధికారిని ఆలస్యానికి కారణం అడిగారుట. దోవలో ఒక షాపులో బియ్యం అమ్ముతున్నారని తెలిసి అక్కడ ఆగడం వల్ల ఆలస్యం అయిందని ఆయన వివరణ ఇచ్చారుట. అంతే, ఆ మీటింగులో ఒక్కరు వుంటే ఒట్టు. అందరూ ఒక్క పెట్టున లేచి పొలోమని ఆ దుకాణం వైపు పరిగెత్తారట.(03-03-2011)

2, మార్చి 2011, బుధవారం

క్రెడిట్ కార్డు మోసాలు – బ్యాంకుల బాధ్యత - భండారు శ్రీనివాసరావు

క్రెడిట్ కార్డు మోసాలు – బ్యాంకుల బాధ్యత - భండారు శ్రీనివాసరావు


ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు కానీ, ఓ నలభయ్ ఏళ్ళ క్రితం ప్రతి హోటల్ ముందు ఒక బోర్డు వేలాడదీసేవారు. “మీ సైకిళ్ళకు మా పూచీ లేదు. మీ సొంత బాధ్యతపై పెట్టుకోవాలి-ఇట్లు హోటల్ యాజమాన్యం” అని దానిపై రాసివుండేది.

అలాగే ఇప్పుడు క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు కూడా ఇదే పరిస్తితి. ఏది జరిగినా మీదే బాధ్యత. ఎందుకంటె ఎలాటి అవకతవకలు జరిగినా ఆ క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకులు  ఆ విషయంలో ఏమాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేవు.

ఈమధ్య ఒక సర్వే జరిపారు. క్రెడిట్ కార్డు భద్రత విషయంలో భారత దేశంలోని బ్యాంకులు  ఏవిధమయిన ముందస్తు చర్యలు తీసుకోవడం లేదన్నది ఆ సర్వే సారాంశం. కార్డు వినియోగదారులు బ్యాంకులకు తెలియచేసే వ్యక్తిగత సమాచారం సమాచారాన్ని గోప్యంగా వుంచే విషయంలో కూడా బ్యాంకులు  ఏరకమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని ఆ సర్వేలో వెల్లడయింది. క్రెడిట్ కార్డుల లావాదేవీల భద్రత పట్ల కూడా బ్యాంకులు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని  ఆ సర్వే ద్వారా తెలియవచ్చింది.

‘క్రెడిట్ కార్డు మోసాలు’ గురించి అనేకరకాల వార్తలు ప్రతిరోజూ బయటపడుతున్న నేపధ్యంలో – మన దేశంలోని చాలా బ్యాంకులు - కార్డు భద్రతతకు సంబంధించి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని – ఈ సర్వే నిర్వహించిన సంస్తలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భారత డేటా కౌన్సిల్, కేపీఎంజి సంయుక్తంగా ఈ సర్వే జరిపాయి. దేశంలోని ఇరవై ప్రభుత్వ రంగ బ్యాంకులు, వాటికి సంబంధించిన ప్రధాన సమాచార భద్రతను పర్యవేక్షించే  అధికారులను  ఈ సర్వే నిర్వహించినవారు ప్రశ్నించి వివరాలు  రాబట్టారు.

మోసాలకు ఆస్కారమిచ్చే పాత, కాలం చెల్లిన విధానాలనే భారతీయ బ్యాంకులు  ఇంకా అనుసరిస్తున్నాయని సర్వే తెలిపింది. క్రెడిట్ కార్డుల మోసాల్లో ముఖ్యంగా ప్రధాన భూమిక వహించే సీ వీ వీ నెంబర్లు, కార్డుల చెలామణీ ముగిసిపోయే తేదీల వివరాలను భద్రపరిచే విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న పద్ధతులు ప్రామాణికంగా లేవని సర్వే వెల్లడించింది. కార్డు భద్రతకు సంబంధించి అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా లేవని తేల్చిచెప్పింది.

