30, డిసెంబర్ 2010, గురువారం

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం – భండారు శ్రీనివాసరావు

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం – భండారు శ్రీనివాసరావు

రెండువేల పదో సంవత్సరం మౌనంగా వీడుకోలు తీసుకుంటున్న వేళ ఒక్కసారి మన రాష్ట్రాన్ని విహంగ వీక్షణం చేస్తే కానవచ్చే దృశ్యం ఏమిటి?

వరుస తుపానులు, అకాల వర్షాలు, నీట మునిగిన పైర్లు, నిండా మునిగిన రైతులు, గుండె ఆగి కొందరు, గుండె చెదరి మరి కొందరు, ఊపిరి వొదిలిన పేదవాళ్ళు -

ముదిరిన ప్రాంతీయ ద్వేషాలు, పలచపడ్డ మానవ సంబంధాలు, నిన్న మొన్నటి దాకా పాలూ నీళ్ళలా కలగలసిపోయిన జనం తాలూకు కనబడని ఆనవాళ్ళు -

మింటికెగసిన ధరలు, వెన్ను విరిగిన ప్రజలు,

ఆందోళనలు, ఊరేగింపులు, హర్తాళ్ళు, రాస్తా రోఖోలు, బందులు, దేశాన్ని చీల్చే చెండుకుతినే రాబందులు,

నాయకుల నిరాహార దీక్షలు, అనుచరుల వీరావేశ ప్రదర్సనలు,

దిష్టి బొమ్మల దహనాలు, ముష్టి యుద్ధాలను మరిపించే బుల్లి తెరల గోష్టులు,

ఒక్కటంటే ఒక్కరోజు ప్రశాంతంగా గడిచిందా? ఏటిపొడుగునా ఇవే గొడవలు. ఏడాది మొత్తం ఇదే తీరు.

‘జనం గమనిస్తున్నారు జాగ్రత్త’ అని ఒకరినొకరు హెచ్చరించుకోవడమే కానీ ఆ జనం నిజంగానే గమనిస్తున్నారన్న సోయ లేకపోవడమే నేటి రాజకీయం లోని ఓ కొత్త కోణం.

సమాజం లోని అన్ని రకాల రుగ్మతలకు పరిష్కారం చూపవలసిన రాజకీయ పార్టీలే వీటికి మూలాధారాలు కావడం మరో విషాదం.

ఎన్ని పార్టీలు రాష్ట్రంలో వున్నప్పటికీ, ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ,టీ ఆర్ యస్ ల చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు గిరికీలు కొడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా జగన్ పెట్టబోయే పార్టీ కూడా ఈ జాబితాలో చేరింది.

ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో టీడీపీ ది ఒక ప్రత్యెక స్తానం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ మాదిరిగానే కొద్దో గొప్పో కేడర్ కలిగిన పార్టీ. తొమ్మిది సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి గా వున్న చంద్రబాబు ఆ పార్టీకి అధినాయకుడు. రెండేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో విజయం తధ్యం అని మనసావాచా నమ్మి దెబ్బతిన్న పరిస్తితి ఆయనది. ఎన్నికలముందు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ, తమ విజయావకాశాలను నీరు కార్చిందని కూడా నమ్ముతున్న వారు టీ డీ పీ లో అనేకులున్నారు. సరే. అది గతం. ముందు ముందు ప్రజలు, కాంగ్రెస్ పార్టీని కాదని పట్టం కట్టడానికి వారి ముందు వున్న ఏకైక ప్రత్యామ్నాయం తమ పార్టీ మాత్రమె అని కూడా వారి నమ్మకాలు కొనసాగుతూ వచ్చాయి. కాంగ్రెస్ నేడున్న పరిస్తితిని చూస్తే వారిది దురాశ అనుకోవడానికి కూడా వీలు లేదు. కానీ ఈ మధ్యలో బాగా పుంజుకున్న తెలంగాణా అంశం వారి ఆశలపై మరోసారి నీళ్ళు చల్లింది.అన్ని పార్టీల మాదిరిగానే ఈ పార్టీపై కూడా తెలంగాణా క్రీనీడలు కమ్ము కున్నాయి. ఈ నేపధ్యం లో- అకాల వర్షాలతో కుమిలిపోతున్న రైతుల దుస్తితి ఆ పార్టీకి ఒక రకంగా కలసి వచ్చింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక బలమయిన అంశం దొరికిందని ఆ పార్టీ ఉత్సాహ పడింది. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా పార్టీ అధినేతే స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించడం, జాతీయ మీడియాను ఆకర్షించే స్తాయికి ఈ అంశం ఎదగడం ఆ పార్టీకి కొంత లాభించినట్టే కనిపించింది. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో వ్యవసాయం గురించి ఆయన చేసిన కొన్ని ప్రస్తావనలను కొందరు పదేపదే పేర్కొనడం - రైతులపట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను అదే పనిగా ప్రశ్నించడం కొంత ఇబ్బందికరంగా మారింది.

పొతే, టీ ఆర్ యస్.

తెలంగాణా లక్ష్య సాధన కోసం, అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే నాయకులకు కొదవ లేని పార్టీ అది. అదృష్టం ముందు పుట్టి తరువాత పుట్టిన చంద్రశేఖరరావు ఆ పార్టీ నాయకుడు. అందువల్ల కుష్టు రోగులెవరూ ఇలాటి ప్రకటనలను సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఉద్యమ పార్టీ కాబట్టి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా కలిగిన పార్టీ కాబట్టి, మిగిలిన ఏ రాజకీయ పార్టీకి లేని కొన్ని వెసులుబాట్లు ఈ పార్టీకి వున్నాయి. విద్యార్ధులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలన్న ఏకైక డిమాండ్ తో- రైతుల సమస్యను కూడా పక్కకునెట్టి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేసినా ప్రశ్నించే వారు లేకుండా పోవడం, ప్రస్తుత తరుణంలో భావోద్వేగాలకున్న పటిమను తెలియచేస్తుంది. తీరా ఇంత చేసినా, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు దీక్షకు పూనుకునేవరకు కేసుల విషయం పరిష్కారం కాని వైనం గమనిస్తే ఇందులోని మతలబు ఏమిటో ఎవరికీ అర్ధం కాని విషయం.

ఇంకా పేరు పెట్టని జగన్ పార్టీ విషయం కూడా చెప్పుకోవాలి. పుటకకు ముందే ప్రకంపనలు సృష్టించి దరిమిలా నీరు కారిపోయిన ఇతర పార్టీలను ఉదాహరణగా చూపిస్తూ కొందరు చేస్తున్న అవహేళనల నడుమ, కొత్తగా అరంగేట్రం చేయబోతున్న ఈ పార్టీ పురుడు పోసుకుంటోంది. వైఎస్ ఆర్ రాజకీయవారసుడిగా రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు గుర్తించకపోయినా, సామాన్య జనం గుర్తిస్తే చాలని మొండిగా ముందుకు సాగిపోతున్న జగన్ సాహసానికి కారణాలను అన్వేషించే పనిలో మరి కొందరు తలమునకలుగా వున్నారు.

పోతే, రాజశేఖరరెడ్డి జీవించి వున్నంత వరకు, ముఖ్య మంత్రుల విషయంలో పాత పోకడలను సమూలంగా మార్చుకున్నట్టు సంకేతాలు పంపి సాధారణ జనంలో మంచి మార్కులు కొట్టేసిన సోనియా, వై ఎస్ ఆర్ మరణానంతరం మళ్ళీ పాత పద్ధతులకు మళ్లిపోతున్నదన్న దురభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు విజయం సాధించడం జగన్ కు కలసి వచ్చింది. ఆయన తలపెట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడం ద్వారా జగన్ పట్ల సానుభూతి పెరిగేలా చేసి అధిష్టానం మొదటి పొరబాటు చేసింది. ఆ తడబాటులో చేసిన మరి కొన్ని పొరబాట్లు జగన్ ని మాస్ హీరో గా మార్చివేశాయి. తిరుగులేని జనాదరణ కలిగిన నాయకుడిగా జనం లో గుర్తింపు పొందిన తరవాత కానీ అధిష్టానానికి తాను చేసిన తప్పు ఓ పట్టాన అర్ధం కాలేదు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆ దరిమిలా పన్నిన వ్యూహాలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకున్న చందంగా అధిష్టానం వ్యవహారాన్ని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నష్ట నివారణకోసం - విద్యార్ధులపై పెట్టిన కేసుల అంశాన్ని ఆలస్యంగానయినా చేతిలోకి తీసుకుని - కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల నిరాహార దీక్ష రూపంలో చూపించిన పరిష్కారం - పోయిన ప్రతిష్టను ఏమేరకు పూడ్చగలిగిందన్నది అనుమానాస్పదంగానే మిగిలిపోయింది.