అయితే, చాలాబ్యాంకులు - కార్డుపై లావాదేవీ జరిగిన వెంటనే ఆ వివరాలను ఆయా ఖాతాదారులకు వెనువెంటనే ఎస్ ఎం ఎస్ ద్వారా తెలియచేస్తూ వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ, ఇది ఒక్కటీ ఎంతమాత్రం సరిపోదన్నది సర్వే తాత్పర్యం.

ఎందుకంటె, ఎలెక్ట్రానిక్ కార్డు పేమెంట్ సిస్టం ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారుడికి చెందిన  వ్యక్తిగత సమాచారం సర్వీసు ప్రొవైడర్లకు, లేదా లావాదేవీలతో సంబంధంవున్న ఇతర భాగస్వామ్య వ్యాపార సంస్తలకు నేరుగా చేరే అవకాశం వుంటుంది. కాకపొతే ఇటువంటి సమీకృత విధానం లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ వుండడంవల్ల వినియోగదారులు వీటిల్లో వుండే ‘రిస్క్’ ను గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఖాతాదారులకు తెలియకుండా ఖాతాల్లోని డబ్బును వేరే ఖాతాలకు మళ్ళించుకోవడానికి ఈ సమాచారం చాలా చక్కగా వుపయోగపడుతుంది.

ఖాతా ప్రారంభించిన వెంటనే పాస్ వర్డు మార్చుకోవడం, ఖాతాను వినియోగదారుడి అభ్యర్ధనపై తాత్కాలికంగా స్తంభింప చేయడం, ఆన్ లైన్ బ్యాంకింగు లో ఖాతాదారులు వాడుకునే సమయాన్ని కుదించడం మొదలయిన కొన్ని చర్యలు భారతీయ బ్యాంకులు  ఇప్పటికే అమలుచేస్తున్నాయి. ఒక నిర్దిష్ట వ్యవధి తరవాత పాస్ వర్డులను మార్చాల్సిన  అవసరాన్ని గురించి వినియోగదారులను జాగృతం చేయాల్సిన అవసరం వుందని సర్వే పేర్కొంటోంది. అధ్యయనం చేసిన బ్యాంకుల్లో ముప్పయ్యేడు శాతం బ్యాంకులు ఎక్స్ టర్నల్ అప్లికేషన్లను, మొబైల్ కోడ్ లను డౌన్ లోడ్ చేసుకునే వ్యవస్తలను ఏర్పాటు చేసుకోలేదని, వీటివల్ల మోసాలను అరికట్టే అవకాశాలను ఈ బ్యాంకులు దూరం చేసుకుంటున్నాయని సర్వే అభిప్రాయపడింది.

ఆన్ లైన్ బ్యాంకింగ్ లో భద్రతను పరిరక్షించడం అన్నది తమకు సవాలుగా మిగిలిపోతోందని సర్వే లో సమాధానాలు ఇచ్చిన బ్యాంకుల సమాచార భద్రతాధికారులు చెప్పారు. అలాగే, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కకుండా చూడడం అనేది మరింత క్లిష్టంగా వుంటోందని కూడా వారు అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించి - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ చట్టం – 2008 లో అనేక నిబంధనలు పొందుపరచడం జరిగింది కానీ, వాటికి సంబంధించి నిర్దిష్టమయిన వ్యవస్తలను అనేక బ్యాంకులు ఇంకా ఏర్పాటుచేసుకున్న దాఖలాలు లేవు. సర్వే చేసిన బ్యాంకుల్లో దాదాపు ఎనభయ్ శాతం బ్యాంకుల్లో సమాచార గోప్యతకు సంబంధించి విడిగా ఏవిధమయిన ఏర్పాట్లు లేని విషయం ఈ సర్వేలో తేలింది. నాలుగింట మూడువంతుల బ్యాంకుల్లో సెక్యురిటీ టీముల్లో పనిచేసేవారి సంఖ్య పదికంటే తక్కువగావుంది.

అత్యంత ఆధునికమయిన వ్యవస్తీకృత పద్ధతులతో బ్యాంకులను మోసంచేసే ప్రమాదకర పరిస్తితిని బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కుంటోందని సర్వే తెలిపింది. అలాగే, వినియోగదారులు సయితం ఆన్ లైన్ బ్యాంకింగ్ విధానం లో తమ డబ్బు ఏపాటి సురక్షితం అన్న ఆందోళనతో వున్నట్టు సర్వే సూచిస్తోంది.