రాష్ట్రంలో నేడు నెలకొనివున్న పరిస్తితికి అన్ని పార్టీలకు అంతో ఇంతో బాధ్యత వున్నప్పటికీ – ఏదో సాకు చూపి తప్పించుకోలేని ప్రధాన బాధ్యత మాత్రం అధికార పక్షానిది. ఇంకా సరిగా చెప్పాలంటే- ఢిల్లీ లో కొలువయివున్న ఆ పార్టీ అధిష్టానవర్గానిది. అంతే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్తితికి కూడా పూర్తి బాధ్యత అధిష్టానానిదే.

అయిదేళ్ళు పాలించండని అధికారం అప్పగించిన ప్రజలను వారి మానాన వారిని వొదిలి గ్రూపు తగాదాలతో మునిగి తేలుతున్న కాంగ్రెస్ వారిని చూస్తుంటే ఆ పార్టీని మొండిగా అభిమానించే వారికి కూడా ఏష్టత కలుగుతోందని బుల్లి తెరలపై జనం బల్ల గుద్ది చెబుతున్నారు. ఇలాటి వారికా మనం వోట్లు వేసి గెలిపించిందని చీదరించుకునే పరిస్తితి ఏర్పడుతోందని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు పేర్కొన్నట్టు - రెండేళ్ళ క్రితం వరకు వడ్డించిన విస్తరి లాంటి కాంగ్రెస్ పరిస్తితి ఈ రోజు కుక్కలు చింపిన విస్తరి చందాన తయారయింది.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు వ్యవధానం వున్నప్పుడు ఇలాటి అంశాలన్నీ చాలా అత్యల్ప విషయాలుగా ఆ పార్టీ భావిస్తూ వుండవచ్చు. కానీ శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక వెలువడిన దరిమిలా రాష్ట్రం లో - భవిష్యత్ రాజకీయ స్వరూప స్వభావాలు నేడున్న విధంగానే వుంటాయని అనుకోవడానికి వీలు లేదు.
‘కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయి మధ్యంతరం ముంచుకు వస్తుందని, ఆ తరువాత జరిగే ఎన్నికల్లో ఇటు తెలంగాణలో టీ ఆర్ యస్, అటు సీమాంధ్ర లో జగన్ పెట్టబోయే పార్టీ - అన్ని స్తానాల్లో అద్భుత విజయాలను సాధిస్తాయనీ, ఆ ఉప్పెనలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందనీ టీ ఆర్ యస్ నేత చంద్రశేఖర రావు తాజాగా చెబుతున్న ‘రాజకీయ జోస్యం’ - కొత్త ఊహాగానాలకు రెక్కలు తొడుగుతోంది. సరికొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతాలు పంపుతోంది.

‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధిష్టానం జాగ్రత్తగా గమనిస్తోందని’ తరచూ పేర్కొనే కాంగ్రెస్ నాయకులు – ఇటీవలి కాలంలో అధిష్టానం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణివల్ల పార్టీ పరిస్తితి మరింతగా దిగజారి పోతున్నదన్న వాస్తవాన్ని ఎందుకు ఢిల్లీ కి చేరవేయలేక పోతున్నారన్నది మరో యక్ష ప్రశ్నగా మిగిలిపోతోంది. (29-12-2010)

25, డిసెంబర్ 2010, శనివారం

HAPPY NEW YEAR – 2011

HAPPY NEW YEAR – 2011



వొత్తిలా వెలగండి

కత్తిలా మెరవండి

కొత్త ఏడాదిలో

ఎత్తుగా ఎదగండి

అత్తరువు గంధమై

చిత్తరువు చందమై

కొత్త ఏడాది

మిము హత్తుకోవాలి!



నూతన సంవత్సర శుభాకాంక్షలతో – HAPPY NEW YEAR

-నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు – హైదరాబాద్

17, డిసెంబర్ 2010, శుక్రవారం

నమ్మకం - భండారు శ్రీనివాసరావు

నమ్మకం - భండారు శ్రీనివాసరావు 


ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధ్రువ పరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు.అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది. “ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మావాడితో.

“నమ్మకం” అనేవాడు మా వాడు స్తిరంగా.

“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచి తూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళ నుంచి వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.

అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.

చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.

వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం,

కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం,

ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించి కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం,

బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం,
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం,
అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా వుండకూడదనే నమ్మకం-

ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా,
ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలము.

ఎందుకంటే – ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ, మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా చేసింది.

నాయకులు తమ అనుచరులనే నమ్మరు.
నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు – కడకంతా తమ వెంట వుండరన్న అపనమ్మకం నాయకులది.

అనుచరులు నాయకులని నమ్మరు.
తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి పైమెట్టుకి ఎగబాకాలనే తాపత్రయం వారిది.

జనం ఈ కార్యకర్తలని నమ్మరు.
ఎందుకంటె తమపేరు చెప్పి వసూలు చేసే మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు తెలుసు కాబట్టి.

జనాన్ని రాజకీయులు నమ్మరు.
ఎన్నికలు కాగానే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వారితో పనేమిటన్నది వారి నమ్మకం.

ఇక మీడియా.
ఒక ఛానల్ ను మరో ఛానల్ నమ్మదు. అందుకే ఒకే వార్త రెండురకాలుగా కనిపిస్తుంది. వినిపిస్తుంది.
ఒక పత్రికను మరో పత్రిక నమ్మదు. ఒక పత్రికలో వచ్చిన వార్తను మరో పత్రిక వ్యాఖ్యాన సహితంగా ఏకిపారేస్తుంది.

ఇప్పుడు చెప్పండి!

నమ్మకం గురించి ఎవరయినా మాట్లాడినా,
నమ్మకస్తులు గురించి ప్రస్తావించినా
నమ్మొచ్చునంటారా?

(17-12-2010)

15, డిసెంబర్ 2010, బుధవారం

ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి - భండారు శ్రీనివాసరావు

ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి - భండారు శ్రీనివాసరావు

అద్దంలో మొహం ఎలా కనబడుతుంది?

ఉన్నది ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటె అద్దం అబద్దం చెప్పదు కనుక.

మరోలా కనబడాలంటే ఏమి చెయ్యాలి? ఊహించుకోవడం ఒక్కటే మిగిలినదారి.

అదే ఇప్పుడు జరుగుతోంది ఆంద్ర ప్రదేశ్ లో.

పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే! ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే ఇందులోని విషాదం.

నిన్న మొన్నటివరకు ప్రాంతీయ సమస్య ప్రధాన భూమిక పోషించిన రాష్ట్రంలో ఈనాడు రాజకీయమంతా ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తోంది. నిజానికి నిండా నాలుగు పదుల వయస్సు లేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏన్నర్ధం కూడా కాలేదు. చూడగానే ఆకట్టుకునే విగ్రహం కాదు. పట్టుమని పది నిమిషాలపాటయినా తన ప్రసంగాలతో ప్రజలను కట్టిపడేసే చాతుర్యం ఏమయినా వుందా అంటే అదీ లేదు.

అయినా వై ఎస్ జగన్ మోహన రెడ్డి సభలకు వేలం వెర్రిగా జనం ఎందుకలా వస్తున్నారు?

ఈ ఒక్క ప్రశ్నే అందర్నీ కలవరపెడుతోంది. అయితే, ఇది సమాధానం లేని ప్రశ్న కాదు. పైపెచ్చు అనేక సమాధానాలున్న ప్రశ్న. ముందు చెప్పినట్టు ఎవరి ఉద్దేశ్యాలకు తగ్గట్టుగా వారు ఊహించుకుంటూ జవాబులు వెతుక్కుంటూ వుండడంవల్ల ఎన్నెన్నో రకాల ఊహాగానాలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఏమి జరగబోతున్నదన్న దానిపై మరెన్నో రకాల వదంతులు చెలరేగుతున్నాయి. జగన్ అనుకూల, ప్రతికూల కధనాలతో మీడియా వీటికి మరింత ఊతం ఇస్తోంది.

నూటపాతికేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలాటి వొడిదుడుకులు కొత్తేమీ కాదన్నది ఆ పార్టీలోని జగన్ వ్యతిరేకుల భావం. ఈరకమయిన తిరుగుబాటుదార్లు లోగడ ఎంతోమంది పార్టీని వొదిలిపెట్టి వెళ్లి, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో తమది బలుపుకాదు వాపు అని తెలుసుకుని మళ్ళీ పార్టీలో బుద్ధిగా చేరిపోయిన గతాన్ని గుర్తుచేయడం వారి వాదం లోని భాగం. కొత్తొక వింత అన్న చందాన జనం జగన్ ని చూడడానికి వెడుతున్నారని కొందరూ, గత ఎన్నికల్లో చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్ సభలకు వచ్చిన జనాలను గుర్తుచేస్తూ – అప్పుడేమి జరిగిందో ఇప్పుడూ అదే జరగబోతోందని మరికొందరూ, డబ్బులు వెదజల్లే స్తోమత వుండాలే కానీ ఈ మాత్రం జనం తమ సభలకూ వస్తారని ఇంకొందరూ తమ వాదనలకు పదును పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న వాడినీ వేడినీ
మరో మూడేళ్ళు పైబడి కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ఈనాడు జగన్ కు వున్న ధన వనరులు, జన వనరులు వచ్చే ఎన్నికలకల్లా కళ్ళ ఎదుటే కరిగిపోవడం ఖాయమన్నది వారి నిశ్చితాభిప్రాయం. అధికారం వున్నప్పుడు అంటిపెట్టుకు తిరిగే వీరవిధేయులు అది దూరం కాగానే అంత త్వరగానే దూరం జరుగుతారనే రాజకీయ ధర్మసూక్ష్మాలను జగన్ వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. ప్రజాసేవమీద కన్నా జగన్ కు ముఖ్యమంత్రి గద్దెపై యావ ఎక్కువన్నది వారు ఎక్కుబెడుతున్న విమర్శనాస్త్రాలలో ప్రధానమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుడు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన తరవాత వారసత్వంగా లభించాల్సిన ముఖ్యమంత్రి పదవిని తనకు దక్కనివ్వ లేదన్న అక్కసుతో, పార్టీ అధిష్టానంపై కక్ష కట్టి కొత్త పార్టీ పెట్టేందుకు జగన్ సిద్ధపడ్దాడన్నది ఆ బోంట్ల మరో ఆరోపణ. అవినీతి మార్గాలలో సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మరో మార్గంలో అధికార పీఠం అధిరోహించడం అతడి ఏకైక లక్ష్యమని గత ఏడాది పైగా సాగుతూ వస్తున్న జగన్ వ్యతిరేక ప్రచారం లోని మరో పార్శ్వం. ఓదార్పు యాత్ర పేరుతొ రాష్ట్రమంతటా కలయ తిరగడం వెనుక, పైకి కనబడని రాజకీయ ఉద్దేశ్యాలున్నాయన్నది జగన్ వ్యతిరేకులు పార్టీ అధిష్టానానికి చేరవేసిన ఆంతరంగిక సమాచారం.