పరిస్థితులు ఇలా వున్నప్పటికీ,  మోసం జరిగిన సంగతిని కస్టమర్లు, లేదా సిబ్బంది తెలియచేసిన తరవాతనే తదనంతర చర్యలకు ఉపక్రమించే స్తితిలో చాలా  బ్యాంకులు వుండడం విషాదకరమని సర్వే పేర్కొన్నది. మోసం జరిగిన వెంటనే దాన్ని తమంత తాముగా కనుక్కునే యంత్రాంగాన్ని బ్యాంకులు ఏర్పాటు చేసుకోలేదని సర్వే తెలిపింది.  

ఈనాటి డిజిటల్ యుగానికి తగినట్టుగా, బ్యాంకులు అంతర్గత నిర్వహణ వ్యవస్తలను మేరుగుపరుచుకోలేదన్న విషయం కూడా ఈ సర్వేలో వెల్లడయింది. సెక్యూరిటీ విషయంలో ఉదాసీనంగా వుండడంవల్లనే, బ్యాంకుల్లో తరచుగా ఆర్ధిక పరమయిన మోసాలు జరుగుతున్నాయని సర్వే అభిప్రాయపడింది.

సమాచార భద్రత అన్నది తమకు సంబంధించిన అంశంగా భారతీయ బ్యాంకులు భావించడం లేదనీ, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన విషయంగా పక్కనపెడుతున్నాయని సర్వే పేర్కొన్నది. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్తలు అనుసరిస్తున్న విధానానికి ఇది వ్యతిరేకమని సర్వే అభిప్రాయపడింది. అయితే, సర్వే మొత్తంలో ఒక్క మంచి విషయం కూడా లేదని అనుకోనక్కరలేదు. బ్యాంకుల నడుమ డబ్బు బదిలీ విషయంలో భారతీయ బ్యాంకులు తగిన సెక్యూరిటీ పద్ధతులు పాటిస్తున్నాయని చక్కటి కితాబు ఇచ్చింది.

కార్డు నెంబర్లను, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని భద్రపరిచే సందర్భాల్లో బ్యాంకులు కోడింగ్ విధానాన్ని పాటిస్తున్నాయి. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం గట్టిగా నొక్కిచేబుతున్న డాటా భద్రత ప్రాధాన్యం గురించిన అవగాహన లోపం బ్యాంకుల్లో కానవస్తోందని ఐ టీ మంత్రిత్వశాఖకు చెందిన డిఎస్ సీఐ సీ.ఈ.ఓ. డాక్టర్ కమలేష్ బజాజ్ చెప్పారు.

పటిష్టమయిన భద్రతా వ్యవస్తలను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకులకు నిధుల కొరత లేదు. వీటిపట్ల దృష్టి సారించకపోవడానికి ప్రధాన కారణం, వాటి నడుమ వున్న పోటీ తత్వం. ఏదోవిధంగా కష్టమర్లకు సులభమయిన, సుఖప్రదమయిన బ్యాంకింగ్ సర్వీసులను అందచేయడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవడం ఒక్కటే వాటి ముందు వున్న ప్రధాన లక్ష్యం. అందువల్ల భద్రతకు సంబంధించి ఎంతో కొంత రాజీ పడాల్సిన పరిస్తితి. భద్రత పేరుతొ బ్యాంకింగ్ లావాదేవీలను మరింత క్లిష్టం చేస్తే సంతోషించే కష్టమర్లు వుండరన్నది వాటి అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ, తమ ఖాతాదారులకు భద్రతా ప్రమాణాల ప్రాధాన్యతను వివరించి, నచ్చచెప్పి, ఒప్పించాల్సిన బాద్యత బ్యాంకులపై వుందని సర్వే సలహా ఇచ్చింది.ఇప్పటికే, కొన్ని బ్యాంకులు ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు వీలుగా  వినియోగదారులను జాగృతం చేసే దిశగా ప్రచారం చేస్తున్న విషయాన్ని సర్వే పేర్కొన్నది. దీన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరాన్ని ఆ సర్వే  ప్రస్తావించింది. (02-03-2011)