ఏతావాతా ఏమయితేనేమి – ఏడాది గడవకముందే ఈ ప్రచారం పనిచేసింది. జగన్ కూ, ఢిల్లీ లోని పార్టీ పెద్దలకు నడుమ దూరం పెరిగింది. వైఎస్సార్ జీవించి వున్నంతవరకు ఢిల్లీ నాయకులవద్ద ఆటలు సాగని వైఎస్ వ్యతిరేకులకూ, వైఎస్ హయాములో రాష్ట్ర వ్యవహారాలపై పట్టు కోల్పోయిన అధిష్టాన దేవతలకూ- వైఎస్ ఆకస్మిక మరణం ఒక మహత్తర అవకాశంగా దొరికింది. స్వతంత్ర భావాలుకలిగి, పిన్న వయస్సులోవున్న జగన్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే మరో నాలుగేళ్ళు రాష్ట్రం వంక కన్నెత్తి చూసే అవకాశం, పెత్తనం చేసే సావకాశం వుండదనే వైఎస్ వ్యతిరేకుల మంత్రం అధిష్టానం పై పనిచేసింది. ఫలితం- అధికార పగ్గాలను రోశయ్యగారికి అప్పగించడం. తాత్కాలిక ఏర్పాటు అన్నది శాశ్వితంగా కొనసాగే సూచనలు కానరావడంతో జగన్ వర్గం లో అలజడి మొదలయింది. పార్టీలో, ప్రభుత్వంలో నామమాత్రపు గుర్తింపు లేకపోవడం ఆ వర్గాన్ని అసహనానికి గురిచేసింది. ప్రజలకిచ్చిన మాట పేరుతొ ఓదార్పు యాత్ర ప్రారంభించడం ఒక్కటే జగన్ వర్గానికి ప్రత్యామ్నాయంగా మిగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేకులు- ఈ యాత్రకు రాజకీయ రంగు పులమడం జగన్ వర్గానికి బాగా కలిసొచ్చింది. వైఎస్ హఠాన్మరణంతో గుండె పగిలిన వారి కుటుంబాలకు సొంత డబ్బుతో ఆర్ధిక సాయం అందించేందుకు జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు అడ్డంకులు కల్పించడం జగన్ పట్ల సానుభూతిని పెంచింది. ఈ క్రమంలో జగన్ సానుకూల, ప్రతికూల వర్గాల నడుమ సాగిన వాదప్రతివాదాలు ముదిరి పాకానపడి జగన్ కు జనం లో హీరో స్తాయిని కట్టబెట్టాయి. పార్టీలో పెద్దలంతా ఒకవైపు, జగన్ ఒక్కడూ ఒకవైపూ వుండి నడిపిన ‘రాజకీయం’ సాధారణ జనంలో జగన్ పట్ల సానుభూతి మరింత పెరిగేలా చేసింది. జగన్ అంశాన్ని పిల్ల కాకి వ్యవహారంగా పరిగణిస్తూ వచ్చిన పార్టీ అధిష్టానం – రోశయ్యను ముఖ్యమంత్రిగా తొలగించి ఆ స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి రాష్ట్ర పార్టీపై తన పట్టును మరో మారు ప్రదర్శించింది.

ఇటు జగన్ కూడా ఈ రాజకీయ క్రీడలో ఏమాత్రం వెనుకబడకుండా మరో అడుగు ముందుకు వేసి పార్లమెంట్ సభ్యత్వాన్నీ, పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్నీ వొదులుకుని, తల్లి విజయమ్మతో అసెంబ్లీకి రాజీనామా చేయించి అధిష్టానంపై తొలి యుద్ధభేరి మోగించాడు. అటు పార్టీ పెద్దలు కూడా త్వరత్వరగా పావులు కదిపి జగన్ వర్గాన్ని దెబ్బతీసేందుకు వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి ఎదురు దెబ్బతీసారు. గత్యంతరం లేని స్తితిలో జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. తమిళనాడు తరహాలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికీ, భవిష్యత్తులో వాటి ప్రాబల్యానికి నాంది పలికారు.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అనుసరించిన వ్యవహార శైలి సీనియర్ సహచరులకు మనస్తాపం కలిగించినప్పటికీ – స్వతంత్రంగా వ్యవహరించగల ముఖ్యమంత్రి మళ్ళీ లభించాడని సాధారణ జనం సంతోషించారు. యువకుడు, విద్యాధికుడు స్వయంగా క్రీడాకారుడు అయిన కొత్త ముఖ్యమంత్రి, సమధికోత్సాహంతో పనిచేసి రాజశేఖరరెడ్డి మాదిరిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో మంచి పేరు తెచ్చుకోగలడని చాలామంది ఆశించారు. కానీ మంత్రుల శాఖల పంపిణీలో తలెత్తిన విభేదాలు, వాటిని సర్దుబాటు చేయడానికి ముఖ్యమంత్రి చేసిన ఢిల్లీ యాత్రలు - ఈ ఆశలపై నీళ్ళు చల్లాయి. అలాగే ముఖ్యమంత్రి గద్దెపై కూర్చున్నమొదటి రోజునుంచీ సొంత పార్టీలో చెలరేగిన లుకలుకలు ఆయన ప్రతిష్టను పెంచకపోగా కొంతమేరకు మసకబార్చాయనే చెప్పాలి. మంత్రివర్గ కూర్పులో సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, బలహీనవర్గాలను చిన్న చూపు చూసారన్న విమర్శ కొత్త ముఖ్యమంత్రికి తగిలిన తొలి దెబ్బ.

భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించే సమయంలో కూడా తన వయస్సుకు తగ్గ వ్యవహారశైలిని ఆయన ప్రదర్శించ లేకపోయారన్నది ఆయన ఎదుర్కుంటున్న మరో విమర్శ. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖరరెడ్డి కానీ ఇటువంటి సందర్భాలను సద్వినియోగం చేసుకున్న దాఖలాలను పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలలో పర్యటించినప్పుడు, మండుటెండలో  ఇసుక మేట వేసిన పొలాల్లో చెమటలు కక్కుతూ తిరుగుతూ - ప్రభుత్వం ప్రజల వెంటే వుందన్న భరోసా కలిగించిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు. మరోపక్క, అదేసమయంలో - జగన్, చంద్రబాబు, చిరంజీవి - బాధిత ప్రాంతాల్లో కలయ తిరిగి తమ పర్యటనల నుంచి రాజకీయ ప్రయోజనం రాబట్టుకునే ప్రయత్నం చేసిన విషయాలను ఉదహరిస్తున్నారు.

అలాగే, రైతు సంక్షేమ రాజ్యం తెస్తామన్న రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి –శాసనసభలో ప్రతిపక్షాలు, రైతుల దుస్తితిపై లేవనెత్తిన వివాదాలను సమర్ధంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే విమర్శలను మూట గట్టుకోవాల్సిన పరిస్తితిలో పడిపోవడం మరో విషాదం. అలాగే విద్యార్ధుల అరెస్ట్ వ్యవహారం –అసెంబ్లీ స్పీకర్ గా విశేష అనుభవం గడించిన కిరణ్ కుమార్ రెడ్డికి గొంతులో వెలక్కాయ మాదిరిగా తయారయింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారనే అపవాదును అంటగట్టింది. శాసన సభ జరుగుతున్న సమయంలోనే కొందరు పార్టీ శాసన సభ్యులు జగన్ అనుకూల వైఖరిని బాహాటంగా ప్రదర్శించడం నూతన ముఖ్యమంత్రికి అదనపు తలనొప్పిగా మారింది.

తెలంగాణా ప్రాంతానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరుగుతుందని బాధ్యతలు స్వీకరించగానే ఆర్భాటంగా ప్రకటించి ఇంతవరకు మళ్ళీ ఆ ఊసు ఎత్తకపోవడం, స్పీకర్ పదవిని భర్తీ చేయకుండానే డిప్యూటీ స్పీకర్ తోనే శాసన సభ సమావేశాలను ముగించాలని చూడడం – ముఖ్యమంత్రి స్వతంత్ర వ్యవహార శైలికి అద్దం పట్టేవిగా లేని విషయాన్ని కూడా పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.

అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ముళ్ళ కిరీటం వంటిదని ఈపాటికే అర్ధం అయివుండాలి. ఒక్క కిరీటం మాత్రమె కాదు ముందున్న దారి కూడా ముళ్ళ బాట మాదిరిగానే కానవస్తోంది. అన్నింటికంటే పెద్ద సమస్య ఈ నెలాఖరులో ఎదురవబోతోంది. యావదాంధ్రలోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక ఆలోపునే వెలువడబోతోంది. ఈ లోపున రైతు సమస్యలపై తాడో పేడో తేల్చుకోవడానికి అటు జగన్, ఇటు చంద్రబాబు సంధించిన నిరాహార దీక్షల తూటాలు పేలబోతున్నాయి. కేసుల ఎత్తివేత గురించి విద్యార్ధుల ఆందోళన, వాళ్ల పక్షాన నిలబడుతున్న టీ ఆర్ ఎస్ తాకిడినీ ప్రభుత్వం ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వుంది. ఈ మధ్యలో సందట్లో సడేమియా లాగా సొంత పార్టీలో రాజుకుంటున్న ‘కుంపట్ల’ విషయం సరేసరి.

బహుశా ఇన్ని రకాల వొత్తిళ్లకు ఏకైక ఉపశమనం ‘ఆటలు’ మాత్రమె అనే నిర్ణయానికి వచ్చి- స్వయంగా క్రీడాకారుడయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ‘ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బాడ్మింటన్ టోర్నమెంట్’ ప్రారంభోత్సవం సందర్భాన్ని అనువుగా తీసుకుని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో కాసేపు బాడ్మింటన్ ఆడి సేదదీరే ప్రయత్నం చేసి వుంటారని అనుకోవాలి. (15-12-2010)

వినదగునెవ్వరు చెప్పిన:  'నిన్న మొన్నటివరకు తెలివిలవాడినన్నఅహంకారంతో ఈ ప్రపంచాన్నే మార్చాలనుకున్నాను. కానీ ఈ రోజు తెలివినపడ్డాను. అందుకే నన్ను నేనే మార్చుకుందామనే నిర్ణయానికి వచ్చాను.'   

11, డిసెంబర్ 2010, శనివారం

Unwarranted row - Bhandaru Srinivas Rao (I.I.S.)

Unwarranted row - Bhandaru Srinivas Rao (I.I.S.)

High-profile Dr Jayaprakash Narayan of Lok Satta is in eye of a storm. His remarks on the floor of the AP Legislative Assembly on 'withdrawal' of cases against students indeed kicked up a row. He had not volunteered to speak, but was asked to express his opinion by the Deputy Speaker, Mr Nadendla Manohar, while dealing with the 'issue of withdrawing cases against those agitating students for separate statehood", along with other floor leaders of various parties.

Being honest IAS officer all though, what he felt he expressed it more explicitly. All he said was law should take its own course in case of those who really indulged in arson, looting and extortion. In the same breath he said petty cases registered against those students can be withdrawn. If one looks at his remarks, none should find fault. But, ironically it has come at wrong time when tempers boiling high. This was when the separatist Telangana Rashtra Samiti (TRS) determined to stall the business in the six-day assembly which begun on Friday. Comes rebuttal from the TRS young leader K T R Rao, son of the TRS President K Chandrasekhara Rao; "it’s an insult to the entire student community of the region and sought an unconditional apology." He also went to the extent of warning the former bureaucrat-turned politician of dire consequences and his movements in the city will be put to threat.

This was followed by quick pro and against protests. As a result, the Osmania University JAC held protests burning the effigies of JP (as the bureaucrat popularly known in the state). The Andhra University Students JAC too indulged in burning the effigy of the TRS leaders in their region to register their protest.

Perhaps, JP's remarks might have come in the backdrop of state police suspecting some anti-social elements indulgence during the riots and arson in the campus and elsewhere in Telangana region. More over, as a genuine concerned of student community, perhaps, he might have made such remarks. As a matter of fact, as per the law once a case is registered, it cannot be withdrawn, without trial. Can a person, who indulges in arson (burning or damaging public property) or extortion (forcible collection of money), be allowed to go scot free? Should that form part of a student's academic curriculum or pursuits? However, emotive an issue may be, law of the land spares none.

At the most, stone pelting in the recent agitation can be treated as a 'petty' case. But certainly not burning of public property like buses and extortion from business houses! If any government permit such persons go scot- free, then it would be setting a wrong precedent and future agitations, for whatever may be reasons, bound to turn more volatile and dangerous.

Having said that it also the responsibility of government to ensure that 'justice' done to the student community too! There are allegations that the police exceeded its brief while dealing with agitating students on the campus. Gory reports appeared in a section of press stating that the police not only beat up stone-pelting students, but also journalists covering it. I remember reading a report with visual how an irresponsible police official pie on a floored TV camera journalist, who was running for cover. In that backdrop, the police too might have acted in partisan manner by registering false cases. Who is right and who is wrong can be known, if one carefully examine video clips of all TV channels.

I also remember reading of a report in which none other than the Home Minister Sabita Indra Reddy apologising on behalf of police for their high handedness in OU campus.

As an observer feel, nothing wrong in demanding for withdrawal of cases against those students against whom false cases were foisted, instead wholesome, I also equally feel no fault in JP's remarks. (11-12-2010)

7, డిసెంబర్ 2010, మంగళవారం

ఉసురు -భండారు శ్రీనివాసరావు

ఉసురు

చలి వొంటిని చుట్టినట్టు పట్టె పాడు ముసురు

పొయ్యి తడిసె కట్టె బిగిసె ఎట్ట కాగు ఎసరు

కలిగినింట గాసువంట లేదుకదా తంటా

వానయినా వొగ్గయినా పేదోడికే గుబులు

కడుపు చల్ల కదలకుండ

ఏసీల్లో టీవీలతో

గడిపెటోనికేముంటది

కడుపులోన దిగులు

-భండారు శ్రీనివాసరావు (07-12-2010)